Revelation – ప్రకటన గ్రంథము

ఆదికాండము ప్రారంభ గ్రంథముగానున్నట్లు ప్రకటన గ్రంథము చివరి గ్రంథముగానున్నది. ఇందులో దేవుని యొక్క విమోచనా ఉద్దేశము సంపూర్తిస్థానము నధిష్టించుచున్నది. సువార్త పుస్తకములును, పత్రికలును అనేక ప్రవచనములతో యిమిడియున్నప్పటికిని ప్రవచన సందర్భములను కేంద్రము చేసికొని వ్రాయబడిన ఒకే క్రొత్త నిబంధన గ్రంథము, ప్రకటన గ్రంథమే. దాని శీర్షిక “తెరను వివరించి చూపుట” (బయలుపరచి చూపుట) అనునది దీని భావము. ఆ విధముగా ఈ గ్రంథము దేవుని గుణగణమును, సూచక క్రియలను, ఆధారము చేసికొని ఇది వ్రాయబడినది. ఇహలోక న్యాయమునకు న్యాయము తీర్చుటకును, దానిని నూతనపరచుటకును, నీతితో పరిపాలించుటకును ఆ క్రీస్తుకు మాత్రమే అధికారము గలదు.

గ్రీకు పరిశుద్ధ గ్రంథములో దీని శీర్షిక “యోహానుకు కలిగిన ప్రత్యక్షత ” అనునదైయున్నది. ప్రత్యక్షత అని మాత్రమే ఒక పేరు దీనికి ఉన్నది. మరుగైయున్న ఒక దానిని ప్రత్యక్ష పరచి చూపునది ఈ గ్రంధమైయున్నది. ఈ పుస్తకమును కొంచెము అధిక శ్రేష్టమైన ఒక శీర్షిక ప్రకటన గ్రంథం 1:1లో కనిపించుచున్నది. “యేసుక్రీస్తు… ప్రత్యక్షత ” అనునదే ఆ శీర్షిక. క్రీస్తులో నుండి ఉద్భవించిన ప్రత్యక్షత అనియో, క్రీస్తును గూర్చిన ప్రత్యేకత అనియో దీని భావముగా చెప్పవచ్చును. రెండును సరియైనవే.

ఉద్దేశము:– క్రీస్తు యొక్క పరిపాలనను సంపూర్ణముగా ప్రత్యక్షపరచబడుట, విశ్వాసులకు హెచ్చరికయు నమ్మకత్వమును ఇచ్చుట.

గ్రంథకర్త:- అపొస్తలుడైన యోహాను.

ఎవరికి వ్రాసెను?:- ఆసియలోని ఏడు సంఘములకును ప్రపంచమంతటిలో నున్న విశ్వాసులకును.

వ్రాయబడిన కాలము:- సుమారు క్రీ.శ.95. పత్మాసు దీవిలో నుండి.

ఆంతర్యము:- డొమీషియన్ చక్రవర్తి క్రింద (క్రీ.శ. 90-95) ఉపద్రవములననుభవించుచుండిన ఆసియలోని ఏడు సంఘములకును ఈ పుస్తకమును యోహాను వ్రాసెను. ఆసియలో నుండి చాలా దూరముగానున్న పత్మాసు దీవికి రోమా అధికారులు యోహానును దేశదిమ్మరిగా కొనిపోయిరి. క్రీస్తు యొక్క మానవావతారమునకు సూటియైన సాక్షిగా నున్న యోహాను ఇప్పుడు, మహిమపరచబడిన క్రీస్తును దర్శించుచున్నాడు. రాబోవు కాలములలో దుష్టత్వమునకు వచ్చు న్యాయ తీర్పును దేవుని యొక్క పరిపూర్ణమైన విజయమును యోహానుకు దేవుడు ప్రత్యక్ష పరచెను.

ముఖ్య వ్యక్తులు:- యేసు, యోహాను.

ముఖ్య స్థలములు:- పత్మాసు, ఆసియలోని ఏడు సంఘములు, నూతన యెరూషలేము.

ముఖ్య పదజాలము:- క్రీస్తు యొక్క రాకడను గూర్చిన ప్రత్యక్షత.

ముఖ్య వచనములు:- ప్రకటన గ్రంథం 1:19; ప్రకటన గ్రంథం 11:15.

గ్రంధ విశిష్టత:- ఈ పుస్తకము ఒక స్వరూపములోనున్న ఒక ప్రవచన గ్రంథము. శ్రమల మార్గమున వెళ్లువారికి నమ్మకమునిచ్చు పోలికలు ఇందులో వర్ణించబడుచున్నవి.

ముఖ్య అధ్యాయములు:- అధ్యాయము 19-22 వరకు.

ఈ అధ్యాయములలో ప్రపంచపు చివరిదినములను, నిత్యత్వమును గూర్చిన దేవుని తీర్మానమును అర్ధసహితమైన భాషలో వ్రాయబడియున్నది. దీనిని జాగ్రత్తగా నేర్చుకొని లోబడువారికి దేవుడు వాగ్దానము చేసిన ఆశీర్వాదములు లభించును (ప్రకటన గ్రంథం 1:13) ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అను యేసు యొక్క వాక్కులు మన హృదయాంతరంగములో భద్రముగా వదిలపరచుకొనవలసినవి.

గ్రంథ విభజన:- దానియేలు, జెకర్యాలాంటివారి ప్రవచనములవలె ప్రత్యక్ష భాష క్రియాపూర్వకముగా ఒక ప్రవక్త ద్వారా వ్రాయబడిన ఒక పుస్తకము ఇదియే. (ప్రకటన గ్రంథం 10:11; ప్రకటన గ్రంథం 22:9). ఇది ఒక ప్రవచన గ్రంథమని వ్రాయబడియున్నది. (ప్రకటన గ్రంథం 1:3; ప్రకటన గ్రంథం 22:7; ప్రకటన గ్రంథం 22:10; ప్రకటన గ్రంథం 22:18-19). దీనియొక్క మహాత్మ్యమైన ప్రత్యక్ష సంభవములో మూడు గొప్ప సంఘటనలు యిమిడియున్నట్లు ప్రకటన గ్రంథం 1:19 లో చెప్పబడుచున్నది. అవియే ఈ గ్రంథము యొక్క మూడు భాగములు.

యోహాను చూచినవి – అధ్యాయము 1
ఇప్పుడు ఉన్నవి – అధ్యాయము 2, 3
రానైయున్న సంభవములు – అధ్యాయములు 4-22 వరకు.

కొన్ని గుర్తింపు వివరములు:- పరిశుద్ధ గ్రంథమందలి 66వ గ్రంథము; అధ్యాయములు 22; వచనములు 404; ప్రశ్నలు 9; చారి|తక వచనములు 53; నెరవేరిన ప్రవచనములు 10; నెరవేరని ప్రవచనములు 341.

Judah – యూదా

దేవుని కృపను జీవితమునకు సంరక్షణ కేడెముగా అమర్చుకొన్న విశ్వాసుల సంఘమును నాశనము చేయుటకు ప్రేరేపిస్తున్న అబద్ధ బోధనలు వ్యాపించినప్పుడు దానిని ఎదిరించు విశ్వాస వీరులనుగా వారిని సిద్ధపరచుట కొరకై వ్రాయబడినదే యీ యూదా పత్రిక. ఇట్టి అబద్ధ బోధనలను వ్యాపింపజేయు మనుష్యులకు దేవుని యొద్ద నుండి గల ఒక హెచ్చరిక యీ పత్రికలో యున్నది. అవిశ్వాసులుగా మారిన ఇశ్రాయేలీయులకును, అవిధేయత వలన పడిపోయిన దేవదూతగణమునకును, సొదొమ గోమోర్రా పట్టణ వాసులకును జరిగిన ఆపదలను స్మరించుకొని వీరికి రాబోవు న్యాయ తీర్పును గూర్చి పత్రిక రచయిత వారికి ప్రకటించుచున్నాడు. ఇటువంటి ఆపదలకు ముందుగా క్రైస్తవులు జాగ్రత్తగా ఉండవలెను. ఎదుర్కొన్న సవాలులు పెద్దవిగానున్నను దేవుడు యధార్థమైన తన బిడ్డలను పడిపోకుండ కాపాడుటకు శక్తిమంతుడైయున్నాడు.

గ్రంథ కర్త:- ఆంతర్యము చిన్నదైనను యూదా పత్రికను ముఖ్యమైనదొకటిగ ప్రారంభకాల సంఘము కలిగియుండెను. ప్రారంభ కాల సంఘ పితరులు దీని భాగములను ఉదహరించుట అలవాటుగా నుండెను. క్రీ.శ.171-లో ఏర్పడిన మురాట్రోరియన్ కానోనిల్ దీని భాగములు చేర్చబడెను. టెర్టలియాన్, ఒరిగెన్ వంటి సంఘ పితరులు దీనిని దేవుని వాక్యములో ఒక భాగముగా అంగీకరించిరి. “యేసుక్రీస్తు – దాసుడును. యాకోబు సహోదరుడును” అని రచయిత తన్ను గూర్చి సూచించుచున్నాడు. (యూదా 1:1) ఈ ఒప్పుకోలు 17వ వచనమందు వచ్చు అపొస్తలులను గూర్చిన సూచనలతో చేర్చి చూచినపుడు యీయన పదకొండుమంది అపొస్తలులలోని ఒకడైన యాకోబు సహోదరుడైన యూదా కాదు అని ఆలోచించుటకు మార్గము చూపుచున్నది. మత్తయి 13:55 నందును, మార్కు 6:3 లో యీ యూదాను గూర్చి గుర్తించబడుచున్నది. ఇతని జ్యేష్ఠ సహోదరుడైన యాకోబు యెరూషలేము సంఘ పెద్దయు (అపో. కార్యములు 15:13-21) అతను పేరు మోసిన పత్రిక యొక్క రచయిత అగును. యేసు యొక్క యితర సహోదరుల వలె యూదా కూడ ప్రభువు యొక్క పునరుత్థానము వరకు ఆయనను విశ్వసించలేదు. (యోహాను 7:1-9; అపో. కార్యములు 1:14) వీటి తరువాత ఇతని గూర్చి ఒకే సూచన 1 కోరింథీయులకు 9:5 లో వచ్చుచున్నది. అందులో ప్రభువు సహోదరులు తమ సువార్త సేవా ప్రయాణమందు స్వంత భార్యలను తీసుకొని వెళ్ళినట్లు తెలియుచున్నది. అపో. కార్యములు 15:22 నందును అపో. కార్యములు 15:32 నందును చెప్పబడు యూదా ఒక వేళ యితడైయుండవచ్చును. పరిశుద్ధ గ్రంథమునకు బయట చెప్పబడు పారంపర్య కథలును యీ యూదాను గూర్చి ఇతర వివరములను చెప్పలేదు.

ఉద్దేశము:- సంఘములు విశ్వాసమందు. స్థిరముగా నిలుచుటకును అబద్ధ బోధనలకు విరోధముగా నిలచి విశ్వాసమును కాపాడుటకును స్మరింపజేయుట.

ఎవరికి వ్రాసెను? యూదా క్రైస్తవులకును విశ్వాసులు యావన్మందికిని.

వ్రాయబడిన కాలము:- దాదాపు క్రీ.శ.65.

ఆంతర్యము:– మొదటి శతాబ్దము ప్రారంభమై కట్టు కథలచేతను, అబద్ధ బోధనల చేతను సంఘము బెదరించబడుచుండెను.

ముఖ్య వచనము:- “ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తి గల వాడనై ప్రయత్నించుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధనిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను”. (యూదా 1:3).

ముఖ్య పాత్రలు: – యూదా, యాకోబు, యేసు.

ముఖ్య పదము:- విశ్వాసముకొరకుపోరాడుడి.

ముఖ్య వచనము:- యూదా 1:3.

గ్రంథ విభజన:- క్రొత్త నిబంధనయందు పౌలు మరియు ఇతర రచయితల పత్రికలలో ఒక పెద్ద భాగము అబద్ద ప్రవక్తలచే కలుగు ఆపదను ఎత్తిచూపుచున్నది. అయినను యీ విశ్వాస త్యాగులు కఠినముగ ఖండించుచు యీ ఆపదకు వ్యతిరేకముగ విశ్వాసము కొరకు పోరాడుటలో క్రైస్తవులను ప్రోత్సాహపరచు కార్యమందు యూదా ముందు నిలుచుచున్నాడు. పత్రిక యొక్క ప్రారంభమును చివరి స్తుతి గీతమును తప్ప మిగిలిన వచనములన్నియు యీ భయంకరమైన ఆపదను గూర్చి మాట్లాడునవగును. క్లుప్తముగనున్నను తీవ్రమైన వర్తమానము గలది. నాల్గు భాగములుగా యీ పత్రికను విభజించవచ్చును.

(1) పత్రిక వ్రాయబడిన ఉద్దేశము. యూదా 1:1-40.

(2) అబద్ధ బోధకులను గూర్చిన వివరణ. యూదా 1:5-16.

(3) అబద్ధ బోధకులను ఎదుర్కొ నవలసిన విధము. యూదా 1:17-23.

(4) స్తుతి గీతము. యూదా 1:24 – 25.

కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథములోని 65వ పుస్తకము; అధ్యాయము 1: వచనములు 25; ప్రశ్నలు లేవు; చారిత్రక వచనములు 22; నెరవేర్చబడిన ప్రవచనము 1; నెరవేర్చబడనివి 2.

John 3 – 3 యోహాను

యోహాను తనకు అతి ప్రియమైన గాయుకు ఈ పత్రికను వ్రాసెను. 1 కోరింథీయులకు 1:14; రోమీయులకు 16:23 మొదలగు వచనములలో గాయు అని గుర్తింపబడియున్నాడు. ఇతడు ముందు కాలములో అపొస్తలుడైన యోహానుకు వ్రాయుటకు సహాయపడు సహాయకుడుగా మారినట్లుగా ఒక శాస్త్రము తెలుపుచున్నది. నాల్గవ వచనములో గాయు యోహాను యొక్క ప్రియమైన పిల్లలలో ఒకడుగా అనగా అతని ద్వారా విశ్వాసములోనికి నడిపింపబడిన ఒకడుగా చిత్రించబడుచున్నాడు. ఇతడు ఎవరైనప్పటికిని, మిక్కిలి నమ్మకమైన ఒక క్రైస్తవ సేవకుడుగా ఉండి యుండవలెను. అపొస్తలుడు నాలుగుసార్లు ప్రియమైనవాడు అని పిలుచుచున్నాడు.

యోహాను మొదటి పత్రికలో అపొస్తలులు దేవునితో కలిగియున్న ఐక్యతను గూర్చి చెప్పుచున్నాడు. రెండవ పత్రికలో అబద్ధ బోధకులతో కూడిన ఐక్యతను గూర్చి వివరించుచున్నాడు. మూడవపత్రికలోనైతే క్రైస్తవ సహోదరులతో కూడిన ఐక్యతకు ఊతనిచ్చుచున్నాడు.

సత్యములో నడచుట యనునదే దీనియొక్క ప్రధాన సందేశమని చెప్పవచ్చును. గాయు సువార్త సేవకులను ఆహ్వానించి పరిచర్య చేసి వారికి ఉపకారములను చేసెను. అతనికి కలిగినదంతయు సువార్త సేవ కొరకే సమర్పించిన అతడు సత్యములో నడచుట అనునది ఒక శ్రేష్టమైన మాదిరియే. దీనికి మారుగా అపొస్తలులు వ్రాసిన పత్రికను నిరాకరించి అతనిపై నేరము మోపి సువార్త సేవకులను అవమానపరచి వారిని చేర్చుకొన్న వారిని సంఘము నుండి వెలుపలికి త్రోసిన దిమిత్రఫే దీనికి వ్యతిరేకమైన సాక్ష్యముగానున్నాడు. అందరి యెడలను మంచి సాక్ష్యము పొందిన దేమేత్రియు కూడ దియొత్రఫే చేత వెలివేయబడిన ఒకడుగానున్నాడు.

ఉద్దేశము:- తన యొక్క ఆతిథ్యము కొరకుగాయును పొగడుట, క్రైస్తవ జీవితములో అతనిని ప్రోద్బలపరచుట.

గ్రంథకర్త:- అపొస్తలుడైన యోహాను.

ఎవరికి వ్రాసెను?:- యోహానుకు సన్నిహితుడైన ఒక సంఘములో మనతవహిచిన గాయునకు.

వ్రాసిన కాలము:- క్రీ.శ.90 ఎఫెసులో నుండి

ఆంతర్యము:- క్రొత్త సంఘములను స్థాపించుట కొరకై బోధకులు పట్టణముయందు సంచరించిరి. వారు సహవిశ్వాసుల యొక్క అతిథులుగా ఒక్కొక్కచోటను నివసించిరి. ఇటువంటి ప్రయాణము చేయు బోధకులను ఇంట చేర్చుకొను వారిలో ఒకడుగా కీర్తి చెందినవాడు గాయు.

ముఖ్య పదజాలము:- సహోదర ప్రేమ.

ముఖ్య వచనములు:- వచనము 11.

గ్రంథ విభజన:- పరిశుద్ధ గ్రంథములో నున్న అతి చిన్న పుస్తకము. అయితే అది మిక్కిలి ప్రత్యేకమైనదియు తేటయైన స్వభావము గలది. అపొస్తలులు పంపిన సువార్తికులు ఒకరికొకరు విరోధముగా నున్న స్థితిలో అట్లు జరిగి తన ఇద్దరు సహోదరులను మధ్యస్తము చేసినట్లు పత్రిక వ్రాయబడియున్నది. యదార్థమైన గాయు విశాల హృదయముతో ఆతిథ్యమును, మంచి గుణముతో నడచుకొనునపుడు యదార్థత లేని దియెత్రిఫే గర్వముతోను, ఎదిరించుటను నడుచుకొన్నట్లు చూచుచున్నాము. కనుకనే పత్రికలోని రెండు ముఖ్య భాగములు ఇవియైయున్నవి.

గాయును గూర్చిన పొగడ్త. 3 యోహాను 1:1-8.
దియెత్రిఫేను గూర్చిన కొరతలు. 3 యోహాను 1:9-14.

కొన్ని ముఖ్య గుర్తింపులు: – పరిశుద్ధ గ్రంథములోని 64వ పుస్తకము. వచనములు 15. ప్రశ్నలు లేవు. ప్రవచనములు లేవు.

John 2 – 2 యోహాను

తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడిపోకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.” (1 కోరింథీయులకు 10:12) పౌలు యొక్క ఈ బోధన యోహానుని యీ చిన్న పత్రిక యొక్క సారాంశముగా అనుకొనవచ్చును. ఏర్పరచబడిన అమ్మగారికిని ఆమె పిల్లలకును యీ పత్రిక వ్రాయబడెను. వారు క్రీస్తునందు స్థిరులైయున్నారని తెలియబడుచున్నది. వారు సత్యముననుసరించి నడచువారును వారికప్పగింపబడిన దేవుని ఆజ్ఞలను గైకొనువారుగా నుండిరి. ఈ కార్యమందు పత్రిక రచయిత సంతృప్తి గలవాడుగా నున్నాడు. అయినను నిలుచుట అనునది పడుటకు ఒక మెట్టు దూరముననున్న స్థితియగును. అందుచే వారు జాగ్రత్తగా నుండవలసిన బాధ్యత గలవారుగానుండి.

ఒకనినొకరు ప్రేమించుట అనునది క్రొత్త ఆజ్ఞ కాదు. దేవుని ఆజ్ఞలన్నిటి సారమే. అయినను యీ ప్రేమ కళంకము లేని, పరిశోధించక ఒకనికి తలుపు తెరచియిచ్చినటువంటిదిగ ఉండకూడదు. ముఖ్యముగ క్రీస్తును శరీరముతో వచ్చిన వాడని అంగీకరించని చదువరులు దేశమంతయు కనిపించు సమయమున వారితో సహవాసము నుండి దూరముగా నిలువవలసిన ఆవశ్యకతను రచయిత దృఢముగ చెప్పుచున్నాడు.

ఉద్దేశము:- క్రీస్తును వెంబడించుటకు ఆధార పాఠములైన సత్యమునకును ప్రేమకును దృఢత్వమునిచ్చుట, అబద్ధ బోధకులను గూర్చి హెచ్చరించుట.

గ్రంథ కర్త:- యోహాను రెండవ మూడవ పత్రికలకు వాటి ఆంతర్యమునను, లోపలను ఇమిడియున్న పోలికలు వాటి రచయితను గూర్చి ఒకటిగ ఆలోచించుటకు తగును. వీటియందు గుర్తించబడిన మనుష్యుల తక్కువ సంఖ్య, పత్రికల క్లుప్తీకరణ, మొదటి పత్రికయందు చెప్పబడియున్నట్లు భిన్నమైన నూతన వర్తమానముల కొరతవంటి కారణములచే ప్రారంభకాల సంమము పితరుల అక్షరములందు యివి తక్కువగానే ఉదహరించబడెను. అయినను అపొస్తలుడైన యోహాను కాలమునకు సమీప కాలమున జీవించిన సంఘ పితరులు ముఖ్యముగా ఐరేనియస్, అలెగ్జాండ్రియా క్లెమెంతు మొదలగువారు సందేహము లేక వీటిని అపొస్తలుడైన యోహాను పత్రికలుగ అంగీకరించి యున్నారు. అపొస్తలుడు తన పేరును పత్రికయందు గుర్తించలేదు. “పెద్దనైన నేను” అని మాత్రమే సూచించెను. అపొస్తలుడైన పేతురు కూడ తన్ను ఒక పెద్దగ సూచించుచున్నాడు. (1 పేతురు 5:1) శైలి ప్రయోగము, సంక్షేపము, అనుచరణ విధానము మొదలగు వాటిని రెండు పత్రికలును సమముగా పొందియున్నవి. యోహాను సువార్తతోను, మొదటి పత్రికతోను దగ్గర సంబంధము కలిగియున్నది. కనుక వెలుపటి, లోపలి ఆధారముల మూలముగ యివి అపొస్తలుడైన యోహాను పత్రికలని ముగించి చెప్పవచ్చును.

ఎవరికి వ్రాసెను:- ఒక సన్మానింపదగిన అమ్మగారికిని, వారి కుటుంబ సభ్యులకును, ఒకవేళ స్వస్థలపు సంఘమునకును వ్రాసియుండవచ్చును.

వ్రాయబడిన కాలము:- 1 యోహాను వ్రాయబడినపుడే. క్రీ.శ.90లో ఎఫెసులో నుండి.

ఆంతర్యము:– యోహాను సేవ చేయుచుండిన ఒక స్వగ్రామ సంఘ సభ్యులైన యీ పెద్ద అమ్మగారు, ఆమె కుటుంబస్థులు వుండి యుండవచ్చును. వారి మధ్య మంచి బంధముండెను. కొన్ని సంఘములందు పలుకుబడిగల అబద్ధ బోధకులను గూర్చి యోహాను హెచ్చరించెను.

ముఖ్య వచనము:- వచ.6. మనమాయన ఆజ్ఞల ప్రకారము నడచుటయే ప్రేమ: మీరు మొదట నుండి వినిన ప్రకారము ప్రేమలో నడచుకొనవలెను అనునదియే ఆ ఆజ్ఞ.”

ముఖ్య పాత్రలు: యోహాను. అమ్మ గారు, ఆమె పిలలు.

ముఖ్య పదజాలము:- అబద్ద బోధకుల సహవాసమును విడచి దూరమగుడి.

ముఖ్య వచనములు:- 2 యోహాను 1:9-10.

గ్రంథ విభజన:- ఈ చిన్న పత్రికకు మొదటి పత్రికతో దగ్గర భావపోలిక కలదు. తన చదువరులకు ప్రేమ యొక్క సలహానిచ్చుటతో బాటు ప్రేమతో జ్ఞానముతో నడచుకొనవలెననియు చెప్పెను. పత్రికకు తేటయైన రెండు భాగములు గలవు:-

(1) దేవుని ఆజ్ఞలను గైకొనుట :- 2 యోహాను 1:1-6.

(2) అబద్ధ బోధకులను విడచి దూరమగుట.:- 2 యోహాను 1:7-13.

కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 63వ పుస్తకము; అధ్యాయము 1; వచనములు 13; ప్రశ్నలు లేవు; ప్రవచనములు లేవు.

John I – 1 యోహాను

దేవుడు వెలుగైయున్నాడు. దేవుడు ప్రేమయైయున్నాడు. దేవుడు జీవమైయున్నాడు. వెలుగును ప్రేమయు జీవమునైన ఆ దేవునితో బహు ఆనందకరమైన ఒక సహవాసము యోహాను అనుభవించి యుండెను. అందుచేతనే యోహాను యీ పత్రికను వ్రాయుచున్నాడు. “యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును” యోహాను తన సువార్త పుస్తకమును వ్రాసెను. (1 యోహాను 20:31) అయితే మొదట పత్రిక వ్రాసిన ఉద్దేశము ఏమిటను దానిని 1 యోహాను 5:13 లో చూపుచున్నాడు. “మీరు నిత్య జీవము గలవారని తెలిసికొనునట్లు దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు తెలిసికొనునట్లు నేను యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను” అనునదే అది. విశ్వసించుడి అను పదమునకు యీ పత్రికయందు ముఖ్యత్వమివ్వబడియున్నది. ఈ చిన్న పత్రికయందు 30 కంటే ఎక్కువసార్లు “తెలిసికొనుడి ” అను పదము మరల మరల వచ్చుచున్నది. ఒక్కొక్కమారు ఆపదము దేని కొరకు వచ్చుచున్నదని పరిశోధించి నేర్చుకొనుట ప్రయోజనకరమైన విద్యగా నుండును.

దేవుడు వెలుగైయున్నాడు. కనుక ఆ దేవునితో ఐక్యముగల వారము కావలెనన్నచో మనము చీకటియందు నడువక వెలుగులో నడచువారముగనుండవలెను. అట్లు వెలుగులో నడచినచో మనలను మనమే తీర్పు తీర్చుకొని మన పాపములను ఒప్పుకొందుము. ఆ విధముగా యేసుక్రీస్తు యొక్క రక్తము సకలపాపముల నుండి మనలను పవిత్రులనుగా చేయును. అప్పుడు క్రీస్తు తండ్రి యెదుట మన కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగా క్రియ జరిగించును. ఈ విధముగా ఐక్యమందు నడచుట యొక్క ఫలమే ప్రేమ. దేవుడు ప్రేమలేని వాడని ఎవడైన తలంచినట్లయితే వాడు దేవునిని ఎరిగి యుండలేదు. ప్రేమ అనునది వట్టి మాట కాదు; అది క్రియ. ప్రేమ పొందవలసినది కాదు. ఇచ్చునది. ఎట్టి నిబంధనయు లేని ప్రేమయే దేవుని ప్రేమ. సత్య దేవుడును నిత్య జీవము గల క్రీస్తుతో గల సహవాసమందు జీవించు ఒకనికి ఆయన యొక్క జీవము గల అనగా స్వభావము యొక్క శ్రేష్ఠత వుండి తీరవలెను. యోహాను యొక్క పేరు యీ పత్రికలలో ఎచ్చటను కనిపించనప్పటికిని యోహాను వ్రాసిన మొదటి పత్రికలని శీర్షిక దీనికివ్వబడెను.

ఉద్దేశము:- క్రైస్తవులను విశ్వాసమందు స్థిరపరచుట: అబద్ధ బోధనలను ఖండించుట.

గ్రంథ కర్త:- అపొస్తలుడైన యోహాను.

ఎవరికి వ్రాసెను?:- ఏదైనను ఒక గుర్తించబడిన సంమమునకు వ్రాసినది కాదు. అన్యజనుల సంఘముల కొరకైన ఒక కాపరి పత్రికగా యిది వ్రాయబడెను. సర్వమునందుగల విశ్వాసులకందరికిని వ్రాయబడినది.

వ్రాయబడిన కాలము:- క్రీ.శ.90లో ఎఫెసునందుండి వ్రాయబడెను.

ఆంతర్యము:- పత్రికను వ్రాయునపుడు యోహాను వృద్ధుడును ఆనాడు జీవముతో నున్న ఒకే అపొస్తలుడగును. అప్పుడతడు పత్మాసు దీవికి కొనిపోబడలేదు. క్రీస్తును నేరుగ చూచినవాడను రీతిలో ఆనాటి నూతన తరము వారైన విశ్వాసులకు దేవుని పై గల స్థిరమైన విశ్వాసమును, ధైర్యమును భాగించుటకు మిక్కిలి అధికారముతో వ్రాయబడిన పత్రిక.

ముఖ్య పదజాలము:- దేవునితో గల సహవాసము.

ముఖ్య వచనములు:- 1 యోహాను 1:3-4; 1 యోహాను 5:11-13.

ముఖ్య అధ్యాయము:- 1యోహా:1. యోహాను 15, 1 యోహాను 1 మొదలగునవి దేవునితో గల సహవాసమును ముఖ్య పరచు ఒక ముఖ్యమైన లేఖన భాగములగును. యోహాను 15 క్రీస్తునందు జీవించవలసిన ముఖ్యత్వమును గూర్చి వివరించుచున్నది. దాని మరియొక్క భాగమును 1యోహాను 1లో చూడగలము. క్రీస్తుతో గల సహవాసమునకు నాశనము వచ్చునప్పుడు మనము దేవుని చెంత నుండి పాప క్షమాపణను, పరిశుద్ధతను పొందుకొని తిరిగి ఆ సహవాసమునకు మరలి రావలెనని యీ అధ్యాయము బోధించుచున్నది.

గ్రంథ విభజన:- అబద్ధ బోధనల తుఫాను వంటి ప్రచారము అపొస్తలుల ఉపదేశమును సవాలునకు పిలుచు పరిస్థితిలో దానిని ఎదిరించి పరిశుద్ద క్రైస్తవ జీవితమును స్థిరపరచుకొనుటకై విశ్వాసులను ప్రోత్సహించుట కొరకు యీ పత్రిక వ్రాయబడెను. 2 పేతురు, యూదా వంటి పత్రికలవలె ఎదిరించుటయును, నెలకొల్పుటయునైన రెండు వైపులు యీ పత్రికకు గలవు. ఒక వైపు అబద్ద బోధనలను విసర్జించగా మరియొక వైపు సత్యము యొక్క జ్ఞానము ప్రకారము జీవించుటకు చదువరులకు సలహానిచ్చు చున్నది. దేవునితో గల సహవాసమే యీ పత్రిక యొక్క మూలభావము. రెండు ముఖ్య భాగములుగా యీ పత్రికను విభజించవచ్చును.

(1) దేవుని సహవాసము యొక్క మూలము. – 1Joh,1,1-2,27.

(2) సహవాసము యొక్క అనుచరణ విధానము – 1Joh,2,28-5,21.

కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 62వ పుస్తకము; అధ్యాయములు 5; వచనములు 105; ప్రశ్నలు 5; చారిత్రక వచనములు 100; నెరవేర్చబడని ప్రవచనములు 5.

Peter 2 – 2 పేతురు

పేతురు యొక్క మొదటి పత్రిక సంఘపు వెలుపలి వారి సమస్యలను సరిదిద్దునపుడు రెండవ పత్రిక సంఘపు లోపలి సమస్యలను సంధించవలసినదిగా నుండెను. అపాయకరమైన అబద్ధ బోధనలను బోధించు బోధకులను ఖండించి మాటలాడుచున్నాడు. వారి వ్యక్తిగత జీవితాలను పరిశుద్ధముగా కాపాడుకొనునట్లు బుద్ధి చెప్పుచూ అతడు ఈ పత్రికను వ్రాసెను. యథార్ధమైన మహిమ, జ్ఞానము, ఆశనిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదరప్రేమ, నిష్కపటమైన ప్రేమ మొదలగు వాటిననుసరించి వెంబడించుటయే క్రైస్తవ్యము యొక్క గురి. ఇందుకు వ్యతిరేకముగా అబద్ధ బోధకుల జీవితములో కనిపించునది చూడగా శరీరాశ, స్వార్ధము, దురాశ, స్వలాభాపేక్ష మొదలగునవి. రాబోవు కాలములో జరుగనైయున్న న్యాయ తీర్పును వారు హేళన చేయుచు నిరాకరించి ఇప్పుడు కనిపించునదే భవిష్యత్కాలపు మాదిరి అను మనస్సుతో జీవించుచున్నారు. దేవుని న్యాయ తీర్పును జ్ఞాపకము చేసికొని దాని వెలుగులో పరిశుద్ధతను, నిష్కల్మషమైన జీవితము గడుపుటకు అతడు విశ్వాసులను పిలుచుచున్నాడు.

“యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడునైన సీమోను పేతురు” అని 2 పేతురు 1:1 లో పత్రిక లేఖికుని గూర్చి విశదముగా చెప్పబడుచున్నది.

ఉద్దేశము:- అబద్ధ బోధకులను గూర్చిన హెచ్చరిక నిచ్చుట, వీరు విశ్వాసమునందును జ్ఞానమునందును ఎదుగుటకు పిలుచుట.

గ్రంథకర్త:- పేతురు.

ఎవరికి వ్రాయుచున్నాడు?:- సంఘములకు

వ్రాసిన కాలము:- ప్రియులారా ఈ రెండవ వత్రిక మీకిప్పుడు వ్రాయుచున్నాను అని 2 పేతురు 3:1లో సూచించి చిన్న ఆసియలోని అదే విశ్వాసులను మనస్సునందుంచుకొని ఈ పత్రిక వ్రాయబడినది. అయినను 2 పేతురు 1:1 లో చెప్పుచున్న “మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి” అను పదజాలము మిక్కిలి చదువ ప్రోత్సాహపరుప సూచించునట్టిదిగాను భావింపవచ్చును. సంమములో నుండి వెలువడినవియును, అందు మూలముగా మిక్కిలి ఆపదను పెంపొందించునట్టివిగానున్న అబద్ధ బోధకులకు బుద్ధి చెప్పుటకు పేతురు ఈ పత్రికను వ్రాసెను. ఇట్టి అబద్ధ బోధకులు యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట అను ఉపదేశమును నిర్మూలము చేయు వ్యతిరేక స్వభావమును క్రమమునకు విరుద్ధమైన బ్రతుకును పురికొల్పిరి (2 పేతురు 3:1-7).

ఈ పత్రిక అపొస్తలుల మరణమునకు కొంచెము ముందుగా రోమాలో నుండి వ్రాయబడినదిగా యుండియుండవచ్చును (2 పేతురు 1:14). పేతురు క్రీ.శ 64 నుండి 66 వరకు మధ్య కాలములో హతసాక్షియాయెను. తిమోతి రోమాలో నున్నప్పుడు పేతురు ఉండి యుండినట్లయితే అతనిని గూర్చిన సూచనలు ఇందులో కనబడియుండవలెను.

ఆంతర్యము:- తన ఆఖరి రోజులు సమీపించెనని పేతురు గుర్తించెను (2 పేతురు 1:13-14). గనుకనే తన హృదయాంతరంగము నుండి తన తరువాత ఏమి సంభవించునది వ్రాయుచున్నాడు. ముఖ్యముగా అబద్ధ బోధకులను గూర్చియు సువార్త యొక్క నిశ్చలమైన నిజత్వస్థితిని గురించియు జ్ఞాపకము చేయుచున్నాడు. ముఖ్య పదజాలము:- అబద్ధ బోధకులను గూర్చి హెచ్చరికగా నుండుడి.

ముఖ్య వచనములు:- 2 పేతురు 1:20-21; 2 పేతురు 3:9-11.

ముఖ్య అధ్యాయము:- 2 పేతురు 1.

గ్రంథ విభజన: – మొదటి పత్రిక జీవవాక్యము ద్వారా రానైయున్న నూతన జన్మను గూర్చి దృఢముగా చెప్పునపుడు రెండవ పత్రిక కృప ద్వారాను క్రీస్తునందలి జ్ఞానముగల ఎదుగుదలకు ప్రధానత్వమును యిచ్చుచున్నది. మూడు ముఖ్య భాగములు ఈ వత్రికనందున్నవి.

క్రైస్తవ ధర్మమును ఏర్పరచుట.- అధ్యాయము 1.
అబద్ధ బోధకులకు శిక్షా తీర్పు. – అధ్యాయము 2.
క్రీస్తు యొక్క రాకడ పట్ల గల విశ్వాసము. – అధ్యాయము 3.

కొన్ని వివరముల గుర్తింపులు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 61వ పుస్తకము; అధ్యాయములు 3; వచనములు 61; ప్రశ్నలు 2; చారిత్రక వచనములు 51; నెరవేరిన ప్రవచనములు 2; నెరవేరని ప్రవచనములు 8.

Peter 1 – 1 పేతురు

ఉద్దేశము:- శ్రమలనుభవించు క్రైస్తవులను విశ్వాసములో దృఢపరచి ఉత్సాహపరచుట.

గ్రంథకర్త:- పేతురు.

ఎవరికి వ్రాసెను?:- యెరూషలేము నుండి తరమబడినవారును చిన్న ఆసియలో ఇక్కడ అక్కడ చెద రిపోయి జీవించుచున్న క్రైస్తవులకును, అన్ని చోట్లనున్న విశ్వాసుల కొరకును.

వ్రాసిన కాలము:- సుమారు క్రీ.శ.64.

ఉద్దేశము:- నీరో చక్రవర్తి కాలమునందు జరిగిన గొప్ప ఉపద్రవకాలములో పేతురు రోమాలో ఉండియుండ వచ్చును. (ఈ ఉపద్రవములో పేతురు కూడ హతసాక్షియైనట్లు నమ్మబడుచున్నది). రోమా సామ్రాజ్యమంతటను క్రైస్తవులు తమ విశ్వాసనిమిత్తమై ఉపద్రవపరచబడియు, హత్య చేయబడి యుండియున్నందున యెరూషలేము సంమము యొక్క విశ్వాసులు మధ్యధరా సముద్ర ప్రాంతములలో చెల్లాచెదురై జీవించవలసిన సంభవము ఏర్పడెను. శ్రమల మధ్యలో వాటితో పోరాడుచూ ముందుకు సాగివెళ్లుచుండిన విశ్వాసులకు వ్రాయునపుడు వారు వీరులవలె పేరుగాంచవలెననియు క్రీస్తు రాకడకొరకును ఆయన చిత్తము నెరవేర్చుటకును వేచియుండవలెననియు పేతురు బోధించుచుండెను. వారి యొక్క గుణమును, క్రియలును నిష్కళంకముగా ఉండవలెను. ఒక జీవముగల నమ్మకము నిమిత్తము తిరిగి జన్మించినవారై, వారిని పిలిచిన పరిశుద్ధతకు తగినట్లుగా పరిశుద్ధులుగా జీవించవలయును. అటువంటి సేవా ఫలితము విధేయతద్వారా మూలాధారముగా కలిగిన ఒక ప్రవర్తనగా పరిమళించును. అన్యజనులు ప్రభుత్వమునకును బానిసలు వారి యజమానులకును భార్యలు భర్తలుగా నున్న వారికిని క్రైస్తవులు ఒకరి కొకరును లోబడియుండవలెను. ఇటువంటి విధేయత గలిగిన ఒక జీవితమును గూర్చి దృఢముగా చెప్పిన తరువాత మాత్రమే పేతురు శ్రమలు అనునట్టి కఠినమైన భాగమును గూర్చి మాటలాడుచున్నాడు. తనకు సంభవింపనైయున్న అగ్నిపరీక్ష ఒక నూతనమైనదని క్రైస్తవులు భావించకూడదు (1 పేతురు 4:12). క్రీస్తు యొక్క శ్రమలలో క్రైస్తవులు పాలి భాగస్తులగునప్పుడు వారు సంతోషించవలయును. శ్రమలలో సంతోషించు స్వభావమే ఆత్మీయ జీవము యొక్క నిజమైన సూచన. దేవుని యొక్క ప్రియమైన హస్తము క్రింద తగ్గించుకొనియుండునట్టి జీవితము యొక్క మిక్కిలి ఉన్నతమైన మహిమ అదియే.

ముఖ్య వ్యక్తులు:- పేతురు, సిల్వాను, మార్కు.

ముఖ్య స్థలములు:- యెరూషలేము. రోము, పొంతు, గలతీయ, కదొకియ, చిన్న ఆసియ, బితూనియ. ముఖ్య పదజాలము:- క్రీస్తు కొరకు శ్రమననుభవించుడి.

ముఖ్య వచనములు:- 1 పేతురు 1:10-12; 1 పేతురు 4:12-13.

గ్రంథ విశిష్ఠత:- తనకు చెందిన కొన్ని శ్రేష్టమైన పోలికలను పేతురు ఉపయోగించుచున్నాడు. జీవము గల రాళ్ల చేత కట్టబడిన ఆత్మ సంబంధమైన కట్టడమే సంఘము. అనుగ్రహించు కార్యమును ప్రభువు యొద్ద నుండి అతనికి దొరికెను (1 పేతురు 2:5-9). సంఘమును గురించి చెప్పునపుడు జీవముగల రాళ్లనియు, కాపరి గొర్రెలు అనియు ఉపయోగించునది పేతురుయొక్క శ్రేష్ట ప్రవర్తనయైయున్నది.

ముఖ్య అధ్యాయము:- 1 పేతురు 4. ఒక క్రైస్తవ సాక్షికి సంభవించు హింసలును, ఉపద్రవములను, ఏ విధముగా ఎదుర్కొనవలెననునదే దానిని గ్రహించుకొనుట క్రొత్త నిబంధన వివరణలో ప్రధానస్థానమును అధిష్టించినది ఈ అధ్యాయమే. క్రీస్తు యొక్క శ్రమలు మనకొక మాదిరి మాత్రమే గాక ఆయన శ్రమలతో పాలి భాగస్తులనుగా మారునపుడు ఉత్సహించు అర్హతయును కలదు.

గ్రంథ విభజన:- క్రైస్తవులకు శ్రమలు అధికమగుచుండిన ఒక లోకములో జీవించు పరదేశులకే పేతురు తన పత్రికను వ్రాయుచున్నాడు. క్రీస్తు కొరకు జీవించుట వలన శ్రమలు సహించు పరిస్థితిలో యేసుక్రీస్తు నందు వారికున్న జీవముగల నమ్మకము యొక్క నిజత్వము జ్ఞాపకము చేసికొను ఆదరణయు, ఉత్సాహమును ఇచ్చుచున్నాడు. దేవుని యొక్క సత్యవంతమైన కృపలో స్థిరపడి యుండుట ద్వారా ఆ అగ్ని పరీక్షను సహించు భాగమును వారు పొందెదరు (1 పేతురు 5:12; 1 పేతురు 4:12). వారు అనుభవించుచున్నట్టి వేదనల తరువాత దేవునికి ఒక ఉద్దేశమున్నది. ఈ పత్రిక వరుసక్రమములో మూడు కారణములను తెలుపుచున్నది.

విశ్వాసి యొక్క రక్షణానుభవము. 1Pet,1,1-2,12.
విశ్వాసిలో బడి యుండుటకు కావలసిన అవసరత. 1Pet,2,13-3,12.
విశ్వాసి సహించవలసిన ఉపద్రవము. 1Pet,3,13-5,14.

కొన్ని గుర్తింపు వివరములు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 60వ పుస్తకము; అధ్యాయములు 5; వచనములు 105; ప్రశ్నలు 4; చారిత్రకవచనములు 92; నెరవేరిన ప్రవచనములు 3; నెరవేరని ప్రవచనములు 10.

James – యాకోబు

క్రియలేని విశ్వాసమును విశ్వాసమనుట తగదు. ఎందుకనగా క్రియలేని విశ్వాసము మృతము. జీవము లేని విశ్వాసము బొత్తిగా లేని దానికన్నను చెడ్డది. విశ్వాసమనునది క్రియా పూర్వకముగానే బయలుపరచబడవలెను. యూదా విశ్వాసులకు యాకోబు వ్రాసిన ఈ పత్రిక యొక్క ఆంతర్యమే నిజమైన విశ్వాసమును అనుదిన జీవితముతో సంప్రదింపజేసి చూపించుచున్నాడు.

విశ్వాసమనునది శోధనలలో ఔన్నత్యతను అధిష్ఠించుచున్నది. విశ్వాసము శోధనలకు లోబడక చెడు దురాశలకు స్థానమివ్వక దీర్ఘశాంతము, దృఢత్వము మొదలగు వాటిని బయలుపరచుచున్నది. యాకోబు యొక్క అభిప్రాయానుసారముగా విశ్వాసము, పక్షపాతము ఒకటిగా ఏకీభవించవు. విశ్వాసము నాలుకను స్వాధీనపరచుకొను శక్తిని యిచ్చుచున్నది. చిన్నదైనను గొప్ప శక్తి గల ఈ ఒకే కళ్లెముతో స్వాధీనపరచుకొనుట అవశ్యకము. విశ్వాసమునకు అట్టి సామర్థ్యమున్నది. పరలోక జ్ఞానమును సంపాదించుకొని ఇహలోక జ్ఞానమును విడిచి పెట్టుటకును విశ్వాసము సహాయపడుచున్నది. విశ్వాసము ద్వారా మనము లోకమును విడిచి ప్రత్యేకింపబడి దేవునికి లోబడుచున్నాము. సాతానును ఎదిరించి నిలిచి దేవునికి సమీపించుచున్నాము. చివరిగా విశ్వాసము ప్రభువు యొక్క రాకడ నిమిత్తమై దీర్ఘశాంతముతో ఎదురు చూచుచున్నది. ఇబ్బందులందును, శ్రమలలోను సణుగుగొణుగు అలవాటును అనిశ్చయముగా వదలి పెట్టుచున్నది.

ఉద్దేశము: – యధార్ధమునకు విరుద్ధమైన అలవాట్లను బహిరంగపరచి చూపించుటయు నిజమైన నియమములను నేర్పించుటయు.

గ్రంథకర్త:- క్రొత్త నిబంధనలో యాకోబను పేరుగల నలుగురు వ్యక్తులను చూడగలము. ఇస్కరియోతు యూదాకాని యూదాయను శిష్యుని తండ్రియైన యాకోబు అల్ఫయి కుమారుడును పండ్రెండు శిష్యులలో ఒకడునైన యాకోబు, జెఫన్యా యొక్క కుమారుడును యోహాను యొక్క సహోదరుడును నైన యాకోబు, యేసుక్రీస్తు యొక్క సహోదరుడైన యాకోబు మొదలగువారే ఆ నలుగురైయున్నారు. వీరిలో నాల్గవదిగా చెప్పబడిన వాడు (మత్తయి 13:55; మార్కు 6:3; గల మార్కు 1:19). గడచిన దినములలో యెరూషలేము యొక్క సంఘపు స్థంభములలో ఒకడుగా ఎంచబడినట్లుగా పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. (అపో. కార్యములు 12:17; Acts,15,13-21-21,8 గల అపో. కార్యములు 2:9; అపో. కార్యములు 2:12). ఈ యాకోబే వంశపారంపర్య నమ్మకస్తుడైన ఈ పత్రిక గ్రంథకర్త. పరిశుద్ధ వాక్యములో నుండి లభించు సాక్ష్యార్ధములు ఈ నమ్మకమునకు ఆధారములైయున్నవి. నీతిమంతుడైన ఈ యాకోబును గూర్చి పరిశుద్ధ గ్రంథమునందుండియు వంశపారంపర్యం నుండియు మనమెరిగిన వివరములను దృఢపరచుటయే ఈ పత్రిక యొక్క ఆంతర్యం.

ఎవరికి వ్రాసెను?:- పాలస్తీనాకు వెలుపలనున్న అన్యుల మధ్యలో నివసించిన మొదటి శతాబ్ద యూదా క్రైస్తవులకు వ్రాసెను.

వ్రాయబడిన కాలము:- క్రీ.శ.49 (యెరూషలేము కార్య నిర్వహణ సమావేశము జరిగిన క్రీ.శ.50నకు పూర్వము.

ఆంతర్యము: – యెరూషలేము సంఘ కార్య నిర్వాహకులును శ్రమలకు గురియైన క్రైస్తవులపై యాకోబుకున్న చింత ఈ పత్రికయందు ప్రతిఫలించుచున్నది.

ముఖ్య పదజాలము: – క్రియా పూర్వకమైన విశ్వాసము.

ముఖ్య వచనములు: – యాకోబు 1:19-22; యాకోబు 2:14-17.

గ్రంథ విశిష్టత:- ఈ పత్రిక క్రొత్త నిబంధన పుస్తకములలో మొదటి పుస్తకముగా పరిగణింపబడుచున్నది. యాకోబు క్రీ.శ. 62లో హతసాక్షిగా మరణమాయెనని జోసిఫస్ అను చరిత్ర గ్రంథకర్త చెప్పుచున్నాడు.

ముఖ్య ఆధ్యాయము:- యాకోబు 1. క్రైస్తవ జీవితములో చాల యీక్కట్లైనన ఒక భాగము. శ్రమలు మరియు శోధనలకు సంబంధించినవిగానున్నవి. వీటి రెండింటికిని మనయొక్క సరియైన అనుసరణము ఏదై యుండవలెననునది ఈ అధ్యాయమునందు యాకోబు వెలిబుచ్చుచున్నాడు. శ్రమలు సంభవించునపుడు దానిని సంతోషముగా భావించుడి. శోధనలు కలుగజేయువాడు దేవుడు కాదు అనునదియు మనము విజ్ఞప్తినుంచుకొనవలెను.

గ్రంథ విభజన:- జ్ఞానము గల పుస్తకముల యొక్క సాహిత్య శైలిలో మంచి భాషలో ఈ పత్రిక క్రొత్త నిబంధన యొక్క “ నీతియుక్తమైన పలుకు ”లుగా పరిశుద్ధ గ్రంథ పారాయణులు భావించుచున్నారు. పాతనిబంధనలోని జ్ఞాన పుస్తకముల ద్వారా యాకోబు లోతైన ఆకర్షతోణ ఈ పుస్తకము వ్రాసెను. అదే ప్రకారముగా కొండ మీది ప్రసంగము ఆయనను ఆకర్షించినది. అన్యాయమునకును, అధర్మమునకును ఎదిరించు అతని యొక్క పరిస్థితి “క్రొత్త నిబంధన యొక్క ఆమోసు ” అను పేరు అతనికి చెందియున్నది. మూడు ముఖ్య భాగములుగా ఈ పుస్తకమును విభజింపవచ్చును.

విశ్వాసము యొక్క శోధన. – యాకోబు 1:1-18.
విశ్వాసము యొక్క ప్రత్యేక లక్షణములు. – James,1,19-5,6.
విశ్వాసము యొక్క విజయము. -యాకోబు 5:7-20.

కొన్ని గుర్తింపు వివరములు: – పరిశుద్ధ గ్రంథము యొక్క 59వ పుస్తకము; అధ్యాయములు 5; వచనములు 108; ప్రశ్నలు 24; చారిత్రక వచనములు 100; నెరవేరిన ప్రవచనములు 8.

Hebrews – హెబ్రీయులకు

పాలస్తీనాలోని అధికమైన యూదులు క్రైస్తవ విశ్వాసమునకు వచ్చిన పిదప క్రైస్తవులకు ఆ రోజులలో అధికముగా వచ్చిన ఉపద్రవము నుండి తప్పించుకొను నిమిత్తము యూదమతమునకు తిరిగి వెళ్ళుటకైన అభిప్రాయమును విలువరచిరి. ఈ విధముగా దిగజారిపోక ముందుకు సాగుటకును, పూర్ణజ్నామును పొందుటకయును ఈ గ్రంథ రచయిత వారికి బోధించెను. యూద మతముకన్నను క్రీస్తు ఎంతో నిజమైన వాడను సత్యమే అతడు చెప్పునట్టి బోధ యొక్క అంతర్భావము. క్రీస్తు ఆరాధనకు పాత్రుడైనందున దూతలకన్నను ప్రభావము గలవాడు. సమస్తమును సృజించినవాడగుటచే మోషే కన్నను శ్రేష్టుడు. అహరోను యొక్క యాజకత్వము కన్నను క్రీస్తు యొక్క యాజకత్వము శ్రేష్ఠమైనది. ఎందుకనగా క్రీస్తు నిత్యమైన ఒకే బలిని చెల్లించెను. ఆయన మిక్కిలి మహిమకరమైన ఒక నిబంధనకు మధ్యవర్తియైనందున ధర్మశాస్త్రము కన్నను శ్రేష్టమైనవాడు. క్లుప్తముగా చెప్పవలయునంటే యూదమతములో వారికేర్పడిన నష్టము కంటెను అనేకరెట్లు క్రీస్తు మూలముగా ఈ విశ్వాసుల ద్వారా పొందగలము. క్రీస్తులో ముందుకు సాగునపుడు శోధింపబడిన ఒక విశ్వాసమును, ఆత్మీయబోధనలు సత్క్రియలకైన పట్టుదల వారికి ప్రతిఫలములగుచున్నవి. ఇదే హెబ్రీ పత్రిక యొక్క వాదము.

ఉద్దేశము: – ప్రభువు యొక్క పరిపూర్ణత్వమును, ఔన్నత్యమును బయలుపరచుట.

రచయిత:- పౌలు

ఎవరికి వ్రాసెను?: – పాలస్తీనాలోని హెబ్రీ (యూద) క్రైస్తవులకు.

వ్రాసిన కాలము:- సామాన్యముగా యేరుశలేము దేవాలయము ధ్వంసము చేసిన క్రీ. పూ. 70కు ముందుగా నుండవచ్చును. ఎందుకనగా దేవాలయ పరిచర్యలను, బలులను మత ఆచారములను గూర్చి ఇందు చెప్పబడుచున్నది. దేవాలయము నాశనము చేయబడిన దానిని గూర్చిన సందర్భములిందు లేవు. సుమారు క్రీ.పూ. 67 లో ఇది వ్రాయబడినట్లుగా భావింపబడుచున్నది.

అంతర్యము: – యూదుల చేతను, రోమా సామ్రాజ్యము చేతను ఈ యూద క్రైస్తవులు సముదాయ స్థితిలోను, శరీర స్థితిలోను, ఎక్కువ శ్రమననుభవించుచుండిరి. ప్రభువు యొక్క రెండవ రాకడను క్రైస్తవులు ఆపేక్షతో ఎదురు చూచుచుండిరి. వారి రాజ్యము స్థాపించుకాలము ఇంకను రాలేదు. క్రైస్తవ విశ్వాసము నిజమైనదనియు, క్రీస్తే మెస్సీయ యనియు క్రైస్తవులకు మరల దృఢత్వము కలుగవలసినదిగా నుండెను.

ముఖ్య వ్యక్తులు: – పాత నిబంధన యొక్క విశ్వాసవీరులు.

ముఖ్యమైన పలుకులు:- క్రీస్తు యొక్క ఔన్నత్యము

ముఖ్య వచనములు:- హెబ్రీయులకు 1:3.

ముఖ్య వచనములు: హెబ్రీయులకు 4:14-16; హెబ్రీయులకు 12:1-2.

గ్రంథ శ్రేష్టత:- ఇది ఒక పత్రికగా పిలువబడినప్పటికిని (హెబ్రీయులకు 13:22) శ్రద్ధగా వడియ కట్టబడిన ఒక ప్రసంగము యొక్క రీతిలో అమరియున్నది.

ముఖ్య అధ్యాయము: – అధ్యాయము 11. గ్రంథవచనముల యొక్క ముఖ్యత్వమును శాశ్వతముగా స్థిరపరచబడిన అధ్యాయములలో ఇది ఒకటి. దేవుని వాగ్దానము కాక మరేమియు లేకుండ ఉండినపుడు దేవునిని ఆయన వచనము యొక్క శక్తి ద్వారా మాత్రమేనని అనుకొను వారి యొక్క జాబితా ఇదియైయున్నది. “విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడై యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా” ఇవియే ఈ విశబ్వూసవీరుని జీవితమార్గగా బయలుపరుచబడినట్టి సత్యములు.

గ్రంథ విభజన:- క్రైస్తవ యూద మతము కన్నను ఔన్నత్యముగల వాడు అని నిరూపించుటయే ఈ పత్రికను ఏర్పరచిన ఉద్దేశము. ఈ గురిని చేరుటకు గ్రంథకర్త వ్రాసిన కార్యములను మూడు భాగములుగా విభజింపవచ్చును.

క్రీస్తు యొక్క పరిపాలనలోనున్న గొప్పతనము. Heb,1,1-4,13.
క్రీస్తు చేసిన క్రియలలోని గొప్పతనము Heb,4,14-10,18.
క్రీస్తు నందున విశ్వాసము, జీవితము మొదలగు వాటి గొప్పతనము. Heb,10,19-13,25.

కొన్ని గుర్తింపు వివరములు:- గ్రంథములోని 58వ పుస్తకము. అధ్యాయములు 13, వచనములు 303, ప్రశ్నలు 17, చారిత్రక వచనములు 270, నెరవేరిన ప్రవచనములు 9, నెరవేరని ప్రవచనములు 24.

Philemon – ఫిలేమోనుకు

అశక్యము కాని సమస్యలతో నిండిన జీవిత పరిస్థితులలో క్రైస్తవ ప్రేమ క్రియా రూపము పొందునా? ఉదాహరణకు ధనవంతుడైన ఒక యజమానియు, అతని యొద్దనుండి పారిపోయిన అతని బానిసయు తమలో ప్రేమించుకొనగలరా? గలరు అనుటలో పౌలునకెట్టి సందేహమును లేదు. ఒకదినము ఫిలేమోను చెంత నుండి పారిపోయిన దొంగయు, దుష్టుడునైన ఒనేసిము అను దాసుని కొరకు పౌలు ఆ యజమానునికి వ్రాయు ఒక లేఖయే ఈ పత్రిక. మునుపు అతడు నిష్ప్రయోజకుడును, సమస్యలకు కారకుడునైన ఒక దాసుడిగా నుండెను. ఇప్పుడైతే అతడు క్రీస్తునందు ప్రియమైన సహోదరునిగా నుండెను. పౌలును ఎంత మిక్కుటమైన ప్రేమతో ఫిలేమోను ఆహ్వానించునో అదే ప్రేమతో ఒనేసిమును అంగీకరించుమని మిక్కిలి తేటగా ఫిలేమోనుకు వ్రాయుచున్నాడు. ఒనేసిము ఫిలేమోను గృహము నుండి దేనినైననూ ఆకర్షించి తీసుకొనినను, పోగొట్టుటకు కారణముగానున్నను దానిని తిరిగి ఇచ్చెదనని పౌలు వాగ్దానము చేసెను. సహోదర ప్రేమ, క్షమాపణను, కనికరమును ఈ పరిస్థితి యందు విజయము పొందునని పౌలుకు పరిపూర్ణ విశ్వాసముండెను.

ఉద్దేశము: – ఫిలేమోను యొద్దనుండి పారిపోయిన దాసుడైన ఒనేసమును క్షమించుటకును విశ్వాస సహోదరునిగా అతనిని గౌరవించుటకును వేడుకొనుట.

గ్రంథ కర్త:- పౌలు

ఎవరికి వ్రాసెను?:- ఫిలేమోనుకు. ఇతడు కొలొస్సైయ సంఘమందు గల ధనవంతుడైన ఒక సభ్యుడిగా నుండి యుండవచ్చును.

వ్రాయబడిన కాలము: – క్రీ.శ. 61 నుండి రోమా చెరసాల కాలమందు దీనిని వ్రాసెను. ఈ కాలమందే ఎఫెసీ, కొలొస్సై మొదలగు పత్రికలను వ్రాసెను.

గ్రంథ కర్త:- ఫిలేమోనుకు 1:1; ఫిలేమోనుకు 1:9; ఫిలేమోనుకు 1:19 మొదలగు మూడు వచనములను పౌలు ఈ పత్రికను వ్రాసెననుటకైన ఆధారములగును. కొలొస్సయులకు 4-14 మొదలగు వచనములను ఫిలేమోనుకు 1:10; ఫిలేమోనుకు 1:23-24 మొదలగు వచనములను పోల్చి చూచినచో యీ రెండు పత్రికలందును గుర్తించబడు మనుష్యుడు ఒకే వ్యక్తియని తెలియుచున్నది.

వ్రాయబడిన కాలము:- ఈ పత్రిక మరియు కొలొస్సై పత్రిక యొక్క ముఖ్య భాగములను పోల్చి చూచినచో పత్రికకు ఆధారమైన చారిత్రిక సంభవములను క్రిందనున్నట్లు పోల్చి చూడవచ్చును.

ఫిలేమోను కొలొస్సైయందు నివసించిన ఒక ధనవంతుడు. అతని భార్య పేరు అప్పియ. అతని కుమారుని పేరు ఆరిప్పు. (కొలొస్సయులకు 4:9; కొలొస్సయులకు 4:17; ఫిలేమోనుకు 1:1) అచ్చట గల సంఘము అతని యింటనే కూడుచుండెను. ఫిలేమోను కుమారుడైన అర్ఖిప్పు సంఘమందు ముఖ్యమైన ఒక పరిచారకుడుగా నుండెను. (కొలొస్సయులకు 4:17). ఫిలేమోను దగ్గర పని చేయుచున్న అనేకులలో ఒనేసిము ఒకడుగానుండెను. యజమానుని వస్తువులను అపహరించిగాని లేక ఏదైనను నేరమును యజమానునికి విరోధముగ చేసిగాని అతడు తన యజమానుని విడిచి దూరముగ పారిపోయెను. భద్రత కొరకై ప్రజలతో క్రిక్కిరిసియున్న రోమును చేరెను. తన యజమానుని మారు మనస్సునకు ముఖ్య కారకుడును, అలవాటు పడిన వాడునైన పౌలును అచ్చట కనుగొనెను. అచ్చట అతడు మారు మనస్సు పొంది క్రీస్తునందు ఒక నూతన వ్యక్తిగ మారెను. పౌలుకు మిక్కిలి ఉపయోగకరమైన ఒక సహోదరునిగ కొంత కాలము సహాయము చేయుచు రోమాలో నివసించెను. యజమానుని యొద్దకు మరల వచ్చుట అవశ్యకమని పౌలును ఒనేసిమును గ్రహించిరి. అప్పుడు కొలొస్సై పత్రికను వ్రాసి తుకికు దగ్గర యిచ్చి పంపుటకు పౌలు తీర్మానించెను. వెంటనే ఒనేసిమును తుకికుతో కలసి కొలస్సైకి పంపుటకు తీర్మానించి అతని చేతికి ఫిలేమోనుకు వ్రాసిన పత్రికనప్పగించెను.

ఒనేసిమును ఒంటరిగ పంపక తుకికుతో కలిసి పంపు కారణము, ఇటువంటి దాసులను పట్టుకొను అధికారుల యొద్ద నుండి కాపాడుట కొరకైన ఉద్దేశముగా నుండవచ్చును. ఆ కాలమందు పారిపోయిన దాసులు కనుగొనబడినట్లయినచో వారికి కఠిన శిక్ష విధించబడును. కొన్ని సమయములందు కనికరము లేక మరణ శిక్ష నిచ్చుట అలవాటుగా నుండెను. ఒనేసిము ఒక క్రైస్తవునిగా మారినట్లైనచో పౌలు యిటువంటి ఒక పత్రికను వ్రాసి చేతికిచ్చినను అతడు తిరిగి వెళ్ళి యుండడు.

పౌలు యొక్క చెరసాల పత్రికలలో ఒకటైన యీ పత్రిక క్రీ.శ.61లో వ్రాసియుండవచ్చును. (ఎఫెసి, ఫిలిప్పీ, ముఖ్యముగా కొలస్పై వంటి పత్రికల ప్రారంభమందు చూడుము.)

ఆంతర్యము:– బానిసత్వము రోమా సామ్రాజ్యమందు సామాన్యమైన ఒకటిగా నుండెను. సంఘ విశ్వాసులలో పలువురికిని బానిసలుండిరి. తన పత్రికలందు బానిసత్వ సంబంధమైన ఆజ్ఞలు ఏవియు గుర్తించబడలేదు. అయితే యీ బానిసను ఫిలేమోను యొక్క క్రీస్తునందలి సహోదరుడని పౌలు చెప్పునప్పుడు ఆ బానిసత్వ స్థితి నుండి ఒక మూలాధారమైన మార్పును ఏర్పరచుచున్నాడు.

ముఖ్య పాత్రలు:- పౌలు, ఫిలేమోను, ఒనేసిము.

ముఖ్య పదము:- క్షమించు

ముఖ్య వచనములు:- ఫిలేమోనుకు 1:16-17.

ముఖ్య స్థలములు:- కొలొస్పై, రోమా

గ్రంథ విశిష్టత:- ఇది ఒక స్నేహితునికి పంపిన ఒకనికి సంబంధించినవియు వ్యక్తిగతమైనదియునైన ఒక పత్రిక.

గ్రంథ విభజన: – పౌలు పత్రికలలో బహు చిన్నది. గ్రీకు భాషలో 334 పదములు మాత్రము ఉన్న పత్రిక యిది. మరియొక రీతిలో చూచినట్లైనచో మరణ శిక్షకు పాత్రుడైన ఒక వ్యక్తి దగ్గర పౌలు చూపు ప్రేమ, ఆపేక్ష, క్షమాపణ, దేవుని ప్రేమకు ఒక విశేషమాదిరి అగును. మూడు భాగములుగా యీ పత్రికను విభజించవచ్చును.

(1) ఫిలేమోను కొరకు కృతజ్ఞత తెలుపు ప్రార్ధన. 1-7.వచ.

(2) ఒనేసిము కొరకు ప్రార్థించుట. వచన.8-16.

(3) ఫిలేమోనుకు పౌలు యొక్క వాగానము. వచ.17-25.

కొన్ని ముఖ్య వివరణలు: – పరిశుద్ధ గ్రంథము యొక్క 57వ పుస్తకము ; అధ్యాయము 1; వచనములు 25; ప్రశ్న 1; ప్రవచనములు లేవు.

Titus – తీతుకు

క్రేతు సంఘము యొక్క బాధ్యతల కొరకు నియమింపబడినవాడైన తీతుకు ఆ సంఘమును పరామర్శించి జరిగించుటకైన బాధ్యత మిక్కిలి భారమైనదిగా నుండెను. అచ్చటనున్న ఒక్కొక్క పట్టణము యొక్క సంమములకును, పెద్దలుగా నుండుటకు నిష్కళంక గుణము పరిశుద్ధతయుగల మనుష్యులను నిర్ణయించవలెనని పౌలు అతనికి ఆజ్ఞాపించుచున్నాడు. సంఘ సేవకులు మాత్రమేగాక సంమములోని వారందరును ఆడ మగ యను బేధము లేక వయపరిమాణము చూడక వారు విశ్వసించు సత్యములను జీవితములో అనుసరించుచూ వచ్చినట్లయితేనేగాని సంఘము జీవముగలదిగా నుండును. పత్రిక ద్వారా రక్షణ యొక్క ఈ అనుభవపూర్వకముగా చేయుటను గూర్చియే పౌలు చెప్పుచున్నాడు.

ఉద్దేశము:- క్రేతు సంఘ బాధ్యతను తీతుకు యివ్వవలసిన బాధ్యతను బోధించుట

గ్రంథకర్త:- పౌలు

ఎవరికి వ్రాసెను?: – తీతుకు, గ్రీకు వాడైన తీతు పౌలు యొక్క సేవా ఫలితముగా విశ్వాసములోనికి వచ్చినవాడుగా నుండవలెను. క్రేతు దీవి సంమములకు పౌలు యొక్క ప్రతినిధిగా తీతు పంపబడెను.

వ్రాసిన కాలము: – క్రీ.శ.64-లో ఈ కాల సందర్భములోనే పౌలు 1తిమోతి పత్రికను కూడ వ్రాసెను. రెండుసార్లు చెరనివాసముకు మధ్య మాసిదోనియాలో నుండి పౌలు ఈ పత్రికను వ్రాసియుండవచ్చును.

ఆంతర్యము: – మధ్యధరా సముద్రపు దీవియైన క్రేతు సుమారు 156 మైళ్ళ పొడవును, 30 మైళ్ళ వెడల్పును గలది. మొదటి శతాబ్దములో ఇక్కడ జీవించిన ప్రజలు అవాచ్యమైన కార్యములకును, దుర్నీతికిని, దుష్కీర్తి పొందినట్టి వారిగా నుండిరి. “క్రేతువానివలె ప్రవర్తించు” అనుమాటకు దొంగ ప్రవర్తన యని అర్ధము. పౌలు క్రేతు దీవి సంఘములను చూచుకొనుటకును అక్కడి కార్యములను క్రమపరచుటకును, తీతును అక్కడకు పంపెను. ఈ కార్యములు ఎట్లు నెరవేరవలెనని పౌలు చెప్పుచున్నాడు.

ముఖ్య మనుష్యులు:- పౌలు, తీతు.

ముఖ్య పదజాలము:- సంఘ క్రమ విధులు.

ముఖ్య వచనములు:- తీతుకు 1:5; తీతుకు 3:8.

ముఖ్య స్థలములు:- కేతు, నికొపోలి.

గ్రంథ విశిష్టత:- తీతు, 1తిమోతి మొదలగునవి ఒకే స్వభావమును వెలువరచు పత్రికలై యున్నవి. రెండింటిలోను పెద్దలకైన బుద్ధిమాటలు చెప్పుచున్నాడు.

ముఖ్య అధ్యాయము:- తీతు 2. సంఘములోని విశ్వాసులు దేవుని చిత్తానుసారముగా బ్రదుక ఈ అధ్యాయములో పౌలు ముఖ్యమైన ఆజ్ఞలు బోధించుచున్నాడు. దేవుని ప్రజలందరు ఈ ఉపదేశములకు సంపూర్ణమైన విధేయతను చూపవలెననునది పౌలు యొక్క వాంఛయైయున్నది.

గ్రంథ విభజన:- పౌలు తీతును లోపముగా ఉన్నవాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే క్రేతులో విడిచి వచ్చెను(తీతుకు 1:5) ఈ పత్రికలో సరియైన బోధను నొక్కి వక్కాణించి, సత్యమును మార్చి చెప్పువారికి వ్యతిరేకముగా హెచ్చరిక నిచ్చుచున్నాడు. అయితే సంఘ ప్రజలు సత్క్రియలందాసక్తి గలవారుగా జీవించుటకైన ఆజ్ఞలే దీని యొక్క ముఖ్యద్దేశము అని చెప్పవచ్చును. రెండు ముఖ్య భాగములుగా ఈ పత్రికను విభజింపవచ్చును.

పట్టణమంతయు పెద్దలను ఏర్పరచుట. అధ్యాయము 1. (2.) ఇతర కార్యములను సరిదిద్దుట. అధ్యాయము 2, 3.
ఈ పత్రిక కు తిమోతితోనున్న ఏకత్వము:- తీతును తిమోతియు ఒకే కాలములో సుమారు క్రీ.శ.64లో వ్రాయబడినవైయున్నవి. పెద్దలను నియమించుటయను ఒకే కార్యమునే రెండు పత్రికలును చెప్పుచున్నవి. తీతు క్రేతులోను, తిమోతి ఎఫెసులోను ఎదుర్కొన్న సంభవములు ఇంచుమించు ఒకే విధమైనవైయున్నవి. రెండు ముఖ్య భాగములుగా ఈ పత్రికను విభజించవచ్చును.

కొన్ని గుర్తింపు వివరములు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 56వ పుస్తకము; అధ్యాయములు 3; వచనములు 46; ప్రశ్నలు లేవు; చారిత్రక వచనములు 45; నెరవేరిన ప్రవచనములు 1.

Timothy 2 – 2 తిమోతికి

చెరలో నుండి ధైర్యమును, ఉత్సాహము నిచ్చు ఒక పత్రికను వ్రాయునదియనుట ఒక అరుదైన కార్యము. అయితే అటువంటి ఒక పత్రికగా తిమోతి రెండవ పత్రిక కనబడుచున్నది. ఈ పత్రికలో పౌలు తిమోతి పైనున్న తన ప్రేమను, అతని కొరకు ప్రార్ధించుటయును గూర్చి ధృడపరచిన పిదప తాను తన యొక్క ఆత్మీయ తండ్రి అనియు, బాధ్యతలను గూర్చి అతనికి జ్ఞప్తి చేయుచున్నాడు. ఒక సైనికుడైనను మల్లయుద్ధము చేయువాడైనను, వ్యవసాయి యైనను, యేసుక్రీస్తు యొక్క సేవకుడైనను, విడువక పోరాడినట్లయితేనే ప్రతిఫలమును పొందగలడు. అంత్య దినములలో ప్రజలు సత్య మార్గమును విడిచి చెవులకు యింపైన ప్రసంగములను విను కాలములో క్రైస్తవ జీవితము కూడ మాని బలమును కోల్పోయి భక్తి వేషములో మునిగిపోవునని పౌలు హెచ్చరించుచున్నాడు. అయితే అటువంటి పడిన స్థితిలో కూడ పౌలు యొక్క సాదృశ్యము తిమోతికి మార్గదర్శిగాను, దేవుని వాక్యము అతనిని బలపరచుటకును ఎంతైనను చాలినంతవిగా నుండెను.

ఉద్దేశము:- ఎఫెసు సంఘ సేవకుడైన తిమోతికి చివరి బుద్ధి మాటలను ప్రోత్సాహమును కలుగజేయుట.

గ్రంథకర్త:- పౌలు

ఎవరికి వ్రాసెను:- తిమోతికి.

వ్రాసిన కాలము: – రోమా చెరలోనుండి క్రీ.శ. 66 లేక క్రీ.శ.67 లో వ్రాయబడినది. మొదట సారి ఖైదు చేయబడిన పౌలు తదుపరి విడుదల చేయబడెను. రెండు సంవత్సరముల తరువాత తిరిగి ఆయన ఖైదు చేయబడి నీరో చక్రవర్తిచే శిరచ్ఛేదనము చేయబడెను.

ఆంతర్యము:- తనకు చెరలో సహాయము చేయుటకు లూకా ఉండినప్పటికిని కార్యరూపములో ఎప్పుడును; పౌలు ఒంటరిగానేయుండెను. క్రొత్త తరము యొక్క సంఘ అధ్యక్షతకు తనను పానార్పణముగా అప్పగించుట కొరకై అతడు ఈ పత్రికను వ్రాయుచున్నాడు. స్నేహితులు తన్ను సంధించవలయుననియు అంగీని, పుస్తకములను చర్మపు కాగితములను కావలెననియు పౌలు తన అభిలాషను వెలిబుచ్చెను.

ముఖ్య మనుష్యులు:- పౌలు, తిమోతి, లూకా, మార్కు.

ముఖ్య పదజాలము:- అపకారమును ఓర్చుకొనుట

ముఖ్య వచనములు:- 2 తిమోతికి 2:3-4; 2 తిమోతికి 3:14-17.

ముఖ్య స్థలము: – రోమా, ఎఫెసు

గ్రంథ విశిష్టత:- ఇది పౌలు యొక్క చివరి పత్రిక. ఇందులో ఆయనయొక్క హృదయ వాంఛలను జీవితములో ప్రాధాన్యమైన, ఆరోగ్యమైన ఉపదేశము, దృఢము, విశ్వాసము, ప్రేమ మొదలైనవాటిని ప్రకటించుచున్నాడు.

ముఖ్య అధ్యాయము:- అధ్యాయము 2. సంపూర్ణ సేవలో నిమగ్నులైయున్న క్రైస్తవ సేవకులందరును, ప్రతిదినము చదివి, ధ్యానించవలసిన ఒక భాగము. ఇది స్థిరముగా నిలుచుటయు విజయవంతమైన ఒక క్రైస్తవ సేవ యొక్క తాళపుచెవిని పౌలు ఇందులో చూపించుచున్నాడు.

ప్రతిఫలమునిచ్చు సేవ, వచనము 1,2

సహనముతో చేయు సేవ. వచనము 3-13

వాక్యము చదువుచుచేయు సేవ- వచనము 14-18

పరిశుద్ధతతో నిండిన సేవ. వచనము 19-26

గ్రంథ విభజన:- ఈ చివరి పత్రికను వ్రాయుచుండినపుడు అతని యొక్క ఇహలోక జీవితదినములు త్వరగా దాని అంతము సమీపించియుండునదని పౌలు గ్రహించెను. భారము తొలగి సేద తీర్చుకొననిష్టపడువాడుగా నుండినను దైవ భక్తి కలిగిన అపొస్తలుడు, కొంచెం భయస్తుడును, అయితే మిక్కిలి యధార్ధమైనవాడును, తన సహ సేవకుడునైన తిమోతిని ఎఫెసు సంఘము యొక్క కష్టతరమైన పరిచర్యకు సిద్ధపరచుటకే ఈ పత్రికను వ్రాసెను. పత్రికలోని రెండు ముఖ్య విషయములు క్రిందచూడుడి.

తాత్కాలిక శోధనలో దృఢముగా నిలిచియుండుము. అధ్యాయము 1,2
భవిష్యత్ కాల శోధనలలో సహనము వహించుము. అధ్యాయము 3,4
కొన్ని వివరముల గుర్తింపులు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 55వ పుస్తకము; అధ్యాయము 4; వచనములు 83; ప్రశ్నలు లేవు; చారిత్రక వచనములు 68; నెరవేరిన ప్రవచనములు 10; నెరవేరని ప్రవచనములు 5.

Timothy 1 – 1 తిమోతికి

వృద్ధుడును, అనుభవజ్ఞుడును అయిన అపొస్తలుడైన పౌలు, యౌవనస్తుడును, ఎఫెసు సంఘ సేవకుడనైన తిమోతికి వ్రాయు పత్రిక ఇది. తిమోతికి వున్న బాధ్యత ఒక పెద్ద సవాలుగనుండెను. సంఘముయందుగల అబద్ధ బోధనలను దూరపరచవలెను, సామాన్య ఆరాధన ఫలించదగినదిగా యుండవలెను. సంఘము పరిపక్వమైన అధ్యక్షతను పొందినదిగా చేయవలెను. సంఘ స్వభావమును కాపాడుట కంటెను పరిచారకుని స్వభావమును భద్రముగా కాపాడవలెను. తిమోతి యొక్క యౌవ్వనము సువార్త సేవకు గొప్ప స్వాస్థ్యముగానుండవలెనే గాని సంఘమును బాధించునట్టిదిగా ఉండకూడదు. అదే సమయమందు ఒక ఆత్మీయ మనుష్యునికి అవసరమైన నీతి, దైవ భక్తి, విశ్వాసము, ప్రేమ, దీర్ఘశాంతము, ఓర్పు మొదలగు వాటిని విడువక అనుసరింపవలెను.

ఉద్దేశము:- యౌవ్వనుడైన తిమోతికి సలహానిచ్చి అతనిని ప్రోత్సాహపరచుట.

గ్రంథ కర్త:- పౌలు

ఎవరికి వ్రాసెను?:- తిమోతికి, యౌవ్వనులైన సంఘ అధ్యక్షులకును ఇతర విశ్వాసులకును.

వ్రాయబడిన కాలము:- దాదాపు క్రీ.శ.64లో రోమా నుండి లేక మాసిదోనియా నుండి (ఇంచుమించు ఫిలిప్పీ). పౌలు యొక్క చివరి రోమా చెరసాల వాసమునకు కొంచెము ముందు.

ఆంతర్యము:- పౌలుకు మిక్కిలి సమీపమైన తోటి సేవకుడిగా తిమోతి ఉండెను. ఎఫెసు సంఘములో ఏర్పడిన తప్పుడు బోధనలను ఎదురించుటకు అతనిని అచ్చటకి పంపెను. (1 తిమోతికి 1:3-4) ఎఫెసు సంఘ సేవకునిగ తిమోతి కొన్ని దినములు పరిచర్య చేసి ఉండవచ్చును. పౌలు అతనిని చూచుటకు ఆశించెను (1 తిమోతికి 3:14-15; 1 తిమోతికి 4:13) అంతకు ముందు పరిచర్య యందు ఎరిగి యుండవలసిన అనుచరణ యందున్న కార్యములను గూర్చి ఈ పత్రిక వ్రాసెను.

ముఖ్య పాత్రలు:- పౌలు, తిమోతి

ముఖ్య పదజాలము: – సంఘము ఏర్పాటు యొక్క అధ్యక్షత

ముఖ్య వచనములు:- 1 తిమోతికి 3:15-16; 1 తిమోతికి 6:11-12.

ముఖ్య స్థలము:- ఎఫెసు

గ్రంథ విశిష్టత:- ఈ పత్రిక సంఘ పరిపాలనను గూర్చియు శిక్షా విధానములను గూర్చిన ఒక వ్యక్తికి సంబంధించిన ఒక పత్రికయగును.

ముఖ్య అధ్యాయము:- అధ్యాయము 3. దేవుని సంఘపు బాధ్యతను వహించి పరిచర్య చేయు వారి అర్హతలను ఈ అధ్యాయమందు పౌలు వివరించుచున్నాడు. మనమిచ్చట చూచునది లోక జీవిత విజయము కొరకైన అర్హతలను కాదు. యధార్ధమైన సంఘ అధ్యక్షత కొరకైన అర్హతలను దేవునితో నడచుట ద్వారా మాత్రమే పొందవచ్చును.

గ్రంథ విభజన:– తమ జీవితపు అంతమున క్రీస్తు సువార్త సేవయందు తోటి పరిచర్య చేసిన వానికి పౌలు వ్రాసిన పత్రికలే “ కాపరి పత్రికలు”. (1తిమోతి, 2తిమోతి, తీతు) అపొస్తలుడైన పౌలు ఒక వ్యక్తికి వ్రాయు పత్రికలు ఇవి మూడు మాత్రమే. ఫిలేమోనుకు వ్రాసిన పత్రిక మాత్రమే ఒకనికి వ్రాసినట్లు వున్నది. వాస్తవమునకు అది పలువురికి వ్రాసిన ఒక పత్రికయే. ఎఫెసునందు క్రేతునందున్న సంఘములన్నిటి దృఢవిశ్వాసమును గురియందుంచుకొని వ్రాయబడినవే ఇవి. 1తిమోతి యందు పౌలు యొక్క ఐదు ప్రమాణములిమిడియున్నవని చెప్పగలము.

(1) బోధనను గూర్చిన ఆజ్ఞ – అధ్యా.1

(2) సామాన్య ఆరాధనను గూర్చిన ఆజ్ఞ – అధ్యా.2,3

(3) అబద్ధపు బోధకులను గూర్చిన ఆజ్ఞ – అధ్యా.4

(4) సంఘ క్రమశిక్షణను గూర్చిన ఆజ్ఞ – అధ్యా.5

(5) కాపరుల లక్ష్యములను గూర్చిన ఆజ్ఞ – అధ్యా.6

కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథములోని 54వ పుస్తకము; అధ్యాయములు 6; వచనములు 114; ప్రశ్నలు 1; చారిత్రక వచనములు 106; నెరవేర్చబడిన ప్రవచనములు 5; నెరవేర్చబడని ప్రవచనములు 2.

Thessalonians 2 – 2 థెస్సలొనీకయులకు

పౌలు యొక్క మొదటి పత్రికకు తరువాత థెస్సలొనీకయుల మధ్య తప్పుడు బోధనల యొక్క గురుగులు అభివృద్ధి చెందుటకు ప్రారంభించి వారు విశ్వాసమందు ఊగిసలాడుటలు ఏర్పడుటకు అది కారణమాయెను. ఈ నాశనపు గురుగులను తీసివేసిన తరువాత పౌలు మరలా ఈ పత్రిక ద్వారా మంచి విత్తనములు విత్తెను. అచ్చట గల విశ్వాసుల శ్రమల మధ్య చూపిన యధార్థతను ఘనపరిచియు ప్రస్తుత కాల శ్రమలు రాబోవు కాల మహిమ యొక్క నిరీక్షణ అని జ్ఞాపకము చేసి ధైర్యపరచి పత్రికను వ్రాయుటకు ప్రారంభించెను. శ్రమల మధ్య పరమ నమ్మకము కలిగియుండుటకు ఉత్సాహపరిచెను.

తరువాత పత్రిక యొక్క ముఖ్య స్థానమునకు నేరుగా పౌలు వచ్చుచున్నాడు. రాబోవు ప్రభువు దినమును గూర్చి అబద్ద బోధకులు చెప్పినటువంటి తప్పుడు భావములను గూర్చి మాట్లాడుచున్నాడు. ఆ దినము నేటికినీ రాలేదు; ఆ దినమునందు సంభవించవలసినవి ఏవని అతడు బయలుపరచెను. కనుక అజాగ్రత్త గల సోమరితనము విడిచిపెట్టి లేచి సువార్తకొరకు కఠినముగా సేవ చేయుటయే వారు చేయవలసినది.

ఉద్దేశము:- క్రీస్తు యొక్క రెండవ రాకడను గూర్చిన సందేహములకు జవాబును చెప్పుట.

గ్రంథ రచయిత:- పౌలు

ఎవరికి వ్రాసెను?:- థెస్సలొనీకయ సంఘమునకు, విశ్వాసులు యావన్మందికిని

వ్రాయబడిన కాలము:- దాదాపు క్రీ.శ. 51లో థెస్సలొనీకయులకు వ్రాసిన కొన్ని నెలలకు తరువాత కొరింథు నుండి వ్రాసెను.

ఆంతర్యము:- క్రీస్తు తిరిగి వచ్చు రాకడ సమయమును గూర్చి సంఘమందు పలువురికి ఈ అసత్య అభిప్రాయములుండెను. క్రైస్తవ విశ్వాసుల శ్రమలు అధికరించుటచే ప్రభువు యొక్క దినము త్వరగా వచ్చునని వారు ఎదురుచూచిరి. మరియు మొదటి థెస్సలొనీకయ పత్రిక యొక్క ఆంతర్యమున ప్రభువు రాకడ యే ఘడియ యందైనను సంభవించవచ్చునని అభిప్రాయ పడిరి. ఈ వివరణ యొక్క ఆంతర్యమున పలువురు సోమరులుగా మారి ఏ పనియూ చేయక క్రీస్తు రాకడ కొరకు కనిపెట్టియుండిరి.

ముఖ్య పాత్రలు:- పౌలు, సీల, తిమోతి.

ముఖ్య పదజాలము:- ప్రభువు దినమును ఎరుగుట.

ముఖ్య వచనములు:- 2 థెస్సలొనీకయులకు 2:3; 2 థెస్సలొనీకయులకు 3:5-6.

ముఖ్య స్థలము:- థెస్సలొనీకయ

గ్రంథ విశిష్టత:- మొదటి థెస్సలొనీకయుల పత్రిక యొక్క కొనసాగింపుగా వ్రాయబడిన పత్రిక. క్రీస్తు రెండవ రాకడ యందు సంభవించవలసిన పలు కార్యములను పౌలు ఇచ్చట గుర్తించుచున్నాడు.

ముఖ్య అధ్యాయము:- అధ్యాయము 2. ప్రభువు దినము వచ్చి ముగించెనను ఒక తప్పుడు బోధనను ఎదురించుటకే ఈ పత్రికను పౌలు వ్రాసెను. అతడు సహించిన శ్రమల మధ్య ఈ బోధ వారిని కలత పరచి, ఎప్పుడు ప్రభువు యొద్ద చేర్చబడుదుము అనుటలో తారుమారు చేసెను. ప్రభువు ప్రత్యక్షతకు ముందు కొన్ని తేటయైన సంభవములు జరుగుననియు, ఆ ప్రసన్నమగుట అంతవరకు జరుగలేదనియు బయలుపరచుచున్నాడు.

గ్రంథ విభజన:- రాబోవు ప్రభువు దినమును గూర్చి వారికి బోధించిన మొదటి పత్రిక యొక్క కొనసాగింపే ఇది. (1 థెస్సలొనీకయులకు 5:1-11) ఇది కలత చెందిన థెస్సలొనీక విశ్వాసులను ధైర్యపరచి పని చేయుటకు సిగ్గుపడిన వారిని ఆ సోమరితనము నుండి విడిపించెను. మూడు ముఖ్య భాగములుగా ఈ పత్రికను చూడగలము.

(1) శ్రమల మధ్యను ధైర్యముగా నుండుటకై పిలువబడుట అధ్యా.1.

(2) ప్రభువు దినమును గూర్చిన వివరణ అధ్యా.2.

(3) సంఘమునకు ఉపదేశమును చెప్పుట అధ్యా.3.

కొన్ని ముఖ్య వివరణలు: – పరిశుద్ధ గ్రంథములోని 53వ పుస్తకము; అధ్యాములు 3; వచనములు 47; ప్రశ్నలు 1; చారిత్రక వచనముల 31; నెరవేర్చబడని ప్రవచనములు 16.

Thessalonians 1 – 1 థెస్సలొనీకయులకు

బాల ప్రాయమున నున్న థెస్సలొనీక సంమములో పౌలు గడిపిన దినములను సంతోషముతో స్మరించుచున్నాడు. వారి విశ్వాసము, నమ్మిక, ప్రేమ వంటివి, శ్రమల మధ్యను వారు చూపిన సహనమును మాదిరిగ నుండెను. రెక్కలు వచ్చి ఎగురుటకు ప్రయత్నించుచున్న పక్షి పిల్లవలె, క్రైస్తవ్యమందు వృద్ధి పొందుచున్న సంఘము కొరకు పౌలు భరించిన శ్రమలు, త్యాగమును మంచి ఫలితము నిచ్చుటచే పౌలు వారి యెడల గలిగిన ప్రేమ పత్రిక యొక్క ఒక్కొక్క భాగమందును ప్రకాశించుచున్నది.

నూతనముగ పొందిన విశ్వాసములో వారు బలపడుటకును, ప్రేమలో ఒకరికొకరు వృద్ధి చెందుటయు, ఎల్లప్పుడును సంతోషముగా నుండుటకును, ఎడతెగక ప్రార్థించుటకును, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును పౌలు వారికి బోధించెను. ప్రభువు యొక్క రెండవ రాకడను గూర్చిన ప్రకటనతో అతడు పత్రికను ముగించెను. మృతులును, సజీవులమునైయున్న విశ్వాసులందరికిని నమ్మికను, ఆదరణను యిచ్చునదే క్రీస్తు యొక్క రెండవ రాకడ.

ఉద్దేశము:- థెస్సలొనీకయ విశ్వాసుల క్రైస్తవ విశ్వాసమును బలపరచుటకును, క్రీస్తు మరల వచ్చునని నిశ్చయతనిచ్చుటకును.

గ్రంథ రచయిత:- పౌలు

ఎవరికి వ్రాసెను?:- థెస్సలొనీకయ సంఘమునకు, విశ్వాసులు యావన్మందికిని.

వ్రాయబడిన కాలము:- దాదాపు క్రీ.శ 51లో పౌలు యొక్క మొదటి పత్రికలలో యిది ఒకటి. పౌలు దినముల యందు థెస్సలొనీక ఒక రేవు పట్టణమును, మాసిదోనియ అను రోమా దేశము యొక్క రాజధానిగనుండెను. రోమా నుండి తూర్పు దేశముల కొరకైన ముఖ్య రాజమార్గమునకు ప్రక్కన గల యీ స్థలము రాజకీయ, వాణిజ్య ముఖ్యత్వములచే మిగుల సస్యశ్యామలముగనుండెను. క్రీ.శ. మొదటి శతాబ్దములో యిచ్చట దాదాపు రెండు లక్షలమంది ప్రజలు జీవించినట్లు చెప్పబడుచున్నది.

థెస్సలొనీకయనందు యూదులు గొప్ప సంఖ్యలో జీవించిరి. సన్మార్గమును ఆధారముగా గల వారి ఒకే దేవుని ఆరాధించుట, గ్రీకుల పలు దేవతారాధనలలో అలసిపోయి దాని నుండి విడిపించు కొనుటకు ప్రయత్నించువారిని ఆకర్షించెను. ఇందుచే పౌలు యొక్క రెండవ సువార్త సేవా ప్రయాణమందు అతడు థెస్సలొనీకయ యూదా దేవాలయములో ప్రకటించిన సువార్త వర్తమానము త్వరలో ప్రజలు ఒప్పుకొనునదిగనుండెను. (అపో. కార్యములు 17:4).

ఆంతర్యము:- ఈ పత్రికను పౌలు వ్రాయునప్పుడు థెస్సలొనీక సంఘము స్థాపించబడి రెండు లేక మూడు సంవత్సరములు మాత్రమే అయ్యెను. వారు విశ్వాసమందు పరిపక్వతను పొందవలసిన వారుగా నుండిరి. క్రీస్తు యొక్క రెండవ రాకడను గూర్చి వారికి ఒక తప్పుడు తలంపు ఉండెను. క్రీస్తు త్వరగా వచ్చునని ఎదురు చూచుచుండిన కొందరిలో ప్రియమైన వారు మరణించినప్పుడు ఆ మృతి చెందిన వారి భవిష్యత్ కాలము ఎటువంటిదని వారికి సంశయమేర్పడెను. వారిక సంశయములను తీర్చుటకును, శ్రమలనుభవించుచున్న విశ్వాసులను ఆదరించుటకును ఈ పత్రిక వ్రాసెను.

ముఖ్య పదజాలము:- క్రీస్తు రాకడ యందు లభించు పరిశుద్ధ పరచబడుట.

ముఖ్య వచనములు:- 1 థెస్సలొనీకయులకు 3:12-13; 1 థెస్సలొనీకయులకు 4:16-18.

ముఖ్య అధ్యాయము:- అధ్యాయము 4. పత్రిక యొక్క మధ్య భాగము యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి చెప్పు నాలుగవ అధ్యాయ భాగమగును. ఆయన వచ్చు దినమున క్రీస్తునందు మృతులగువారు మొదట లేతురు. ఆ మీదట సజీవులై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము అని ఈ అధ్యాయము చెప్పుచున్నది.

గ్రంథ విభజన:- బలవంతపరచబడుటచే థెస్సలొనీకయను విడిచి వెళ్ళిన పిదప థెస్సలొనీకయను గూర్చి పౌలుకు గల అక్కర పెరిగి వారి విశ్వాసపు ఎదుగుదల కొరకు మేల్కొలుపు గలిగియుండెను. తిమోతి తెచ్చిన ఆదరణ వర్తమానముచే సంతృప్తి చెంది పౌలు వారిని పొగడి, బోధించి ఆదరించి వ్రాసిన ఈ పత్రికలో రెండు ముఖ్య భాగములను చూడగలము.

(1) థెస్సలొనీకయులను గూర్చిన పౌలు యొక్క వ్యక్తిగత స్మరణ అధ్యాయము 1-3.

(2) పౌలు వారికిచ్చిన బోధనలు అధ్యాయము 4,5

కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 52వ పుస్తకము, అధ్యాయములు 5; వచనములు 89; ప్రశ్నలు 3; చారిత్రక వచనములు 69; నెరవేర్చబడిన ప్రవచనములు 20.

Colossians – కొలస్సయులకు

యేసుక్రీస్తు సంఘమును చిత్రించు పత్రికగా ఎఫెసీ కనిపించగా సంఘమునకు శిరస్సైన క్రీస్తును కొలొస్సయి వత్రిక బయలుపరచుచున్నది. ఎఫెసీ శరీరమును గూర్చి జాగ్రత్త వహించగా కొలొస్సయి శిరస్సు మీద దృష్టియుంచుచున్నది. చిన్న పుస్తకమైన కొలొస్సయుల ప్రారంభభాగము (అధ్యాయము1,2) బోధనను గూర్చినదియు, చివరి భాగము (అధ్యాయము 3,4) అనుచరణ – జీవితమునకు చెందినదగును. క్రీస్తును సమస్తమునకు ముందున్నవారిగా చూపుటయే దీని ద్వారా పౌలు ఉద్దేశమై యున్నది. క్రైస్తవుని జీవితము కూడ ఆ సత్యమును బయలుపరచి చూపవలెను. విశ్వాసులు క్రీస్తునందు వేరు పారి జీవించువారిగను, క్రీస్తునందు మరుగై ప్రభువు యొక్క సంపూర్ణతను పొందువారగుటచే ఆయన లేని జీవితము నిరుపయోగము.

కొలొస్సై విశ్వాసులకు యీ పత్రికను వ్రాయుచున్నట్లు కొలొస్సయులకు 1:1-2 వచనములలో పౌలు పలికెను. దీనికి సమీప పట్టణమైన లవొదికయలో నున్న వారికిని యీ పత్రికను చదువవలెనని ఆయన పలికెను. (కొలొస్సయులకు 4:16)

గ్రంథ రచయిత:- కొలొస్సై పత్రిక రచయిత పౌలని పారంపర్యముల వివరణలును దానితో కలియుచున్నవి. వ్యక్తిగత సూచనలు, ఎఫెసీ పత్రికతో గల పోలికలు మొదలగునవి దీనిని మరల దృఢపరచుచున్నవి. దీని నాల్గు అధ్యాయములలో పౌలు యొక్క యితర వత్రికలలో చూడలేని 55 గ్రీకుపదములు కనిపించుచున్నవి. పౌలుకు గ్రీకు భాషను ఉపయోగించుట కొరకైన విడుదల అతడు గైకొను విషయముతో ప్రకాశించుటయు, కొలొస్సై సంఘము యొక్క తప్పుడు బోధలను గూర్చిన సూచనలును, యీ అత్యధిక పదములకు చాలినంత వివరణనిచ్చుచున్నది. కొలొస్సైలో వచ్చు క్రీస్తును గూర్చిన అభిప్రాయమును (కొలొస్సయులకు 1:15-23), యోహాను 1:18 వరకు గల లోగోస్ ను గూర్చిన అభిప్రాయముతో పోల్చవచ్చును. క్రీస్తును లోకసృష్టికర్తగ చూపు భావము యొక్క ప్రారంభము ఫిలిప్పీయులకు 2:5-11 వరకు గల భాగమునందు బయలుపడుచున్నది.

వ్రాయబడిన కాలము:- ఎఫెసుకు దాదాపు 100 మైళ్ళు తూర్పున సమృద్ధియైన లైకస్ లోయలో అమరియున్న ఒక పట్టణమే కొలొస్సయి. శ్రేష్ఠమైన నల్లగొఱ్ఱ రోమమునకు ప్రఖ్యాతి గాంచిన సంతగానుండెను. కొలొస్సయులకు 1:4-8; కొలొస్సయులకు 2:4 మొదలగు భాగములందు వచ్చు సూచనల ద్వారా పౌలు ఎన్నటికి కొలొస్సైకి వెళ్ళనప్పటికిని పౌలు యొక్క ఒక శిష్యుడును, తోటి సేవకుడునైన ఎపఫ్రా చేత అచ్చట సంఘము స్థాపించబడెనని ఊహించవచ్చును. తరువాత పౌలు యొక్క చెరసాల దినములలో ఎపఫ్రా అతనిని కలసి కొలొస్సైయుల వర్తమానములను అతనికి తెలియజేసెను. (కొలొస్సయులకు 4:12-13; ఫిలేమోనుకు 1:23).

కొలొస్సయులు, ఎఫెసీయులు, ఫిలేమోను మొదలగు మూడు పత్రికలందు కనిపించు ఏకత్వము గల అభిప్రాయములను, ప్రకటనలను, వ్యక్తి గత పేర్లను బట్టి యీ మూడు పత్రికలను ఒకే కాలమందు, ఒకే పరిస్థితి యందు వ్రాయబడెనని తీర్మానించగలము. (కొలొస్సయులకు 4:9-17; ఫిలేమోనుకు 1:2, ఫిలేమోనుకు 1:10, ఫిలేమోనుకు 1:23-24). చెరసాల పత్రికలు నాలుగును పౌలు యొక్క మొదటి చెరసాల నివాసకాలమందు వ్రాయబడి యుండవచ్చును. ( ఎఫెసీ, ఫిలిప్పీ వీటి కాలమును చూడుము) అట్లైనచో క్రీ.శ.60లో లేక 61లో యీ పత్రికను వ్రాసి తుకికు దగ్గర ఇచ్చి కొలొస్సైకి పంపెను. కొలొస్సయులకు 4:7-9; ఎఫెసీయులకు 6:21; ఫిలేమోనుకు 1:10-12 మొదలగు భాగములను చూడుమ

ఎపఫ్రా పౌలును సంధించి కొలొస్పై సంఘ పరిస్థితులను చెప్పుట ద్వారా యీ పత్రికను వ్రాయుటకు ప్రోత్సహించి యుండవచ్చును. ఇంచుమించు అన్యజనులు జీవించిన కొలొస్సై సంమమునకు తప్పుడు బోధ యొక్క శక్తి వంతమైన బెదరింపులను ఎదుర్కొనవలసి యుండెను. వారు దానికి ఓడిపోనప్పటికిని యేసు క్రీస్తు యొక్క సువార్తకు దుర్బోధలు అధిక హానికరముగ నుండెను. దానిని నిరాకరించు పత్రిక భాగమే కొలొస్సయులకు 2:8-23. ఈ భాగము నుంచి ఆ దుర్బోధల స్వభావము ఏమిటని కొంత వరకు ఊహించగలము. ఇది గ్రీకు తత్త్వజ్ఞానము. (కొలొస్సయులకు 2:4; కొలొస్సయులకు 2:8-10). యూదుల ధర్మశాస్త్రము (కొలొస్సయులకు 2:11-17). తూర్పు దేశముల దైవత్వము పొందుట యొక్క సిద్ధాంతము (కొలొస్సయులకు 2:18-23) మొదలగునవి కలిసిన ఒక సమయ విధానముగ నుండెను. శరీరమును అలక్ష్యము చేయుట, సున్నతి, ఆహార కొలతలు, సంస్కారములకు ముఖ్యత్వమునిచ్చుట, శరీరమును హింసించుకొనుట, దేవదూతారాధన, యోగాసనములకు స్థలమునిచ్చుట వంటివి దాని భాగములుగా నుండెను.

ముఖ్య పదజాలము:- సమస్తమునకు ముందుగా నున్న వాడైన క్రీస్తు.

ముఖ్య వచనములు:- కొలొస్సయులకు 2:9-10; కొలొస్సయులకు 3:1-2.

ముఖ్య అధ్యాయము:- కొలొస్సై 3. క్రీస్తు యొక్క మహా ఉన్నతత్వము. క్రీస్తునందుగల స్వాతంత్ర్యము, క్రీస్తునందు విధేయత యీ విధముగ కొలొస్సైనందు వచ్చు మూడు ముఖ్య అభిప్రాయములును మూడవ అధ్యాయమునందు ఏకమగుచున్నవి. విశ్వాసి క్రీస్తుతో కూడ లేపబడిన వాడగుటచేత అతడు ప్రాచీన పురుషుని పరిత్యజించి నవీన పురుషుని ధరించుకొనవలెను. జీవితపు అన్ని పరిస్థితుల యందును పరిశుద్ధతయే దాని ఫలము.

అందం గ్రంథ విభజన: – పరిశుద్ధ గ్రంథమునందు అత్యధికముగ క్రీస్తును కేంద్రీకరించి మాట్లాడు పుస్తకము ఇది. ఇందు కొలొస్సై సంఘమును బెదరించిన దుర్బోధనలను ఆటంకపరచుటకు క్రీస్తు యొక్క మహా ఉన్నతత్వమును, ఆయన అనుగ్రహించిన రక్షణ యొక్క పరిపూర్ణతను దృఢముగ చెప్పుచున్నాడు. ఈ ఆజ్ఞలకు అనుదిన జీవితమందు కలుగవలసిన ఫలమును గూర్చి గ్రంథపు చివరి భాగమున చెప్పుచున్నాడు. అనగా బోధన యొక్క వాస్తవ అనుచరణ విధానము జీవితములో ఆ ఫలమును చూపవలెను. పత్రిక యొక్క రెండు ముఖ్య విషయములు క్రింద యివ్వబడెను.

(1) క్రీస్తు యొక్క మహా ఉన్నతత్వము. అధ్యా. 1,2.

(2) క్రీస్తుకు సమస్తమును లోబడి యుండవలెను. అధ్యా 3,4.

కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 51వ పుస్తకము, అధ్యాయములు 4; వచనములు 95; ప్రశ్న 1; చరిత్రక వచనములు 92; నెరవేర్చబడని ప్రవచనములు 3.

Philippians – ఫిలిప్పీయులకు

అగిన సమయమందు ధారాళముగ సహాయము చేసిన ఫిలిప్పీయ విశ్వాసులకు అపొస్తలుడైన పౌలు వ్రాసి పంపిన కృతజ్ఞతా వచనమే ఫిలిప్పీ వత్రిక అనవచ్చును. ఈ విధముగా లభించిన సందర్భమున క్రైస్తవ ఐక్యమత్యమును గూర్చి బోధించుటకు ఉపయోగించుకొనుచున్నాడు. దీని మూలభావము దీనమైనది. క్రీస్తునందు మాత్రమే నిజమైన ఐక్యమత్యము ఏర్పడగలదు. తగ్గింపు మనస్సునకును, పరిచర్యకును క్రీస్తును మన మాదిరిగా అంగీకరించినచో ఆలోచనయందును, మాటయందును, క్రియలయందును ఐక్యమత్యమును మనము చేకూర్చగలము. పౌలు తన అనుభవమునే దీనికి ఆధారముగ చూపుచున్నాడు. ఇది ఫిలిప్పీ విశ్వాసులకు చాలా ప్రాముఖ్యమైన వర్తమానముగనుండెను. ఫిలిప్పీ సఘమందు ఏకమై శ్రమించినవారు ఒకరికొకరు జగడములతో ఏసుక్రీస్తు సువర్తకు శత్రువులుగా జీవించిన కాలముగనుండెను. అందుకే పౌలు వారికిట్లు బోధించుచున్నాడు. కావున నా ఆనందమును నా కిరీటమునైయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులైయుండుడి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడి. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి. దేనిని గూర్చియు చింతపడకుడిగాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకము మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును”. (ఫిలిప్పీయులకు 4:1-7).

గ్రంథ రచయిత:- దీని రచయిత పౌలు అనుటకైన లోపలి, వెలుపలి ఆధారములు మిక్కిలి శక్తివంతమైనవి. కనుకనే దీనిని గూర్చి ఎవరును సందేహించలేదు.

వ్రాయబడిన కాలము:- క్రీ. పూ. 353లో మాసిదోనియా యొక్క ఫిలిప్పు రాజు (మహా అలెగ్జాండరు యొక్క తండ్రి) యీ పట్టణమును పట్టుకొని పెద్దదిగా చేసి దీనికి ఫిలిప్పీ అని పేరు పెట్టెను. క్రీ.పూ. 168లో రోమా అధికారులు దీనిని స్వాధీనపరచుకొనిరి. వెనుకటి కాలమును ఔగుస్తురాయుడు దీనిని ఒక సైన్యమును నిలుపు కేంద్రముగ మార్చెను. ఫిలిప్పీ ఒక వాణిజ్య పట్టణముగ లేక ఒక రాణువ కేంద్రముగ నుండుటచేతనే పౌలు యిచ్చటికి వచ్చునపుడు ఒక యూదా ప్రార్థనా మందిరము కూడా కట్టుటకు వీలు లేనట్లు యూదులు సంఖ్య యందు తక్కువగా నుండిరి.

పౌలు యొక్క రెండవ సువార్త సేవా ప్రయాణమందు త్రోయయందు దొరికిన మాసిదోనియా ఆహ్వానము ప్రకారము అతడు యీ పట్టణమునకు వచ్చి సువార్తను ప్రసంగించెను. అప్పుడు లూదియయు మరి కొందరును మారుమనస్సు పొంది క్రైస్తవులైరి. పౌలు, సీలలు అచ్చట కొట్టబడి చెరసాలయందుంచబడిన సంభవము చెరసాల అధిపతియు అతని కుటుంబమును మారుమనస్సు పొందుటకు హేతువాయెను. రోమా పౌరసత్వము గల పౌలు, సీలలను విచారణ చేయకయే కొట్టి చెరసాలయందుంచుట, అచ్చట ఉద్యోగము చేసిన న్యాయస్థాన అధిపతులను సమస్యలకు యీడ్చెను. (అపో. కార్యములు 16:37-40) ఇది నూతనముగ క్రైస్తవులైన ఆదేశ ప్రజలు అధిక శ్రమల నుండి తప్పించుటకు సహాయపడియండవచ్చును. తన మూడవ సువార్త సేవా ప్రయాణమందు పౌలు మరల యీ పట్టణమునకు వచ్చెను. (అపో. కార్యములు 20:1) పౌలు రోమాయందు బంధించబడుటను వినినప్పుడు ఫిలిప్పీ సంఘస్థులు సహాయనిధితో ఎపఫ్రోదితును రోమాకు పంపిరి. (ఫిలిప్పీయులకు 4:18) మరి రెండుసార్లు యీ విధముగ వారు పౌలుకు సహాయపడిరి. (ఫిలిప్పీయులకు 4:16) రోమా యందు ఎపఫ్రోదితు వ్యాధిగ్రస్తుడై మరణ ద్వారమునకు వెళ్ళెను. అతడు స్వస్థత పొందిన వెంటనే పౌలు యీ పత్రికను వ్రాసి అతని చేతికిచ్చి అతనిని మరల ఫిలిప్పీకి పంపెను. (ఫిలిప్పీయులకు 2:25-30).

పౌలు, సీల, తిమోతి, లూకా మొదలగు వారు మొదట క్రీ.శ. 51లో ఫిలిప్పీకి వచ్చిరి. దాని తరువాత 10 సంవత్సరములకు క్రీ.శ 61లో పౌలు యీ పత్రికను వ్రాసెను. ఫిలిప్పీయులకు 1:13; ఫిలిప్పీయులకు 4:32 మొదలగు వచనములు యీ పత్రిక రోమా నుండి వ్రాయబడుటను చూపుచున్నవి. రోమా చెరలో పౌలు బంధించబడి యున్నప్పుడు, ఆ సామ్రాజ్యపు అధిపతులు అతనికి ఎట్టి తీర్పు నిచ్చెదరని ఎదురు చూచుచు దినములను గడుపుచుండిరి.

ముఖ్య పదము:- జీవించుచున్న క్రీస్తు.

ముఖ్య వచనములు:- ఫిలిప్పీయులకు 1:21’; ఫిలిప్పీయులకు 4:12.

ముఖ్య అధ్యాయము:- ఫిలి: 2

యేసుక్రీస్తు యొక్క తగ్గింపు మనస్సును గూర్చి గల ప్రత్యక్షతలోనే క్రొత్త నిబంధన సత్యము యొక్క వున్నత మహిమ సంక్షేపమైయున్నది. ఈ అధ్యాయమందు ఆ తగ్గింపు యొక్క అద్భుత మహిమను పౌలు చూపుచున్నాడు. కొనసా గండి “క్రీస్తు యేసునకు కలిగిన యీ మనస్సును మీరును కలిగియుండుడి” అని ఉపదేశమును ఇచ్చుచున్నాడు.

గ్రంథ విభజన:- అసాధారణ పరిస్థితుల మధ్య మ్రోగు సంతోష ప్రవాహము యొక్క ధ్వనియే ఫిలిప్పీ పత్రిక. ఫిలిప్పీ క్రైస్తవుల పట్ల గల తమ ప్రేమను ప్రతిఫలింపజేయుటతో బాటు వారి స్థిరమైన సాక్ష్యమును, ధారాళమైన సహాయమును పొగడి, పోటీలు, ఐక్యమత్యము లేకపోవుటను విడిచి పెట్టి క్రీస్తు యేసునకు గల మనస్సుతో ముందుకు సాగివెళ్ళునట్లు అపొస్తలుడైన పౌలు వారికి బోధించెను పత్రిక యొక్క నాల్గు ముఖ్య అభిప్రాయములు క్రిందయివ్వబడెను: –

పరిస్థితుల వివరణ అధ్యా 1. • క్రీస్తు యేసుకు గల మనస్సు అధ్యా 2. • క్రీస్తును ఎరుగు జ్ఞానము అధ్యా 3. • క్రీస్తు యొక్క సమాధానము అధ్యా 4.
కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 50వ పుస్తకము; అధ్యాయములు 4; వచనములు 104; ప్రశ్నలు 1; చారిత్రక వచనములు 96; నెరవేర్చబడని ప్రవచనములు 5.

Ephesians – ఎఫెసీయులకు

యేసు క్రీస్తు యొక్క అత్యధికమైన ఆత్మీయ స్వాస్థ్యములకు హక్కుదారులైనప్పటికిని ఆ స్వాస్థ్యములను గూర్చిన తెలివిలేక భిక్షకులవలె ఆత్మీయ జీవితమును జీవించుచున్న ఒక విశ్వాస సమూహమునకు వ్రాయబడిన పత్రిక యిది. స్వంతము చేసికొనవలసిన స్వాస్వములను వారు ప్రత్యేకపరచుటచే ఆత్మీయ క్షామమునందు జీవించవలసి వచ్చెను. వారి పరలోక ధనాగారమందు కనిపించుచున్న అత్యధిక స్వాస్థ్యమును గూర్చి వివరించి చెప్పుచూ పౌలు యీ పత్రికను వ్రాయుటకు ప్రారంభించెను. జగత్తు పునాది వేయబడకయునుపే ఏర్పరచబడుట, కుమారులుగా స్వీకరించుటకు అంగీకరించుట, పాప క్షమాపణ, విమోచన, సంపూర్ణమైన జ్ఞానము, ఆత్మీయ స్వాస్ధ్యములు, పరిశుద్ధాత్మ ముద్ర వంటి పరలోకపు ఆశీర్వాదములన్నియు వారికి చెందినవిగా యుండెను. ఈ గొప్ప స్వాస్థ్యమును స్వంతము చేసికొని దేవుని కృపా మహిమ కొరకు జీవించుట క్రైస్తవులకు తగును. (ఎఫెసీయులకు 1:5) 4 నుండి 6 వరకు గల అధ్యాయములలో యీ ఐశ్వర్యమునకు హక్కుదారులుగా అనుచరణ జీవితమందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్కరియలు చేయుటకై, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనియైయున్నాము.” (ఎఫెసీయులకు 2:10).

ఉద్దేశము:- ఎఫెసు మరియు యితర స్థలములలో గల విశ్వాసులను క్రైస్తవ విశ్వాసమందు స్థిరపరచుట, క్రీస్తు శరీరమైన సంఘము యొక్క ఉద్దేశము, గుణము వంటి వాటిని విశదీకరించుట.

గ్రంథ రచయిత:- పౌలు

ఎవరికి వ్రాసెను?:- ఎఫెసు మరియు ఇతర స్థలములందుగల విశ్వాసులకు.

వ్రాసిన కాలము:- దాదాపు క్రీ.శ. 60లో పౌలు రోమా చెరయందున్నప్పుడు.

ఆంతర్యము:- సంఘ సమస్యలను పరిష్కరించుటకు యిది వ్రాయబడలేదు. దానికి మారుగా సంఘములను బలము పొందునట్లు చేసి, ప్రోత్సాహావరచుటకు వ్రాయబడెను. తుకికు చేతికిచ్చి పంపెను. ఎఫెసీయులకు 1:1 లో ‘ఎఫెసులో అనుపదము కుండలీకరణములో వచ్చుటచే ప్రాచీన చేవ్రాత ప్రతులలో ఆ పదము లేదని తెలిసికొనవచ్చును. ఇది ఎఫెసునందున్న వారి కొరకు మాత్రము వ్రాయబడిన పత్రిక కాదనియు, అనేక సంఘములను మనస్సునందుంచుకొని వ్రాయబడినదనియు దీని ద్వారా ఊహించగలము. కొలొస్సయులకు 4:16 లో చెప్పబడు “ లవొదికయకు వ్రాయబడిన పత్రిక ” యీ పత్రికయేనని పలువురు నమ్ముచున్నారు.

ముఖ్యపాత్రలు:- పౌలు, తుకికు.

గ్రంథ విశిష్టత:- సంఘమును శరీరముగను, దేవుని మందిరముగను, మర్మముగను, నూతన పురుషునిగను, కన్యకగను, సైన్యవీరుడుగను యీ పత్రికయందు పోల్చబడియున్నది.

ముఖ్య వచనములు:- ఎఫెసీయులకు 2:8-10; ఎఫెసీయులకు 4:1-3

ముఖ్య అధ్యాయములు: – ఎఫెసీ 6. క్రైస్తవుడు పరలోకపు ప్రతి ఆశీర్వాదము చేతను ఆశీర్వదించబడినవాడైనను (ఎఫెసీయులకు 1:3) యీ లోకమందు జీవించునంత వరకు ఆత్మీయ పోరాటమనునది అతని ప్రతిదిన అనుభవమగును. ప్రభువునందును ఆయన మహాశక్తి యందును బలపడుట ఎట్లు అను దానిని గూర్చిన అతి స్పష్టమైన ఉపదేశమును గూర్చి 6వ అధ్యాయమందు చదువగలము.

గ్రంథ విభజన:- క్రీస్తునందు గల తమ స్థానమును గూర్చి క్రైస్తవులను స్మరింపజేసి ప్రతిదిన జీవితమందు శక్తితో నిండిన జీవితమును జీవించుటకు ప్రోత్సాహమునిచ్చుటకే యీ పత్రిక వ్రాయబడెను. గ్రంథము యొక్క రెండు గొప్ప విభజనలును, వాటిలోని విభజనలును క్రింద ఇవ్వబడెను.

(1) క్రైస్తవుని పదవి అధ్యా. 1-3 వరకు. (అ) విమోచన కొరకై స్తోత్రము ఎఫెసీయులకు 1:1-14. (ఆ) ప్రత్యక్షత కొరకైన ప్రార్థన ఎఫెసీయులకు 1:15-23; (ఇ) క్రైస్తవుని స్థితి Eph,1,24-3,13; (ఈ) స్థిరపరచుటకైన ప్రార్థన ఎఫెసీయులకు 3:14-21.

(2) క్రైస్తవుని అనుచరణ జీవితము అధ్యా.3-6 వరకు (అ) సంమమందు ఐకమత్యము ఎఫెసీయులకు 4:1-16; (ఆ) జీవితమందు పరిశుద్ధత. Eph,4,17-5,21 ; (ఇ) గృహమందును ఉద్యోగ స్థలమందును గల బాధ్యతలు. Eph,5,22-6,9; (ఈ) యుద్ధమందు స్థిరముగా నిలచియుండుట. ఎఫెసీయులకు 6:10-24.

సమకాలిక చరిత్ర:- ఆసియా మైనరులోనే అందమైనదియు, సమృద్ధికరమైనదియునైన భూభాగమే ఈ ఈయోనియా భాగము మిక్కిలి ప్రఖ్యాతి గాంచిన పట్టణముగా ఎఫెసు పేరు గాంచెను. స్ముర్నకు 40 మైళ్ళు దక్షిణముననున్నదే ఎఫెసు మిక్కిలి సౌఖ్యమైన శీతోష్ణస్థితి గలది. సంగీతము, నాట్యము వంటి వాటిలో ఆపేక్ష గల ప్రజలు, ఐశ్వర్య మనతలు గల ప్రజలును, అలంకరించుకొని బారులు తీరు స్త్రీలును ఎఫెసు యొక్క గర్వమునకు ఉదాహరణగా నుండెను.

డయానా అను అర్తెమి దేవి యొక్క దేవాలయము ఎఫెసునందుండెను. ప్రాచీన కాల ప్రపంచ ఏడు వింతలలో ఇది ఒకటి. దేవాలయము 425 అడుగుల పొడవును 82 అడుగుల వెడల్పును గలది. దీనికి 60 అడుగుల ఎత్తు గల 120 స్తంభములు ఉండెను. ఒక్కొక్క స్తంభమును ఒక్కొక్క రాజు యొక్క బహుమానమగును. వాటిలో 36 స్తంభములు బంగారపు రేకులచే మూయబడియుండెను. ప్రాచీన కాల దేవాలయములు మధ్య భాగము మాత్రము పైన గుడిసె ఆకారముగను మిగిలిన భాగములు తెరువబడినట్లును వుండును. ఈ దేవాలయపు పైన గల గుడిసె కుప్ర దీవి నుండి తేబడిన మ్రానులచే కట్టబడినది. అర్జెమి యొక్క ఆరాధానను గూర్చి మాత్రము కాదు గాని రోమా రాజుల ఆరాధన కొరకై కట్టబడిన దేవాలయములను గూర్చియు ఎఫెసు ప్రఖ్యాతి గాంచెను. నీరో, క్లవుదియ, జేవియరు మొదలగు రాజుల పేరున పలు దేవాలయములు కనిపించెను. విగ్రహారాధన ఇచ్చట బహు బలముగనుండెను.

మూఢ నమ్మకములందును ఎఫెసు దుష్కీర్తి పొందెను. రేకులు, తాయతులు అను రీతిలో మంత్రములును, మాయా జాల ప్రార్థనలును గల అర్తెమి దేవి యొక్క పేరుగల “ఎఫెసు అక్షరములు ” ప్రఖ్యాతి గాంచినవి. వ్యాధి స్వస్థపడుట, సంతాన భాగ్యము, వృత్తి విజయము వంటి వాటికి శుభములని నమ్మి వాటిని కొనుటకు భూదిగంతముల నుండి ప్రజలు పోగైవచ్చిరి. .

ఒక రకమైన కలయిక ప్రజలు అచ్చట జీవించిరి. వారిలో ఆరు విధములైన వ్యత్యాస ప్రజల సమూహములు వుండెను. వాటిలో ఒకటి గ్రీకుల రాకడకు ముందు అచ్చట జీవించిన ప్రాచీన ప్రజల వెనుకటి తరమువారు. మరియొక సమూహము ఏథెన్సు నుండి వలస వచ్చిన వారు. మూడవ సమూహము గ్రీకులు. యూదుల నుండి విభజింపబడి వచ్చిన వారు అని అభిప్రాయపడు నాల్గవ ఒక సమూహమును అచ్చట కనిపించెను. అర్తెమి దేవాలయము మతమునకు ప్రఖ్యాతిగాంచినట్లు, నేరక్రియలకును, హీన ప్రవర్తనలకును కేంద్రముగా బయలుపడెను. ఎటువంటి నేరస్థుడును అర్తెమి దేవాలయపు ఎదుటికి చేరగనే తప్పించబడును. అచ్చట నుండి అతనిని నిర్బంధముగ బంధించి తీసికొని వెళ్ళుటగాని, అచ్చట శిక్షించుట కాని కుదరదు. దేవాలయమందు నివశించిన వెయ్యి మంది దేవాలయపు నాట్యకత్తెలు చేయు హీనమైన సేవయే దేవాలయపు పవిత్రతయని వారు స్తుతించునది విచిత్రమైన కార్యముగ నుండెను. కలయిక ప్రజలు, నేరస్థుల ఆశ్రయము, దేవాలయపు దుష్టత్వము మొదలగునవన్నియు ఏకముగ ఎఫెసును చెడిపోయిన ఒక పట్టణముగా మార్చెను.

అటువంటి ఒక స్థలమందే సువార్త విత్తనము విత్తుటకు మహా గొప్ప విజయమును పొందగలిగిరి. పౌలు ఇతర పట్టణముల యందు వున్న దాని కంటెను అధిక కాలము ఎఫెసు నందుండెను. (అపో. కార్యములు 20:31) ఆ సంఘము యొక్క మొదటి అధ్యక్షుడు తిమోతి అగును. (1 తిమోతికి 1:3) ఆకుల, ప్రిస్కిల్లలు పౌలుతో కూడ యీ పట్టణమునకు వెళ్ళిరి. (అపో. కార్యములు 18:19; అపో. కార్యములు 18:24-26). పౌలు అత్యధికముగా ప్రేమించిన సంఘముగా యిది పేరుగాంచెను. (అపో. కార్యములు 20:17-38) తరువాత యెహోను యిచ్చట మిగుల యిష్టుడుగ బయలుపడెను.

ఎఫెసు నేడు:- ఈ ప్రాచీన పట్టణమున్న స్థలమున నేడు “ఐసాలుక్ ” అను పేరుగల ఒక చిన్న పరిశుభ్రత లేని ఒక గ్రామము కనిపించుచున్నది. ప్రాచీన కాల శ్రేష్ఠత యొక్క పాడు పడిన స్మారక చిహ్నములను నేటికిని అచ్చట చూడగలము. వ్యవసాయ వృత్తి చేసి జీవించు అచ్చటి ప్రజలు యిప్పుడు మిగుల క్లిష్ట పరిస్థితిలో జీవించుచున్నారు.

కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 49వ పుస్తకము: అధ్యాయములు 6; వచనములు 155; ప్రశ్నలు 1; చారిత్రక వచనములు 146; నెరవేర్చబడిన ప్రవచనములు 1; నెరవేర్చబడని ప్రవచనములు 8.

Galatians – గలతీయులకు

గలతీయ ప్రజలు యేసుక్రీస్తు నందుగల విశ్వాసముచే రక్షించబడిన తరువాత తమ విశ్వాస ప్రయాణమును త్వరలో నిలిపివేసి క్రియలతో కూడిన ఒక నూతన ప్రయాణమును ప్రారంభించుటను చూడగలము. ఇది పౌలు హృదయమును బాధించెను. విశ్వాసమును ప్రక్కన నిలిపిన క్రియల యొక్క యీ విశేషమునకు విరోధముగా ఒక కఠినమైన సాధనము, విశ్వాస సువార్త కొరకైన నిరూపణముగా గలతీ పత్రిక చిగురించుచున్నది.

ఒక అపొస్తలుడను రీతిలో దేవుని యొద్ద నుండి తనకు లభించిన ఒక అధికారమును తన వర్తమానము యొక్క దైవీకతత్త్వమును గూర్చి ధర్మశాస్త్రము మూలమున కాదు, విశ్వాసము మూలముననే లభించుచున్నది. ధర్మశాస్త్రము మానవుని నేరస్థుడు అని తీర్పు తీర్చి బంధించుచున్నది. విశ్వాసమైతే క్రీస్తునందు గల ఆశీర్వాదములను అనుభవించుటకు వారిని స్వతంత్రులనుగా చేయుచున్నది. అయిననూ స్వతంత్రమనునది అవిధేయత గల జీవితపు ఒక అధికార యోగ్యతా పత్రము కాదు. పరిశుద్దాత్మచే నింపబడిన ఒక జీవితవిధానము ద్వారా హద్దులో జీవించి నీతిఫలములనిచ్చునదైన స్వతంత్రము.

గలతీయ దేశమందుగల కొన్ని సంఘములకు పౌలు యీ పత్రికను వ్రాయుచున్నాడు. (గలతియులకు 1:2) కనుకనే అనేక సంఘములను ఒకటిగా ఆహ్వానించి వ్రాయబడిన ఒక ఉత్తరము ఇది.

ఉద్దేశము:- అన్య జనులలో నుండి క్రైస్తవ విశ్వాసమునకు వచ్చువారు రక్షింపబడవలెనన్నచో ధర్మశాస్త్రవు ఆజ్ఞలకు లోబడవలెనను యూదా మతభక్తి గలవారిని ఖండించుటయు, క్రైస్తవులను విశ్వాసమునకు, క్రీస్తు చెంతకును, స్వతంత్రమునకును ఆహ్వానమునిచ్చుట.

గ్రంథ రచయిత:- పౌలు

ఎవరికి వ్రాసెను?: – దక్షిణ గలతీయ సంఘములకు (పౌలు యొక్క మొదటి సువార్త ప్రయాణమందు నెలకొల్పబడిన సంమములు ఇవి.)

ఆంతర్యము:- ప్రారంభకాల సంఘము ఎదుర్కొనిన ప్రాముఖ్యమైన సమస్య అన్యజనులలో నుండి రక్షించబడుచున్న క్రైస్తవ విశ్వాసుల ధర్మశాస్త్రపు ఆజ్ఞలకు లోబడవలెనా, లేదా అనునదే. పౌలు యొక్క మొదటి సువార్త సేవ ప్రయాణమందు నెలకొల్పబడిన సంఘములన్నిటి యందును యీ సమస్య కలిగెను. దీని పరిష్కారమును చూచుటకే పౌలు యీ పత్రికను వ్రాసెను. ఏ విధము చేతనైనను యీ సమస్యకు సంఘనాయకులు ఏకముగా కూడి పరిష్కారము చేసిరి. (అపొ.15)

ముఖ్య పాత్రలు: – పౌలు, పేతురు, బర్నబా, తీతు, అబ్రాహాము, అబద్ధ బోధకులు.

ముఖ్య స్థలములు:- గలతీయ, యెరూషలేము.

గ్రంథ విశిష్టత:- గుర్తించబడిన ఒక సంఘము కొరకు వ్రాయబడిన పత్రిక కాదు. గలతీయ ప్రాంతమందుగల పలు సంమముల కొరకు వ్రాయబడినది.

ముఖ్య వాక్య పదజాలము:- sధర్మశాస్త్రము నుండి విమోచన.

ముఖ్య వచనములు:- గలతియులకు 2:20-21; గలతియులకు 5:1

ముఖ్య ఆధ్యాయము:- అధ్యా.5 “మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసికొనక, ప్రేమగలిగినవారై యొకనికొకడు దాసులై యుండుడి” (గలతియులకు 5:13). “ఆత్మానుసారముగా నడచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు” (గలతియులకు 5:16) “ అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు”. (గలతియులకు 5:22-23).

గ్రంథ విభజన:- క్రైస్తవ స్వాతంత్ర్య హక్కు గల పత్రముగా యీ పత్రిక పిలువబడుచున్నది. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట అను పౌలు యొక్క ప్రకటన పత్రము అనియు దీనిని చెప్పవచ్చును. క్రీస్తునందు గల స్వాతంత్ర్యమును విక్రయించుటకు జంకని ఒక సమూహము యొక్క పేరుననే పౌలు యీ పత్రికను వ్రాసెను. యూదులైన కొందరు ధర్మశాస్రోపదేశకుల దాసత్వము విత్తు ఉపదేశమును విని యేసు ద్వారా లభించు స్వాతంత్ర్యమును వారి పాదముల చెంత అర్పించుటకు యీ ప్రజలు సిద్ధపడిరి.

వీరి బుద్ది హీనతను కఠినమైన మాటలచే ఖండించియు, దేవుని సత్యమును పట్టుకొని ఆత్మ యొక్క స్వాతంత్ర్యమును స్థిరపరచుటకు ఆహ్వానమునిచ్చుచు పౌలు వ్రాసిన యీ పత్రికయందు దేవుని కృపా సువార్తను మూడు విధములుగా అనుచరణలోనికి తెచ్చుటను చూడగలము.

(1) కృపా సువార్తను స్థిరపరచుట. అధ్యా.1,2.

(2) కృపా సువార్తను వివరించుట. అధ్యా.3,4.

(3) కృపా సువార్త యొక్క అనుచరణ విధానము. అధ్యా. 5,6.

కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 48వ పుస్తకము, అధ్యాయములు 6; వచనములు 149; చారిత్రక వచనములు 144; నెరవేర్చబడిన ప్రవచనములు 1; నెరవేర్చబడని ప్రవచనములు 4; ప్రశ్నలు 19.

Corinthians 2 – 2 కొరింథీయులకు

పౌలు కొరింథుకు వ్రాసిన మొదటి పత్రికకు తరువాత అబద్ధ బోధకులు అక్కడకు పోయి పౌలుకు వ్యతిరేకముగా ప్రజలను పురికొల్పిలేపిరి. పౌలు అస్థిరుడును, అధిక స్వార్థప్రియుడును, హెచ్చింపుకు, పొగడ్తకు, గౌరవమునకు తగిన వాడును, వేషదారియు, యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగా పేర్కొన అనర్హుడును అని అతనిపై నేరము మోపిరి. ఇట్టి స్థితిని సంధించుటకు తీతును పౌలు కొరింథునకు పంపెను. తీతు తిరిగి వచ్చినప్పుడు కొరింథీయులకు ఏర్పడిన మారు మనస్సును పౌలు విని సంతోషించెను. మారుమనస్సు పొందిన అనేకులకు కృతజ్ఞత చెప్పుటకును మారు మనస్సులేని కొంతమందితో వాదించుటకును ఈ రెండవ పత్రికను వ్రాసెను. పత్రికారంభము మొదలుకొని చివరి వరకు అతను తన గుణమును, ప్రవర్తనను, యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడను స్థితిలో నున్న అతని యొక్క పిలుపును గూర్చి వారితో వాదించుచున్నాడు.

ఉద్దేశము:- తన అపొస్తలుల అధికారమును, సేవను, దృఢపరచుట, కొరింథీయ అబద్ధ బోధకులను కనపరచుట.

వ్రాసినవారు:- పౌలు

ఎవరికి వ్రాసెను?:- కొరింధి సంఘమునకు, అంతటనుగల క్రైస్తవ విశ్వాసులకు.

వ్రాసిన కాలము:- సుమారు క్రీ.శ. 56లో మాసిదోనియాలో నుండి.

ముఖ్య వ్యక్తులు:- పౌలు, తిమోతి, తీతు, అబద్ధ బోధకులు.

ముఖ్య స్థలములు:- కొరింధు, యెరూషలేము.

గ్రంధ శ్రేష్ఠత:- వ్యక్తిగతమైనదియును, స్వీయచరిత్ర స్థితిలో నున్న ఒక పత్రిక.

ముఖ్య వార్త:- పౌలు యొక్క సేవనుగూర్చిన వివాదము.

ముఖ్య వచనములు:- 2 కోరింథీయులకు 4:5-6; 2 కోరింథీయులకు 5:17-19.

ముఖ్య అధ్యాయము:- 8, 9 అధ్యాయములు ఒకే భాగముగా నిలిచి ఇతర గ్రంథ భాగములలో ఎక్కడను కనిపించని రీతిని పూర్ణమైన స్థితిలో క్రైస్తవ సహాయ స్వభావమును బయలుపరచుచున్న విస్సహాయము యొక్క మూలాధారమైన ప్రమాణము (2 కోరింథీయులకు 8:1-6) ఆసక్తి (2Chor,8,16-9,5) ప్రతిఫలము వాగ్దానము (2 కోరింథీయులకు 9:5-15) మొదలగునవి ఈ అధ్యాయములు వివరించుచున్నవి.

క్రీస్తు 2 కొరింథీ : – పత్రికలో క్రీస్తు విశ్వాసుల యొక్క ఆదరణ (2 కోరింథీయులకు 1:5) విజయమునిచ్చుట (2 కోరింథీయులకు 2:14), ప్రభువు (2 కోరింథీయులకు 4:5), వెలుగు (2 కోరింథీయులకు 4:6), న్యాయాధిపతి (2 కోరింథీయులకు 5:10), సమాధానములు (2 కోరింథీయులకు 5:19), పరిహారకుడు (2 కోరింథీయులకు 5:21), ఈవి (2 కోరింథీయులకు 9:15), స్వంతదారుడు (2 కోరింథీయులకు 10:7), శక్తి (2 కోరింథీయులకు 12:9) మొదలగు స్థితులలో చెప్పబడుచున్నాడు.

గ్రంధ విభజన:- ఒక అపొస్తలుని యొక్క రుజువును నిరూపించు పత్రికయని 2 కొరింథీని చెప్పవచ్చును. కొరింధీ ప్రజలను పౌలుకు విరోధముగా రేపిన అబద్ధ బోధకులను హెచ్చరించుటలో గొప్ప ప్రఖ్యాతి గడించి యుండిరి. అట్టి పరిస్థితిలో అపొస్తలులు అను భావనతో అతని గుణము, ప్రవర్తన, దేవుని పిలుపు మొదలగు వాటి నిజత్వమును విశధపరుచ పౌలు ఈ పత్రికను ఉపయోగించుచున్నాడు. పత్రిక యొక్క మూడు ముఖ్య విభజనలు క్రింద చూడుడి.

(1) తన సేవలను గూర్చిన పౌలు యొక్క వివరణ అధ్యాయము 1-7 వరకు

(2) పరిశుద్ధుల కొరకు పౌలు చేసిన సహాయనిధి పని. అధ్యాయము 8-9 వరకు

(3) తన అపొస్తలత్వమును పౌలు నిలుపుకొనుట. అధ్యా 10-13

కొన్నిగుర్తింపు వివరములు:- పరిశుద్ధ గ్రంథములో 47వ పుస్తకము; అధ్యాయములు 13; వచనములు 257; ప్రశ్నలు 29; పాత నిబంధన ప్రవచనములు 4; క్రొత్త నిబంధన ప్రవచనములు 4; చారిత్రక వచనములు 249; నెరవేరిన ప్రవచనములు 4; నెరవేరని ప్రవచనములు 4.

Corinthians 1 – 1 కొరింథీయులకు

పాలు కాలములో గ్రీసుకు ఒక ముఖ్య పట్టణముగానున్న కొరింథు ప్రపంచమంతటను వ్యాపారము, అక్రమపద్ధతులు, విగ్రహారాధన మొదలైన వాటితో నిండిన ఒక స్థలముగానుండెను. ఇక్కడ పౌలు ఒక సంఘమును ఏర్పరచెను(అపో. కార్యములు 18:1-17). అతని పత్రికలలో రెండవ కొరింధు దేవుని సంఘము అని పేరుకు మాత్రమే వ్రాయబడినవిగా నుండెను.
ఒక అన్య సముదాయము నుండి పిలిచి ప్రత్యేకపరచబడిన సంఘము ఎదుర్కొనవలసిన సమస్యలు, పురికొల్పులు, పోరాటములు, మొదలైనవి ఈ మొదటి పత్రిక బయలు పరచుచున్నది. కొరింథీయ సంఘ జీవితములో ఒకభాగముగా మారిన విభజనలు, నేరములు, దుర్మార్గము, దుష్ట ప్రవర్తన, ప్రభువు బల్ల మరియు కృపావరములను తప్పుగా నుపయోగించుట మొదలైన వాటిని గూర్చి ఈ పత్రికలో పౌలు మాట్లాడుచున్నాడు. శిక్షకార్యములను గూర్చిన నిరాకరింపులు తప్ప కొరింథు విశ్వాసులు వ్రాసి అడిగిన కొన్ని సమస్యలను గూర్చిన తన అభిప్రాయములనుకూడ ఈ పత్రికలో చూడవచ్చును.

ఉద్దేశము:- కొరింథు సంఘము యొక్క సమస్యలను తెలిసికొని వాటికి పరిహారము చెప్పుట, అక్రమ పద్ధతులు నిండిన సముదాయములో విశ్వాసులు ఎట్లు జీవించవలెనని బోధించుట.
వ్రాసిన వారు: – పౌలు.
వ్రాసిన కాలము:- సుమారు క్రీ.శ. 55. పౌలు యొక్క మూడవసువార్త దండయాత్రలో ఎఫెసులో మూడేండ్ల సేవ యొక్క ముగింపులో.
ముఖ్య వ్యక్తులు:- పౌలు, తిమోతి, క్లోయె యింటివారికి.
ముఖ్య స్థలములు:- కొరింథులో సంఘముగా కూడివచ్చు స్థలములు.
గ్రంధ శ్రేష్టత:- నిర్మలత్వమును పటుత్వముగల ఒక బహిరంగమైన పత్రిక.
ముఖ్య పదజాలము:- శరీరానుసారమైన బ్రతుకు అను తప్పును దిద్దుకొనుడి.
ముఖ్య వచనములు:- 1 కోరింథీయులకు 6:19-20; 1 కోరింథీయులకు 10:12-13
ముఖ్య అధ్యాయము:- 1కొరి.13 వివాహ ఆచార వ్యవహారములలో పఠించుట ద్వారాను, ప్రసంగములకు మూలాధార వచనములుగ ఎత్తి చూపుటద్వారాను ఈ అధ్యాయము ప్రేమను గూర్చి మిక్కిలి శ్రేష్ఠమైన పరిమాణముగా కీర్తిగాంచెను. ప్రేమయనునది ఒక ఉద్రేకము. ప్రజలు దానిని కౌగిలించుకొనుటయో, దానిని విడిచి పెట్టి పారిపోవుటయో చేయవచ్చునను అభిప్రాయములను విడచి పెట్టి ప్రేమ ఒక ముఖ్యమైన ఆచరణ కార్యము అను సత్యమును ఈ అధ్యాయము తెలియజేయుచున్నది. అందుకనే దేవుడు అంత మిక్కుటముగా ప్రేమించుట ద్వారా తన కుమారునినే మనకనుగ్రహించెను. (యోహాను 3:16).
గ్రంథ విభజన:- పౌలు మరియు కొందరు దైవ సేవకుల యొక్క ప్రయత్న ఫలితముగా ఒక సంఘమేర్పడెను. అయితే ఆ సంమము నుండి “ కొరింథు” ను దూరముగా పెట్టుట అనునది మిక్కిలి కఠినమైన ఒక కార్యముగా భావింపబడుచున్నది. ఈ కార్యము యొక్క ఆరంభమందలి కార్యమైన ఈ పత్రికను మూడు ముఖ్య భాగములను విశధముగా వివరించవచ్చును.
(1) విభజనలను గూర్చి క్లోయె యింటి వారి యొద్ద నుండి వచ్చిన వార్తలకైన సమాధానము అధ్యాయము 1-4 వరకు.
(2) దుర్మార్గమును గూర్చి వచ్చిన సందేశమునకు జవాబు. అధ్యాయము 5-6 వరకు.
(3) కొరింథీయులు వ్రాసిన ఉత్తరములో కనిపించిన సమస్యలకు సమాధానము. అధ్యాయము 1-16 వరకు.
కొన్ని వివరముల గుర్తింపు:- పరిశుద్ధ గ్రంధములో 46వ పుస్తకము; అధ్యాయములు 16; వచనములు 437; ప్రశ్నలు 113; పాత నిబంధన ప్రవచనములు 5; క్రొత్త నిబంధన ప్రవచనములు 13; చారిత్రక వచనము 377; నెరవేరిన ప్రవచనములు 5; నెరవేరని ప్రవచనములు 55.

Romans – రోమీయులకు

పౌలు యొక్క అతి శ్రేష్ఠమైన ఒక సృష్టి రోమీయులకు వ్రాసిన పత్రిక. క్రొత్త నిబంధన యందు చేర్చబడిన అతని 13 పత్రికలును యేసుక్రీస్తు యొక్క కార్యములను, ఉపదేశములను గూర్చి పలుకగా, రోమా పత్రిక క్రీస్తు యొక్క బలి మరణము యొక్క ముఖ్యత్వమును గూర్చి చెప్పుచున్నది. ఒక ప్రశ్న- జవాబు అను విధానము గలిగి పరిశుద్ధ గ్రంథము యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశ్యపూర్వమైన ఉపదేశముల సమూహమును అపొస్తలుడైన పౌలు ఈ పత్రిక యందు వ్రాసి యున్నాడు. ఈ గ్రంథము ఒక దైవత్వము గల గ్రంథమనుటకు పూర్వమే అనుచరణ విధానపు బోధనలు గల ఒక సమూహముగా నున్నది.

గ్రంథ రచయిత:- బోధనల పునాదికి ముఖ్యత్వము వహించిన ఈ పత్రికను పౌలు వ్రాసెను. (రోమీయులకు 1:1) పదజాలము, ప్రవర్తన ఉద్దేశముల సమూహము, దైవత్వము యొక్క అనుకరణ విధానము మొదలగు వాటిలో ఇది పౌలు యొక్క ఇతర పత్రికలకు సంబంధించియున్నది. పౌలు చెప్పుచుండగా తెరియు అనునతనిని వ్రాయమని చెప్పి (రోమీయులకు 16:22) వ్రాసిన వాని అభినందనలను దీనితో కలుపుటకు అనుమతిని ఇచ్చియున్నాడు.

ఉద్దేశము:- రోమా ప్రజలకు పౌలును పరిచయం చేయుటయును, అతను రోమాకు వెళ్ళుటకు ముందు అతడు చెప్పు వర్తమానపు మాదిరిని వారికి ఇచ్చుటయును.

ఎవరికి వ్రాసెను?:- రోమా యందు గల క్రైస్తవులకును, అన్ని చోట్ల గల విశ్వాసులు యావన్మందికిని.

వ్రాసిన కాలము:- దాదాపు క్రీ.శ. 57లో కొరింథు నుండి యెరూషలేమునకు వెళ్ళుటకు పౌలు సిద్ధపడుచుండినపుడు.

ఆంతర్యము:- తూర్పు దేశములందు యించుమించు తన పరిచర్యను నెరవేర్చిన తరువాత స్పెయినుకు వెళ్ళు మార్గమందు రోమాను సంధించుటకు పౌలు ఇష్టపడెను. అయితే అంతకు ముందు యెరూషలేము లోని బీదలైన విశ్వాసుల కొరకు సహాయనిధిని చేర్చుటకు ప్రారంభించెను. (రోమీయులకు 15:22-28) రోమా సంఘము యొక్క అధిక పక్షపు వారు యూదులైనప్పటికిని అన్యజనులు అనేకులుండిరి.

ముఖ్య పాత్రలు: – పౌలు, ఫీబే

ముఖ్య స్థలము:- రోమా

గ్రంథ విశిష్టత:- పౌలు తన విశ్వాసమును బట్టబయలుగా ఒప్పుకొని అప్పగించు రీతిలో రోమా పత్రికను వ్రాసెను. ఇది ప్రతినిధిత్వ బహువచనము గల ఒక మాదిరి పత్రిక కాదు. అయితే పత్రిక చివరి భాగమును రోమీయులకు అభినందనలు తెలుపుటకు అధిక సమయమును తీసికొనెను.

పత్రికను ఎందుకు వ్రాసెను?:- “దేవుని చిత్తము యొక్క ముగింపు మాటలే మోషే యొక్క చట్టములు. అన్య జనులు క్రైస్తవులుగా మారుటలో ఆక్షేపణ లేదు. అయితే మొదట వారు సున్నతి పొంది మోషే ధర్మ శాస్త్రమును నెరవేర్చిన తరువాత మాత్రమే క్రైస్తవులు కాగలరు.” ఇది రోమా సమాజపు ఒక పక్షపు విశ్వాసులు మూర్ఖ వివాదము. మరియొక పద్ధతిలో దీనిని చెప్పినచో యూదా మతమును అంగీకరించని ఒకడు క్రీస్తునందు విశ్వాసముంచి రక్షణ పొందగలడా అనునదే వారి సమస్య. క్రైస్తవ్యము యొక్క ప్రారంభము యూదా మతము నందుండియున్నచో ఆ రీతిగా ఎట్లయిననూ కొనసాగించవలెననునదే వారి మధ్య గల యూదా మత నాయకుల స్థిరమైన తీర్మానము. ఒక అన్యునుకి యూదా మతమునంగీకరించుటకు సున్నతి అనునది ఒక ప్రాముఖ్యముగా నెరవేర్చవలసిన ఒక మత సంస్కారముగా నుండెను.

నీతిమంతులుగా తీర్చబడుటను గూర్చి-పౌలు యొక్క వివరణ: – నీతిమంతులగు వారి విషయము క్రీస్తు ద్వారానే తప్ప మోషే యొక్క ధర్మ శాస్త్రము ద్వారా దేవుని యెదుట మనుష్యుని నీతిమంతునిగా తీర్చలేము అని ఈ పత్రిక ద్వారా బయలుపడుచున్నది. దేవుని పరిశుద్ధతను బయలుపరచి చూపునది ధర్మశాస్త్రము. స్వభావ సిద్ధముగా పాపియైన మానవుడు పరిపూర్ణముగా ధర్మశాస్త్రము ప్రకారం జీవించలేడు. అయితే పాపి ఎట్లు ధర్మశాస్త్రము ప్రకారము నీతిమంతుడిగా తీర్చబడగలడు? క్రీస్తు ద్వారా లభించు పాపక్షమాపణ ద్వారా మాత్రమే పాపియైన మనుష్యుడు దేవుని యెదుట నీతిమంతుడిగా మార్చబడును. అనగా మనుష్యునికి యేసుక్రీస్తు అనుగ్రహించు పాప పరిహారము మూలముననే తప్ప స్వంత క్రియలచే ఎవరునూ నీతిమంతుడైన దేవుని యెదుట నీతిమంతులుగా తీర్చబడలేరు. కనుక నీతిమంతులుగా తీర్చబడుట అనునది క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా మాత్రమే లభించును. అంతేకానీ ధర్మశాస్త్రము వలనైన ఆచారముతో లభించదని పౌలు నిర్బంధముగా నిరూపించుచున్నాడు.

ముఖ్య పదజాలము:- దేవుని నీతి.

ముఖ్య వచనములు:- రోమీయులకు 1:6; రోమీయులకు 1:17; రోమీయులకు 3:21-25.

ముఖ్య అధ్యాయములు:- రోమా 6-8 వరకు క్రైస్తవ జీవిత పునాది బోధనలు యీ పత్రిక మధ్య భాగమైన 6-8 వరకు గల అధ్యాయములలో కనిపించుచున్నవి. పాపము నుండి ఎట్లు విడుదల లభించును? కృప ద్వారా శిరస్సావహించిన ఒక జీవితము మనకెట్లు లభించును? పరిశుద్ధాత్మతో నిండిన ఒక విజయ జీవితమును ఎట్లు స్వంతము చేసుకొనగలము? ఈ ప్రశ్నల యొక్క సమాధానమును యీ భాగమందు చూడగలము. యేసుక్రీస్తు యొక్క పోలికలో రూపాంతరము పొందుటను గూర్చిన అతి ముఖ్యమైన లేఖన భాగము ఇదేనని అనేకులు తలంచుచున్నారు.

గ్రంథ విభజన:- దేవుని నీతియనునదే ఈ గ్రంథము యొక్క ముఖ్య అంశము. ఈ నీతిని గూర్చిన మూడు కార్యములు వరుస క్రమమున యీ గ్రంథము నందు వివరించబడియున్నవి. (1) దేవుని నీతి ప్రత్యక్షత. ఆధ్యా1-8 వరకు. (2) దేవుని నీతి నిరూపించబడుట. ఆధ్యా 9-11 వరకు. (3) దేవుని నీతి యొక్క అనుచరణ అభ్యాసము 12-16 వరకు.

కొన్ని ముఖ్య వివరణలు :- పరిశుద్ధ గ్రంథము యొక్క 45వ పుస్తకము: అధ్యాయములు 16; వచనములు 433; ప్రశ్నలు 87; పాత నిబంధన ప్రవచనములు 19; క్రొత్త నిబంధన ప్రవచనములు 4; చారిత్రక వచనములు 388; నెరవేర్చబడిన ప్రవచనములు 29; నెరవేర్చబడని ప్రవచనములు 16.

Acts – అపొ. కార్యములు

యేసుక్రీస్తు చిట్టచివరిగా తన శిష్యులకు ఇచ్చినవి ఆజ్ఞలుగా వ్రాయబడిన వాక్యములను గొప్ప ఆజ్ఞలు అని పిలుచుచున్నాడు. యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను, భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు (అపో. కార్యములు 1:8) అనునవే ఆ పలుకులు. ఈ గొప్ప ఆజ్ఞను శిరసావహించి ఆయన శిష్యులు విశ్వాసులు – పునరుత్థానుడైన రక్షకుని గూర్చిన సువార్తను భూదిగంతముల వరకు ప్రకటించిన చివరి స్త్రీ పురుషుల వృత్తాంతమే లూకా వ్రాసిన అపొస్తలుల కార్యములు. రెండు భాగములుగా లూకా వ్రాసిన ఒక గ్రంథములో రెండవ భాగముగా చెప్పబడుచున్న గ్రంథమునకు ప్రత్యేక నామమేదియు లేదు. కాని ఇప్పటి వరకు దొరికిన గ్రీకు – చేవ్రాత ప్రతులలోను “ప్రాక్సెయిస్” అనగా “కార్యములు” లేక అపొస్తలుల కార్యములు అను నామమును చూడగలము. గ్రీకు సాహిత్యములో “ప్రాక్సెయిస్” అనే పదం ప్రసిద్ధిగాంచిన పురుషుల యొక్క సాధనలను క్రోడీకరించి ఇచ్చిన గ్రంథమని పిలిచెదరు. ఈ పుస్తకములో అపొస్తలులు అని సమూహ అర్ధముగా పిలువబడుతున్నప్పటికి మనకు కన్పించువారు ఇరువురు మాత్రమే 1 అపొస్తలుడైన పౌలు 2 అపొస్తలుడైన పేతురు వారి సేవ, త్యాగము, అద్భుతములు ముఖ్యముగా గుర్తించబడుచున్నవి.

ఉద్దేశము : క్రీస్తు సంఘ పుట్టుకను, సంఘవృద్ధిని తేట తెల్లముగా తెలుపుట.

గ్రంథకర్త : వైద్యుడైన లూకా

ఎవరికి వ్రాయడెబను : థెయొఫిలాకు

వ్రాయబడిన కాలము : క్రీ.శ. సుమారు 61 సంవత్సరము

గత చరిత్ర : క్రీస్తు జీవితమును క్రీస్తు సంఘాభివృద్ధిని కలుపు ఒక గొలుసుగా ఇది ఉన్నది. సువార్త పుస్తకములను పత్రికలను కలుపుగొలుసుగా కూడ ఇది ఉన్నది.

ముఖ్య వచనము : అయినను పరిశుద్ధాత్మ మీమీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు. అపో. కార్యములు :8.

ప్రముఖ వ్యక్తులు : పేతురు, యోహాను, యాకోబు, సైఫను, ఫిలిప్పు, పౌలు, బర్నబా, కొర్నేలి, యేసు సహోదరుడైన యాకోబు, తిమోతి, లూదియ, సీల, తీతు, అపొల్లో, ఫేస్తు, అగ్రిప్ప, లూకా, మార్కు, అననీయ, ఫెలిక్సు

ముఖ్య స్థలములు : యెరూషలేము, సమరయ, యొప్పె, అంతియొకయ, ఈ కొనియ, పెసిదియ, లుస్త్ర, దెర్బె, ఫిలిప్పీ, థెస్సలోనికయ, బెరయ, ఎఫెసు, కైసరియ, మెలితే, రోము, ఏథెన్సు, లుద్ద, పిసిదియలోనున్న అంతియొకయ, కొరింధీ.

గ్రంథ విశిష్టత : లూకా సువార్తకు పొడిగింపు గ్రంథముగా ఇది ఉన్నది.

ముఖ్య పదము : సంఘ అభివృద్ధి.

ముఖ్య వచనములు : అపో. కార్యములు 1:8; అపో. కార్యములు 2:42-47.

ముఖ్య ఆధ్యాయము : అపొ. 2

యేసుక్రీస్తు తన శిష్యులకు పై నుండి శక్తి వచ్చువరకు యెరూషలేములో నిలిచి యుండుడని ఆజ్ఞాపించెను. ఈ వాగ్దానము ననుసరించి పరిశుద్ధాత్మ (దేవుడు) పెంతెకోస్తు దినమున మేడ గదిలో నున్న వారి మీదికి దిగి వచ్చెను. లోకమంతటా సువార్త ప్రకటించు పని ప్రారంభమాయెను. శిష్యుల బాధ్యత లోకమంతట సువార్త ప్రకటించి ఎవరును జయించలేనంత బలమైన సంఘముగా క్రీస్తు సంఘమును విస్తరింప చేయుటయే. ప్రభువు యొక్క అనాధి నిర్ణయం నెరవేర్చబడి, వారు సువార్త పనిలో ముందుకు కొనసాగుటకు శక్తివంతులుగా చేసెను.

గ్రంథ విభజన : లూకా సువార్త ముగిసిన చోటనే అపొస్తలుల కార్యములు గ్రంథము ప్రారంభమగుచున్నది. మత్తయి 28:19-20 వచనములలో యేసు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ నెరవేర్పు క్రమములో ప్రారంభ సంఘ చరిత్రాంశముల నింపియున్న గ్రంథమే ఈ అపోస్తలుల కార్యములు అను గ్రంథము. కొత్త నిబంధన సంఘపు ప్రారంభ చరిత్రను ఈ పుస్తకములో చూస్తున్నాము. యేసుక్రీస్తు ఆరోహణము, పెంతెకోస్తు దినమున పరిశుద్దాత్మ దిగి వచ్చుట మున్నగు వాటితో ప్రారంభమగుచున్న ఈ గ్రంథము – సువార్త ప్రకటన యెరూషలేములో ప్రారంభింపబడి రోమా మహాసామ్రాజ్య సరిహద్దులన్నింటిలోనికి వ్యాపించుటను వివరించుచున్నది.

అపొస్తలుల కార్యములు గ్రంథము పలు మలుపులను వివరించుచున్నది. సువార్త పుస్తకముల నుండి ప్రతికలలోనికి మార్చబడుట, యూదా మతము నుండి క్రైస్తవ మార్గములోనికి మార్చబడుట ధర్మశాస్త్రములో నుండి కృపలోనికి మార్చబడుట యూదులు మాత్రమే దేవుని ప్రజలు అను భావము నుండి సమస్త జాతి ప్రజలు దేవుని ప్రజలగుదురను మార్పు ఈ గ్రంథము ద్వారా పొందగలము. పలు మలుపుల ప్రారంభములను లూకా వ్రాసిన ఈ గ్రంథములో మాత్రమే చూడగలము. ఈ గ్రంథములోని ముఖ్య వచనమైన అపో. కార్యములు 1:8లో లిఖితమైనట్టుగా సువార్త వ్యాప్తిని సూచించు మూడు భాగములుగా దీనిని విభజింపవచ్చును.

యెరూషలేములో క్రీస్తును గూర్చిన సాక్ష్యము Acts,1,1-8,4
యూదయ సమరయ దేశములలో క్రీస్తు సాక్ష్యం ప్రకటన Acts,8,5-12,25
భూది గంతముల వరకు, క్రీస్తును గూర్చిన సాక్ష్యము 13 – 28 అధ్యాయములు.

సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో 44వ పుస్తకము. అధ్యాయములు 28; వచనములు 1007; ప్రశ్నలు 75; పాతనిబంధన ప్రవచనములు 21; క్రొత్త నిబంధన ప్రవచనములు 20; చరిత్రాత్మక వాక్యములు 949; నెరవేరిన ప్రవచనములు 49; నెరవేరనున్న ప్రవచనములు 14.

John – యోహాను సువార్త

అధ్యాయములు: 21, వచనములు: 879

గ్రంథ కర్త: జెబెదయి కుమారుడును, యాకోబు సహోదరుడును అపోస్తలుడైన యోహాను.

రచించిన తేది: క్రీ.పూ. 85-90వ సం.

మూల వాక్యాలు:

1:1,14 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీర -ధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మన మధ్య నివసించెను.

1:29 ఇదిగో లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.

3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

6:29 యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాస ముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను.

10:10 గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితిని.

10:27,28 నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను

11:25-26 అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును;బ్రదికి నాయందు విశ్వాస ముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు

13:35 మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను .

14:6 యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ద్దకు రాడు.

19:30 సమాప్తమైనది

నాణెమునకు రెండు భాగములు కలవు. రెండింటికిని సమాన ప్రాధాన్యత ఉండెను. ఈ ప్రకారముగానే యేసుక్రీస్తుకు తుల్యప్రధానమైన స్వభావములు రెండు గలవు అవి ఏవనగా దైవత్వం మానవత్వం, అపొస్తులుడైన యోహాను క్రీస్తు జీవితములో నున్న దైవత్వ స్వభావమునకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చుచు ఆయన దేవుని కుమారుడని తన సువార్తలో వ్రాసియుండెను. లూకా యేసుక్రీస్తు జీవితములోనున్న మానవత్వమునకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చుచు ఆయన మనిషి కుమారుడని తన సువార్తలో వ్రాసియుండెను. కాలమునకు సంబంధించిన ఆధారములు వీటికి భిన్నమైన ప్రాముఖ్యాంశములను ఆధారము చేసికొని ఈ సువార్త రచింపబడెను. క్రీస్తు చేసిన ఏడు అద్భుతములను నేనే అని ఆయన దృఢముగా చెప్పిన ఏడు సత్యములను కేంద్రంగా చేసికొని సువార్త రచన ముందుకు సాగుచుండెను. మేడ గదిలో సిద్ధపరచబడిన చివరి రాత్రి భోజన వృత్తాంతములో తన శిష్యులకు చివరిగా ప్రసంగించెను. ప్రత్యక్ష సాక్ష్యముల వివరములతో ప్రారంభమై క్రీస్తు పునరుత్థాన సంభవములు తెలుపుచు, క్రీస్తు దేవుని కుమారుని యోహాను స్పష్టపరిచెను.

ఉద్దేశము : యేసు నిజముగా దేవుని కుమారుడని ఆయనయందు విశ్వాసముంచిన వారు నిత్య జీవము పొందుదురు అని నిరూపించుట.

గ్రంథకర్త : జెబెదయి కుమారుడును, యాకోబు సహోదరుడును అపొస్తలుడైన యోహాను. జెబెదయి కుమారులు “ఉరిమెడి “వారు అని పిలువబడియుండిరి.

ఎవరికి వ్రాయబడెను : నూతన విశ్వాసులకు, సత్యాన్వేషకులైన అవిశ్వాసులకు

వ్రాయబడిన కాలం : క్రీ.శ సుమారు 90 సంవత్సరములో

గత చరిత్ర : క్రీ.శ. 70 సంవత్సరములో యెరూషలేము నాశనం చేయబడిన తరువాత యోహాను పత్మాసు ద్వీపమునకు పరవాసిగా వెళ్ళకముందు యోహాను ఈ సువార్తను వ్రాసియుండెను.

ముఖ్య వ్యక్తులు : యేసు, బాప్తీస్మమిచ్చు యోహాను, యేసు శిష్యులు, మార్త, మరియ, లాజరు, యేసు తల్లి, పిలాతు, మగ్దలేనే మరియ.

ముఖ్య స్థలములు : యూదయ, సమరయ, గలిలయ, బేతనియ, యెరూషలేము.

గ్రంథ విశిష్టత : వ్రాయబడిన 7 అద్భుతములలో 6 అద్భుతములు దీనిలో మాత్రమే వ్రాయబడెను. అనగా మిగిలిన మూడింటిలో దేనిలోను ఇవి లేవు. అలాగే 14 – 17 అధ్యాయములలో వ్రాయబడిన, మేడ గదిలో ప్రభువు శిష్యులనుద్దేశించి చేసిన ప్రసంగములు కూడ ఈ పుస్తకములోని ప్రత్యేకత. ఈ సువార్తలోని విషయములు 90 శాతము వివరములు ఇతర సువార్తలలో లేవు. అయితే ఇతర సువార్తలలో చెప్పబడిన యేసు వంశావళి, జననము, బాల్యకాల విశేషములు, శోధనలు, రూపాంతరము, శిష్యుల నియామకము, ఉపమానములు, చివరి ఆజ్ఞ, ఆరోహణము అనువాటిని గూర్చి ఈ సువార్తలో ఏమియు వ్రాయబడలేదు.

ముఖ్య పద సముదాయము : యేసు దేవుని కుమారుడని నమ్ముట.

ముఖ్య వచనములు :యోహాను 1:11-13; యోహాను 20:30-31

ముఖ్య ఆధ్యాయము : 3వ అధ్యాయము యోహాను 3:16 అధికముగా చదువబడునది; ప్రసంగింపబడుచునున్న సువార్త వాక్యమిది. రక్షణ దేవుని వరమనియు, అది విశ్వసించిన వారికి మాత్రమే ఇవ్వబడుననియు ఈ వచనము చెప్పుచున్నది. నీకొదేముతో జరిగిన సంభాషణ, బాప్తీస్మమిచ్చు యోహాను సాక్ష్యము – మున్నగు వాటి మూలమున, దేవుని రాజ్యములో ప్రవేశించుటకు నూతన జన్మ పొందుటయే ఏకైక మార్గమని ఈ అధ్యాయము మనకు తెలియజెప్పుచున్నది.

కొని ప్రత్యేక సందర్భములలో యేసు పాత నిబంధనలో నేనే అని చెప్పినది. దేవునితో సమానుడని స్పష్టపరిచెను. ఆయన దైవత్వమును చాటి చెప్పు ముఖ్యాంశములను యోహాను 1:1; యోహాను 8:58; యోహాను 10:30; యోహాను 14:9; యోహాను 20:28 అను వచనములలో చూడగలము. నేనే అని యేసు తనను గూర్చి దృఢముగా చెప్పిన ఏడు మాటలను ఈ క్రింద చూతము.

జీవాహారమును నేనే (యోహాను 6:35-48) 2. నేను లోకమునకు వెలుగైయున్నాను. (యోహాను 8:12; యోహాను 9:5). 3. నేనే ద్వా రమును (యోహాను 10:7-9). 4. నేను మంచి కాపరిని (యోహాను 10:11-14). 5. పునరుత్థానమును, జీవమును నేనే (యోహాను 11:25). 6. నేనే మార్గమును, సత్యమును, జీవమును (యోహాను 14:6). 7. నేనే నిజమైన ద్రాక్షావల్లిని (యోహాను 15:1-5).
గ్రంథ విభజన : ఇతర మూడు సువార్తలలో లేని ప్రత్యేకమైన యొక సారాంశమును శైలిని కలిగియున్న ఈ సువార్త – స్థూల పరిశీలనా సువార్తలు మత్తయి, మార్కు, లూకా విడిచి పెట్టిన కొన్ని ముఖ్యాంశములను వ్రాయుట ద్వారా క్రీస్తు చరిత్ర సంగ్రహమును సంపూర్ణము చేయుచున్నది. మిక్కిలి సులభశైలితో, అతి శ్రేష్ఠమైన వర్తమానములతో నిండియున్నది. ఈ గ్రంథము, పరిశుద్ధ గ్రంథములోని పుస్తకములన్నింటిలో మిక్కిలి శ్రేష్టమైనది ఆత్మీయ సత్యములతో పరిపుష్టమైనది. యేసునందు విశ్వాసముంచుట ద్వారా మనుష్యులు ఆత్మ జీవులుగా మారగలరు అను సుస్పష్టమైన లక్ష్యముతో యోహాను ఈ సువార్తను వ్రాయుచున్నాడు. దీనిని ఐదు ముఖ్య భాగములుగా విభజింపవచ్చును.

ఉపోద్ఘాతము: దేవుని కుమారుని అవతారం (యోహాను 1:1-18). 2. దేవుని కుమారుని బహిరంగ సువార్త సేవ (Joh,1,19-4,54). 3. దేవుని కుమారుడు ఎదుర్కొనిన ఎదిరింపులు అధ్యాయము 5 మొదలు 12 వరకు. 4. దేవుని కుమారుని శిష్యులను సేవకులుగా చేయుట అధ్యాయము 13 మొదలు 17 వరకు. 5. దేవుని కుమారుని సిలువ మరణము పునరుత్థానము అధ్యాయము 18 మొదలు 21 వరకు.
సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో 43వ పుస్తకము; అధ్యాయములు 21; వచనములు 876; ప్రశ్నలు 167; నెరవేరిన పాత నిబంధన ప్రవచనములు 15; నెరవేరిన క్రొత్త నిబంధన ప్రవచనములు 85; నెరవేరని ప్రవచనములు 7.

ఉపోద్ఘాతం: యోహాను సువార్త యేసు క్రీస్తు ప్రభువును ఉద్దేశించి రచించబడింది. ఆయన క్రీస్తు అనియు, దేవుని కుమారుడనియు, ఆయన నామమందు విశ్వాసము కలిగిన వారికి నిత్య జీవమనియు మరి ముఖ్యంగా తెలియజేస్తుంది. రెండవ తరం క్రైస్తవుల విశ్వాసాన్ని బలపరచడమే కాకుండా తప్పుడు బోధలను సరి చేస్తూ వారికి సత్య సువార్తను నిక్షిప్తం చేస్తుంది ఈ గ్రంథం. యోహాను యేసు క్రీస్తు-ప్రభువు అనియు, మనుష్యకుమారుడు మరియు దేవుని కుమారుడు అని మరి ముఖ్యంగా తెలియజేస్తూ, క్రీస్తు ఆత్మ ప్రతీ వ్యక్తి పై ప్రభావితం చేస్తుంది అని వివరిస్తాడు.యేసు క్రీస్తు యొక్క బాప్తీస్మము మొదలుకొని మరణ పునరుత్థానము వరకు జరిగిన అన్ని సన్నివేశాలు ఈ గ్రంథం లో లిఖితం చేయబడినవి. ఈ సువార్త లో సువార్తికుడు కేవలం ఏడు అద్భుతాలను తెలియజేస్తూ ఆ ఏడు అద్భుతములు నేనే అని ఆయన ధృడంగా చెప్పిన ఏడు సత్యాలైన క్రీస్తు ప్రరిచర్యను విశ్లేషిస్తాడు. ఈ సువార్తికుని యొక్క గ్రంథం మిగతా సువార్తల కంటే ప్రత్యేకమైనది. కీస్తు ఆరోహణమైన తరువాత ఆదరణ కర్తయును సత్య స్వరూపియైన ఆత్మ ఏ విధంగా సర్వ సత్యమైన పరిచర్యలోనికి నడిపించిందో గమనించగలం. నమ్ముట, సాక్షి, ఆదరణ, జీవం – మరణం, వెలుగు – చీకటి, ప్రేమ అనే పదాలు అనేక మారులు ఈ సువార్తలో కనబడుతుంటాయి.

యేసు క్రీస్తును కేవలం తన జననం నుండే పరిచయం చేయడు కాని ఆది నుండి ఏమై ఉన్నదో ఆ వాక్యం నుండి వివరిస్తాడు. ఆదియందు వాక్యముగా, ఆ వాక్యమే శరీరధారియై, లోక పాపములను మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్లగా, మెస్సియగా, ప్రతీవాడు నశించకుండా ఆయన ద్వారా నిత్యజీవం పొందునట్లు యేసు క్రీస్తును పరిచయం చేసింది ఈ సువార్త. యేసు క్రీస్తు జీవితములో ఉన్న దైవ స్వభావమును మానవత్వాన్ని వివరించి కాలమునకు సంబంధించిన భిన్నమైన ప్రాముఖ్యాంశములను ఆధారము చేసుకొని ఈ సువార్త రచించెను. యోహాను 3:16 అధికముగా చదవబడినది, అనేకులకు ప్రసంగించబడిన సువార్త వాక్యం ఇది. రక్షణ దేవుని వరమనియు, అది విశ్వసించిన వారికి మాత్రమే ఇవ్వబడుననియు ఈ వచనము చెప్పుచున్నది. అంతేకాదు నీకొదేముతో జరిగిన సంభాషణ, బాప్తీస్మమిచ్చు యోహాను సాక్ష్యము మొదలగు వాటి మూలమున, దేవుని రాజ్యములో ప్రవేశించుటకు నూతన జన్మ పొందుట ఒక్కటే మార్గమని తెలియజేశాడు. యేసు క్రీస్తు ప్రభువు తన శిష్యులతో తాను పొందబోయే ఆ సిలువ మరణము గూర్చి మరియు తాను ఆరోహణమైన తరువాత వారు చేయబోయే పరిచర్య విషయమై వారిని సిద్దపరిచాడు.

యేసు క్రీస్తు తనను గూర్చి దృఢంగా చెప్తూ, జీవాహారము నేనే (6:35,48), నేను లోకమునకు వెలుగై ఉన్నాను(8:12,9:5), నేనే ద్వారమును (10:7,9), నేను మంచి కాపరిని (10:11,14), పునరుత్థానమును జీవమును నేనే (11:25), నేనే మార్గమును సత్యమును జీవమును (14:6), నేనే నిజమైన ద్రాక్షావల్లిని (15:1-5) అను ఏడు సంగతులు ప్రత్యేకముగా వివరించాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను అనే ప్రాముఖ్యమైన సంగతి 4:24 లో గమనించగలం.

సారాంశం: నిజ జీవితంలో పరిపూర్ణమైన పరిచర్య ఏ విధంగా చేయాలి అని ప్రత్యేకంగా 3:16 తెలియజేస్తుంది. యేసు క్రీస్తు వలే మానవత్వంలో మాదిరికరమై, ఇతరుల పట్ల కూడా అదే జీవితం మనమందరం కలిగి యుండాలి, జీవించాలి. ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించి, నిత్యజీవమునకు వారసులమై ఆశీర్వాదములు పొందడమే కాకుండా ఇతరులకు కూడా ఆశీర్వాదకారకులమయ్యే ధన్యత కలిగి యుండాలి. అట్లు ప్రభువు మీకు సహాయం చేయును గాక. ఆమేన్.

Luke – లూకా సువార్త

ప్రేమపూరిత పదములతో, వైద్యుడైన లూకా, మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ మానవత్వమును కడుజాగరూకతతో వర్ణించుచున్నాడు. ప్రారంభములో యేసు వంశావళిని, జననమును, బాల్యమును వివరించి వాటికి తగిన ప్రాధాన్యతను వివరించిన తరువాత కాల సంభవములను సూక్ష్మబుద్దితో తెలిపిన తదుపరి ప్రభుని బహిరంగ పరిచర్యను వర్ణింపబూనుకొన్నాడు. ఆ బహిరంగ పరిచర్య సామాన్య ప్రజలలో యేసునందు విశ్వాసము పెరుగుచుండగా మరొకవైపు ఆయన శత్రువులలో విరోధ భావములు పెరుగుచుండెను. ఇట్టి పరిస్థితులలో విశ్వసించిన వారికి శిష్యత్వపు విలువలు తరిచి తెలిసికొనుట సవాలుగా మారినది. విరోధులు మనుష్య కుమారుడు సిలువపై ఒక మృతదేహముగా వ్రేలాడుట చూచువరకు మనశ్శాంతి పొందలేదు. కాని ఆయన పురుత్థానుడైన తరువాత స్థితిగతులకు మార్పు వచ్చెను. తుదకు మనుష్య కుమారుడైన క్రీస్తులో దేవుని చిత్తము సంపూర్ణముగా నెరవేరెను.

లూకా అను నామము క్రొత్త నిబంధనలో ముమ్మారు మాత్రమే చెప్పబడినది. కొలొస్సయులకు 4:14; 2 తిమోతికి 4:11; ఫిలేమోనుకు 1:24. ఉద్దేశము : యేసు క్రీస్తు జీవితమును గూర్చి అధిక వివరముల నిచ్చుట యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడు నిజ రక్షకుడు అని చూపుట.

గ్రంథకర్త : గ్రీకు దేశస్థుడును వైద్యుడైన లూకా (కొలొస్సయులకు 4:14) కొత్త నిబంధన రచయితలలో అన్యుడైన ఒకే యొక వ్యక్తి. ఇతడు అపొస్తులుడైన పౌలుతో బాటు ప్రయాణములు చేసినవాడు. అపోస్తులుల కార్యములు అను గ్రంథరచయిత, ఈ రెండు పుస్తకములు ఒకదానికొకటి సంపూర్ణములుగా నున్నవి.

ఎవరికి వ్రాయబడెను : ఘనత వహించిన థెయొఫిలాకును, అన్యజనులకును వ్రాయబడెను.

కాలము : సుమారు క్రీ.శ 60.

గత చరిత్ర : లూకా కైసరియాలో ఉంటున్నప్పుడుగాని రోమాలో ఉంటున్నప్పుడుగాని దీనిని వ్రాసి యుండవచ్చును.

ప్రముఖ వ్యక్తులు : యేసు, ఎలీసబెతు, జెకర్యా, బాప్తీస్మమిచ్చు యోహాను, మరియ, శిష్యులు, మహా హేరోదు, పిలాతు, మగ్దలేనే మరియ

ముఖ్య స్థలములు : బెత్లెహేము, గలిలయ, యూదయ, యెరూషలేము.

గ్రంథ విశిష్టత : అత్యధిక సమాచారములు కలిగిన సువార్త పుస్తకము ఇది. సాధారణ బాషా రీతి పదసముదాయముతో రచయిత గొప్ప విద్వాంసుడని తెలియుచున్నది. పలు విధములగు వ్యాధులను గూర్చి తరచుగా వివరించుచున్నాడు. బహుజనసమూహములతో యేసుకు గల సంబంధమును, ఆయన ప్రార్ధనా జీవితమును, ఆయన చేసిన అద్భుతములను, దూతలను గూర్చి స్పష్టముగా చెప్పి యుండెను.

ముఖ్య పదము : మనుష్య కుమారుడైన యేసు.

ముఖ్య వాక్యములు : లూకా 1:3-4; లూకా 19:10

ముఖ్య అధ్యాయము : 15. ఈ పదునైదవ అధ్యాయములో చెప్పబడిన తప్పిపోయిన గొట్టె, పోగొట్టుకొనబడిన వెండి నాణెము, తప్పిపోయిన కుమారుడు అను ఉపమానముల ద్వారా రక్షణ సువార్త సారాంశమును ప్రభువు తెలియజేసెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. వాక్యమే సువార్త సారం.

గ్రంథ విభజన : చరిత్ర సంభంధమైన ఆధారములతో లూకా తన సువార్తను వ్రాశాడు. కాలక్రమమునకు చరిత్ర ఆధారములు ఎంత ప్రాముఖ్యమైనవో లూకా ఎరిగియుండెను. కావుననే ఈ సువార్త గ్రంథము మాత్రమే నాలుగు సువార్తలలో కంటే లోకమంతట అత్యధికముగా ప్రసిద్ధి గాంచుటకు అర్హముగా నున్నది. నాలుగు సువార్తలలో ఇది దీర్ఘమైనది. సాహిత్య రూపములో ఇది అగ్రభాగమున నిలుచున్నది. ఈ గ్రంథము పాపమానవులను వెదకి రక్షించుటకై వచ్చిన సంపూర్ణమానవునిగా యేసును చిత్రించుచున్నది. దీనిని నాలుగు ప్రధాన భాగములుగా విభజింపవచ్చును.

మనుష్యకుమారుని ఆగమనము Luke,1,1-4,13. 2. మనుష్యకుమారుని పరచర్య Luke,4,14-9,50. 3. మనుష్యకుమారుని తృణీకరించుట Luke,9,51-19,27. 4. మనుష్య కుమారుని సిలువ మరణము పునరుత్థానము Luke,19,28-24,53.

సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో 42వ పుస్తకము, అధ్యాయములు 24; వచనములు 1,151; ప్రశ్నలు 165; నెరవేరిన పాతనిబంధన ప్రవచనములు 9; క్రొత్త నిబంధన ప్రవచనములు 54; చరిత్రాత్మక వాక్యములు 930; నెరవేరిన ప్రవచన వాక్యములు 118; నెరవేరనున్న ప్రవచన వాక్యములు 103.

Mark – మార్కు సువార్త

మార్కు సువార్తలోని వర్తమానమును ఒకే యొక వచనములో క్లుప్తపరచిన యెడల అది ఈ విధముగా చెప్పవచ్చును. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను. (మార్కు 10:45), ఈ పుస్తకం యొక్క ఒక్కొక్క అధ్యాయములో మెస్సీయ శ్రేష్ఠ జీవితమునకు కేంద్రబిందువుగా తెలియజేయునది త్యాగపూరితమైన ఆయన సేవయే.

తండ్రి చిత్తమునకు ఎల్లవేళల విధేయుడగుచు సేవలో నిమగ్నుడై ముందుకు కొనసాగుచున్న దాసునిగా మార్కు ప్రభువును చిత్రీకరించెను. వాక్యమును ప్రసంగించుచు రోగులను స్వస్థపరచుచు మరణము వరకు ఇతరుల అవసరములను నెరవేర్చు సేవలో యేసు నిమగ్నుడాయెను. పునరుత్థానుడైన తరువాత ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణ దాసులుగా ఆయన అడుగు జాడలలో నడిచే శిష్య బృందముగా ప్రభువు నియమించెను.

మార్కు అని పిలువబడుచున్న ఈ గ్రంథకర్తకు యోహాను అను మరొక పేరు కూడ ఉన్నది. (అపో. కార్యములు 12:12-15; అపో. కార్యములు 15:37

ఉద్దేశము : యేసు బోధనలను, క్రియలను తెలుపుట.

గ్రంథకర్త : మార్కు ప్రభువు శిష్యుడు కాడు. కాని పౌలు చేసిన మొదటి సువార్త దండయాత్రలో మార్కు ఆయనతోపాటు పాల్గొనెను. (అపో. కార్యములు 13:13)

ఎవరికి వ్రాయబడెను : రోమాలో నివసించుచున్న క్రైస్తవుల కొరకు రోములోనే ఈ గ్రంథము వ్రాయబడెను.

రచించిన కాలము : క్రీ. శ 55 – 65 కు మధ్య కాలము

గత చరిత్ర : తిబెరకైసరు క్రింద రోమా సామ్రాజ్యం ఉండినప్పుడు మహా సామ్రాజ్యమంతటను ఒకే భాషయు, పుష్కలమైన ప్రయాణ సౌకర్యములు, వార్తలు సమాచారములు అందించు సౌకర్యములు, బాగుగా నుండుట వలన అందరూ సువార్త విని అర్ధము చేసికొనవలెననియు సమస్త దేశములకును వేగముగా ఈ సువార్తను అందించు అవకాశములు ఏర్పడెను.

ప్రముఖ వ్యక్తులు : యేసు, ఆయన శిష్యులు (పండ్రెండుగురు) పిలాతు యూదమత నాయకులు

ముఖ్య స్థలములు : కప్నెహూము, నజరేతు, కైసరియ, యెరికో, బేతనియ, ఒలీవ కొండ, యెరూషలేము, గొల్గొతా.

గ్రంథ విశిష్టత : ఇది మొట్టమొదట వ్రాయబడిన సువార్త పుస్తకము. ఇతర సువార్తల కంటే ఎక్కువ అద్భుతములను మార్కు వ్రాసియున్నాడు. ( 18 అద్భుతములు, 4 ఉపమానములు)

మార్కు కాలము : నాలుగు సువార్తలలో మొదటిగా వ్రాయబడిన సువార్త మార్కు సువార్తయేనని పలువురు బైబిలు పండితులు అభిప్రాయబడుచున్నారు. అయినను దీని కాలమును నిర్దుష్టముగా తెలుప జాలము. దేవాలయ నాశనమును గూర్చిన ప్రవచనము ఇందులో వ్రాయబడియుండుటను బట్టి ఈ సువార్త క్రీ.శ 70కి ముందే వ్రాయబడియుండవచ్చును. అయితే క్రీ.శ. 64లో పేతురు హత సాక్షి మరణమునకు ముందో వెనుకో ఇది వ్రాయబడినదని చెప్పుటకు సాధ్యంకాదు. క్రీ.శ. 55కు 65 కు మధ్యలో సువార్త రచన కాలమని భావించుచున్నారు.

మార్కు రోమీయులను ఉద్దేశించి దీనిని వ్రాసెననుట సుస్పష్టము. అది కాలములోనున్న యూదా పారంపర్యమును బట్టి మార్కు రోములో ఉండిన కాలములో దీనిని వ్రాసెనని నమ్మవచ్చును. యూదులు గౌరవింపజాలని పలు ప్రాముఖ్య విషయములను మార్కు వ్రాయకపోవుటకు కారణము ఇది రోమీయులకు వ్రాయబడుటయే. క్రీస్తు వంశావళి, ఆయన జీవితములో నెరవేరిన ప్రవచనములు ధర్మశాస్త్ర సంబంధమైన వివాదములు, ఇతర సువార్తలో ప్రాముఖ్యముగా కనిపించు యూదుల సంప్రదాయములు మున్నగునవి విడువబడినవి.

ముఖ్య పద సముదాయము : దాసుడైన యేసు.

ముఖ్య వచనములు : మార్కు 10:43-45; మార్కు 8:34-37.

ముఖ్య అధ్యాయము : 8వ అధ్యాయము. పేతురు – నీవు క్రీస్తువని ఆయనతో చెప్పిన విశ్వాస వాక్యమే అధ్యాయములో ప్రధాన సంఘటన. విశ్వాసముతో కూడిన ఈ ఒప్పుకోలు యేసు సేవలో ఒక నూతన పద్ధతి ప్రారంభమగుటకు కారణమైనది. అప్పటి నుండియు ప్రధానయాజకులు మున్నగు వారి వలన తాను పొందబోవు శ్రమలను తన మరణమును తన శిష్యులు ఎదుర్కొనవలెనని వారిని సంసిద్ధులుగా చేసెను. అక్కడ సంపూర్ణ బానిసగా సిలువ మరణము పొందుట ద్వారా దేవుని మహిమను వెల్లడించెను.

గ్రంథ విభజన : ఇది సువార్తలన్నింటిలో క్లుప్తమైనది. సులభ గ్రాహ్యమైనది. ఈ పుస్తకము యేసు జీవిత సంఘటనలు వేగముగా చూచుటకు చదువరులకు సహాయపడుచున్నది. యేసు చేసిన బోధలకంటె ఆయన సేవకు అధికముగా ప్రాముఖ్యతనిస్తున్న దీనిలో రెండు ముఖ్య భాగములు గలవు. మొదటి భాగము 1 – 11 అధ్యాయములు – యేసు పరిచర్యను, రెండవ భాగము 12 – 16 అధ్యాయములు, యేసు త్యాగమును తెలుపుచున్నవి. గ్రంథ విభజన వివరముగా ఈ క్రింద నీయబడినది.

1.సేవకుని పరిచర్య 1 – 10 అధ్యాయములు. (a). సేవకుని ఆగమనము Mark,1,1-2,12. (b). సేవకుడు ఎదుర్కొని ఆటంకములు Mark,2,13-8,26. (c). సేవకుడిచ్చిన ఉపదేశములు Mark,8,27-10,52.

సేవకుని త్యాగము : 11 – 16 అధ్యాయములు. (a). సేవకుడు నిరాకరింపబడుటకు, Mark,11,1-15,47. (b). సేవకుని పునరుత్థానము మార్కు 16:1-20
సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో 41 వ పుస్తకము. – అధ్యాయములు 16; వచనములు 678; ప్రశ్నలు 121; నెరవేరిన పాత నిబంధన ప్రవచనములు 11; క్రొత్త నిబంధన ప్రవచనములు 30; చారిత్రాత్మక వచనములు 582; నెరవేరిన ప్రవచన వాక్యములు 43; నెరవేరనున్న ప్రవచన వాక్యములు 53.

Matthew – మత్తయి సువార్త

యూదుడు యూదుని గూర్చి యూదులకు వ్రాసిన సువార్తయే మత్తయి సువార్త. ఇందు మత్తయి రచీత, యూదులు చదవరులు, యేసుక్రీస్తును గూర్చిన ప్రస్తావన. యేసును యూదుల రాజుగా, దీర్ఘకాలము నుండి ఎదురు చూస్తున్న మెస్సీయగా తెలియజేయుటయే మత్తయి యొక్క ఉద్దేశం. ఆయన వంశావళి, బాప్తిస్మము, అద్భుత కార్యములు మొదలగునవన్నియు యేసు రాజని మార్పులేని ఒకే ఉద్దేశములోనికి చదవరుల దృష్టిని నడిపించుచున్నవి. ఈ రాజు మరణము చెందుట వలన మొదట తన దృష్టికి ఓటమిగా అనిపించినప్పటికీ ఆయన పునరుత్థానము చెందుట ద్వారా విజయకరముగా మారెనని భావించెను. యూదుల రాజు జీవించుచుండెను అను సందేశము పదే, పదే ప్రతిధ్వనించుచుండెను.

మత్తయి అనే పేరుకు దేవుని దానం అనే అర్థం కలదు. మత్తయికి లేవీ అనే మరొక పేరు కూడా కలదు. (మార్కు 2:14; లూకా 5:27)

ఉద్దేశము : నిత్యుడైన రాజు, మెస్సీయ అని యేసును నిరూపించుట.

గ్రంథకర్త : మత్తయి (లేవీ)

కాలము : క్రీ.శ 60 – 65కు మధ్యలో

గత చరిత్ర : రోమా గౌరవ్నమెంటు కోసం సుంకమును వసూలు చేయు ఒక ఉద్యోగస్తుడైన మత్తయి. ఇతడు యేసు ప్రభువు యొక్క శిష్యుడుగా మారెను. ప్రవచనముల నెరవేర్పుకు దృఢత చేకూర్చుట ద్వారా యీ సువార్తను పాత, క్రొత్త నిబంధనలను కలిపె గొలుసువలె నుండెను.

ముఖ్య వచనములు : ధర్మశాస్త్రమునైనను, ప్రవక్తల వచనముల నైనను కొట్టివేయు వచ్చితినని తలంచవద్దు నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు మత్తయి 5:17

ప్రముఖ వ్యక్తులు : యేసు, మరియ, యోసేపు, బాప్తీస్మమిచ్చు యోహాను, యూద మత గురువులు పెద్దలు, కయప, ఫిలాతు, మగ్దలేనే మరియ, యేసు శిష్యులు.

ముఖ్య స్థలములు : బెత్లెహేము, యెరూషలేము, కపెర్నహూము, గలలియ, యూదయ.

గ్రంథ విశిష్టత : ఈ సువార్త ఒక మెస్సీయ శైలిలో రచింపబడెను. (ఉదాహరణకు దావీదు సంతతివాడు అని పలుమారు ఉపయోగించెను. పాత నిబంధన వాక్యములు యాభైమూడు, స్పష్టముగా లేని డెభైరు హెచ్చరికలు ఇందులో కలవు, సంభవములు కాలక్రమమును అనుసరించి ఇవ్వబడలేదు. యేసును మెస్సీయగాను రాజుగా నిరూపించుటయే ముఖ్య ఉద్దేశం.

ముఖ్య పద సముదాయము : యేసు అను రాజు.

ముఖ్య వచనములు : మత్తయి 16:16-19; 28,19-20}

ముఖ్య అధ్యాయము : 12

పండ్రెండ అధ్యాయములో పరిసయ్యులు యేసును ఇశ్రాయేలు జనులకు నాయకత్వం వహించు స్థానము నుండి బహిరంగముగా ఆయనను తృణీకరించెను. యేసు ప్రభువు యొక్క శక్తి దేవునిని నుండి కాక సాతాను నుండి వచ్చుచున్నదని వారు చెప్పుటతో మత్తయి సువార్త ఒక మలుపు తిరుగుచున్నది. సాధారణ ప్రజలకు యేసు ప్రభువు బోధించునపుడు ఉపమానములతో బోధించుచు ఆయన శ్రద్ధ ముఖ్యంగా తన శిష్యులకు తర్ఫీదునిచ్చునట్లు త్రిపచుండెను. ఈ సందర్భములోనే తన సిలువ మరణము సమీపించుచున్నదని పలుమార్లు చెప్పుచుండెను.

గ్రంథ విభజన : మత్తయి సువార్తను క్రొత్త నిబంధనలో మొదటి గ్రంథముగా చేర్చుటతో కొన్ని కారణములు లేకపోలేదు. 1వ అధ్యాయము, 1వ వాక్యము గమనించినచో అబ్రాహాము కుమారుడగు దావీదు. కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. ఈ ప్రారంభములోని సత్యమును పలుమారు మారులు చెప్పుట ద్వారా ఈ సువార్త పాత, క్రొత్త నంబంధనలను కలిపే వంతెన వలె ఉండెను. యేసుక్రీస్తు యొక్క ప్రాముఖ్య మైన ఐదు ప్రసంగము యీ సువార్తలో నుండెను. కొండ మీద ప్రసంగము (Mat,5,3-7,27) శిష్యులకు కావలసిన బోధ (మత్తయి 10:5-42) పరలోక రాజ్యమును గూర్చిన ఉపమానములు (మత్తయి 13:3-52) శిష్యత్వమునకు కావలసిన విధులు (మత్తయి 9:3-38) ఒలీవ కొండ పై ప్రసంగం (Mat,24,3-25,46) మొదలగునవన్ని యేసు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తుగా చూపుచున్న ఈ సువార్త గ్రంథ విభజన ఈ క్రింది విధముగా నున్నది.

రాజు వంశావళి, రాకడ Mat,1,1-4,11. • రాజు కట్టడలు Mat,4,12-7,29. రాజు అధికారము Mat,8,1-11,1. • రాజు తృణీకరింపబడుట Mat,11,2-16,12. • రాజు రాయబారుల సిద్ధపాటు Mat,16,13-20,28. • రాజుగా నగర ప్రవేశము, నిరాకరింపబడుట Mat,20,29-27,66. • రాజు అధికార నిరూపణ మత్తయి 28:1-20.
సంఖ్యా వివరములు : – పరిశుద్ధ గ్రంథములో ఇది 40వ పుస్తకము; అధ్యాయములు 28; వచనములు 1071; ప్రశ్నలు 177; నెరవేరిన పాతనిబంధన ప్రవచనములు 25; క్రొత్త నిబంధన ప్రవచన వాక్యములు 47; చరిత్రాత్మక వచనములు 815; ప్రవచన వాక్యములు 256; నెరవేరిన ప్రవచనములు 164; నెరవేరని ప్రవచనములు 92.

Malachi – మలాకీ

నెహెమ్యా కాలములలో జీవించియుండిన ప్రవక్తయైన మలాకీ ఇశ్రాయేలీయుల ఆత్మీయ పతనమునకు విరోధముగా దేవుని సందేశములను ప్రవచించుటకు ఏర్పరచుకొనబడినవాడు. మోసాలు చేయు యాజక సమూహములకును, క్రూర హింసలతో కూడిన జీవిత విధానముగల ప్రజలకును మలాకీ దేవుని వర్తమానములను ప్రకటించెను, ప్రజలు మేము దేవుని ప్రజల మనియు మాకు విశేష వాగ్దానములు గలవనియు మేము మిక్కిలి క్షేమముగా నున్నామనియు గర్వపడుచుండిరి. వారు మిక్కిలి హేయమైన ప్రవర్తన గల దుష్టతరము వారైయుండిరి. అట్టివారికి మలాకీ దేవుని సందేశములను అందించుచున్నాడు. మలాకీ ప్రశ్నలు వేయుట, జవాబులు చెప్పుట అను పద్ధతి అనుసరించెను. వారి వేషధారణను, మిశ్రమ వివాహ పద్ధతిని, విడాకుల ద్వారా వివాహములను రద్దుచేసికొను విధానమును, భక్తి లేని కేవలము ఆచారములతో కూడిన ఆరాధనను, అసూయతో నిండిన వినాశకరమైన జీవన విధానమును నిశితముగా పరిశీలించిన మలాకీ తీవ్రపద జాలముతో యూదులను గద్దించెను. అటు తరువాత దేవుడు 400 సంవత్సరము పర్యంతము మౌనముగా నుండెను. అనగా ఆ 400 సంవత్సరములలో ఒక్క ప్రవక్త కూడ ప్రవచించలేదు. తరువాత (మలాకీ 3:1)లో చెప్పబడిన ప్రకారము బాప్తీస్మమిచ్చు యోహాను ద్వారా దేవుడు తన ప్రవచన స్వరమును వినిపింపజేసెను. మలాకీ అనగా నా దూత అని అర్థము. బహుశ ఇది యెహోవా దూత అను అర్థమిచ్చు మలాకాయహా అను నామమునకు సంక్షిప్త రూపమై యుండవచ్చును. క్రొత్త నిబంధన దూతయైన బాప్తీస్మమిచ్చు యోహానును గూర్చి తెలియజేయుచున్న ఈ గ్రంథమునకు ఈ పేరు తగియున్నది. మలాకీ 2:7; మలాకీ 3:1 మున్నగు వచనములలో వివాదములు లేవు. గ్రంథమంతా ఒకరి చేతనే వ్రాయబడియున్నది అను విషయములో భిన్నాభిప్రాయములు లేవు. సంభాషణా ధోరణి గ్రంథమంతటా వ్యాప్తి చెంది యున్నది. ఈయనను గూర్చి తెలిసికొనుట ఇతర ఆధారములు ఏవియు లేవు. ఈయన తండ్రి పేరు అయినను మనకు లభించుట లేదు. అయినను ఈయన ఒక సమాజమందిర సభ్యుడు అని యుదా పారంపర్యము నమ్ముచున్నది.

మలాకీ కాలము : మలాకీ గ్రంథ కాలమును నిర్ణయించుటకు తగిన ఆధారములు లేనప్పటికిని, ఈ గ్రంథములోనే ఇవ్వబడిన కొంత సమాచారమును బట్టి ఈయన కాలమును గుర్తించుచున్నాము. మలాకీ 1:8 లో వ్రాయబడిన అధికారి అను పదము హగ్గయి 1:1; హగ్గయి 1:14; హగ్గయి 2:21 లలో కనిపించుటను బట్టి ఇశ్రాయేలీయులు పారశీకపాలకులకు లోబడియున్న కాలములో క్రీ.పూ 539 – 333 ఈ గ్రంథము వ్రాయబడి యుండునని తలంచవచ్చును. క్రీ.పూ 516లో పునర్నిర్మింపబడిన యెరూషలేము దేవాలయములో ఆ గ్రంథ రచనా కాలములో బలులు అర్పింపబడుచున్నవి (మలాకీ 1:7-15; మలాకీ 3:8) ఈ విధముగా బలులు అలవాటు మరల ప్రారంభింపబడిన తరువాత కొన్ని సంవత్సరములకు ఈ గ్రంథ రచన జరిగియుండును. బలియర్పణ పురాతన ఆచారము. చాలనియమములు పాటించవలసి యుండగా మలాకీ కాలములో నియమ పాలన జరుగలేదు. లోపము గల వాటిని బలి అర్పించుట హేయముగా నుండెను. మరియు నెహెమ్యా కనుగొనిన లోపమునే మలాకీ కూడ చూచెను. వారు కనుగొన్న సమస్యలు ఈ క్రింద విధముగా నున్నవి.

నీచులైన యాజకులు (మలాకీ 1:6; మలాకీ 2:9; నెహెమ్యా 13:1-9). 2. దశము భాగములను, కానుకలను నిర్లక్ష్యము చేయుట (మలాకీ 3:7-12; నెహెమ్యా 13:10-13). 3. అన్యజనులతో వివాహ బంధము మలాకీ 2:10-16; నెహెమ్యా 13:23-28.
నెహెమ్యా యెరూషలేము పట్టణ ప్రాకరములను కట్టుటకు క్రీ.పూ. 444లో యెరూషలేముకు వచ్చెను. ఎజ్రా దేవాలయ నిర్మాణమును ప్రారంభించి అప్పటికి 13 సంవత్సరములు గతించినవి. క్రీ.పూ 432లో నెహెమ్యా మరల పారశీక దేశమునకు వెళ్లెను. తరువాత క్రీ.పూ 425లో అతను మరల యెరూషలేమునకు వచ్చెను. అప్పడతడు ఇశ్రాయేలీయులలోనున్న వివిధ పాపపు అలవాటులను మార్చి వేసెను. కావున నెహెమ్యా యెరూషలేములో లేని కాలములో అనగా క్రీ. పూ. 432, 425ల మధ్య కాలములో మలాకీ ప్రవచించెనని అభిప్రాయపడుట మిక్కిలి తగినదైయున్నది. గ్రంథము హగ్గయి, జెకర్యా ప్రవక్తల కాలమునకు (క్రీ.పూ. 420) నూరు సంవత్సరముల తరువాత వ్రాయబడి యుండవచ్చు.

ముఖ్య పద సముదాయము : వెనుకంజ వేసిన వారికి ఆహ్వానము.

ముఖ్య వచనములు: మలాకీ 2:17; మలాకీ 3:1; మలాకీ 4:5-6

ముఖ్య అధ్యాయము : 3

పాతనిబంధనలోని ఈ చివరి గ్రంథము యేసు క్రీస్తును గూర్చియు, ఆయనకు ముందుగా పంపబడిన బాప్తీస్మమిచ్చు యోహానును గూర్చియు ప్రవచించుటతో ముగింపబడుచున్నది. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మలాకీ 3:1 నాలుగు వందల సంవత్సరముల దీర్ఘకాల ప్రవచన లేమిని తొలగించి ఇదిగో అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము. ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడి అను పలుకులతో యెహాను బయలుపరచబడెను. అప్పుడు యోర్దాను నదీ తీరమున ఉన్న యోహాను వద్దకు ఇశ్రాయేలు ప్రజలు కూడి వచ్చిరి. మలాకీ 3 , 4 అధ్యాయములు మెస్సీయా రాకడను, ఆయనకు ముందుగా రానున్న దూత రాకడను గూర్చియు ప్రవచించుట ద్వారా పాత నిబంధనకును, క్రొత్తని బంధనకును నడమ ఒక వంతెనగా నిలువబడుచున్నవి.

గ్రంథవిభజన : ప్రశ్నలు – జవాబులతో కూడియుండి సంభాషణా రూపమును మలాకీ దేవుని సందేశమును ప్రజల ముందు క్లుప్తముగా బోధించెను. ఈ సందేశముతో పాతనిబంధన ముగియుచున్నది. మలాకీ ఇశ్రాయేలీయులకు సంబంధించిన మూడు ముఖ్య విషయములను ప్రవచించుచున్నాడు.

1.యూదా ప్రజల ఆత్మీయ స్థితి మలాకీ 1:1-5 2.యూదుల అప విత్రత Mal,1,6-3,15 3.యూదుల కొరకు వాగ్దానములు. Mal,3,16-4,6

(a). జ్ఞాపకార్ధ గ్రంథములో వ్రాయబడియున్నవారి ఫలితములు మలాకీ 3:16-18 (b). క్రీస్తు రాకడవలన సంభవించు ఫలితములు మలాకీ 4:1-3 (c). ఏలీయా రాకడను గూర్చిన ప్రవచనములు మలాకీ 4:4-6

సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో ఇది 39వ పుస్తకము; చివరి పుస్తకము . అధ్యాయములు 4; వచనములు 55; ప్రశ్నలు 27; ఇశ్రాయేలీయులు పాపములు తెలుపు వాక్యములు 32; ఆజ్ఞలు 5; వాగ్దానములు 5; హెచ్చరికలు 30; ప్రవచన వాక్యములు 19; నెరవేరిన ప్రవచనములు 6; నెరవేరనున్న ప్రవచనములు 13; దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 28.

Zechariah – జెకర్యా

బబులోను చెర తరువాత కాలమునకు చెందిన ప్రవక్త జెకర్యా. ఈయన బబులోనులో పుట్టిన లేవీయుడు, (నెహెమ్యా 12:16) చెరసాల చరిత్రను తరచిచూచిన యెడల ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు క్రీ.పూ. 722లో అషూరు సైన్యమునకు లొంగిపోయి దీనావస్థలో పడెను. దక్షిణ దేశమైన యూదాకు ఇట్టి దుస్థితి క్రీ.పూ. 586లో బబులోను రాజైన నెబుకద్నెజరు దండయాత్ర ఫలితముగా తటస్థించెను. యూదులలో అనేకులు సుమారు 70 సంవత్సరములు బబులోను దాస్యములో నుండిరి. క్రీ.పూ. 539లో పారశీక మహా సామ్రాజ్యము బబులోను మహాసామ్రాజ్యమును జయించెను. పారశీక సామ్రాజ్యపు నూతన విదేశీ విధానము మూలమున యూదులు స్వదేశమునకు మరల వలెననియు, నెబుకద్నెజరు దండెత్తి కొల్లగొట్టి నాశనము గావించిన వారి దేవాలయమును పునర్నిర్మాణముగావించవలెననియు కోరేషు ఆజ్ఞ వెలువడెను. ఈ ఆజ్ఞననుసరించి జెరుబ్బాబెలు (ఇతడు తరువాత గవర్నరుగా నియమింపబడెను) యొక్కయు యాజకుడైన యెహోషువ యొక్క నాయకత్వమున సుమారు 50,000 మంది యూదాకు తిరిగివచ్చిరి. ఇట్లు వచ్చిన వారిలో ప్రవక్తయైన జెకర్యా ఒకడు. యెరూషలేమునకు రాగానే వారు పూర్వ ప్రకారంగా ఒక బలిపీఠమును కట్టి దేవునికి బలి అర్పించారు. (ఎజ్రా 3:1-6) వారు తమ స్వదేశమునకు వచ్చిన తరువాత రెండవ సంవత్సరములోనే దేవాలయమును కట్టుటకు పునాది వేసిరి. (ఎజ్రా 3:8-13; ఎజ్రా 5:16) కాని వెలుపటి ఆటంకముల మూలమునను, లోపటి సమస్యల మూలమునను దేవాలయ నిర్మాణము 16 సంవత్సరముల ఆటంకపరచబడినది. అటు తరువాత పారశీకరాజైన దర్యావేషు కాలమున (క్రీ.పూ. 522 – 486) మరల దేవాలయ నిర్మాణము ప్రారంభింపబడియున్నది. దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరమున (క్రీ.పూ. 520లో) యెహోవా హగ్గయిను దేవాళయ నిర్మాణపు పనికి ప్రోత్సాహమిచ్చుటకు లేపెను. హగ్గయి నాలుగు నెలల వ్యవధిలో నాలుగు వర్తమానములను అందించి తన పరిచర్యను పూర్తిచేసికొనెను. హగ్గయి తరువాత జెకర్యా అదే పరిచర్యను చేపట్టెను. (హగ్గయి 1:1; జెకర్యా 1:1) జెకర్యా ఖండించి బుద్ధి చెప్పు ఉపదేశ మార్గమును పాటించలేదు. తమ ఉజ్జ్వల భవిష్యత్తు కొరకును దేశాభివృద్ధి కొరకును దేవాలయ నిర్మాణము చేపట్టుట ఎంత ప్రాముఖ్యమో ప్రజలకు వివరించెను. ప్రజలు గొప్ప స్ఫూర్తితో దేవాలయ నిర్మాణములో ముమ్మరముగా పాల్గొనిరి. క్రీ.పూ. 516లో దేవాలయ నిర్మాణ పని పూర్తియైనది నిర్మాణమునకు సహాయపడిన దర్యావేషు తరువాత అహష్వేరోషు. (క్రీ.పూ 486 – 464) ఈ అహష్వేరోషే వస్తిని రాణి పదవి నుండి తొలగించి ఎస్తేరును పారశీక దేశపు రాణిగా చేసికొనెను. జెకర్యా అను నామమునకు “యెహోవా జ్ఞాపకము చేసికొనును” అని అర్థము. ఇదే భావము గల సందేశము ఈ గ్రంథములో అధికముగా వ్యాపించియున్నది. ఇశ్రాయేలీయుల మూల పితరులతో తాను చేసిన నిబంధనలను యెహోవా ఇప్పుడు జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. దీనిని బట్టి వారు ఆశీర్వదింపబడిన వారుగా నుందురు.

గ్రంథకర్త : జెకర్యా. పరిశుద్ధ గ్రంథములో జెకర్యా అను పేరుగలవారిని సుమారు ముప్పది మందిని చూడగలము. మగ సంతానము కలిగినందుకు దేవునికి కృతజ్ఞత తెలుపుకొనుటకు గుర్తుగా వారికి ఈ పేరు పెట్టబడియుండును. తన పితరులైన యిర్మీయా, యెహెజ్కేలు వంటి వారివలె ఈయనయు యాజక కుటుంబములో జన్మించిన ఒక యాజకుడు. ఈయన బెరక్యా కుమారుడు. ఇదోకు మనుమడు. (జెకర్యా 1:1-7; ఎజ్రా 5:1; ఎజ్రా 6:14; నెహెమ్యా 12:4-16) దేవుడు ఈయనను బాల్యములోనే పిలిచి ప్రవక్తగా ప్రత్యేకించుకొనెను. బెరక్యా కుమారుడైన ఈ జెకర్యా – యూదా పారంపర్య ప్రకారము లేఖనములను సమకూర్చు దేవాలయ సంఘ సభ్యులలో ఒకడుగా నుండెను. ఈయన దేవాలయమునకు బలిపీఠమునకు మధ్య మిక్కిలి దారుణముగా చంపబడెను. (మత్తయి 23:35) మరియొక జెకర్యాయును ఇదే విధముగా హత్య గావింపబడెను. (2 దినవృత్తాంతములు 24:20-21) జెకర్యా గ్రంథమును సంపూర్ణముగా వ్రాసినవాడు బెరక్యా కుమారుడైన జెకర్యాయేనని యూదా పారంపర్యము, క్రైస్తవ పారంపర్యము సాక్ష్యమిచ్చుచున్నది.

కాలము : క్రీ.పూ. 480 – 470 మధ్య కాలమని భావింపబడుచున్నది.

ముఖ్య పదసముదాయము : మెస్సీయ కొరకు సిద్ధపడుడి.

ముఖ్య వచనములు : జెకర్యా 8:3; జెకర్యా 9:9.

ముఖ్య అధ్యాయము : 14. జెకర్యా ప్రవచనము ఈ 14వ అధ్యాయము శ్రేష్ఠమైన ఒక అంశమును చెప్పుచున్నది. యెరూషలేము ముట్టడింపబడుట, ఇశ్రాయేలీయుల విరోధులు మొదటిగా విజయము పొందుటను వివరించిన తరువాత ఒలీవల కొండ రెండుగా విడిపోవుటయు, యెరూషలేము యెహోవా చేత రక్షింపబడుటయు జరుగును. యెహోవా దర్శనము జరుగును. అన్యజనులు దేవుని తీర్పుననుసరించి శిక్షింపబడుదురు. ఇశ్రాయేలు దేశము పూర్వ ఔన్నత్యమును పొందును. యూదా పునరుద్ధరింపడును. దేవుడేర్పరచిన పర్ణశాలల పండుగ ఆచరింపబడును. యెరూషలేము ప్రతిష్టిత పట్టణమగును. మున్నగు అంశములన్నియు ఈ అధ్యాయమునందు వర్ణింపబడెను.

గ్రంథవిభజన : ఈ గ్రంథములోని మొదటి 8 అధ్యాయములు దేవాలయమును నిర్మించుటకు యూదులకు ఇవ్వబడిన ప్రోత్సాహములు. తరువాత వచ్చు 6 అధ్యాయములు – దేవాలయ నిర్మాణము పూర్తియైన పిమ్మట మెస్సీయ రాకడ కొరకు ప్రజలు ఎదురు చూచుటకు తోడ్పడు హితోపదేశములు. అన్యజనుల పాలనలో నుండి మెస్సీయ పరిపాలనలోనికిని, శ్రమలలో నుండి సమాధానము లోనికిని, అపవిత్రతలో నుండి పవిత్రతలోనికిని యూదులను తెచ్చుగొప్ప మార్పులు ఈ చివరి భాగములో చెప్పబడినవి. గ్రంథములో వ్యక్తపరచబడిన మూడు భాగములు ఈ క్రింది విధముగానున్నవి.

ఎనిమిది దర్శనములు : 1 – 6 అధ్యాయములు 2. నాలుగు వర్తమానములు : 7, 8 అధ్యాయములు 3. రెండు హృదయ భారములు : 9 – 14 అధ్యాయములు
సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో ఇది 38వ పుస్తకము. అధ్యాయములు 14; వచనములు 211; ప్రశ్నలు 27; ఆజ్ఞలు 35; వాగ్దానములు 4; హెచ్చరికలు 226; ప్రవచన వాక్యములు మొత్తము 122; నెరవేరిన ప్రవచనములు 31; నెరవేరనున్న ప్రవచనములు 91; దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 59.

Haggai – హగ్గయి

గ్రంథకర్త : హగ్గయి

హగ్గయి కాలము : క్రీ.పూ 538లో పారశీక రాజైన కోరెషు – యూదులు తమ స్వదేశమునకు తిరిగి వెళ్ల వలెననియు, యెరూషలేములోని దేవాలయమును పునర్నిర్మాణము గావించవలెననియు ఆజ్ఞాపించెను. స్వదేశమునకు వచ్చిన మొదటి గుంపు ప్రజలకు జెరుబ్బాబెలు నాయకుడుగా నుండెను. క్రీ.పూ 536లో దేవాలయ నిర్మాణము ప్రారంభమాయెను. ఎజ్రా 4 నుండి 6 అధ్యాయములు – హగ్గయి ప్రవచన కాలమును వివరించుచున్నవి. అక్కడ జీవించుచుండిన సమరయులు దేవాలయ నిర్మాణమును నిలిపివేయవలెనని కోరుచు పారసీక రాజ్యమునకు లేఖ వ్రాసియుండిరి.

ఈ ఆటంకములను చూచి యూదులు అధికముగా నిరుత్సాహపడిరి. స్వదేశమునకు తిరిగి వచ్చుచు వారికి ఉన్న మంచి విశ్వాసము సడలెను. దేశములోనున్న శిథిలస్థితి, పంటలు లేకపోవుట, పునర్నిర్మాణమునకు జెందిన కఠినమైన పని, సమరయుల ఆటంకములు వారి మనస్సులను బహుగా నిరుత్సాహపరచెను. విదేశీయులతో పోరాడుట కంటే, దేవాలయ నిర్మాణమును నిలిపి వేయుటయే మంచిదని వారికి తోచెను. ఈ విధముగా రెండు సంవత్సరములు జరిగిన తరువాత క్రీ.పూ 534లో వారు దేవాలయ నిర్మాణమును నిలిపివేసిరి. జనులలోని మానసిక నిరుత్సాహము వారిని ఆత్మీయముగా వెనుకంజ వేయించుకొనుటలోను నిమగ్నులైరి. వారి అవసరములకు ఇండ్లు కట్టుటకు మొదటి స్థానమిచ్చిరి. దేవాలయ విషయములో అశ్రద్ధచూపుటకు వారు పలు సాకులు వెదకసాగిరి. రాజకీయముగా ఎదురైన ఆటంకము, యెరూషలేము ప్రాకారమును కట్టకముందు దేవాలయమును నిర్మించకూడదను ఆలోచన మున్నగునవి వారు చూపుచున్న కొన్ని సాకులు.

ఇట్టి సమయములో దేవాలయ నిర్మాణమును పూర్తి చేయవలెనని ప్రజలను ప్రోత్సహించుటకును, వారిలో నూతనోత్సాహమును పుట్టింపవలెననియు, దేవుడు ప్రవక్తలైన హగ్గయిని, జెకర్యాను లేపాడు. ఈ రెండు గ్రంథములు వ్రాయబడిన కాలములను ఆ గ్రంథముల పుటల నుండియే తెలిసికొనగలము. హగ్గయి గ్రంథము క్రీ.పూ 520లోను, జెకర్యా గ్రంథము క్రీ.పూ 519 – 518 లో వ్రాయబడి యుండును. ఈ ప్రవచనముల ఫలితముగా – 14 సంవత్సర కాలము నిర్లక్ష్యము చేయబడిన దేవాలయ నిర్మాణము క్రీ.పూ 520లో మరల ప్రారంభింపబడి క్రీ.పూ 516లో ముగింపబడినది.

హగ్గయి జెకర్యాలు ప్రవచించిన కాలములో క్రీ. పూ521 – 486 మొదటి దర్యావేషు రాజు పారశీక రాజ్యమును పాలించుచుండెను. ఈతని పై విరోధముగా లేచిన అనేక దేశములను జయించి యూదా దేశమును బలపరచి రాజ్యపాలన గావించెను.

ముఖ్య పదజాలము : దేవాలయమును నూతనముగా నిర్మించుట

ముఖ్యవచనములు: హగ్గయి 1:7-8; హగ్గయి 2:7-9.

ముఖ్య అధ్యాయము- 2

పరిశుద్ధ గ్రంథములోనున్న వాగ్దానములలోని మనలను బలముగా ఆకర్షించి, నిలువబెట్టి యోచింపజేయగల కొన్ని వాగ్దానములను హగ్గయి 2:6-9 లో చూడగలము.

గ్రంథ విభజన : ఉపదేశ పూర్వకమైన హగ్గయి ప్రవచన గ్రంథమును నాలుగు ముఖ్య భాగములుగా విభజింప వచ్చును.

దేవాలయ నిర్మాణమును పూర్తి చేయుట కొరకు ఉపదేశము : హగ్గయి 1:1-15.
2.దేవాలయము – దాని పూర్వ వైభవము హగ్గయి 2:1-9.

3.లోబడిన వెంటనే కలుగు ఆశీర్వాదములు హగ్గయి 2:10-19

4.భవిష్యత్తులో ఆశీర్వాదముల నిత్తునను వాగ్దానము హగ్గయి 2:20-23.

సంఖ్యా వివరములు: పరిశుద్ధ బైబిలులో ఇది 37వ పుస్తకము ; అధ్యాయములు 2; వచనములు 38; ప్రశ్నలు 8; ఆజ్ఞలు 9; వాగ్దానములు 3; ముందు జాగ్రత్తలుగా హెచ్చరికలు 14; ప్రవచన వాక్యములు 9; నెరవేరినవి 6; నెరవేరనున్నవి 3; దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 5.

Zephaniah – జెఫన్యా

ఇశ్రాయేలు దేశము రెండు ముక్కలుగా చీలగా, యెరూషలేము రాజధానిగానున్న దక్షిణ రాజ్యమే, యూదా దేశము. దీని ఆత్మీయ, రాజకీయ చరిత్రలలో పునరుద్ధీకరణలు, పరిశుద్ధ పరచబడుట పలుమారు జరిగియున్నవి. ఆమోను కుమారుడైన యోషీయా పరిపాలనా కాలములో ఇట్టి సంఘటన యొకటి సంభవించెను. అనగా దేవుని వైపు మళ్లుకొనుట జరిగెను. శుద్ధీకరణ పొందుటకై జెఫన్యా ప్రజలకిచ్చిన

ఆహ్వానము యోషీయా కాలములో జరిగిన ఉజ్జీవమునకు ప్రోత్సాహములను ఇచ్చియుండును. ఈ కాలములో యూదా ప్రజల జీవితములో బాహ్యముగా పలుమార్పులు కలిగినవి. అయినను ప్రజల అంతరంగములలో తగినంత మార్పు రాలేదు. శుద్ధీకరణ కొంతవరకే ప్రయోజన కరముగా నుండెను. కావున అప్పటి పరిస్థితులకు అనుగుణంగా జెఫన్యా – మహాభయంకరమైన యెహోవా దినము రాబోవుచున్నది. అప్పుడు ప్రతిపాపము ప్రతి దుష్టత్వము మిక్కిలి కఠినముగా దండింపబడును అని ఉచ్చై స్వరముతో ప్రవచించెను. దేవుని కోపాగ్నికి యూదాదేశముతో బాటు దాని చుట్టునున్న దేశములు కూడ కాలిపోవునని జెఫన్యా ప్రవచించెను. ప్రవచనము ప్రకారము వినాశము సంభవించిన తరువాత మిగిలిన ప్రజలు మెస్సీయ పరిపాలనా కాలముతో మహిమకరమైన ఆశీర్వాదములను స్వతంత్రించుకొందురు. అప్పుడు స్తోత్రమును సంతోషమును కలుగును అని జెఫన్యా ప్రవచించాడు. జెఫన్యా అనగా యెహోవాదాచును అని అర్థము. మిక్కిలి దుష్టుడైన రాజైన మనష్హే పరిపాలన ఉత్తరార్థములో జెఫన్యా జన్మించాడు. మనష్హె క్రూరత్వము నుండి యెహోవా అతనని మరుగుచేశాడు అను విషయమును ఈ నామము సూచిస్తుంది.

గ్రంథకర్త : గ్రంథములో వ్రాయబడిన ప్రథమ వచనము, దానిని వ్రాసిన జెఫన్యాను కొంచెము భిన్నమైన రీతిలో పరిచయము చేస్తున్నది. జెఫన్యా తన వంశమునకు చెందిన నలుగురు రాజుల నామములను ఈవచనములో వ్రాస్తున్నాడు. దీనిని బట్టి జెఫన్యా యూదా రాజుల వంశస్థుడనియు, అతడు ప్రవక్త ఆయెననియు తెలియుచున్నది. ఈ బంధుత్వము బట్టి రాజు సన్నిధిలో మంచి పదవిని, దేవుని వర్తమానమును ప్రకటించు స్వాతంత్ర్యమును కలిగియుండును. జెఫన్యా 1:6 లో యెరూషలేమును గూర్చి ఈ స్థలములో అని చెప్పుచున్నాడు. అంతమాత్రమే కాకుండా యెరూషలేమునకు గల ప్రత్యేకత అనేక వచనములలో చెప్పబడినది జెఫన్యా 1:9-10; జెఫన్యా 3:1-7. దీనిని బట్టియు జెఫన్యా యెరూషలేము నివాసీ అని తెలియుచున్నది.

కాలము : ఆమోను కుమారుడైన యోషీయా దినములలో అని గ్రంథము ప్రారంభమగుచున్నది. కావున యోషీయా కాలమును బట్టి జెఫన్యా కాలమును నిర్ణయింపగలుగుచున్నాము. యోషీయా క్రీ.పూ 640 నుండి 609 వరకు పాలించెను. జెఫన్యా 2:13 లో నీనెవె పతనము క్రీ.పూ . 612లో జరిగినది. కావున జెఫన్యా క్రీ.పూ 612 కంటె ముందే ప్రవచించెనని తెలియుచున్నది. కావున జెఫన్యా ప్రవచించిన కొలతలు క్రీ. పూ 640 – 621 మధ్య కాలమని భావింపవచ్చును. ఈ కాలమును నిర్ణయించుటకు గల ఆధారములను ఇంకను స్పష్టముగా పరిశీలింతుము. జెఫన్యా 1:3-13; జెఫన్యా 3:1-7 మున్నగు వాక్య భాగములలో వివరింపబడియున్న పాపముల పట్టికను పరిశీలించినచో ఈ వాక్యములు యోషీయా చేపట్టిన పునరుద్ధరణకు ముందుగా వ్రాయబడెననుట సుష్పష్టము. ఆయన ప్రవచించిన కాలములో మనషె కాలములో ఆమోను కాలములో బలపడిన పాపస్థితి కొనసాగుచునేయున్నది.

యోషీయా 8 సంవత్సరములవయస్సులో రాజాయెను. 16 సంవత్సరముల వయస్సులో ఆయన హృదయము దేవుని వైపు తిరుగసాగెను. అతడు తన పునరుద్ధీకరణ కార్యక్రమమును తన 12వ సంవత్సరమున ప్రారంభించెను. (క్రీ.పూ 628 లో 2 దినవృత్తాంతములు 24:3-7) బయలు దేవతాబలిపీఠమును పడగొట్టెను; ఉన్నత స్థలములను కూల్చివేసెను. విగ్రహములను ధ్వంసముచేసెను. అతడు యూదాదేశమును యెరూషలేమును శుద్ధీకరించెను. మరల 6 సంవత్సరములకు పిమ్మట క్రీ.పూ. 622 లో యాజకుడైన హిల్కియా, దేవాలయములో కనుగొనిన ధర్మశాస్త్ర గ్రంథమును చదివిన తరువాత మరియొక మారు, శుద్ధీకరణను చేపట్టుటకు పూనుకొనియుండెను. (2 దినవృత్తాంతములు 34:8; 2 దినవృత్తాంతములు 34:35-19) ఈ ఆధారముల ద్వారా జెఫన్యా కాలము క్రీ.పూ 640 – 621 అని స్థిరపరచబడినది. మనషే ఆమోనుల దుష్టపరిపాలన 57 సంవత్సరములు కొనసాగెను. అది యూదా ప్రజలపై బలమైన యొక దుష్టముద్రను వేసెను. యూదా అట్టి దుష్ట ప్రభావముల నుండి బయటపడుట ఎన్నటికిని సాధ్యపడలేదు. యోషీయా చేపట్టిన పునరుద్ధరణ కార్యములు చాలా ఆలస్యమగుట వలన పునరుద్దరణ తగినంత ప్రభావముతో వ్యాప్తిజెందలేదు. ఆయన మృతిజెందిన తరువాత ప్రజలు ఎప్పటివలే తమ పాత దుర్మార్గములకు, విగ్రహారాధనలకు మరలుకొన్నారు. యిర్మీయా, హబక్కూకు అనువారికి సమకాలికుడైన జెఫన్యా యూదా నాశనమునకు కొంచెము చివరి కాలములో జీవించెనని మనము ఒప్పుకొనవచ్చును.

ముఖ్య పదజాలము : ప్రభువుదినము.

ముఖ్య వచనములు : జెఫన్యా 1:14-15; జెఫన్యా 2:3

ముఖ్య అధ్యాయము : జెఫన్యా 3. జెఫన్యా యొక్క ఈ చివరి అధ్యాయములో ప్రభువు దినమును గూర్చి రెండు గుణ లక్షణములను గురించి న్యాయ తీర్పును, విమోచన గూర్చి వ్రాయబడినది మిక్కిలి గమనించవలసినది.

గ్రంథ విభజన : ఈ గ్రంథమును రెండు ముఖ్య కార్యములు మనము చూడగలము. తీర్పు, రక్షణ.

(1) ప్రభువుదినము న్యాయ తీర్పు, శిక్ష Zep,1,1 -3,8.

(a). లోకమంతటి మీదికి వచ్చు శిక్ష జెఫన్యా 1:1-3. (b). యూదా మీదికి వచ్చు శిక్ష Zep,1,4-2,3. (C). యూదా చుట్టునున్న దేశముల మీదికి వచ్చు న్యాయ తీర్పు జెఫన్యా 2:4-15. (d). యెరూషలేమునకు విరోధమైన న్యాయతీర్పు జెఫన్యా 3:1-7. (e). లోకమంతటి మీదికి వచ్చు న్యాయతీర్పు జెఫన్యా 3:8.

(2). ప్రభువు దినమున కలుగు రక్షణ జెఫన్యా 3:9-20.

(a). మారుమనస్సును గూర్చిన వాగ్దానము జెఫన్యా 3:9-13. (b). విమోచనను గూర్చిన వాగ్దానము జెఫన్యా 3:14-20.

సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో ఇది 36వ పుస్తకము. దీనిలోని అధ్యాయములు 3; వచనములు 53; ప్రశ్నలు లేవు; ఆజ్ఞలు 14; వాగ్దానములు 4; హెచ్చరికలు 86; ప్రవచనవాక్యములు 45; నెరవేరిన ప్రవచనములు 5; నెరవేరనున్న ప్రవచనములు 40; దేవుని నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 4. (జెఫన్యా 1:2; జెఫన్యా 2:1; జెఫన్యా 3:1-8).

Habakkuk – హబక్కూకు

యూదామరల మృత్యుముఖమును సమీపించుచున్న కాలములో హబక్కూకు ప్రవక్త ప్రవచించెను. మారుమనస్సు పొందుడని పలుమారు ఆహ్వానింపబడినను జనులు గర్విష్టులై వంగని మెడ గలవారై పాప మార్గములను విడువక వెంబడించుచుండిరి. తన దేశమున నెలకొనియున్న ఈ భయంకర దుస్థితిని చూచి ప్రవక్త యెహోవా ఇది ఎంత కాలము కొనసాగును అను ప్రశ్నను లేపుచున్నాడు. (హబక్కూకు 1:2; హబక్కూకు 1:13-14) తమ మీదికి రానున్న శిక్షను నెరవేర్చు ఆయుధములుగా బబులోనీయులు తన చేతిలో నుందురని దేవుడు జవాబివ్వగా – ప్రవక్త భయపడి వణకుచు తనకు తెలియకుండానే మోకాళ్లూని ప్రార్థన ప్రారంభించెను. అంతట ఏతరమునకు చెందిన వారైనను – నీతిమంతుడు చూపుద్వారా కాక విశ్వాసమూలముగా బ్రదుకును అను సత్యమును దేవుడాయనకు బయలుపరచెను. దేవుని మార్గములు తనకు సంపూర్ణముగా తెలియబడనప్పటికి హబక్కూకు సాటిలేని దేవుని జ్ఞానమును కీర్తించి స్తుతిగానము చేయుచున్నాడు. హబక్కూకు అను అసాధారణమైన హెబ్రీనామధేయము – కౌగలించుకొనుట అను అర్థమిచ్చు హబక్ అను హెబ్రీ క్రియా పదము నుండి ఉద్భవించినది. కౌగలించుకొనువాడు లేక గట్టిగా పట్టుకొనువాడు అని ఈ నామమునకు అర్ధము. దేవునిని గట్టిగా పట్టుకొనిన ఈ ప్రవక్త ఇదే భావమును హబక్కూకు 3:16-19 వాక్యముల ద్వారా వివరించుచున్నాడు.

గ్రంథకర్త : హబక్కూకు 1:1; హబక్కూకు 3:1 లను బట్టి దీని గ్రంథ కర్త హబక్కూకు అని స్పష్టమగుచున్నది. హబక్కూకు వృత్తి ప్రవచించుటయని ఈ వాక్యములు తెలియజేయుచున్నవి. 3వ అధ్యాయము ఒక ప్రార్థనా గీతము. దీని చివరి భాగములో ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది అని వ్రాయబడుటను బట్టి హబక్కూకు యెరూషలేములో జరుగు ఆరాధనలతో సంబంధము గలిగియున్న ఒక యాజకుడైయుండవచ్చునని మనము తలంచవచ్చును. ఆయన తనకుటుంబమును గూర్చియైనను తన దేశనమును గూర్చియైనను ఏమియు చెప్పలేదు. ఈయనకు దానియేలుతో సంబంధముగలదని కొందరు అభిప్రాయపడుచున్నారు.

హబక్కూకు కాలము : హబక్కూకు కాలము యొక్క గుర్తింపులను, జరుగనైయున్న బబులోను దండయాత్రను గూర్చి ఈ గ్రంథములో వ్రాయబడిన వర్తమానముల నుండి మాత్రమే గ్రహించగలము. (హబక్కూకు 1:6; హబక్కూకు 2:1; హబక్కూకు 3:16) హబక్కూకు గ్రంథము వ్రాయబడిన కాలము మనష్హే పాలనా కాలము ( క్రీపూ 697 – 642 ) అని కొందరు బైబిలు పండితులును, ఆమోను పాలనా కాలము (క్రీ. పూ. 642 – 640 ) అని మరికొందరు బైబిలు పండితులు అభిప్రాయపడుచున్నారు. అయితే ఈ ఇరువురు రాజుల కాలములో బబులోను అషూరు రాజులు పాలించిన భాగములలో ఒకటిగా ఉన్నందున ఈ ఊహలు పునాదులు లేనివిగా నున్నవి. క్రీ.పూ. 640 – 609 పాలించిన ఉత్తమ రాజైన యోషియా కాల పరిస్థితులు హబక్కూకు ప్రవచనములకు సరిపడలేదు. క్రీపూ 609 – 598 కాలములో యూదాను పరిపాలించిన భక్తి హీనుడైన రాజైన యెహోయాకీము కాలము మాత్రమే హబక్కూకు ప్రవచనమునకు సరిపోవుచున్నది. ఈ రాజే యూదాను నాశనపుటంచుల వరకు దుష్టత్వములో నడిపించాడు. (2 రాజులు 23:34; 2 రాజులు 24:5 యిర్మియా 22:17) నా బోసాలాసర్ (నెబూజరదాను)? అను రాజు కాలములో (క్రీ.పూ. 626 – 605) బబులోను బలపడనారంభించెను. అతడు క్రీ.పూ 612లో అషూరు రాజధానియైన నీనెవేను నాశనము గావించెను. నాబా సాలాసర్ తరువాత రాజైన నెబుకద్నెజరు క్రీ.పూ 605లో సింహాసన మెక్కెను. ఆయన తన పరిపాలన ప్రారంభమైన మొదటి సంవత్సరములోనే యూదాపై దండెత్తాడు. దానిని స్వాధీనము చేసుకొని రాజకుటుంబీకులలో 10,000 మంది అధిపతులను చెరపట్టి బబులోనుకు తీసికొని వెళ్లాడు. పేదలను వంఛించిన అధిపతులే మొదటిగా ఖైదీలుగా పట్టబడ్డారు. హబక్కూకు బబులోను దండయాత్రకు ముందే ప్రవచించెను. గనుక క్రీ.పూ 607 కు సమీపములో ఈ గ్రంథము వ్రాయబడియుండవలెను.

ముఖ్య వచనము : “నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రదుకును”

ముఖ్య వచనములు : హబక్కూకు 2:4; హబక్కూకు 3:17-19

ముఖ్య అధ్యాయము : 3 అధ్యాయము.

హబక్కూకు గ్రంథములోని చివరి మూడు వచనములు (హబక్కూకు 3:17-19) ఈ గ్రంథమును మిక్కిలి ఔన్నత్య స్థానమునకు హెచ్చించుచున్నది. ఫిర్యాదులతోను, సందేహములతో, ప్రశ్నలతోను ప్రారంభమైన హబక్కూకు ప్రవచన గ్రంథము ముగింపులో ధృఢ నిశ్చయతతోను, విశ్వాసముతోను అంతమగుచున్నది. విశ్వాస విజయ విఖ్యాతమైన ఈ మూడవ అధ్యాయము పరిశుద్ధ గ్రంథము అంతటిలో విశిష్ట స్థానము పొందుచున్నది.

గ్రంథ విభజన : ఈ గ్రంథములో రెండు భాగములు మిక్కిలి తేటగా కనబడుచున్నవి. హబుక్కూకు దేవుని యెదుట లేవనెత్తుచున్న సంశయాత్మక ప్రశ్నలును దానికి దేవుడు అనుగ్రహించిన జవాబులును మొదటి రెండు అధ్యాయములలోను, హబక్కూకు కృతజ్ఞతతో దేవునికి చేయు స్తోత్ర గీతము మూడవ అధ్యాయములోను వివరింపబడినవి.

(1) హబక్కూకు సంశయములు, ప్రశ్నలు, దేవుని జవాబులు: 1 , 2 అధ్యాయములు (a). హబక్కూకు మొదటి ప్రశ్న హబక్కూకు 1:1-4. (b). దేవుని జవాబులు హబక్కూకు 1:5-11 (c). హబక్కూకు రెండవ ప్రశ్న హబక్కూకు 1:12; హబక్కూకు 2:1 (d). దేవుని రెండవ జవాబు హబక్కూకు 2:2-20

(2) హబక్కూకు స్తోత్రగీతము : 3వ అధ్యాయము

(a). దేవుని కృప కొరకు ప్రవక్త ప్రార్ధన హబక్కూకు 3:1-2 (b). దేవుని కనికరము స్మరించుట హబక్కూకు 3:3-15 (c). దేవుని రక్షణపై విశ్వాసముతో ఆనుకొనుట హబక్కూకు 3:16-19

సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో ఇది 35వ పుస్తకము. అధ్యాయములు 3; వచనములు 56; ప్రశ్నలు 12; ఆజ్ఞలు 1; వాగ్దానములు లేవు; హెచ్చరికలు 20; ప్రవచన వాక్యములు 11; దేవుని నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 2 (Hab,1,5-2,2).

Nahum – నహూము

ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయ జూతురు; మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. లూకా 12:48. ఏకైక సత్యదేవుని తెలిసికొనే మంచి అవకాశము నీనెవెకు లభించినది. యోనా సందేశమును వినిన ఈ మహా పట్టణము మారు మనస్సు పొందినది. అందువలన దేవుడు తన అత్యంత కృపచేత దాని మీదికి రావలసిన శిక్షను నిలిపివేసెను. అయితే 100 సంవత్సరముల తరువాత ప్రవక్తయైన నహూము అదే పట్టణమునకు కలుగబోవు దుర్గతిని గూర్చి తన గ్రంథములో ప్రవచించుట చూడగలము. అష్హూరీయులు తమ ఆత్మీయ ఔన్నత్యము నుండి దిగజారిన తరువాత, వారు మరల తమ అక్రమములను, విగ్రహారాధనలను, దుష్టకర్మములను అనుసరించి. ఆ హేతువు చేతనే ఈ పట్టణమును బబులోను సర్వనాశనము చేయునని భూమిపై దీని పేరు చెరిపివేయబడునని నహూము ప్రవచించెను. ఈ ప్రవచనము మిక్కిలి భయంకరముగా అక్షరాలా నెరవేరెను. హెబ్రీ నామమైన నహూము నెహెమ్యా అను పేరుకు సంక్షిప్త రూపము. నహూము అనగా యెహోవా యొక్క ఆదరణ అని అర్ధము. అష్హూరు రాజధానియైన నీనెవె పతనమును గూర్చిన ప్రవచన వర్తమానము, నీనెవె చేతిలో శ్రమలు అనుభవించిన యూదాకును, ఇతర ప్రజలందరికిని మిక్కిలి ఆదరణ కరముగా నుండెను.

గ్రంథకర్త : నహూము, పాతనిబంధనలో నహూము 1:1 లో మాత్రమే ప్రవక్తయైన నహూమును గూర్చి లిఖింపబడియున్నది. అందు ఆయన ఎల్కోషు వాడు అని పిలువబడుచున్నాడు. ఎల్కోషు అను పేరుగల స్థలము ఎక్కడ ఉన్నది? దీనిని గూర్చి నాలుగు అభిప్రాయములు గలవు. (1). 16వ శతాబ్దములో నున్న ఒక సంప్రదాయమును బటి ఇరాక్ లోని అల్ కూస్ పటణమే ఈ ఎల్కొషు. ఈ పట్టణము ఇరాక్ లో, నేనెవేకు ఉతరమున టెగ్రీస్ నదీతీరమున గలదు. (2). గలలీయలోని రామా పట్టణమునకు సమీపమున నున్నట్టియు, ఎల్కెషి అని పిలువబడుచున్నట్టియు పట్టణమే ఎల్కోషు అని ఆది సంఘ పితరులలో ఒకరైన జరోము తలంచెను. (3). కప్నెహూము అనగా నహూము యొక్క నగరము అని అర్ధము. పూర్వము ఎల్కోషు అని పిలువబడిన పట్టణమే, నహూము జ్ఞాపకార్థముగా కపెర్నహూముగా మార్చబడినది అని కొందరు నమ్ముచున్నారు. (4). ఎల్కోషు అనునది దక్షిణ యూదాలో యెరూషలేమునకును, గాజాకును మధ్యలో ఉన్నదనియు, కాలక్రమములో ఎల్కేషేయి అని పిలువబడినదనియు బైబిలు పండితులలో అధిక సంఖ్యాకులు అభిప్రాయపడుచున్నారు. ఆఖరున చెప్పబడిన అభిప్రాయము ననుసరించి నహూము ప్రవక్త దక్షిణ దేశమైన యూదాకు జెందినవాడు. ఆయన యూదా విజయమును సంతోషముగా ప్రవచించుటను బట్టి ఆయన యూదా ప్రాంతమునకు జెందిన వాడని విశదమగుచున్నది (నహూము 1:15; నహూము 2:2)

నహూము కాలము : బబులోను దండయాత్ర ఫలితముగా నీనెవె క్రీ.పూ 612లో నాశనము చేయబడినది. నహూము 3:8-10 వచనములలో వ్రాయబడిన దానిని బట్టి నైలు నదీతీరమున నున్న తేబేసు (నో అమ్మోను) నాశనము నగరము యొక్క నాశనము సమీపకాల సంభవము తెలుపుచున్నది. తేబేసు నగరము

క్రీ.పూ. 663వ సంవత్సరములలో పతనమాయెను. కావున నహూము కాలము క్రీ.పూ. 663 కును, క్రీ.పూ. 612కును మధ్య కాలమనునది స్పష్టము. తేబేసు పట్టణము పతనమైన తరువాత పది సంవత్సరములకు, క్రీ.పూ. 693లో మరల నిర్మింపబడినదని చరిత్ర పుటలు వివరించుచున్నవి. నహూము తన గ్రంథమును

క్రీపూ 663కును, క్రీ.పూ. 654 కును మధ్య కాలములో వ్రాసియుండవచ్చునని తలంచవచ్చును. గ్రంథ ప్రారంభములో రాజులలో ఎవరి పేరైనను ప్రస్తావింపబడక పోవుటను బట్టి రాజైన మనష్హే (క్రీ.పూ. 697 – 642) దేవుని దృష్టికి చెడ్డవాడైయుండుటయే కారణమని తలంచవచ్చును.

యోనా ప్రవచన వర్తమానము విని నీనెవె ప్రజలు పశ్చాత్తాపబడిన సంఘటన క్రీ.పూ. 759లో జరిగినది. ఈ పశ్చాత్తాపము, మారుమనస్సు తాత్కాలికమైనదిగా నుండెను. అష్హూరీయులు అనతి కాలములోనే తిరిగి తమ క్రూరత్వమునకు మరలిరి. క్రీ.పూ 722 లో అష్హూరు రాజైన రెండవ షార్గోను ఉత్తర రాజ్య ( ఇశ్రాయేలు) రాజదానియైన షోమ్రోనును నాశనము చేసి, పది గోత్రముల వారిని చెదరగొట్టి వారిని బానిసలుగా అష్హూరునకు తీసికొని పోయెను. క్రీపూ 701లో అష్హూరు రాజైన సేన్హరీబు మహా గొప్ప సైన్యము యూదాను జయించుటకు విఫలయత్నము చేసెను. క్రీ.పూ 669 – 633 వరకు రాజ్యమేలిన అషూర్ పాని పాల్ కాలములో కీర్తి ఔన్నత్యము నొందియున్నది. నీనెవె పట్టణము దానికి రాజధాని.

భూమి మీద మిక్కిలి ప్రఖ్యాతిగాంచిన ఈ నీనెవె పట్టణము చుట్టూ 100 అడుగుల ఎత్తును, ఏక కాలములో మూడు రథములను ఒకదాని ప్రక్క మరొకదానిని ఉంచి నడుపుటకు తగినంత వెడల్పును గల కోటయున్నవి. కోటలోపల పలు ప్రాంతములలో కనబడు మేడమిద్దెలు ఇంకను 100 అడుగుల ఎక్కువ ఎత్తుగలవై యుండెను. వీటి అన్నింటి కంటె మిన్నగా కోట చుట్టూ 150 అడుగుల వెడల్పును 60 అడుగుల లోతును గల కందకము గలదు. ఇంత గొప్ప నీనెవె పట్టణము సర్వనాశనము చేయబడునని నహూము ప్రవచనము చెప్పుచుండెను. ఆ కాలములో ఈ ప్రవచనము నమ్మశక్యము కానిదిగా నుండెను.

క్రీ.పూ 663 తరువాత అషూరును పాలించిన రాజులకాలములో ఆమహా సామ్రాజ్యపు కీర్తి పతనమగుట ప్రారంభించెను. నహూము 1:8 లో నీనెవె పట్టణము ఒక మహా నది ప్రవాహము ద్వారా నాశనమగునని చెప్పబడియున్నది. అది అక్షరాలా నెరవేరెను. టైగ్రీస్ నది పొర్లి ప్రవహించి నీనెవె కోటగోడలో కొంత భాగమును పడగొట్టెను. కోట పడిపోయిన భాగము ద్వారా బబులోను సైన్యందండెత్తి క్రీ.పూ 612లో నగరమును స్వాధీనం చేసికొనిన పిదప దానిని అగ్నికి ఆహుతిచేసెను. నహూము 3:11 లో నీవును మత్తురాలవై దాగుకొందువు, శత్రువు వచ్చుట చూచి ఆశ్రయ దుర్గము వెదకుదువు అని వ్రాయబడిన ప్రకారముగానే క్రీ.పూ. 612లో నశించిపోయిన నీనెవె స్థానం మరువబడెను. 2500 సంవత్సరముల కాలము వరకు లోకములో అజ్ఞాతముగా నుండెను. అలెగ్జాండరు, నెపోలియనులు సమీపమున స్థావరమేరుపరచుకొని విశ్రమించెను. కాని వీరికి ఇక్కడ ఒక కాలమున ప్రసిద్ధి చెందిన పట్టణమున్నదను సూచన ఎలాంటిది లభించలేదు. అస్థలము మొత్తం గొర్రెల మేపు ప్రదేశమని పిలువబడెను. నీనెవె సర్వనాశనమాయెను. క్రీ.శ. 1542లో భూశాస్త్ర పరిశోధనలో ఇప్పుడున్న ఇరాక్ లో నున్న టైగ్రీసు నది తీరమున ఇది ఉన్నదని కనుగొనిరి.

ముఖ్య వర్తమానము : నీనెవె న్యాయతీర్పు.

ముఖ్యవచనములు : నహూము 1:7-8 నహూము 3:5-7

ముఖ్య అధ్యాయము : నహూము 1. ఈ అధ్యాయము ఒక ప్రక్క దేవుని ప్రతిదండనయు, కోపమును వర్ణించుటయు, మరో ప్రక్క తమ భక్తులకు శ్రమలకాములో యిచ్చు ఆశ్రయమైన దేవకారుణ్యమును హెచ్చించి చూపుచున్నది. “ఇదిగో సమాధానమును చాటించు సువార్తకుని పాదములు పర్వతముల మీద వచ్చుచున్నవి” అని ప్రారంభించు 15వ వచనము దేవుని బిడ్డలకు దేవుడిచ్చు బద్రతయు, సమాధానమును చెప్పుచున్నది.

గ్రంథ విభజన : మూడు అధ్యాయములు గల ఈ గ్రంథము నీనెవె మీదికి రాబోవు న్యాయ తీర్పును గూర్చి మూడు ముఖ్య కార్యములను రమ్యముగా తెలియ జేయుచున్నది.

నీనెవె నాశనమును చెప్పుచున్నవి : 1 అధ్యాయము (a). న్యాయ తీర్పు జరుగు విధము : నహూము 1:1-8 (b). నీనెవె నాశనము , యూదా విడుదల : నహూము 1:9-15. 2. నీనెవె నాశనము – వివరణ : 2 అధ్యాయములు. (a). యుద్ధమునకు ఆహ్వానము నహూము 2:1-2 (b). నీనెవె నాశనమగుచున్నది నహూము 2:3-13. 3. నీనెవె నాశనము కాబోవుచున్నది. 3 అధ్యాయము (a). నాశనమునకు కారణములు నహూము 3:1-11 (b). నీనెవె నాశనము – ఆగదు నహూము 3:16-19

సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో ఇది 34వ గ్రంథము. అధ్యాయములు 3; వచనములు 47; ప్రశ్నలు 8; ఆజ్ఞలు 5; వాగ్దానములు లేవు; హెచ్చరికలు 72; ప్రవచనములు 46; నెరవేరినవి 40; నెరవేరనివి 6; దేవుని నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 2; (నహూము 1:2; నహూము 2:1)

Micah – మీకా

మీకా ఒక గ్రామీణ కుటుంబము నుండి దేవుని చేత పిలువబడిన యొక ప్రవక్త. ఇతడు యెరూషలేము రాజకుటుంబమునకును, యూదా ప్రజలకును, షోమ్రోను రాజకుటుంబమునకును, ఇశ్రాయేలు ప్రజలకును దేవుని న్యాయ తీర్పులను గూర్చిన వర్తమానములను ప్రవచనములుగా ప్రకటించి యున్నాడు. ధనవంతులును, అధికారులును పేద ప్రజలను బాధించుచు, క్రూరముగా హింసించుటను సహించలేక మీకా గొప్ప హృదయ భారముతో తన ప్రవచన వాక్యములను ప్రకటించెను. సామాజిక, రాజకీయ అధికారములను స్వార్ధలాభము కొరకు ఉపయోగించుచున్న వారిని ఆయన గద్దించుచున్నాడు. మీకా గ్రంథములో ముఖ్యములగు మూడు అభిప్రాయములను చూడగలము.

మొదటిది : తన ప్రజల పాపము, క్రూరత్వము. రెండవది : వాటికి ప్రతిగా దేవుడు పంపబోవుచున్న కఠిన న్యాయ తీర్పు. మూడవది : శిక్ష విధింపబడిన యనంతరము మిగిలిన ప్రజలను తనకు మహిమ కరముగా పునరుద్ధ రించుట. ఈ మూడు ఉద్దేశముల ద్వారా దేవుడు తన ప్రజల నుండి ఆశించినది ఏమనగా —- న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు మాత్రమే.

మికాయా అను హెబ్రీ పదమునకు సంక్షిప్త రూపమే మికా. మీకాయా అను పదమునకు “యెహోవా వంటి వాడు ఎవడు” అని అర్థము. మీకా 7:18లో అడిగిన ప్రశ్న ద్వారా మీకా తన నామమును ప్రత్యేకముగా లిఖించుచున్నాడు.

గ్రంథకర్త : మీకా జన్మ స్థలమైన మోరె మోరేషేత్గతు (మీకా 1:14) యెరూషలేమునకు 40 కి. మీ దూరమున నైరుతి దిక్కుననున్నది. ఇది యూదయకును ఫీలిష్టియులకు సరిహద్దున, గాతునకు సమీపముననున్నది. ఆమోసువలె మీకా కూడా గ్రామీణుడే, ఆయన వృత్తిని గూర్చిన స్పష్ట సమాచారము లేదు. మోరెషెత్గతు గ్రామము వ్యవసాయ గ్రామము. అతడు వ్యవసాయదారుడై యుండవచ్చును. యెషయా దానియేలులవలె ఇతడు రాజకీయములను ఎరుగడు. అయినను ఆయన తన ప్రజల యొక్క శ్రమలను గూర్చి గాఢమైన హృదయ భారమును వ్యక్తపరచియున్నాడు. దేవుడు ఆయనను స్వయముగా పిలిచి ప్రవక్తగా ప్రత్యేకించెనను విషయము మీకా 3:8 ద్వారా స్పష్టమగుచున్నది. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడియున్నాను.

కాలము : ఈ గ్రంథములోని మొదటి వచనములో చెప్పబడిన ప్రకారము మికా ప్రవచించినది యోతాము (క్రీ.పూ 750 – 735), ఆహాజు (క్రీ.పూ 735 – 715 ), హిజ్కి యా (క్రీ పూ 715 – 686) అను యూదా రాజుల కాలము అని గ్రహించగలము. ( 2 రాజులు 16 అధ్యాయము) ఈయన ప్రవచించినది ముఖ్యముగా యూదాను గూర్చియే అయినను, ఈయన ఇశ్రాయేలీయులను గూర్చి కూడ ప్రవచించి షోమ్రోను పతనమును ప్రవచించెను. ఈయన ప్రవచించిన కాలములో అధిక భాగము క్రీ.పూ 722లో సంభవించిన అష్హూరు చెరకు ముందే జరిగి యుండెనని ఊహింపవచ్చును. దేవుని ప్రజలలో విస్తరించియున్న విగ్రహారాధనను, క్రమ శిక్షణా రాహిత్యమును ఈ ప్రవక్త మిక్కిలి కఠినముగా ఎదిరించి తీర్పును ప్రకటించుట వలననే హిజ్కియా కాలములో గొప్ప ఉజ్జీవము కలిగినదనియు – అందువలన ఈ ఉజ్జీవమునకు ముందే మీకా క్రీ.పూ 742 నుండి క్రీ.పూ 687 వరకు గల కాలములో జరిగినదని నిర్ణయించుకొనవచ్చును. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు రాజ్యములో జీవించిన హోషేయకును, యెరూషలేములోని రాజ భవనములో జీవించిన యెషయాకును ఈయన సమకాలికుడు. మహోజ్వలమైన ఉజ్జియా పరిపాలనానంతరము యోతాము యూదా రాజాయెను. అతడు తన తండ్రియైన ఉజ్జియా వలె దేవుని దృష్టికి నీతిగా ప్రవర్తించెను. అయినను అతడు ఉన్నత స్థలములను నాశనము చేయలేదు. యోతాము తరువాత అతని కుమారుడైన ఆహాజు యూదా రాజాయెను. ఆహాజు దుష్టుడై ఇశ్రాయేలు రాజులవలె ప్రవర్తించెను. అతని కాలములో అష్హూరు సైన్యము వలనను సిరియా సైన్యముల వలనను యూదా మీదికి భయోత్పాతములు వచ్చెను. అతని తరువాత అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజాయెను. హిజ్కియా కాలములో అష్హూరు సైన్యము యెరూషలేమును ముట్టడించెను. దేవుడు అద్భుత రీతిగా హిజ్కియాను, అతని రాజ్యమును రక్షించెను. ఆయన దేవుని దృష్టికి నీతిమంతుడుగా జీవించెను. అతడు ఉన్నత స్థలములను పడగొట్టి, విగ్రహములను ధ్వంసము చేసెను. ప్రజలను పరిశుద్ధ జీవితములోనికి నడిపెను. మీకా ప్రవచించిన కాలములో 3వ తిగ్లేత్పిలేసరు, ఐదవ సల్మనేసరు, రెండవ షార్గోను, సేన్హరీబు అను రాజులు అష్హూరును పాలించిరి. ఆ కాలములో అష్హూరు పతాక స్థాయినందుకొనెను. ఆది యూదాకు బీతిని పుట్టించుచుండెను. ఆ దినములలో బబులోను కూడా అషూషరుకు లోబడియుండెను. మీకా – యూదులు బబులోనుకు చెరగొని పోదురని మీకా 4:10 లో ప్రవచించెను. అందువలన బబులోను రాజ్యము బలపడక పూర్వమే ఈ ప్రవచించెను.

ముఖ్య వర్తమానము : యూదా, న్యాయ తీర్పు – విమోచనము

ముఖ్య వచనములు : మీకా 6:8; మీకా 7:18

ముఖ్య అధ్యాయములు : 6, 7 అధ్యాయములు.

గ్రంథ విభజన : ముందుగా ప్రస్తావింపబడినట్లుగానే ఈ గ్రంథమును మూడు ముఖ్య విభాగములుగా చేసి వాటిని మరికొన్ని భాగములుగా వివరింపవచ్చును.

(1). న్యాయ తీర్పును, గూర్చిన ప్రవచనము : 1 – 3 అధ్యా.

జనుల మీదికి వచ్చు న్యాయ తీర్పు మీకా 1:1; మీకా 2:13.
నాయకుల మీదికి వచ్చ న్యాయ తీర్పు మీకా 3:1-12
(2). విమోచనను గూర్చిన ప్రవచనము : 4, 5 అధ్యాయాలు

రాబోవు రాజ్యమును గూర్చిన ప్రవచనము : మీకా 4:1-5.
చెర నుండి తిరిగి వచ్చుటను గూర్చిన వాగ్దానము : Mic,4,6-5,1.
రాబోవు రాజును గూర్చి వాగ్దానము మీకా 5:2-15.
(3). మారు మనస్సు పొందుటకైన పిలుపు : 6, 7 అధ్యాయములు.

దేవుని మొదటి పిలుపు : మీకా 6:1-9.
దేవుని రెండవ పిలుపు : మీకా 6:10; మీకా 7:6.
సంపూర్ణ రక్షణను గూర్చిన ప్రవచనము : మీకా 7:7-20
సంఖ్యా వివరములు : ఇది పరిశుద్ధ గ్రంథములో 33వ పుస్తకము. అధ్యాయములు 7; వచనములు 105; ఆజ్ఞలు 20; ప్రశ్నలు 23; వాగ్దానములు 2; హెచ్చరికలు 123; ప్రవచనములు మొత్తము 123; నెరవేరిన ప్రవచనములు 91; నెరవేరవలసిన ప్రవచనములు 32; దేవుని నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 7.

Jonah – యోనా

యోనా అను హెబ్రీపదమునకు పావురము అని అర్ధము. లాటిన్, గ్రీక్ భాషలలో క్రమముగా జోన్స్ జోనా అను పదములు వినియోగింపబడినవి. తెలుగు అనువాదకులు వాటిని అంగీకరింపక యోనా అను హెబ్రీ పదమునే నేరుగా తెలుగు పరిశుద్ధ గ్రంథములో ఉపయోగించి యున్నారు.

ఉద్దేశము : దేవుని దయ మిక్కిలి శ్రేష్ఠమైనదని చూపుట. ఇందలి రక్షణ సందేశము అందరికి వర్తించును. అన్ని కాలముల వారికి వర్తించును.

గ్రంథకర్త : అమిత్తయి కుమారుడైన యోనా.

కాలము : క్రీపూ 793 – 753

ఎవరికి వ్రాయబడెను? ఇశ్రాయేలీయులకు లోకమంతటనున్న దేవుని ప్రజలకు.

గత చరిత్ర : నీనెవె పట్టణము అష్హూరు మహా సామ్రాజ్యమునకు రాజధాని. అష్హూరు ఇశ్రాయేలీయులకు గొప్ప శత్రువు. క్రీ.పూ. 722లో అష్హూరు ఇశ్రాయేలు దేశము మీద దండెత్తి జయము గాంచినది. యోనా ఆమోసు కంటే ముందు ప్రవచించినవాడు. ఇశ్రాయేలు రాజులలో మిక్కిలి బలవంతుడైన రెండవ యరొబాము పాలనా కాలములో యోనా ప్రవచించెను. (క్రీ.పూ 793 – 753; 2 రాజులు 14:23-25)

ముఖ్య వచనము : యోనా 4:11

ముఖ్య వ్యక్తులు : యోనా, ఓడ నావికుడు, ఓడలోని పనివారు, ప్రయాణికులు.

ముఖ్య స్థలములు : యెప్పే, నీనెవె

గ్రంథ విశిష్టత : నీనెవె ప్రజలకు యోనా చెప్పవలసిన ప్రవచనము ఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగును అనునదే (యోనా 3:4) ఈ పుస్తకములో మరియొక ప్రవచనము ఏదియు లేదు. యోనా జీవితమే ఇందలి ముఖ్య విషయము. యోనా జీవిత సంఘటనను తన మరణ పునరుత్థానములు సాదృశ్యమైన దానినిగా యేసు చూపుచున్నాడు. (మత్తయి 12:38-42)

సారాంశము : నీనెవె ప్రజలు మారు మనస్సు పొందుట

ముఖ్య వచనములు: యోనా 2:8-9; యోనా 4:27

ముఖ్య ఆధ్యాయము : 3 , ప్రపంచ చరిత్రలో ఇంత గొప్ప ఉజ్జీవము మరి ఎన్నడును, ఎక్కడను జరుగలేదు. నీనెవె ప్రజలందరు మారు మనస్సు పొందుట ఇందు వర్ణింపబడెను.

గ్రంథ విభజన : నాలుగు అధ్యాయములు గల ఈ గ్రంథమును రెండేసి అధ్యాయములు గల రెండు ముఖ్య విభాగములుగా విభజింపవచ్చును. ఒక్కొక్క విభాగమును మరల స్పష్టమైన భాగములుగా విభజింపవచ్చును.

(1). యోనాకు దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ 1, 2 అధ్యాయములు.

దేవుని ఆజ్ఞను యోనా పాటించలేదు యోనా 1:1-3
దేవుని దండన యోనా మీదికి వచ్చెను యోనా 1:4-17
మహా మత్స్యము కడుపులో నుండి యోనా ప్రార్ధించగా విడుదల అనుగ్రహింపబడుట యోనా 2:1-10 (2). యోనాకు దేవుడిచ్చిన రెండవ ఆజ్ఞ 3, 4 అధ్యాయములు.
దేవుని ఆజ్ఞ, యోనా విధేయుడగుట యోనా 3:1-4
నీనెవె మారు మనస్సు పొందుట. శిక్ష తప్పింపబడుట యోనా 3:5-10
యోనా ప్రార్థన యోనా 4:1-3
యోనాను దేవుడు సరిదిద్దుట యోనా 4:4-10
దేవుడు యోనాకు నేర్పిన మిక్కిలి గొప్ప పాఠము యోనా 4:11

సంఖ్యా వివరములు : యోనా గ్రంథము పరిశుద్ధ గ్రంథములో 32వ పుస్తకము.

దీనిలోని – అధ్యాయము 4; వచనములు 48; ఆజ్ఞలు 8; ప్రశ్నలు 12; వాగ్దానములు లేవు; మొత్తము ప్రవచనములు 1; నెరవేరిన ప్రవచనములు: ప్రజలు మారు మనస్సు పొందగా అప్పటికి శిక్ష తప్పించబడినది. తరువాత చాలా కాలమునకు ఈ ప్రవచనము నెరవేరినది. దేవుని నుండి వచ్చిన పత్యేక వర్తమానములు : 6. (యోనా 1:2; యోనా 2:10; యోనా 3:2; యోనా 4:4; యోనా 4:9; యోనా 4:10)

Obadiah – ఓబద్యా

యాకోబు ఏశావులు కవల సోదరులు. ఏశావును ఎదోము అనియు పిలిచెడివారు. ఏశావు అనగా ఎఱ్ఱనివాడు అని అర్థము. ఏశావుకు ఎరుపు రంగుతో పలు సంబంధములు గలవు. అతని శరీరఛాయ ఎరువు. అతని బలహీనత ఎఱ్ఱని చిక్కుడు కాయల వంటకము కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్ముకొనుట. అతడు ఎఱ్ఱని బండలు గల దేశమును తన నివాస స్థలముగా చేసికొనెను. (ఆదికాండము 25:25; ఆదికాండము 25:30; ఆదికాండము 36:1) యాకోబు హారానులో 20 సంవత్సరములు నివసించినపుడు ఏశావు శేయీరు మన్యము ఎతైన కొండ శిఖరముల పైనున్న పీఠభూమలో ఈ సెలానగరము, ఎఱ్ఱనిబండలతో నిండియున్నందునను, అతని పేరును బట్టి ఆదేశమును ఎదోము దేశమని పిలువబడెను. (ఆదికాండము 32:3) అది ఇంచుమించు 100 చదరపు మైళ్ల విస్తీర్ణము గల కొండ ప్రాంతము. ఎదోము దేశము (శేయీరు మన్యము) అరాబాకు తూర్పునను, మృతసముద్రమునకు దక్షిణమునను ఉన్నది.

ఎదోమీయుల మీదికి రాబోవుచున్న సంపూర్ణ నాశనమును గూర్చి ప్రవచించుటయే ఈ గ్రంథములోని విషయము. ఓబద్యా అనగా “యెహోవాను ఆరాధించువాడు”. లేక యెహోవాను సేవించువాడు అని అర్ధము.

గ్రంథకర్త : ఓబద్యా

కాలము : గ్రంథరచన జరిగిన కాలము వ్రాయబడలేదు.

గత చరిత్ర : ఎదోము దేశమునకు సెలా రాజదాని. సెలాను పెట్రా అనియు పిలుతురు. పెట్రా అనగా బండ అని అర్థము. చరిత్రలోని అద్భుతములలో పెట్రా నగరము ఒకటి. కొండల సందులలో ఈ అద్భుత నగరము నిర్మించిరి. దీనిని జయించుట శత్రువులకు సులభము కాదు. ఎత్తైన కొండ శిఖరముల పైనున్న పీఠభూమిలో ఈ సెలానగరము, యుండెను. కొండల మధ్య నుండు సందుల మార్గమున మాత్రమే ఈ సెలా నగరమున ప్రవేశించుట సాధ్యమగును. గొప్ప సైన్యముతో ఈ సందుల మార్గమున పయనించి ఈ నగరమును పట్టుకొనుట ఎవరికినీ సాధ్యము కాదు. చిన్న చిన్న గుంపులుగా ఎక్కి వచ్చి శత్రువులను ఓడించుట ఈ నగర వాసులకు సులభము. నగరము బద్రముగా ఉన్నప్పటికి, దేవునితీర్పు నుండి తప్పించుటకు ఆ కొండలవలన కాలేదు. యెరూషలేము పతనమునకు ఐదు సంవత్సరములకు తరువాత బబులోను సైన్యము ఈ నగరమును జయించినట్టు చరిత్ర తెలుపుచున్నది. అయినప్పటికి మక్కబీయుల కాలములో ఎదోమీయులు తిరిగి శక్తి పొందినట్లు చూడగలము. యేసుక్రీస్తు పుట్టుక సమయములో యూదాలో పరిపాలించుచుండిన హేరోదు ఒక ఎదోమీయుడు క్రీ.శ. 70వ సంవత్సరములో టైటస్ రాజు యొక్క నాయకత్వములో వచ్చిన రోమా సైన్యము ఎదోమును సమూలనాశనము చేసిరి. ఆయన వీరిని కాల్చి ఏశావు యొక్క వంశములో శేషము లేకుండ భక్షించిరి అని 18వ వచనములో చెప్పబడిన ప్రవచనము ప్రకారము నెరవేరినది.

ముఖ్య పదజాలము : ఎదోము యొక్క న్యాయ తీర్పు.

ముఖ్య వచనములు : ఓబద్యా 1:10-21

నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు, ఒక నెన్నటికిని లేకుండ మీరు నిర్మూలమగుదువు. (వచ 10) మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుట సీయోను కొండమీద రక్షకులు పుట్టుదురు అప్పుడు రాజ్యము యెహోవాదియగును (వచ 21)

గ్రంథ విభజన : 21 వచనములను కలిగియున్న ఈ గ్రంథము పాతనిబంధనలో మిక్కిలి చిన్న గ్రంథము. అయినను న్యాయ తీర్పుతో నిండియున్న శక్తివంతమైన వర్తమానమును దీనిలో చూడగలము. విమోచింపబడు అవకాశమే లేనివిధముగా , ఎదోము దేశ నాశనమును ముద్రింనబడియున్నది. దేవుడు ఎదోమీయుల అహంకామునకు ప్రతీకారము చేసి యాకోబు వంశీయులను విమోచించు ననునదియే ఓబద్యా ప్రవచించిన సందేశము. ఓబద్యా గ్రంథమును రెండు భాగములుగా విభజింపవచ్చును.

ఎదోము మీదికి రాబోవు న్యాయ తీర్పు (ఓబద్యా 1:1-16)
ఇశ్రాయేలీయుల విమోచన (ఓబద్యా 1:17-21)

సంఖ్యా వివరములు : ఓబద్యా గ్రంథము పరిశుద్ధ గ్రంథములోని 31వ పుస్తకము. అధ్యాయములు 1; వచనములు 21; ఆజ్ఞలు 1; ప్రశ్నలు 4; వాగ్దానములు లేవు; హెచ్చరికలు 30; ఆ ప్రవచనములు మొత్తము 12; నెరవేరిన ప్రవచనములు 5; నెరవేరనున్న ప్రవచనములు 7; దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 3 (ఓబద్యా 1:1; ఓబద్యా 1:7; ఓబద్యా 1:15)

Amos – ఆమోసు

ఇశ్రాయేలు రాజ్యము బలమైన రాజును కలిగియుండి, శాంతి భద్రతలతో వర్ధిల్లుచున్న కాలములో ఆమోసు తన ప్రవచన పరిచర్య జరిగించెను. అది వ్యాపారాభివృద్ధిని, ధన వృద్ధిని సాధించుకొనిన కాలము. అయితే ప్రజలు అల్ప సంతోషమునిచ్చు పాప భోగములందు ఆనందించుచుండిరి. అన్యాయము అవినీతి ప్రబలెను. (అధికమాయెను) సత్యమైన సరియైన ఆరాధనా స్థానమును కపటాచారములు ఆక్రమించుట ప్రారంభమాయెను. భద్రత విషయముతో గట్టి నమ్మకము, దేవుని శిక్షను అలక్ష్యము చేయు పరిస్థితి హెచ్చగుచుండెను. దేశములో కరువు కాటకములు పెరిగినను అపాయకరమైన వ్యాధులు వ్యాప్తిజెందినను, యుద్ధము నాశనము పైబడినను, ఇవి ఏవియు ప్రజలలో పశ్చాత్తాపమును పుట్టించలేదు. మారుమనస్సు పొందుటకు ప్రజలు సిద్ధముగా లేరు. ఆమోసు పశువుల కాపరియైన ఒక గ్రామీణ యువకుడు. ఈయన దేవుని పిలుపుకు లోబడి దేశము మీదికి దేవుని తీర్పు త్వరగా రాబోవుచున్నదని హెచ్చరించి, మారుమనస్సు పొందవలెనని దేశ ప్రజలుకు పిలుపు నిచ్చెను. వేషధారణతో కూడియున్న వారి భక్తియు, నిర్లక్ష్యముతో కూడిన వారి మతాచారములును వారిని గంపలో కుళ్లిపోవుచున్న పండ్లవలే మార్చెను. క్రమశిక్షణా రాహిత్యము వృద్ధియయ్యెను. వారిలో హింసా ప్రవృత్తి పెరిగినందున దేవుని నీతి న్యాయములు ప్రజలను వీడిపోయెను.

ఆమోసు అను హెబ్రీపదమునకు భారము భరించుట అని అర్థము. ఆమోసు తన పేరుకు తగినట్లుగా కలహకారులైన ఇశ్రాయేలీయుల పాప భారమును భరిస్తూ, వారికి దేవుని సందేశమును అందించెను. దేవుడు తనకు అప్పగించిన పనిని ఆమోసు నెరవేర్చి, తన సేవను సంపూర్తి గావించుకొనెను.

గ్రంథకర్త : ఆమోసు

ఆమోసు కాలము : యూదా రాజైన ఉజ్జియా దినములలోను, ఇశ్రాయేలు రాజైన యోవాసు కుమారుడైన యరొబాము దిసములలోను, భూకంపము కలుగుటకు రెండు సంవత్సరములకు ముందు, ఆమోసు ప్రవచనము చెప్పుట ప్రారంభమాయెను (ఆమోసు 1:1). ఉజ్జియా యూదాను యేలిన కాలము క్రీ.పూ 792 నుండి 749 వరకు. రెండవ యరొబాము ఇశ్రాయేలును పాలించిన కాలము క్రీ.పూ 793 నుండి 753 వరకు పరిపాలన చేసెను. ఉజ్జియా కాలములో సంభవించిన ఈ భూకంపమును గూర్చి సుమారు 200 సంవత్సరములకు ముందే జెకర్యా ప్రవక్త ప్రవచించియుండెను. జెకర్యా 14:5). ఆమోసు 7:11 లో ఇశ్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురని ప్రవచించెను. ఇది క్రీ.పూ 722లో నెరవేరెను. ఆ సంవత్సరములో అష్హూరు రాజు ఇశ్రాయేలీయులను అష్హూరు దేశములోనికి చెరకొని పోయెను. ఆమోసు ఈ ప్రవచనము చెప్పియున్నప్పుడు యరొబాము చనిపోలేదు అనునది స్పష్టము. ఆమోసు దక్షిణ రాజ్యమైన యూదాలో జన్మించినప్పటికి ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు రాజ్యములోని బేతేలులో తన ప్రవచన కార్యమును క్రీ.పూ 760 నుండి 750 వరకు జరిగెను.

ఓబద్యా, యోవేలు, యోనా మున్నగు ప్రవక్తల తరువాతను, హోషేయ, మీకా, యెషయా మున్నగు ప్రవక్తల కంటే కొంచెము ముందుగాను ఆమోసు ప్రవచించెను. ఆ కాలములో ఉజ్జీయా యూదా దేశమును చక్కగా పరిపాలించెను. ఆయన అమ్మోనీయులను, ఫిలిప్తీయులను, ఎదోమీయులను జయించెను. ఉత్తర దేశమును బలవంతుడైన రెండవ యరొబాము పాలించుచుండెను. దేశము ధనవృద్ధిని, సైనిక బలమును, అభివృద్ధిని కలిగియుండెను. లోకాశ, భక్తిహీనత, అవినీతి ప్రజల జీవితములో అధికమాయెను. (ఆమోసు 2:6-8; ఆమోసు 3:10; ఆమోసు 4:1; ఆమోసు 5:10-12; ఆమోసు 8:4-6) చెప్పబడలేదు. ఈ కాలములో అష్హూరియా, బబులోను, సిరియ, ఐగుప్తుయను రాజ్యములు ఇశ్రాయేలుతో పోల్చినపుడు బలహీనముగాయున్నవని చెప్పవచ్చును. ఈ స్థితిలో ఆమోసు పలికిన అపాయమేదనగా అష్హూరియా చెరవాసము జరుగ అవకాశము లేదని ప్రజలకు తోచినది. అయినప్పటికి 30 సంవత్సరములు జరిగిన తరువాత ప్రవచన నెరవేర్పుగా ఇశ్రాయేలీయుల పతనము జరిగినది.

గ్రంథ విభజన : ఆమోసు యూదయలో తాను జన్మించిన గ్రామమును విడిచి, ఇశ్రాయేలు దేశమునకు వెళ్లెను. తాను ఎన్నడును ఎదురుచూడని ఊహించని ఒక వర్తమానమును ఇశ్రాయేలీయులకు ప్రకటింవవలెనని దేవుడు ఆయనను పిలిచెను. సుఖ భోగములలో జీవిస్తున్న ఇశ్రాయేలీయులకు న్యాయ తీర్పును గూర్చిన ఆమోసు ప్రవచనములు తమ జీవిత కాలములోనే సంభవించుటకు ఆస్కారము లేదని తలంచిరి. ప్రవక్త అందించిన ఆ వర్తమానము అంగీకరించుటకు అయోగ్యముగానున్నట్లు వారు తలంచిరి.

ముఖ్య పదజాలము : ఇశ్రాయేలీయుల మీదనున్న న్యాయతీర్పు

ముఖ్యవచనములు : ఆమోసు 3:1-2; ఆమోసు 4:11-12

ముఖ్య ఆధ్యాయము : అధ్యాయము 9, ఆమోసు మిక్కిలి ఖచ్చితముగా భయంకర న్యాయ తీర్పును గూర్చి ఇచ్చు వర్తమానములకు మధ్యలో పరిశుద్ధ గ్రంథములోని ఇతర భాగముల కంటే, మిక్కిలి విశదముగా ఇశ్రాయేలీయుల రక్షణను గూర్చి ఈ అధ్యాయములో చెప్పుట చూడగలము. అబ్రహాముతోను దావీదుతో కూడ దేవుడు ఇశ్రాయేలీయులలో చేసిన నిబంధన “మెస్సియా” రాకడలో నెరవేరుటను గూర్చి, ఐదు వచనములలో మాత్రమే ప్రవక్త స్పష్టముగా వివరిస్తున్నాడు.

గ్రంథమును ఐదు భాగములుగా విభజింపవచ్చును.

ఆమోసు 1:1-2 వచనములలో ముందున్నవి మినహాయించి నాలుగు ముఖ్య భాగములు ఈ గ్రంథములో కనిపించుచున్నవి. గ్రంథములోని ముఖ్య భాగములు క్రింద ఇవ్వబడినవి.

ఉపోద్ఘాతము : ఆమోసు 1:1- 2. 2. ఎనిమిది న్యాయ తీర్పులు : (దయస్కు, గాజా తూరు, ఎదోము, అమ్మోనీయులు, మోయాబు యూదా, ఇశ్రాయేలులపై) న్యాయ తీర్పు ఆమోసు 1:3; ఆమోసు 2:16. 3. న్యాయ తీర్పును గూర్చిన మూడు ప్రసంగములు : Amos,3,1-6,14. 4. న్యాయ తీర్పును గూర్చిన ఐదు దర్శనములు : Amos,7,1-9,10 (మిడుతలు, అగ్ని, మట్టపుగుండు , వేసవి కాలపు పండ్ల గంప, పైకమ్ములు). 5. విమోచనను గూర్చిన ఐదు వచనములు ఆమోసు 9:11-15.

సంఖ్యా వివరములు : దేవుని పరిశుద్ధ గ్రంథములో ఇది 30వ పుస్తకము; అద్యాయములు 9 ; వచనములు 146; ఆజ్ఞలు 28; ప్రశ్నలు 31; వాగ్దానములు 2; హెచ్చరికలు 117, ప్రవచనములు 121; నెరవేరని ప్రవచనములు 8; నెరవేరిన ప్రవచనములు 113; దేవుని నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 35.

Joel – యోవేలు

దక్షిణ రాజ్యమైన యూదా రాజ్యమును యోవాషు రాజు క్రీ.పూ 835వ సంవత్సరము నుండి 796వ సంవత్సరము వరకు పరిపాలించెను. ఆ రాజు కాలములో గొప్ప మిడుతల దండు ఒకటి ఆదేశములో ప్రవేశించెను. ఆదండు ఆదేశములోని పొలము పంటలను, ఫలవృక్షములను సర్వనాశనము చేయగా దేశ ప్రజలు బహుగా క్షామపీడితులైరి. అట్టితరుణములో దేవుని ప్రవక్త లేక దీర్ఘదర్శిమైన యోవేలు ద్వారా దేవుడు తన సందేశమును ప్రజల యొద్దుకు పంపెను. ఆ సందేశమే యోవేలు గ్రంథము. మిడుతల దండు సృజించిన ఈ భీబత్సము – మానవుని పాప ఫలితముగా దేవుడు పంపిన కఠిన దండనను వర్ణించుచున్నది. అయితే అంత్యదినములలో అనగా ప్రభువు దినమున దేవుడు ప్రజల మీదికి తీసుకొని రాబోవుచున్న ప్రతి దండన మిక్కిలి భయంకరముగా నుండునని యోవేలు హెచ్చరించుచున్నాడు. ప్రభువు దినమున దేశము మీదికి రాబోవు అపాయము బహుకఠినముగా నుండుననియు, దాని ముందు గత కాలపు ప్రతి దండన మిక్కిలి అల్పమైనదిగా నుండుననియు ప్రవక్త వివరించెను. ఆదినమున దేవుడు తన శత్రువులనునిత్య తీర్పునకు లోబరచును. తనకు యధార్ధముగా లోబడువారికి ఆయన శ్రేష్ఠ ఫలముల నిచ్చును.

యోవేలు అను పదమునకు హెబ్రీభాషలో యెహోవాయే దేవుడు అని అర్థము. ఈ అర్థము గ్రంథసారాంశముతో ఏకీభవించుచున్నది. దేవుడు చరిత్రయంతటిపై సర్వాధికారిగా పరిపాలించుచున్నాడని ఈ నామము స్పష్టపరచుచున్నది. సర్వశక్తి సంపన్నుడైన మన దేవుడు, సమస్త ప్రకృతి మీదను, సకల రాజ్యముల మీదను సర్వాధికారము కలిగియున్నాడు.

గ్రంథకర్త : ఈ గ్రంథరచయిత యోవేలు. యోవేలు అను పేరు గల మరి పదుముగ్గురిని పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలము. అయితే ప్రవక్తయైన యోవేలును గూర్చిన సమాచారమును ఈ గ్రంథములో మాత్రమే కనుగొనగలము. ఈ గ్రంథరచయిత పెతూయేలు కుమారుడని విశదమగుచున్నది. పెతూయేలు అనగా దేవుని చేత ప్రేరేపణ పొందినవాడు అని అర్థము. సీయోనును గూర్చియు, దేవాలయమును గూర్చియు మాటి మాటికి ప్రస్తావించుటను బట్టి యోవేలు యెరూషలేమునకు సమీపముగా నివసించెనని మనము తలంచవచ్చును. యాజకత్వమును గూర్చి యోవేలు 1:13-14; యోవేలు 2:17 మున్నగు వచనములలో చెప్పినందున యోవేలు ఏకకాలమున ప్రవక్తగాను, యాజకుడుగాను ఉండియుండెనని కొందరు అభిప్రాయపడుచున్నారు. ఏది ఏమైనను, జనులు మారు మనస్సు పొందవలెనని యోవేలు ప్రవక్త అసందిగ్ధమైన భాషలో క్లుప్తముగా, స్పష్టముగా బోధించెను.

యోవేలు కాలము : యూదయలో పరిచర్య చేసిన ప్రారంభ ప్రవక్తలలో యోవేలు ఒకడు. యోవేలు 3:16ను ఆమోసు 1:2తోను, యోవేలు 3:18ను ఆమోసు 9:13 తోను పోల్చి చూచినప్పుడు ఆయా వాక్యముల సమభావములను బట్టి ఆమోసు ఈయనకు (యోవేలుకు) సమకాలికుడని మనము తలంచుటకు వీలు కలుగుచున్నది. క్రీ.పూ 835 నుండి 796 వరకు యూదా రాజ్యపాలన గావించిన రాజాయెను. ఆయనకు రాజ్యపాలన చేయు వయస్సు వచ్చువరకు – దేశము యాజకుడైన యెహో యాదా సంరక్షణలో నుండెను. అందువలన యోవేలు తన గ్రంథములో ఏ రాజు పేరునైనను ప్రస్తావించి యుండ లేదు అని కొందరు అభిప్రాయపడుచున్నారు. యోవేలు తొలి ప్రవక్తలలో ఒకడైయుండినందున ఈయన ఎలీషా ప్రవక్తకు సమకాలికుడు అయ్యే అవకాశము గలదు.

ముఖ్య సందేశము : మహాభయంకరమైన ప్రభుదినము రాబోవుచున్నది అనునది యోవేలు అందించిన ముఖ్య వర్తమానము.

ప్రాముఖ్య వచనములు : యోవేలు 2:11; యోవేలు 2:28-29

ప్రాముఖ్యమైన అధ్యాయము : 2, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి (యోవేలు 2:12-13) అనునదియే యోవేలు పిలుపు. యూదాజనం, ప్రవక్త చెప్పిన ప్రకారము దేవుని వైపు తిరిగిన యెడల, దేవుడు తాను చేయ నుద్దేశించిన కీడును చేయక మానుకొనును అను వాగ్దానమును యోవేలు వారికి ఇచ్చియున్నాడు. హృదయ పూర్వకముగా పశ్చాత్తాపపడు వారి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడునను దేవుని వాగ్దానమును కూడ యోవేలు వారికి తెలియజేసెను. పెంతెకోస్తు దినమున మేడ గదిలోనున్న విశ్వాసుల మీదికి పరిశుద్ధాత్మ దిగివచ్చుట ఈ వాగ్దానమును అనుసరించి జరిగినదే. పశ్చాత్తాప పడని వారి మీదికి యేసు క్రీస్తు రాకడ దినములలో దేవుని న్యాయ తీర్పు వచ్చును.

సారాంశము : యోవేలు గ్రంథము నందు మిడుతల దండువలన సంభవించిన వినాశము, హానికరమైన వ్యాధులు, క్షామములు, అగ్నివలన కలుగు ప్రమాదములు సైన్యములు దండెత్తుట, ఆకాశము నుండి వచ్చు అపాయములు అను అపాయముల పట్టికను చూడగలము. రాబోవు న్యాయ తీర్పు వర్ణింపబడినది. దేవుని కృపను, విశ్వాసమును పుట్టించు దేవుని వాగ్దానములను ఈ గ్రంథములో చూడగలము. ప్రభువు దినమును గూర్చి భూతకాలములో చెప్పబడినను అది భవిష్యత్తులో జరుగనున్నది.

గ్రంథ విభజన :

(1) ప్రభువు దినము. భూతకాల దృష్టి యోవేలు 1:1-20

(అ) గతించిన కాలములో జరిగిన మిడుతల దాడి యోవేలు 1:1-12

(ఆ) పైరులు, ఫలములు నశించుట, క్షామము యోవేలు 1:13-20

(2) ప్రభువు దినము : భవిష్యత్ కాల దృష్టి Joel,2,1,21

(అ) సమీపించుచున్న ప్రభువు దినము యోవేలు 2:1-27 అన్యులు దండెత్తుట.

(ఆ) బహుదూరమున నున్న ప్రభువుదినము. యూదులు దేవుని వైపు మరలుట, అంతిమన్యాయ తీర్పు Joel,2,28-3,21

సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో ఇది 29వ పుస్తకము; అధ్యాయములు 3; వచనములు 73; ప్రశ్నలు 7; ఆజ్ఞలు 50; వాగ్దానములు 10; ప్రవచన వాక్యములు 69; నెరవేరినవి 11; నెరవేరబోవునవి 59; దేవుని యొద్ద నుండి వచ్చిన సందేశము 1. (Joel,1,2-3,21)

Hosea – హోషేయ

సొలొమోను కాలమునకు తరువాత కనాను దేశము యూదా అనియు, ఇశ్రాయేలు అనియు రెండు భాగములుగా విభాగించబడి నిలిచిన రెండు రాజ్యములలో ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలులో ప్రవచనా సేవను నెరవేర్చిన వాడు హోషేయ. ఎప్రాయీము గోత్రీకుడైన యరొబాము విభజించబడిన ఉత్తర ఇశ్రాయేలుకు

మొట్టమొదటి రాజుగా ఉండెను. భూగోళ శాస్త్ర ప్రకారము పాలస్తీనా యొక్క మధ్య భాగములో ఎఫ్రాయీము గోత్రము యొక్క నివాసములుండెను. అనేక పరిస్థితులలో ఇశ్రాయేలీయుల పది గోత్రములలో ఎంతో ముఖ్యమైన గోత్రముగా ఎఫ్రాయీము గోత్రము పరిగణించబడి నందువలన ఉత్తరదేశమును ఎఫ్రాయీము అని హోషేయ పిలిచెను. హోషేయ అంటే రక్షణ అని అర్ధము. ఇశ్రాయేలు యొక్క పతనమైపోయిన ఆత్మీయ స్థితికి ఉదాహరణముగా గోమెరు అను స్త్రీని దేవుని ఆజ్ఞానుసారముగా హోషేయ పెండ్లాడెను. ఇశ్రాయేలీయుల విగ్రహారాధనకును, దేవునితో కలిగియున్న యదార్థత లేని స్థితికిని ప్రవక్త యొక్క కుటుంబము ఒక క్రియారూపకమైన పాఠముగా మార్చబడినది. హోషేయ ప్రవచనములో మూడు ముఖ్య భాగములు ఇమిడియున్నవి. 1. దేవుడు తన ప్రజల పాపములను ద్వేషించుచున్నాడు. 2. దేశము తీర్పు పొందడం నిశ్చయము. 3. తమ ప్రజలతో దేవునికున్న ప్రేమ ఏ మాత్రము మార్పు చెందనిది.

గ్రంథకర్త : బెయేరి కుమారుడైన హోషేయ ఈ గ్రంథము యొక్క గ్రంథకర్త. అని మొదటి వచనము హక్కుతో మెచ్చుకొనుట ఎవరు కాదనలేరు. ఆయన జన్మించిన ప్రదేశము ఏది అని ఎక్కడా వ్రాయబడలేదు. అయినను ఉత్తర దేశమైన ఇశ్రాయేలుతో నిరంతర సంబంధము కలిగిన వాడుగా నుండినందున ఆయన జన్మించిన స్థలము యూదా కాదుగాని ఇశ్రాయేలుగా ఉండి ఉండవచ్చును. హోషేయ 7:5 లో ఇశ్రాయేలు రాజును గూర్చి మన రాజు అని చెప్పుట ఈ తలంపును నిర్ధారణ చేయుచున్నది. భార్య గోమెరును ఇద్దరు కుమారులును, ఒక కుమార్తెయు కలిగిన కుటుంబముగా కనబడెను. (హోషేయ 1:1-9) పరిశుద్ధ గ్రంథములో ఇతర స్థలములన్నీటిలో ఆయనను గూర్చిన వర్తమానము ఏవియును తెలిసికొనుటకు తరుణము లేదు.

తమ దేశ ప్రజలైన ఇశ్రాయేలు యొక్క మోసము, నరహత్యలు, అబద్ధము, కృతజ్ఞతలేని స్థితి, విగ్రహారాధన, దురాశ అనువాటినన్నింటిని గూర్చి హెచ్చరించుచున్నాడు. అయినను ఆయన వార్త మిక్కిలి కరుణతో కూడినదై నమ్మకముతో నింపబడినదిగానున్నది. హోషేయ తమ స్వంత జీవితములో వ్యభిచార జీవితమును జీవించిన భార్య గోమెరు ద్వారా అనుభవించిన దుఃఖము ఆయన హృదయమును కనికరముతో నిండియుండియుండవచ్చును.

కాలము :- హోషేయ 1:1 లో చూచిన రీతిగా ఉజ్జీయా, యోతాము ఆహాజు హిజ్కియా మొదలైన యూదా రాజులకాలములోను, రెండవ యరొబాము అను ఇశ్రాయేలీయుల రాజు కాలములోనే హోషేయ తన సేవను నెరవేర్చెను. ఇశ్రాయేలీయులలో మరియొక ప్రవక్తగా యుండిన ఆమోసు, యూదా ప్రవక్తగా నుండిన యెషయా, మీకా, అనువారి యొక్క కాలములో నుండిన ప్రవక్తగా ఈయన ఉంటున్నాడు. హోషేయ యొక్క దీర్ఘకాల ప్రవచనము రెండవ యరొబాము కాలములోను తరువాత ఇశ్రాయేలీయుల రాజు యొక్క చివరి కాలములో పరిపాలించిన జెకర్యా నుండి హో షేయ వరకు గల ఆరుగురు రాజుల కాలములోను కొనసాగెను. ఆయన సేవాకాలము దాదాపుగా క్రీ.పూ 755 నుండి క్రీ.పూ 710 వరకు అని ఊహించవచ్చును. క్రీ.పూ 710 సంవత్సరముమునకు సమీపించిన హిజ్కియా పరిపాలనా కాలములో హో షేయ తన ప్రవచనా గ్రంథమును వ్రాసినట్లుగా తీసుకోవచ్చును. తన ప్రవచనా సేవ యొక్క నలుబది సంవత్సరముల కాల కార్య క్రమములతో నిండినది హోషేయ గ్రంథము.

హోషేయ సేవ ప్రారంభకాలములో ఇశ్రాయేలు రెండవ యరొబాము యొక్క పరిపాలన క్రింద సమృద్ధికలిగియుండెను. అయినను మూడవ తిగ్లత్పిలెసెరు యొక్క (క్రీ.పూ 745 – 727 ) పరిపాలనలో అష్హూరు ఎంతో ప్రఖ్యాతిగాంచిన వెంటనే ఇశ్రాయేలు పతనము వైపు సాగెను. చివరి ఆరుగురు రాజుల పరిపాలనా కాలములో ఎంతో క్లుప్తమైనవిగా నుండెను. వారిలో నలుగురు చంపబడిరి. 5వ రాజు బానిసగా అష్హూరుకు కొనిపోబడెను. ఉత్తర దేశపు రాజు యొక్క చివరి దినములు కలవరముతోను, వెనుకంజవేయు స్థితితో నిండినదిగా నుండినవి. అధర్మము విగ్రహారాధన ద్వారా ప్రజలు ఆత్మీయ గ్రుడ్డితనములో జీవించిరి.

ముఖ్యమాట : తిరుగుట, అధర్మము, విగ్రహారాధన విడిచి పెట్టి యెహోవా వైపు తిరుగుటకు ఆహ్వానము ఈ ప్రవచనా గ్రంథమంతటిలో మ్రోగడము మనము వినగలము.

ముఖ్య వచనములు : హోషేయ 4:1; హోషేయ 11:7-9

ముఖ్య అధ్యాయము : హోషేయ 4, ఇశ్రాయేలీయులు సత్యమును గూర్చిన జ్ఞానమును విడిచి అన్యులయొక్క విగ్రహారాధనను వెంబడించిరి. నా జనములు జ్ఞానము లేనివారైనశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండ నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేను నీ కుమారులను మరుతును అని హోషేయ 4:6 లో చూచుచున్న మాటలు హోషేయ ప్రవచనా వర్తమానము యొక్క ముఖ్యాంశమైయున్నది.

విభజన : యూదా దేశపు చివరి దినములలో యిర్మీయా చేసిన ప్రవచనా సేవతో ఇశ్రాయేలు యొక్క చివరి దినములలో దేవుని శుభవర్తమానమును ప్రకటించిన హోషేయ సేవను సరిపోల్చివచ్చును. శీలసంబంధముగా, యదార్థతలేని స్థితిని పడిపోవుచున్న ఇశ్రాయేలీయులు తిరిగి తన వైపు తిప్పుకొనుటకు దేవుడు చేసిన చివరి ప్రయాసమని దీనిని మనము ఊహించవచ్చును. భార్య భర్త బాంధవ్యములో ఒక్కరు మాత్రము యదార్థముగా ప్రేమలో నిలిచిన హోషేయ యొక్క స్వంత జీవితమువలె ఇశ్రాయేలుకు దేవుని గల సంబంధము కనబడినది. హోషేయ కుటుంబ జీవితములో కనబడిన దుర్మార్గాస్థితి ఇశ్రాయేలు దేశమునకు ఏర్పడిన దుర్మార్గస్థితికి చిత్రపటముగా పరిగణింపబడుచున్నది. గోమెరు అన్య ప్రజలను వెంబడించినట్లుగా ఇశ్రాయేలు అన్యదేవతలను వెంబడించెను. హోషేయ గ్రంథమును ఈ రెండు గొప్ప భాగములుగా విభజించవచ్చును.

దుర్మార్గముతో నిండిన భార్యయు యధార్థతగల భర్తయు అధ్యా 1 – 3.
విగ్రహారాధనతో నిండిన ఇశ్రాయేలును యదార్ధతగల దేవుడును 4 -14.
మానవులు పాపములో పడి యదార్థత లేనివారుగా మారినపుడు, యదార్థత, ప్రేమ అనువాటిలో మార్పు లేనివాడును. వారి ఉజ్జీవము కొరకు ప్రేమతో కని పెట్టుచున్న దేవుని యొక్క స్వభావము ఈ గ్రంథములో మనము చూచుచున్నాము.

కొన్ని ముఖ్య వివరములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 28వ గ్రంథము, అధ్యాయములు 14; వచనములు 197; ప్రశ్నలు 16; ఆజ్ఞలు 26; వాగ్దానము 10; హెచ్చరికలు 298; ప్రవచనా వచనములు 152; నెరవేరని ప్రవచనములు 17; నెరవేరిన ప్రవచనములు 134; దేవుని యొద్ద నుండి ప్రత్యేకమైన వర్తమానములు 10.

Daniel – దానియేలు

దానియేలు యొక్క జీవితము, సేవయు బబులోను చెరనివాసకాలమైన డెబ్బై సంవత్సరములు విస్తరించియున్నది. 16వ ఏటే చెరపట్టబడిన దానియేలు రాజకార్యము నిమిత్తము ఎన్నుకొనబడ్డాడు. దాని తరువాత దేవుని తాత్కాలిక నిత్య ఉద్దేశమును ఇశ్రాయేలీయులకు అన్యజనులకు బయలుపరచు దేవుని ప్రవక్తగా ఉన్నాడు. దానియేలు గ్రంథములోని 12 అధ్యాయములలో 9 అధ్యాయములు దేవుని దర్శనములు, కలలు, ఉదాహరణముతో నిండిన ప్రవచనములతో నిండి కనిపిస్తున్నవి. ప్రత్యేక జనులు మరియు దేశముల యొక్క జీవిత సంభవములలో దేవుని నడిపింపు, ప్రణాళిక ఏ విధముగా క్రియచేయుచున్నదని దానియేలు గ్రంథము మనకు తెలియజేయుచున్నది. దానియేలు అను పదమునకు దేవుడు నాకు న్యాయాధిపతి అని అర్థము.

గత చరిత్ర : దానియేలును అతని ముగ్గురు స్నేహితులు సమస్త జ్ఞానములోను శ్రేష్ఠులును రాజ కార్యమునకు యోగ్యులైనవారు (దానియేలు 1:4) వారికి బబులోను తర్పీదు శాలలో 3 సంవత్సరములు తర్పీదు లభించింది. (దానియేలు 1:5) వారి స్వదేశ పేరులను మార్చుటకు బెత్తెషాజరు అను క్రొత్త పేరు దానియేలుకు ఇవ్వబడినది. దానియేలు యొక్క జ్ఞానము మరియు కలల భావము చెప్పు సామర్థ్యము వలన ఆయనకు నెబుకద్నెజరు, దర్యావేషుల రాజ్యాంగములలో ప్రవేశము కలిగినది. ఎటువంటి అపవిత్రతకును లోనుకాని దానియేలును నీతితో నిండిన జీవితమునకు మాదిరిగా యెహెజ్కేలు చూపించుచున్నాడు. (యెహె 14 – 20, 28: 13) విశ్వాసము, ప్రార్థన జీవితము, ధైర్యము, నీతి భక్తి, క్రమము అనునవి నిండిన జీవితముగా ఆయన జీవితము ఉన్నది. నీవు బహుప్రియుడవు అని ప్రభువు ఆయనను పిలుచుచున్నాడు. బబులోను సామ్రాజ్యము పతనమయి మాదీయ పారశీక సామ్రాజ్యము వచ్చినప్పటికిని దానియేలు తన శేష్టమైన పదవిలో కొనసాగాడు. నెబుకద్నెజరు, బెల్లసరు, దర్యావేషు, కోరెసు, అను నలుగురు రాజుల కాలములోను ప్రధానమంత్రి అను శ్రేష్టమైన పదవిని వహించాడు.

గ్రంథకర్త : దానియేలు

దానియేలు కాలము : అష్హూరు సామ్రాజ్యమునకు విరోధముగా బబులోను కలవరము చేసి క్రీ.పూ. 612లో అష్హూరు రాజధాని అయిన నినెవేను పట్టుకున్నది. క్రీ.పూ. 605 ఐగుప్తు సైన్యమును జయించుట ద్వారా మధ్య తూర్పు దేశములపాలన ఆధిక్యము బబులోనుకు లభించింది. అదే సంవత్సరములో నెబుకద్నెజరు యెరూషలేమును జయించినపుడు చెరపట్టబడినవారిలో ఒకడుగా దానియేలు ఉన్నాడు. బబులోను చెరనివాసకాలమంతయు ఒక పాలకుడుగాను, ప్రవక్త గాను దానియేలు జీవించాడు. మాదీయులు పారశీకులు బబులోనును హస్తగతం చేసుకున్నాను. దానియేలు యొక్క పదవిలో మార్పు కలుగలేదు. పారశీక రాజైన కోరెషు యొద్ద పలుకుబడి పొందుటకు నూరు సంవత్సరములకు ముందే యెషయా కోరెషును గూర్చి ప్రవచించిన ప్రవచనమును ఆయన గ్రహింపునకు తెచ్చుటకు దానియేలు ప్రయత్నించియుండవచ్చును. దాని యొక్క ఫలితముగానే కోరెషు తన పాలన మొదటి సంవత్సరములోనే యెరూషలేము దేవాలయము మరల కట్టబడుటకు ఆజ్ఞను జారీ చేసియుండవచ్చును. దానియేలు

ప్రవచించిన విధముగా పారశీకరాజ్యము అలెగ్జాండరు దండెత్తువరకు నిలిచియుండినది. (దానియేలు 11:2-3), దాని తరువాత గ్రీకు సామ్రాజ్యము దాని పతనము తరువాత రోమా సామ్రాజ్యమును ఉద్భవించినవి.

ముఖ్య స్థలములు : నెబుకద్నెజరు యొక్క అంతఃపురము; అగ్నిగుండము, బెల్లసరు యొక్క విందుశాల, సింహముల గుహ.

గ్రంథ విశిష్టత : దానియేలు యొక్క దైవ దర్శనములు, మెస్సియాను గూర్చి సూటియైన ప్రవచనముల వంటివి నిండిన అనేక కాల మట్టములలో దేవుని ప్రణాళికలను గూర్చిన ఒక క్లుప్త వివరణ ఈ గ్రంథములో ఇవ్వబడియున్నది. ( 8 – 12 అధ్యాయములు)

ముఖ్య పదజాలము : మహోన్నతుడైన దేవుడు, మానవుల రాజ్యాంగములను, పదవులను నియంత్రించే ఉన్నతమైన దేవుని ఈ ప్రవచనము మనకు చూపించుచున్నది. దేవుని యొక్క మార్పులేని పాలన ఎల్లప్పుడును ఉండునను దానిని దానియేలు తెలియజేయుచున్నాడు.

ముఖ్య మైన వచనములు : దానియేలు 2:20-22; దానియేలు 2:44

ముఖ్యమైన ఆధ్యాయము : దానియేలు 9; డెబ్బై (70) వారములను గూర్చిన ప్రవచనము Dan,9,24,27 లో కనిపించుచున్నది. వీటిలో మొదటి 69 వారములు క్రీస్తు యొక్క రాకడతో నెరవేరినవననునది స్పష్టము. 69 – 70 వారముల మధ్యలో ఒక విరామము ఉన్నట్లుగా బైబులు పండితులు అభిప్రాయపడుచున్నారు. మనము ఈ వివిరామకాలములో జీవించుచున్నాము. 70వ వారము క్రీస్తు యొక్క రెండవ రాకడకు సంబంధించిన 7 సంవత్సరములను చూపించుచున్నది. ఎప్పుడు ఆ 70వ వారము వస్తుంది? దేవునికి మాత్రమే తెలుసు.

గ్రంథ విభజన : పాతనిబంధన ప్రకటన గ్రంథము అని పిలువతగిన దానియేలు ప్రవచన గ్రంథము దీర్ఘకాల ప్రపంచ చరిత్రను తెలిపే గ్రంథమగును మొదటి అధ్యాయము యొక్క ఉపోద్ఘాతము అర్ధమయిన తరువాత 2 నుంచి 7 వరకున్న అధ్యాయములలో లోకము యొక్క భవిష్యత్తు చెప్పబడియుంటున్నది. 8 నుండి 12 వరకైన అధ్యాయములలో అన్యజనుల పాలన క్రింద యూదా ప్రజల భ విష్యత్తు చెప్పబడియున్నది. ప్రపంచ చరిత్రపై దేవుని పరిపాలన (అధికారము) అను అభిప్రాయము ఈ ప్రవచనముల మూలముగా గ్రాహ్యమగుచున్నది. అది బబులోనీయుల వలన నాశనము చేయబడిన యూదా ప్రజలకును, క్రైస్తవ సంఘములకును ఓదార్పును, ఆధరణను ఇచ్చుచున్నది. బబులోను, పారశీకము, గ్రీకు, రోమా మహాసామ్రాజ్యములు ఉదయించి అస్తమించును. అయినను దేవుని విమోచన జనము ద్వారా ఆయన తన నిత్యరాజ్యమును స్థాపిస్తాడు. దానికి ఎప్పుడును అంతము లేదు. గ్రంథవిభజన క్రింద చూడండి.

దానియేలు యొక్క వ్యక్తిగత జీవితము అధ్యాయము 1.
అన్యజనుల దేశముల భవిష్యత్ కాల స్థితి అధ్యాయము 2 – 7.
(a) నెబుకద్నెజరు కలలు అధ్యా 2 – 4.

(b) బెల్లసరు దర్శనము అధ్యా 5.

(C) దర్యావేషు ఆజ్ఞ అధ్యా 6.

(d) నాలుగు (జంతువుల) దర్శనము అధ్యా 7 (మృగముల)

ఇశ్రాయేలీయుల భవిష్యత్ కాల స్థితి. అధ్యా 8 – 12.
( a) పొట్టేలు మరియు మేకపోతుల దర్శనము. అధ్యా 8.

(b) 70 వారముల గూర్చిన దర్శనము అధ్యా 9.

(C) ఇశ్రాయేలీయుల భవిష్యత్తును గూర్చిన దర్శనము. అద్యా 10 – 12.

కొన్ని క్లుప్త వివరములు : పరిశుద్ధ గ్రంథములో 27వ గ్రంథము, అధ్యాయములు 12, వచనములు 357; ప్రశ్నలు 16; చరిత్రకు సంబంధించిన వచనములు 218; నెరవేరిన ప్రవచనములు 79; నెరవేరని ప్రవచనములు 60; ఆజ్ఞలు 7; వాగ్దానములు 4; దేవుని యొద్ద నుండి ప్రత్యేక వర్తమానములు 16.

Ezekiel – యెహెఙ్కేలు

యెహెజ్కేలు ఒక యాజకుడుగాను, ప్రవక్త గాను ఉన్నాడు. ఈయన యూదా చరిత్రలో మిక్కిలి అంధకారకాలమైన 70 సంవత్సరముల బబులోను చెర నివాస కాలములో దేవుని కొరకు శత్రుదేశమైన బబులోనులో తనయొక్క ప్రవచన సేవను నెరవేర్చాడు. యెరూషలేము నాశనమగుటకు ముందు బబులోనుకు కొనిపోబడిన ఈ ప్రవక్త దర్శనములు, ఉపమానములు, రూపములు, ప్రవచనములు వంటి అనేక మార్గములలో చెరలో తనతో ఉన్న ప్రజలకు ప్రవచించాడు. చెదరిన ఎముకలవలె వారి అప్పటి స్థితి కనిపించుచున్నను దేవుడు వారిని మరల తనతో చేర్చుకుంటాడు. వారికి జీవమును పోసి మరల ఒక దేశముగా వారిని నిలుపుతాడు. భూత కాలములో సంభవించిన శిక్ష రాబోవు మహిమకు మార్గమును సిద్ధపరుస్తుంది. ఈ విధముగా నేను యెహోవానని మీరు తెలిసికొనెదరు అనునదే యెహెజ్కేలు యొక్క వర్తమానము.

హెబ్రీ భాషలో యెహెజ్కేలు అనియు గ్రీకు భాషలో యెజేక్కియేలు అనియు స్వల్ప భేదముతో కనపడు ఈ పేరు యొక్క అర్థము దేవుడు బలపరుస్తాడు అనునదే. దేవుడు పిలిచి ఏర్పరచిన ప్రవచనా సేవ నిమిత్తము యెహెజ్కేలును ఆయన బలపరుచుటను మనము చదువగలము (యెహెఙ్కేలు 3:8-9), యెహెజ్కేలు అను ఈ పేరు ఈ గ్రంథములో రెండు చోట్ల తప్ప పాత నిబంధనలో మరెక్కడను చూడలేము.

గ్రంథకర్త : బూజీ కుమారుడైన యెహెజ్కేలు వివాహమైన వాడు. నెబుకద్నెజరు చివరిసారిగా యెరూషలేమును ముట్టడించినపుడు యూదులకు ఒక సాదృశ్యముగా ఆయన భార్య మరణించినది. (యెహెఙ్కేలు 24:16 -24) యిర్మీయా వలె ఒక యాజకుడుగా ఉన్న ఈయనను తన ప్రవచన సేవ చేయుటకు దేవుడు పిలిచాడు. దేవాళయము, యాజకత్వము, బలులు, దేవుని మహిమ అనునవి ఆయన ప్రవచనములలో గట్టిగా చెప్పబడుటను చూడగలము. దేవుని శక్తి, దేవుని ప్రణాళిక అనువాటిని బయలుపరచే అనేక దర్శనములు యెహెజ్కేలుకు కలిగినవి. పొందిన దర్శనములను ఉపయోగకరమైన రీతిలో వివరించి వ్రాయుటకు ఆయన ఇష్టపడ్డాడు.

ఈ గ్రంథములో అక్కడక్కడ నేను అను సర్వనామమును ఉపయోగించి ప్రవక్త తన వర్తమానములను తెలియజేశాడు. ఈ విధముగా చెప్పేవాడు యెహెజ్కేలే అని యెహెఙ్కేలు 1:3; యెహెఙ్కేలు 24:24 అను వచనములు తేటపరచుచున్నవి. కనుక ఈ గ్రంథకర్త యెహెజ్కేలు అనుటలో సందేహము లేదు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నరపుత్రుడా నేను యెహోవానని తెలిసికొనెదరు అను పదజాలము పదేపదే వచ్చుచున్నది. ప్రారంభము నుండి చివరి వరకైన ఒకే వ్రాతశైలి ఈ గ్రంథమంతటిని యెహెజ్కేలే వ్రాశాడు అని సాక్ష్యమిచ్చుచున్నవి.

ఉద్దేశము : ఇశ్రాయేలులోను, అన్యదేశములలోను రాబోవు దేవుని శిక్షను గూర్చి చెప్పుట, దేవుని ప్రజల చివరి రక్షణను ముందుగానే తెలియజేయుట.

గ్రంథకర్త : యెహెజ్కేలు, లేవి గోత్రకుడును, యాజకుడునైన బూజీ కుమారుడు.

ఎవరికి వ్రాశాడు : బబులోను చెరలో ఉన్న యూదులకు, సమస్త దేశములలో ఉన్న దేవుని ప్రజలకు.

కాలము : సుమారు క్రీ.పూ. 571

గత చరిత్ర : యూదాను యెహోయాకీను రాజు పరిపాలించుచున్న క్రీ.పూ. 597 లో బబులోను రాజు యూదాను హస్తగతం చేసుకుని జనులను బబులోను చెరకు తీసుకుని వెళ్ళాడు. ఈ విధముగా చెరగొన్నబడినవారిలో ఒకడు ఈ యెహెజ్కేలు. బబులోను చెరనివాసుల మధ్య తన ప్రవచన సేవను చేసినవాడు యెహెజ్కేలు. యిర్మీయా కంటే వయస్సులో చిన్నవాడైన యెహెజ్కేలు బబులోనులోను, యిర్మీయా యూదాలోను ఒకే సమయములో ప్రవక్తలుగా జీవించారు.

ముఖ్యమైన వచనములు : Eze,36,24,26

ముఖ్యమైన వ్యక్తులు : యెహెజ్కేలు, ఇశ్రాయేలు నాయకులు, యెహెజ్కేలు భార్య, నెబుకద్నెజరు,

ముఖ్యమైన స్థలములు : యెరూషలేము, బబులోను, ఐగుప్తు

ముఖ్యమైన పదజాలము : భవిష్యత్ కాల మహిమ. బబులోను చెరలో జీవించుచున్న దేవుని ప్రజలకు వారికి సంభవించిన కీడునకు కారణము వారి పాపములే కారణమని యెహెజ్కేలు జ్ఞాపకము చేయుచున్నాడు.

దానితో రాబోవు కాలములో మహిమ కరమైన విడుదల వారికి ఉందని బోధించుచున్నాడు. దేవాలయమును విడిచి తొలగిన దేవుని మహిమ మరల దానిని నింపునట్లుగా చిత్రించిన భాగములను చూడుము. (యెహెఙ్కేలు 43:27; యెహెఙ్కేలు 44:4).

ముఖ్య మైన వచనములు : యెహెఙ్కేలు 36:24-26; యెహెఙ్కేలు 36:33-35.

ముఖ్యమైన అధ్యాయము : యెహెజ్కేలు 37. ఇశ్రాయేలీయుల భవిష్యత్ కాల నమ్మకమును రమ్యముగా బయలుపరచే ఒక భాగముగా చెదరిన ఎముకల ప్రవచనము ఉన్నది. ఇశ్రాయేలీయుల భవిష్యత్ కాలము ఎంత మహిమకరముగా ఉంటుందో అనునది ఈ భాగము తేటపరచుచున్నది.

గ్రంథ విభజన : నాలుగు భాగములుగా ఈ ప్రవచన గ్రంథమును విభజింపవచ్చును.

(1). యెహెజ్కేలుకు కలిగిన దేవుని దర్శనము, దేవుని నడిపింపు. అధ్యా 1 -3 వరకు, (2). యూదాపైకి రాబోవు న్యాయ తీర్పు (శిక్ష) అధ్యా 4 – 24 వరకు, (3). చుట్టు ఉన్న అన్యజనులకు న్యాయ తీర్పు (శిక్ష) అధ్యా 25 – 32 వరకు, (4). ఇశ్రాయేలీయుల విమోచన, దేవాలయము యొక్క పునర్వీకరణ ఆధ్యా 33 – 48 వరకు.

వాగ్దాన దేశమైన కనానులో నుండి పెరికి వేయబడిన పిమ్మట స్వంతముగా ఒక దేశమో, రాజు లేకుండా, స్వాతంత్ర్యమైన ఒక జీవితమునకు, కార్యమునకు, ఆరాధనకు అవకాశము లేకుండా పాడైన గుంటలో పడిపోయిన చెరనివాసులకు దేవుని వర్తమానములను తెలియజేయులాగున యెహెజ్కేలు ఏర్పరచబడ్డాడు. మొదటి అధ్యాయములో ఆయన చూచినట్లుగా ఉన్న దేవుని దర్శనము పాతనిబంధనలో మోషేకు, యెషయాకును, కొత్త నిబంధనలో యోహానుకును కలిగిన దర్శనములకు సమానమైనది. యెషయా, యిర్మీయా వలె ఒకే సారి దేవుని న్యాయ తీర్పు శిక్షను గూర్చి మరియు మహిమాయుక్తమైన భవిష్యత్ కాలమును గూర్చి ఆయన మాట్లాడుచున్నాడు. దేవుని మహిమ యెరూషలేము దేవాలయమును విడిచి వెళ్లుచున్నట్లుగా ఆయన పొందిన దర్శనము పదవ అధ్యాయములో వివరించబడియున్నది.

పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచుట ద్వారా క్రైస్తవ సమాజమునకును, వ్యక్తులకును నేడు సంభవించిన స్థితి ఇదే. కోల్పోయిన మహిమను తిరిగి పొందుటకు ఒకే మార్గము పాపములను విడిచి దేవుని వైపుకు తిరుగుట. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్దియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రదుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. (యెహెఙ్కేలు 18:31-32), ఇటువంటి సజీవమైన మానవహృదయములో నుండి సమాజములో నుండి దేవుని జీవజలనదులు బయలుదేరి చుట్టు సశ్యశ్యామలముగా చేయుటను గూర్చి 47వ అధ్యాయములో వివరించుచున్నాడు.

కొన్ని సంఖ్యా వివరములు : దేవుని గ్రంథములో 26వ గ్రంథము; అధ్యాయములు 48; వచనములు 1273; చరిత్రాత్మిక వచనములు 310; నెరవేరిన ప్రవచనములు 530; నెరవేరని ప్రవచనములు 433; హెచ్చరికలు 953; నెరవేరిన హెచ్చరికలు 659; నెరవేరని హెచ్చరికలు 294; ఆజ్ఞలు 345; వాగ్దానములు 25; ప్రశ్నలు 80; దేవుని యొద్ద నుండి ప్రత్యేక సందేశములు 179.

Lamentations – విలాపవాక్యములు

ఒక మహానగరము యొక్క గోషలాగ విలాపవాక్యములు కనబడుచున్నది. ఒక కాలములో యూదుల యొక్క అతిశయింపదగిన పట్టణముగా కనిపించిన యెరూషలేము బబులోనియులు స్వాధీనపరచుకొనినదానిని బట్టి ఆ పట్టణము ఒక ఇసుక దిబ్బలాగా మార్చబడిన సంగతులను కన్నీరు భాషగా విలాపించుచున్నారు.

గ్రంథకర్త ఐదు విలాప కావ్యముల కూర్పును యిర్మీయా ఈ గ్రంథము ద్వారా తన యొక్క వేదనతో కూడిన ఆలోచనలకు రెక్కలు ఇచ్చుచున్నాడు. యెరూషలేము పట్టణము కూలిపోయినది అది అందరికి అపహాస్యాస్పదముగా మార్చబడినది.

ఈ విలాప వాక్యములను అక్షర వరుసక్రమములో వ్రాసియున్నాడు. గ్రంథర్త 1 నుండి 4 వరకు ఒక్కొక అధ్యాయము ఆలెఫ్ అనబడిన హెబ్రీభాష మొదటి అక్షరముతో ప్రారంభించి తదుపరి వచ్చు ఒక్కొక్క వచనము వరుస క్రమములో మొదటి అక్షరముతో ప్రారంభించి చివరి అక్షరముతో ముగియబడుచున్నది. ఈ గొప్ప బాధకరమైన ప్రత్యక్షత మధ్యలో యెహోవా నీ యొక్క యదార్ధత గొప్పదైయున్నది. అనెడి ప్రకటన ద్వారా ఆధరణను నిరీక్షణను పొందుచున్నారు. ఈ విధముగా మిక్కిలి కీడైన బాధను విశ్వాసము యొక్క జయముగా మార్చుటకు యిర్మియా ప్రయాసపడుచున్నాడు.

గ్రంథకర్త : విలాపవాక్యముల యొక్క గ్రంథకర్త ఎవరని ఈ గ్రంథములో సూటిగా చెప్పబడలేదు. అయినప్పటికినీ అనేకమైన ఆంతర్యసాక్ష్యములు మరియు బాహ్య సాక్ష్యములును దీని యొక్క గ్రంథకర్త యిర్మీయా అని సాక్షమిచ్చుచున్నవి. సెప్టోజెంట్ భాషాంతర పరిచయ వాక్కులలో ఈ విధముగా వ్రాయబడియు యెరూషలేము నిర్మూలన చేయబడినది ఇశ్రాయేలీయులు దాసులుగా చెరపట్టబడిన తదుపరి యెరూషలేమును గూర్చి విలపించుచూ యిర్మీయా ఈ విలాప వాక్యములను విలపించెను. ప్రారంభకాల యూదా క్రైస్తవ పారంపర్యములు కూడా ఏక స్వరముతో ఈ గ్రంథకర్త యిర్మీయా అని అగీకరించుచున్నవి.

గ్రంథములో వివరించు సందర్భములో ముఖాముఖిగా చూచిన దృశ్యములుగా కనిపించుట గమనించదగినవి. (విలాపవాక్యములు 1:13-15; విలాపవాక్యములు 2:6-9; విలాపవాక్యములు 4:1-12 మొదలగు భాగములను చూడుము) యెరూషలేము పతనమైనది ముఖాముఖిగా చూచుట మాత్రమే కాదుగాని అందులోని జనులు దాసులుగా బబులోనుకు కొనిపోబడిన తరువాత కూడా కొంత కాలము అక్కడనే నివశించెను. యిర్మీయా ప్రవచనా భాషాశైలికి భిన్నమైనదిగా ఇది కనిపించుచున్నదని కొందరు విమర్శించుచున్నారు. పద్యభాగమునకు, గధ్య భాగమునకు మధ్యలో భాషాశైలిలో భేదముండుట సహజమే. అయినప్పటికినీ యూదా ప్రజల పతనమును గూర్చిన దుఃఖము అంజలియు ఈ రెండు గ్రంథములలో ఒకే విధముగా ధ్వనించుచున్నవి.

కాలము : యెరూషలేము పతనమైన తరువాత ప్రారంభ సంవత్సరములలో ఈ గ్రంథమును వ్రాసి ఉండవచ్చును క్రీ.పూ 588 నుండి 586 వరకు నెబుకద్నెజరు యొక్క సైన్యము యెరూషలేమును ముట్టడి వేసెను. క్రీ.పూ. 586 సంవత్సరము ఆగస్టు నెలలో పట్టణము పతనమైనది. యూదాలో సంభవమునకును మిగిలిన ప్రజలు యిర్మీయాను వారితో కూడా ఐగుప్తుకు తీసుకువెళ్ళుటకు మధ్యకాలములో ఈ గ్రంథము వ్రాయబడి ఉండవచ్చును.

ముఖ్య పదము : దుఖఃము

ముఖ్య మైన వచనములు : విలాపవాక్యములు 2:5-6; విలాపవాక్యములు 3:22-23

ముఖ్యమైన అధ్యాయము : అధ్యా 3. నాశనము, లేమి, నీరసత్వము అనునవి పొంగిపొర్లే ఈ గ్రంథములో తాను దేవుని వాగ్దానములను, మరియు దేవుని యదార్థతను ప్రాధమికాంశముగా కలిగిన ఒక విశ్వాసములో గ్రంథకర్త ఆశ్రయమును పొందుటను చూచుచున్నాము. మిగతా నాలుగు అధ్యాయములలో వేదనతో కూడిన ఆలోచనలకు మధ్యలో దేవుని యొక్క కనికరములో నిరీక్షణ కలిగిన మహిమతో నిండిన పూర్ణ విశ్వాసమును విలాపవాక్యములు 3:22-25 లో చూడగలము.

గ్రంథ విభజన : 40 సంవత్సరము లకు పైగా యెరూషలేముకు వచ్చు తీర్పును గూర్చి ప్రవచనము పలికి హెచ్చరికలను ఇచ్చిన ప్రవక్తగా యిర్మీయా కనిపించుచున్నాడు. క్రీ.పూ. 586 సంవత్సరములో నెబుకద్నెజరు యెరూషలేమును పతనము చేసిన తరువాత తనయొక్క హెచ్చరికలను అశ్రద్ధ చేసిన యూదులను నిర్లక్ష్యపరచి నేరము మోపుటకు యిర్మీయా ప్రయత్నించలేదు. అదే సమయములో యెరూషలేము యొక్క దుస్థితిని చూచి వేదనతో విలపించెను. ఈ విధముగా తన దేశ ప్రజలతో ఏకీభవించెను. పాపులును కఠిన హృదయము గలవారుగా కనిపించిన తన దేశ ప్రజలతో కఠినమైన దేవుని వాక్కులను ప్రకటించుటకు నియమింపబడిన ప్రవక్త యొక్క కనికరముగల మనసును ఈ గ్రంథము ప్రతిబింబిచుచున్నది. దీని అధ్యాయములకును దాని సారాంశముల మూలానుసారముగా ఇవ్వబడిన పేర్లు క్రింద ఇవ్వబడినవి.

అధ్యాయము 1 : యెరూషలేము నాశనము

అధ్యాయము 2 : దేవుని కోపము

అధ్యాయము 3 : కనికరము కొరకైన విన్నపము

అధ్యాయము 4 : యెరూషలేము ముట్టడి

అధ్యాయము 5 : విమోచనకొరకైన విన్నపము

కొన్ని క్లుప్త వివరములు : పరిశుద్ధ గ్రంథములో 25వ పుస్తకము ; అధ్యాయములు 5; వచనములు 154; ప్రవచన వచనములు 2; ప్రశ్నలు 13; ఆజ్ఞలు 3; వాగ్దానములు లేవు; హెచ్చరికలు 2; దేవుని యొద్ద నుండి ప్రత్యేక వర్తమానములు లేవు.

Jeremiah – యిర్మియా

యూదాకు మిక్కిలి అపాయకరమైన కాల స్థితిలో దేవుని ద్వారా లేపబడిన ఒక యౌవనుడు యిర్మీయా. సామర్థ్యములేని వారిని త్రోసివేయబడిన అనేకులను దేవుడు తన యొక్క ఉద్దేశము కొరకు లేక పని కొరకు ఏర్పరచుకొనుచున్నాడు. సున్నితమైన, లేక మృదువైన మనసు ధైర్యము లేని వాడైన యిర్మీయాను అసాధారణమైన వాక్కులను పలుకుటకు దేవుడు ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు, యూదా అని కనాను విభజించబడియున్నది.

ఇశ్రాయేలు అష్హూరీయుల చేత నిర్మూలమైన తరువాత 136 సంవత్సరం యూదా ప్రభుత్వము నిలిచియున్నది. అలాంటి స్థితిలో ఉన్న యూదులు విగ్రహారాధనకు వారి మార్గములను చెరిపివేసికొని సరియైన మార్గము విడిచిపోవుటకు దాసులగుట చూచిన యిర్మీయా వారి కాలములో వారిని చుట్టియున్న అపాయమును గూర్చి హెచ్చరించెను. యిర్మీయా దేవునివైపు తిరుగుటకు వారిని ఆహ్వానించెను.

వరుసక్రమమునుబట్టి గాని, కాలక్రమమునుబట్టిగాని యిర్మీయా గ్రంథము అమర్చబడలేదు. గ్రంథమంతయు చదివిన యెడల గ్రంథ కర్త యొక్క జీవితమంతయు తెలియబడును. అయితే అంశక్రమమును వరుసక్రమమును మనము కనుగొనవలెను. నాశనమునకు గురైనా యూదా తప్పించుకొనుటకు ఒకే మార్గము దేవునికిలో బడుటయే వారికి బుద్ధిచెప్పుటే ఈ గ్రంథము యొక్క సారాంశము.

ఉద్దేశము : దేవుని యొక్క జనులు తమ పాపములను విడిచి పెట్టి దేవుని యొద్దకు తిరిగి వచ్చుటకు ఆహ్వానము.

గ్రంథకర్త : యిర్మీయా

ఎవరికి : దక్షిణ రాజ్యమైన యూదాకు దానియొక్క రాజధాని అయిన యెరూషలేము ప్రజలకు

కాలము : క్రీ.పూ 627 – 586

గతచరిత్ర : యెషియా, యెహోయహాసు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా అను ఐదుగురు. యూదా చివరి రాజుల కాలములోను యిర్మీయా ప్రవచన సేవను నెరవేర్చెను. క్రీ.పూ 586లో బబులోను రాజు యూదాను నిర్మూలముచే సెను. ( 2 రాజులు 21 – 25 అధ్యాయము ) జెఫన్యా యిర్మీయాకు ముందుటివాడును, హబక్కూకుకు సమకాలీకుడగును.

ముఖ్యమైన వ్యక్తులు : పైన చెప్పబడిన ఐదుగురు యూదా రాజులు బారూకు, ఎబెద్మెలెకు, నెబుకద్నెజరును, రెగాబియురు మొదలగువారు.

గ్రంథము యొక్క ప్రత్యేకత : చరిత్ర కావ్యములు, జీవిత చరిత్ర మొదలగునవి ఇమిడియున్నవి తమ యొక్క మనస్సులోని బయలు పరుచుటకు అనేకమైన గుర్తులను ఉపయోగించుచున్నారు.

ముఖ్యపదము : తిరిగివచ్చుట, యూదాకు తన ధుర్మార్గ మార్గమును విడిచి తిరిగివచ్చుటకు ఆహ్వానము ఇచ్చుచున్నారు. యిర్మీయా అవకాశమును చివరి అవకాశమని వారికి తెలియపరచెను.

ముఖ్యమైన వచనములు : యిర్మియా 7:23-24; యిర్మియా 8:11-12

ముఖ్య అధ్యాయము : 31 అధ్యాయములో యిర్మీయా తన అన్ని హెచ్చరికలకు శిక్ష తీర్పులకును మధ్య దేవుని అద్భుత వాగ్దానములను గూర్చియు యూదా ప్రజలకు జ్ఞాపకము చేయుచుండెను. దేవుడు వారితో కొత్త నిబందన చేయును. నేను నా ధర్మ శాస్త్రమును వారి మనస్సులో ఉంచి దానిని వారి హృదయములో వ్రాసెదను నేను వారికి దేవుడనైయుందును వారు నా ప్రజలై యుందురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యేసుక్రీస్తు తన యొక్క మరణము పునరుద్దానమును వాటి ద్వారా ఈ కొత్త నిబంధనను స్థాపించి అమలులోనికి తెచ్చెను.

గ్రంథ విభజన : యూదా చరిత్రలో చీకటితో నింపబడిన కాల స్థితిలో అతిగొప్ప ప్రవక్త ఒకరు జరిగించిన సేవా ప్రతులే యిర్మీయా ప్రవచన గ్రంథము. చెరసాలలో నుండి 70 సంవత్సరముల తరువాత తిరిగి వచ్చుటను గూర్చియు క్రీస్తు ద్వారా స్థాపించబడు క్రొత్త నిబంధన ద్వారా దేవుని ప్రజలకు సొంతమగు మహిమ కలిగిన నమ్మకమును గూర్చియు యిర్మీయా పలికిన ప్రవచనములు ఎంతో గమనించతగినవి. ఈ గ్రంథములో 4 పాముఖ్యమైన భాగములు ఉన్నవి.

(1). యిర్మీయా పిలువబడుట (1 అధ్యా 1-19).

(2). యూదులకు ప్రవచనము ( 2 అధ్యా నుండి 45 అధ్యా వరకు)

(3). అన్య దేశములకు ప్రవచనము ( 46 అధ్యా నుండి 51 వరకు).

(4). ఇశ్రాయేలు (యూదా యొక్క) నిర్మూలము. బబులోను చెర అధ్యా 52.

కొన్ని క్లుప్త వివరణలు : పరిశుద్ధ గ్రంథములో 24వ పుస్తకము; అధ్యాయములు 52; వచనములు 1364; చరిత్రకు సంబంధించిన వచనములు 680; హెచ్చరికలు 1002; నెరవేరిన ప్రవచనములు 666; నెరవేరని ప్రవచనములు 180; నెరవేరిన హెచ్చరికలు 779; నెరవేరని ముందు హెచ్చరికలు 223; ప్రశ్నలు 194; ఆజ్ఞలు 303; వాగ్దానములు : 16; దేవుని యొద్ద నుండి ప్రత్యేకమైన వర్తమానములు 62.

Isaiah – యెషయా

పరిశుద్ధ గ్రంథము యొక్క 17 ప్రవచన గ్రంథములలో అనుక్రమానుసారముగా మాత్రమే కాకుండా శ్రేష్ఠత్వములోను ప్రధమ గ్రంథముగా కనుపించేదే యెషయా ప్రవచన గ్రంథము. యోబు నుండి పరమగీతము వరకున్న కావ్య గ్రంథాలు ఇశ్రాయేలు రాజ్య స్వర్ణయుగములలో వ్రాయబడగా యెషయా నుండి మలాకీ వరకైన గ్రంథాలు ఇశ్రాయేలు రాజ్య అంధకారయుగమునకు సంబంధించినవి. ఇశ్రాయేలు రాజ్యము ఉత్తర ఇశ్రాయేలు దక్షిణ యూదాగా రెండుగా విడిపోయి దైవభక్తి నుండి దిగజారి అక్రమమైన విగ్రాహారాధనలో పడిపోయినపుడు దేవుడు త ప్రవక్తలను పంపి వారితో మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాము. క్రీ.పూ. 9వ శతాబ్దము నుండి 4వ శతాబ్దము వరకు ఈ ప్రవక్తల కాలమగును క్రీ.పూ 4వ శతాబ్దములో ప్రవచించిన మలాకీ తరువాత బాప్తీష్మమిచ్చు యోహాను కాలము వరకు సుమారు మూడు వందల సంవత్సరములపైగా ఏ ప్రవక్త కూడా ఉద్భవించలేదు. 16 మంది ప్రవక్తలలో నలుగురిని పెద్ద ప్రవక్తలని 12 మందిని చిన్న ప్రవక్తలని వారి యొక్క గ్రంథముల ప్రాముఖ్యతను ఆధారము చేసుకుని, ప్రవచన గ్రంథము యొక్క కొలతను ఆధారము చేసుకుని గుర్తించబడినది. వీరిలో యెషయా, యిర్మీయా హోషేయా, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా అను పదకొండు మంది చెర నివాసమునకు ముందు జీవించారు. దానియేలు, యెహెజ్కేలు అనువారు చెరనివాసకాలములోను, హగ్గయి, జెకర్యా, మలాకీ అనువారు చెర విమోచనము తరువాత జీవించారు.

ప్రవక్తలు ద్వితీయోపదేశకాండము 18:18-19 వచనములలో కనబడునట్లుగా దేవుని కొరకు ప్రజలతో మాట్లాడుతూ వచ్చిరి. పరిశుద్ధ గ్రంథములో మూడింటిలో ఒక భాగము ప్రవచనా గ్రంథములు నింపబడుటలో ప్రవక్తల యొక్క సేవ ప్రాధాన్యతను బయలుపరచుచున్నది.

ఉద్దేశము : యూదాను దేవునివైపు త్రిప్పుట, మెస్సియా మార్గమైన దేవుని రక్షణను ప్రస్తావించుట.

గ్రంథకర్త : 1 – 39 వరకు గల అధ్యాయములు క్రీపూ 700 సంవత్సరములోను 40 -66 వరకు గల అధ్యాయములు క్రీపూ 681 సంవత్సరములోను వ్రాయబడినవని ఊహించవచ్చును.

సారాంశము : యెరూషలేము

ముఖ్యమనుష్యులు : యెషయా, ఆయన ఇద్దరు కుమారులు

గ్రంథము యొక్క విశేషం : ఈ గ్రంథములో పద్యములును పాటలును ఉన్నవి. మాదిరికరమైన కార్యములు అనేకమైన వున్నవి. జరుగుచున్న కాలములోను, భవిష్యత్తులోను జరుగవలసిన కార్య క్రమములు వచనా రీతిగా చెప్పబడియున్నది. అజర్యా అని పిలువబడు ఉజ్జీయా చనిపోయిన సంవత్సరములో యెషయాకు కలిగిన దర్శనమును గురించి 6వ అధ్యాయములో వ్రాయబడియున్నందున మొదటి 5 వ్రాయబడియున్నందున మొదటి 5వ అద్యాములు ఉజ్జీయా యొక్క పరిపాలన కాలములో వ్రాయబడినవని చెప్పవచ్చును. యోతాము కుమారుడైన ఆహాజు పరిపాలనా కాల కార్యములు 7వ అధ్యాయములో వ్రాయబడి యుండుటను బట్టి (యెషయా 7:1-5) యెషయా యొక్క ప్రవచనములలో అధిక భాగము ఆహాజు మరియు హిజ్కియాల పాలన కాలములో ప్రవచించబడినవని అనుకొనవచ్చును. ఆష్హూరు తిగ్లత్పిలేసెరు నాయకత్వములో ఒక గొప్ప శక్తివంతమైన రాజ్యముగా అభివృద్ధి చెందిన కాలమది. మధ్యదరా సముద్ర తీరపాంతములలో ఉన్న చిన్న దేశములను హస్తగతం చేసుకున్న అష్హూరు ఇశ్రాయేలుపై దండెత్తి దానిని స్వాధీనం చేసుకుని అక్కడ జీవించిన వారిలో ఎక్కువ మందిని చెర పట్టుకుపోయినది. ఈ విధముగా క్రీ.పూ 722లో ఇశ్రాయేలు సంపూర్ణముగా నాశనము చేయబడినది. ఇశ్రాయేలు పతనమునకు పిదప యూదాకు కూడా తీర్పు వచ్చును అనియు అది ఆష్హూరు నుండి కాదుగాని బబులోను నుండే కలుగునని ప్రవక్త పలుకుటను చూస్తున్నాము. ఇది బబులోను గొప్ప మహాసామ్రాజ్యముగా అవతరించుటకు ముందే చెప్పబడిన ప్రవచనము అని మనస్సులో గుర్తించుకోవాలి.

ముఖ్యమైన మాట : రక్షణ

ముఖ్య మైన వచనములు : యెషయా 9:6-7; యెషయా 5:3-6

ముఖ్యమైన అధ్యాయము : యెషయా 53. ఈ అధ్యాయములోని ఒక్కొక వచనమును దేవుని సత్యగని వలె ప్రాముఖ్యతను పొందినవి. ఇవి హృదయమున చెక్కబడవలసినవి.

గ్రంథ విభజన : వేదపండితుల ద్వారా ప్రవక్తలలో పెద్దవానిగా భావించబడువారు యెషయా మెస్సియాను గూర్చి మిక్కిలి స్పష్టముగాను ప్రాముఖ్యత కలిగిన ప్రవచనములు గల ఈ గ్రంథమును యెషయా సువార్త అని పిలుచుటలో ఆశ్చర్యపడనక్కర లేదు. ఈ గ్రంథము క్రింద ఇవ్వబడిన రీతిగా మూడు పెద్ద భాగములుగా విభజింపవచ్చును.

న్యాయ తీర్పును గూర్చిన ప్రవచనములు అధ్యాయము 1 నుండి 35 వరకు.
చరిత్ర సంబంధమైన ఒక అనుబంధము – అధ్యాయము 36 నుండి 39 వరకు.
అష్హూరు రాజు నుండి హిజ్కియాకు లభించిన విడుదల 36: 1 నుండి 37: 38 వరకు.
మరణకరమైన రోగము నుండి హిజ్కియాకు దొరికిన విడుదల యెషయా 38:1-22 వరకు
హిజ్కియా యొక్క బుద్దిహీనత యెషయా 39:1-8.
మహిమతో నిండిన విశ్వాసము యొక్క ప్రవచనములు – అధ్యాయము 40 నుండి 66 వరకు

కొన్ని సంఖ్యా వివరణలు : పరిశుద్ధ గ్రంథము యొక్క 23వ గ్రంథము; – అధ్యాయములు 66, వచనములు 1292; నెరవేరని ప్రవచనములు 634; నెరవేరిన ప్రవచనములు 395; హెచ్చరికలు 1313; నెరవేరిన హెచ్చరికలు 449; నెరవేరని హెచ్చరికలు 864; చరిత్రాత్మక వచనములు 273; ప్రశ్నలు 190; వాగ్దానములు 120; ఆజ్ఞలు 308; దేవుని యొద్ద నుండి ప్రత్యేక సందేశములు 71.

Song of Solomon – పరమగీతము

అనేక బృందములును తూర్పు దేశము యొక్క వాజ్మయశైలిలో అమర్చబడిన చిత్రపటములతో నిండిన ఒక ప్రేమ కవిత్వముగా పరమగీతము ఉంటున్నది. చరిత్ర రీతిగా చూచినట్లయితే సొలొమోను రాజునకును, ఒక కాపరి సంతతికి చెందిన కన్యకును మధ్య గల ప్రేమను, వివాహమును చిత్రించే ఒక గ్రంథముగాను, మరియొక రీతిగా చూస్తే ఇశ్రాయేలు దేవుని యొక్క పవిత్రమైన పెండ్లి కుమార్తెగాను, సంఘము యేసుక్రీస్తు

యొక్క పెండ్లి కుమార్తెగాను చిత్రించే ఒక గ్రంథముగా దీనిని పరిగణించవచ్చును. మానవుని ఆత్మీయ జీవితము యొక్క గొప్ప సమృద్ధి దేవునికిని మానవునికి అనగా క్రీస్తుకును మానవ ఆత్మకును మధ్యనున్న ప్రేమగల సంబంధమే.

అనేక సాక్షులతో నిండిన ఒక నాటకము యొక్క శైలిలో ఈ గ్రంథమున్నది. సొలొమోను రాజు (నాయకుడు) షూలమ్మితీ (నాయకురాలు) యెరూషలేము కుమార్తెలు (పాటల బృందము) వీరే దీని యొక్క ఈ కథా పాత్రలు. హెబ్రీ, గ్రీకు భాషలలో నున్న గ్రంథముల పేర్లు పాటల యొక్క పాటలు అనగా పరమగీతములు అనునదే. సొలొమోను రచించిన 1005 పాటలను గూర్చి 1 రాజులు 4:32 లో చెప్పబడియున్నది. వాటిలో ఎంతో శ్రేష్టమైన పాట అనుబావము ఇచ్చుటచే పరమగీతము అను పేరు అర్థముతో నిండినదిగానున్నది. ముప్పది సంవత్సరములకు లోబడిన వారు చదువుటకు ధర్మశాస్త్రో పదేశకులు, పెద్దలు దీనిని అనుమతించలేదు.

గ్రంథకర్త : సొలొమోను

కాలము : సొలొమోను పరిపాలన కాలము యొక్క ప్రారంభము అనగా దాదాపు 965లో వ్రాయబడినదని ఊహించవచ్చును.

ముఖ్యమైన మాట : ప్రేమ

ముఖ్యవచనములు : పరమగీతము 7:11; పరమగీతము 8:7 నేను నా ప్రియుని దానను. అతడు నా యందు ఆశాబద్దుడు (పరమగీతము 7:11). అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలవు ప్రేమకై యొకడు తన స్వాస్థ్యమంతా యిచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. (పరమగీతము 8:7).

ముఖ్యమైన అధ్యాయములు : గ్రంథమంతయు కవిత్వముతో నిండియున్నందున ఏదైన ఒక అధ్యాయమునకు శ్రేష్టతనిచ్చుటకు వీలుపడదు. 8 అధ్యాయములు కుటుంబ ప్రేమను ఎంతో చక్కగా బోధించుచున్నవి.

గ్రంథ విభాగములు : ఈ గ్రంథమునకు మూడు ముఖ్యమైన భాగములున్నవని చెప్పగలము.

(1). ప్రేమ ప్రారంభము Song,1,1-3,5 వరకు

పెండ్లి కమార్తె యొక్క ప్రేమాకాంక్ష పరమగీతము 1:1-8
ఒకరికొకరు తమ ప్రేమను బయలుపరచుట Song,1,9-2,7
రాజు పెండ్లి కుమార్తె యింటిలో పరమగీతము 2:8-17
పెండ్లి కుమార్తె యొక్క ఎడబాటు కల పరమగీతము 3:1-5

(2). ప్రేమ వివాహములో సఫలమయ్యెను Song,3,6-5,1

వివాహ ఊరేగింపు పరమగీతము 3:6-11
పెండ్లికుమార్తె యొక్క విశేషమైన అందము పరమగీతము 4:1-15
వివాహము యొక్క ఆనందం Song,4,16-5,1

(3). ప్రేమాభివృద్ధి Song,5,2-8,14

పెండ్లి కుమార్తె యొక్క రెండవ ఎడబాటు కల పరమగీతము 5:2-7
పెండ్లి కుమారుని విశేషమైన అందము Song,5,8-6,3
పెండ్లికుమార్తె యొక్క అందమును పొగడబడుట Song,6,4-7,10
తన యింటికి వెళ్ళుటకు పెండ్లి కుమార్తె వాంచ Song,7,11-8,4
ప్రయాణమైయింటిని చేరుకొనుట పరమగీతము 8:5-14

కొన్ని ముఖ్య వివరములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 22వ గ్రంథము ; అధ్యాయములు 8; వచనములు 117; ప్రశ్నలు 13; ఆజ్ఞలు 14; ప్రవచనములు లేవు; దేవుని యొద్ద నుండి విశేష వర్తమానములు లేవు.

Ecclesiastes – ప్రసంగి

మాయ (వ్యర్ధము) అనునదే ఈ గ్రంథము యొక్క ముఖ్య సారాంశము. 37 సార్లు మరల, మరలా ఈ మాట ఈ గ్రంథములో వచ్చుచున్నది. దేవుడు లేని జీవితములో తృప్తిని కనుగొనుటకు వ్యర్థముగా ప్రయాసపడుటయే ఈ పదము గుర్తించుచున్నది. ప్రసంగి అనగా సొలొమోను ఇశ్రాయేలీయుల చరిత్రలోనే ఎంతో గొప్ప జ్ఞానము గలవాడును, శ్రీమంతుడును, ప్రఖ్యాతి గాంచిన రాజుగా నుండెను. ఆయ సూర్యుని క్రిందనున్న సమస్తమును మానవ దృష్టితో చూచెను. అప్పుడన్నియు వ్యర్ధమైనవని చూచుచున్నాడు. మానవ హృదయములో దేవుడు ఉంచిన ఒక ఖాళీ స్థలమున్నది. దేవుడు తప్ప వేరే ఏదియు ఆ స్థలమును నింపవీలుపడదు. అధికారముగాని, పేరు ప్రతిష్టలుగాని, ఆస్థిగాని సుఖముగాని, ప్రఖ్యాతిగాని దానిని ఏమాత్రము నింపలేదు. దేవుని దృష్టితో దాని విలువను లెక్కించునపుడు జీవితానికి, లక్ష్యము, అర్థమ ఉన్నది. అప్పుడు తినుట, త్రాగుట, ఆనందించుట, మేలుచేయుట, దేవునికి భయపడుట మొదలైనవన్నియు ఎంతో విలువైనవిగా లెక్కించబడుచున్నవి. ప్రతి దినము మన జీవితమును దేవుడు అనుగ్రహించే ఒక ఈవి అని తలంచునపుడు సూర్యోదయములో మంచు మరుగైనరీతిగా నిరాశలన్నియు మరుగైపోవును. హెబ్రీభాషలో ఈ గ్రంథము యొక్క పేరు “గొహేలేత్ ” అనబడును. ఒక సంఘములో ప్రసంగించువాడు అని దీని అర్ధము. గ్రీకు పదమైన “క్లీసియాస్టెస్” అను మాటకు కూడ ఇదే అర్థము. ఈ విధముగా తెలుగులో ప్రసంగి అను పేరు పెట్టబడియున్నది.

గ్రంథకర్త : సొలొమోను

కాలము : సొలొమోను యొక్క అంత్య దినములలో దాదాపుగా క్రీపూ 935 లో

ముఖ్య మాట : వ్యర్ధము ( 37 సార్లు)

ముఖ్య వచనము : ప్రసంగి 2:24; Ecc,12,13,14

ముఖ్య అధ్యాయములు : ప్రసంగి 12 , గ్రంథము యొక్క చివరి భాగమునకు ప్రవేశించబోవుచున్నప్పుడు ప్రసంగి దైవ దృష్టి ద్వారా జీవితమును చూచుచున్నాడు. అయితే అంతకుముందు సూర్యుని క్రిందనున్న సమస్తమును బౌతిక కండ్లతో అతడు చూచెను. అప్పుడు ఆయనకు సమస్తము నిష్ప్రయోజనమైనవిగా అర్థశూన్యముగా నుండినవి. అయితే సూర్యునికి పైగా ఉన్న దేవుని దృష్టితో జీవితమును చూచినపుడు దేవుని ఈవిగా దానిని ఎంచుటకు, అన్నియు యథార్థమైనవిగా, మేలుకరమైనవిగా ఉన్నవని గ్రహించగలిగెను.

జీవితము యొక్క ముఖ్య సంకల్పము ఏమని ఆయన వెదకినపుడు కనుగొన్న జవాబే 12వ అధ్యాయము దేవుని యందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి (ప్రసంగి 12:13) అను గమ్యమునకే ప్రసంగి వచ్చి చేరెను.

గ్రంథవిభజన : మానవ జీవత ఉద్దేశము ఏమి అని కనుగొనుటకు గ్రంథకర్త జరిగించిన ధీర్ఘమైన అన్వేషణయే ఈ గ్రంథము యొక్క సారాంశము. ఈ గ్రంథమును మూడు ముఖ్య భాగములుగా విభజింపవచ్చును.

సమస్తము వ్యర్ధము అనునది Ecc,1,1-1,11 వరకు
వ్యర్ధము అను ఉద్దేశము యొక్క ఆదారములు Ecc,1,12-6,12 వరకు
వ్యర్ధమును జయించి జీవించుటకు బోధన Ecc,7,1-12,14 వరకు
దేవునియందలి భయభక్తులు కలిగి జీవించే మార్గమే శ్రేష్టమైన జీవితమును సంపాదించుకోగలదు అను తీర్మానమునకు ప్రసంగి చేరుకుంటున్నాడు. దేవునిని, దేవుని చిత్తమును, విలువైనదిగా ఎంచని వారి జీవితము అపాయములోను, భయంకరమైన అపజయములోను జారిపడుచున్నది. ప్రతి సమస్యకు పరిష్కారము కనుగొనేంత వరకు జీవితము ఎవరి కొరకును వేచియుండడములేదు. అయితే సూర్యునికి

క్రింద చూచుటకు బదులుగా సూర్యుని పైగా ఒకే కాపరిని తొంగి చూచుట ద్వారా జీవిత రహస్యమునకు జవాబులు దొరుకును. అప్పుడది అర్థవంతమైనదిగాను, సంతోషకరమైనదిగాను పరిగణంచబడుట నిశ్చయమే.

కొన్ని ముఖ్య వివరములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 21వ గ్రంథము ; అధ్యాయములు 12; వచనములు 222; ప్రశ్నలు 33; ఆజ్ఞలు 34; ప్రవచనములు లేవు; వాగ్దానములు 1; దేవుని యొద్ద నుండి విశేషమైన వర్తమానము లేదు.

Proverbs – సామెతలు

జ్ఞానము అనునదే సామెతల యొక్క ముఖ్య భావార్థము. జీవితము చక్కగాను, చమత్కారముగాను జీవించుటకు సామర్థ్యమునిచ్చునది జ్ఞానమే. అనుదిన జీవితము యొక్క క్రియారూపకమైన సమస్యలను జయకరముగా ఎదుర్కొనుటకు విశాలమైన కర్తవ్యములు ఈ గ్రంథములో ఇమిడియున్నవి. దేవుడు తల్లిదండ్రులు, పిల్లలు, స్నేహితులు, పొరుగువారు, అధికారులు మొదలైన వారితో ఏలాగు మెలగవలయును అని ఇది నేర్పించుచున్నది. జీవిత సమస్యలను ఎదుర్కొనుటకు అవసరమైన ఒక ఆత్మీయ దృష్టిని పాఠకులకు బహుకరించుటకు, కవిత్వము, విప్పుడు కథ, సామెతలు, ఉపమానములు, పొడుపు కథలు మొదలైవాటితో నిండిన ఒక అక్షరానుసారశైలిని దీని గ్రంథకర్తయైన సొలొమోను ఉపయోగించియున్నాడు.

ఉద్దేశము : సకల క్రియలలో, వివేకముగలవారుగాను, నిష్కలంకులుగా నుండుటకుగాను, జనులకు నేర్పించుటకుగాను, యువలకులకు వచ్చు సమస్యలు ఎలాగు అతిజీవించాలి అనుదానిని గూర్చిన నిర్దేశములు. జ్ఞానులకు యోగ్యమైన నాయకత్వ లక్షణములు నిచ్చుటకు సహాయపడుచుండెను. సంక్షిప్తముగా చెప్పినట్లైతే దైవ జ్ఞానం దయనందిన జీవితములోను ఉపయోగపరచుకొనుటకు సత్ మార్గ నిర్దేశములనిచ్చుటకుగాను యీ పుస్తకం రచించబడినది.

ముఖ్య గ్రంథకర్త ఇశ్రాయేలీయుల జ్ఞానులకు జ్ఞానియైన సొలొమోను కాబట్టి సొలొమోను సామెతలు అను నామము హెబ్రీ, గ్రీకు పరిశుద్ధ గ్రంథములు పెట్టుకొన్నవి. తరువాత లాటిన్ భాషలోను, ఇంగ్లీషులోను ఇతర భాషలలోను సామెతలు అని తగ్గించబడినది.

గ్రంథకర్త : సొలొమోను

కాలము : సొలొమోను పరిపాలన ప్రారంభములో వ్రాయబడింది. దాదాపుగా క్రీ.పూ 931 అని ఎంచబడుచున్నది. 25 – 29 అధ్యాయములు క్రీ.పూ 700 హిజ్కియా చేత సేకరించబడి చేర్చబడినవి.

ముఖ్యాంశము : పరిపూర్ణ జ్ఞానము గల ఆలోచనలతో దేవుని యందు భయభక్తులు గలిగి ఏలాగు జీవించాలి అని ప్రజలకు నేర్పించే చక్కటి వచనములతో నిండిన గ్రంథమిది.

గ్రంథ ప్రాముఖ్యత : కవిత్వము, చిన్న ఉపమానములు, ఉద్దేశముతో కూడిన ప్రశ్నలు.

ముఖ్య మాట : జ్ఞానము

ముఖ్య వచనములు : సామెతలు 1:5-7; సామెతలు 35:6.

ముఖ్య అధ్యాయము : సామెతలు 31 , ఈ అధ్యాయము పాత రచనలలో ప్రత్యేకమైన ఒక భాగము. దీనిలో స్త్రీలను గూర్చి ఉన్నతమైన, శ్రేష్టమైన ఒక దృష్టిని చూడవచ్చును. సామర్ధ్యము గల స్త్రీ, మాదిరికరమైన భార్య, శ్రేష్టమైన తల్లి, మంచి పొరుగు స్త్రీ అయిన స్థితులలో ఇక్కడ చిత్రించబడియున్న స్త్రీ 7వ అధ్యాయములోని జారస్త్రీ నుండి ఎంతగా ప్రత్యేకించబడుచున్నది.

గ్రంథ విభజన : క్రింది ఇవ్వబడియున్న రీతిగా ఆరు భాగములుగా ఈ గ్రంథమును విభజింపవచ్చు.

గ్రంథము యొక్క ఉద్దేశము Pro,1,1-1,7
యౌవనస్థులకు జ్ఞానోపదేశములు Pro,1,8-8,36
ప్రతి మానవునికి తగిన బోధనలు Pro,9,1-24,34
హిజ్కియా సేకరించిన సామెతలు అధ్యా 25 – 29
ఆగూరుపలికిన మాటలు 30వ అధ్యా
రాజైన లెమూయేలు పలికిన మాటలు 31వ అధ్యా

కొన్ని ముఖ్యాంశములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 20వ గ్రంథము; అధ్యాయములు 31; వచనములు 915; ప్రశ్నలు 49; నెరవేరని ప్రవచనాలు 27; పాపములు 67; మూడులను గూర్చినవి 66; సోమరితనములను గూర్చినవి 28; రాజులను గూర్చినవి 22; హేయమైనవి 25; ఆజ్ఞలు 215; వాగ్దానములు 120; ఆశీర్వాదములు 27; జీవిత రహస్యములు 24; మంచి క్రియలు 17; సామెతలు 560.

Psalms – కీర్తనల గ్రంథము

పరిశుద్ధ గ్రంథము యొక్క హృదయాంతరంగములో నుండి లేచు సంగీతమువలె కీర్తనల గ్రంథము దాని మధ్య అమర్చబడియున్నది. పరిశుద్ధ గ్రంథములోనే ఎంతో పెద్దదిగాను, ఎక్కువగా ఉపయోగించబడేదిగాను – ఈ గ్రంథమున్నది. మానవ అనుభవముల యొక్క ప్రత్యేకమైనదియు, అనుదిన జీవితముతో సంబంధము గలిగినదియునైన ప్రతి భాగములను ఇవిముట్టుచున్నవి. వీటిలో ఇమిడియున్న 150 పాటల యొక్క ముఖ్యాంశములో సృష్టి ఆరంభము నుండి ఇశ్రాయేలు చెరకొనిపోబడిన కాలమువరకు విస్తరించబడియున్నది. గోత్ర కర్తల కాలము న్యాయాధిపతులు రాజ్యమేలినకాలము, రాజపరిపాలన కాలము, చెరపట్టబడిన కాలము అను పలు రకములైన కాలములతో నిండియున్న కీర్తనలు ఈ గ్రంథములో నున్నవి. వీటిలో ఇమిడియున్న కర్తవ్యము ఆశ్చర్యము కలిగించేవిగానున్నవి. వాటిలో దైవీక ఆనందము, యుద్ధము, సమాధానము, ఆరాధన, న్యాయ తీర్పు, ప్రవచనము, స్తుతి, విలాపము అను పలు విధములైనవియున్నవి. సంగీత వాయిద్యముల సహాయముతో దేవాలయ ఆరాధనలో ఆలపింపబడేవిగా ఈ గానములు వ్రాయించబడినవి. యూదా ప్రజల పాటల వరుసగాను భక్తి మార్గదర్శిగాను పరిగణించబడుచూయున్నది.

ఉద్దేశము : కవిత్వముతో కూడిన స్తుతిని, ఆరాధనను, ఒప్పుదలను ప్రత్యక్షపరచుట.

ముఖ్యమైన మనుష్యులు : దావీదు

ముఖ్యమైన స్థలము : దేవాలయము

ముఖ్యమైన మాట : ఆరాధన

ముఖ్యమైన వచనములు : కీర్తనల గ్రంథము 19:14; కీర్తనల గ్రంథము 145:21

ముఖ్యమైన అధ్యాయము : కీర్తన 100

కొన్ని కీర్తనలలో పరిశుద్ధ గ్రంథము యొక్క చాలచక్కటి సారాంశములు పాడబడినవి కనుక ఏదైన ఒక కీర్తనను ఇది ముఖ్యమైనది అనుచెప్పుట చాలా కఠినము. 1, 22, 23, 24, 27, 72, 100, 101, 119, 121, 150 కీర్తనలు ముఖ్య మైనవే. 100వ కీర్తనలో స్తుతి, ఆరాధన అను రెండు భాగములు సమతల స్థితిలో ఏకమైయున్నవి. కనుక ఈ కీర్తనను ప్రాముఖ్యమైన అధ్యాయము అను స్థలములో ఉంచవచ్చును.

గ్రంథ విభజన : కీర్తనలను 5 స్కంధములుగా విభజించబడియున్నవి. ఒక్కొక్క స్కంధము ఒక స్తుతితో ముగించబడుచున్నది. 150వ కీర్తన 5వ పుస్తకమునకు పూర్తి పుస్తకమునకు ముగింపు స్తుతి. 5 స్కంధములకు వరుసగా క్రింద ఇవ్వబడియున్నవి.

ప్రథమ స్కంధము : 1వ కీర్తన నుండి 41 వరకు వీటి సాధారణ విషయసూచిక మానవుడు అని చెప్పవచ్చును. మానవుని నిజమైన స్థితి ఆశీర్వాదకరమైన స్థితి. పతనము, విమోచన అనునవి ఈ పాటలు చిత్రించుచున్నవి.

ద్వితీయ స్కంధము : 42వ కీర్తన నుండి 72వ కీర్తన వరకు ఇశ్రాయేలీయులు ముఖ్య పాత్రగా యున్నారు. 42 నుండి 49 వరకు గల పాటలు వారి పతనమును 50 నుండి 60 వరకు గల పాటలు వారి విమోచనకుడను, 61 నుండి 72 వరకు వారికి లభించు విమోచనమును గూర్చి చెప్పబడియున్నది.

తృతీయ స్కంధము : కీర్తన 73 నుండి 89 వరకు దేవాలయము అనగా పరిశుద్ధ ఆలయము దీని ముఖ్యాంశము సైన్యముల కధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు అను ప్రారంభించు 84వ కీర్తన చూడండి.

చతుర్ధ స్కంధము : కీర్తన 90 నుండి 106 వరకు. ఇది భూమిని గూర్చియు దానికి దొరకనైయున్న,

దొరకుచున్న దీవెనలను గూర్చియు పాడుచున్న సొగసైన పాటలు.

పంచమ స్కంధము : కీర్తన 107 నుండి 150 వరకు. దేవుని వాక్యమే ఈ పాటల యొక్క ముఖ్యమైన సారాంశమ. దేవుడు తన వాక్కును పంపి స్వస్థపరచుటను గూర్చి 107వ కీర్తనలో చెప్పబడియున్నది. 176 వచనములు కలిగిన 119వ కీర్తన యొక్క ప్రతి వచనము కూడ భక్తి గల మానవులకు దేవుని వాక్యము అనుగ్రహించు దీవెనలను పాడి ప్రస్తావించుచున్నది.

ఇక ఒక పాటను పరిశీలించినట్లయితే మొదట దేవునితో మాట్లాడునట్లుగాను, తరువాత తన స్థితి వివరముగాను దానికి తరువాత మరల దేవుని గూర్చి మాట్లాడునట్లు గాను, అమర్చబడియుండుట చూడగలము హెబ్రీ కవిత్వములతో ఈ లాంటివి సాధారణమైనవే.

కొన్ని ముఖ్యమైన వివరములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 19వ పుస్తకము ; అధ్యాయములు 150; వచనములు 2,461; చారిత్రాత్మిక వచనములు 2027; నెరవేరిన ప్రవచనములు 160; నెరవేరని ప్రవచనములు 274; ప్రశ్నలు 164; ఆజ్ఞలు 413; దేవుని క్రియలు 338; తీర్మానములు 124; దేవస్తుతులు 174; నిందలు చూపుట (విజ్ఞాపనలు) 118; యూదాను గూర్చినవి 72; దేవుని సత్యములు 865; దేవుని వచనములను గూర్చినవి 235; సాక్ష్యములు ప్రకటనలు 182; వాగ్దానములు 97; మెస్సీయాను గూర్చినవి 128; ఆశీర్వాదములు 281; పాటల గ్రంథకర్తలను గూర్చినవి 190; న్యాయక్రియలు 78; దుష్ట క్రియలు 101; పాపములు 233; విజ్ఞాపనలు 582; విజ్ఞాపనకు కారణములు 187.

Job – యోబు

ఎస్తేరు గ్రంథముతో పాతనిబంధన గ్రంథము యొక్క చారిత్రిక గ్రంథములు ముగియుచున్నవి. దీనికి ప్రక్కనున్న పద్య భాగములో మనము చూచుచున్న అయిదు కావ్య గ్రంథములలో మొట్టమొదటిది యోబు గ్రంథము. కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు మొదలైనవి ఇతర నాలుగు పద్య గ్రంథములు. అతి ప్రాచీనమో, ఆధునీకమైన సాహిత్య కృతుల సమూహములో అతి శ్రేష్టమైన కావ్య గ్రంథము యోబు గ్రంథమేనని టెన్నిసన్ అనునతడు చెప్పెను. పరిశుద్ధ గ్రంథములోనే ఎంతో పాత గ్రంథము యోబు గ్రంథమే.

ఉద్దేశము : నిజమైన విశ్వాసము యొక్క కర్తవ్యమును దేవుని ఉన్నతమైన అధికారమును ప్రత్యక్ష పరచుట.

గ్రంథకర్త : యోబు

కాలము : 2000 – 1880 క్రీ.పూ

పూర్వ చరిత్ర : ఊజు దేశము (పాలస్తీనాలోని ఉత్తర సరిహద్దులో దమస్కునకు యూప్రటీసు నదికిని మధ్య భాగములో నున్న అరణ్యములోనున్న స్థల మైయుండవచ్చును.)

ముఖ్య మనుష్యులు : యోబు, తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడగు బిల్టదు, నయమాతీయుడైన జోఫరు, రాము వంశస్థుడైన బూజీయుడుగు ఎలీహు.

విశేష కార్యములు : హెబ్రీ పరిశుద్ధ గ్రంథములో పద్య భాగములో మొట్టమొదటిగా యోబు గ్రంథము మొదటిస్థానము వహించినది. పరిశుద్ధ గ్రంథములో అతి ప్రాచీనమైనదిగా ఈ గ్రంథము పరిగణింపబడుచున్నది. సాతాను యొక్క క్రియలను గూర్చి లోతైన దృష్టి ఈ గ్రంథములో మనికివ్వబడుచున్నది. యెహెఙ్కేలు 14:14-20 యాకోబు 5:11 మొదలైన వచనములు యోబు ఒక చారిత్రక మానవునిగా చిత్రించుచున్నవి.

ముఖ్యమైన మాట : దేవుని యొక్క పరిపూర్ణమైన అధికారము: శ్రమలలో కూడా యోబు నేర్చుకొను పాఠము దేవుని పూర్ణమైన అధికారమును గూర్చినదైయున్నది. విశ్వాసుల యొక్క విషయములో అది అలాగే యున్నది.

ముఖ్యమైన వచనములు : యోబు 13:15; యోబు 37:23-24

ముఖ్యమైన అధ్యాయము : యోబు 42. గ్రంథము యొక్క ఈ చివరి అధ్యాయము యోబుకు తనతోను, భార్యతోను, స్నేహితులతోను, దేవునితోను జరిగిన పోరాటము యొక్క ఉన్నత స్థితిని చూపించుచున్నది. దేవుని పరిపూర్ణ మహాత్యమును సర్వ ఆధిపత్యమును అంగీకరించుటతో యోబుకు మానసిక పరివర్తనం సంభవించుచుండెను. ఆయనను కలత జెందించుచుండిన ఎందుకు అను ప్రశ్న తరువాత ఆయనకు సమస్యగా కనిపించలేదు.

విభాగము : గ్రంథమును మూడు భాగములుగా విభజింపవచ్చును. యోబు యొక్క దుఃఖములు, యోబుకు స్నేహితులకు జరిగిన వివాదము. ఆయనకు దొరికిన విడుదల మొదలైనవి ఈ మూడు భాగములు. ఒక్కొక్క దాని అంతర్భావములు ఈ క్రింద ఇవ్వబడియున్నవి.

(1): యోబు దుఃఖములు : Job,1,1-2,13. 1). యోబు యొక్క కుటుంబ చరిత్ర యోబు 1:1-5. 2). సాతాను మొదటి ముట్టడి యోబు 1:6-22. 3). సాతాను రెండవ ముట్టడి యోబు 2:1-10. 4). యోబు స్నేహితుల రాక యోబు 2:11-13

(2). యోబుకును స్నేహితులకు జరిగిన వాదోపవాద క్రమము : Job,3,1-37,24. 1). యోబు యొక్క మొదటి పలుకు Job,3,1-26. 2), ఎలీఫజు యొక్క పలుకులు, యోబు జవాబు Job,4,1-5,27. 3). బిల్దదు పలుకులు, యోబు జవాబును Job,8,1-10,22 4). జోఫరు పలుకులు, యోబు జవాబు Job,11,1-14,32. 5). ఎలీఫజు యొక్క రెండవ పలుకలుక జవాబును Job,15,1-16,17. 6). బిల్టదు పలుకులు యోబు జవాబును Job,18,1-19,29. 7). జోఫరు రెండవ పలుకులు యోబు జవాబు Job,20,1-21,34. 8). ఎలీఫజు మూడవ పలుకులు యోబు జవాబు Job,22,1-24,25. 9). బిల్దదు పలుకులును, జవాబులును Job,25,1-26,14. 10). యోబు చివరి వాదము Job,27,1-31,40. 11). ఎలీహు జవాబు Job,32,1-37,24.

(3). యోబుకు దొరుకు విడుదల : Job,38,1-42,17 1). యోబుకు దేవుడిచ్చే జవాబు Job,38,1-41,34 2). యోబు తన అమాయత్వమును సమ్మతించుట – స్వనీతి కొరకు పశ్చాత్తాపపడు యోబు Job,42,1-6. 3). యోబుకు దొరికిన విడుదల Job,42,7-17.

a). తన స్నేహితుల కొరకు యోబు విజ్ఞాపన చేయుచున్నాడు Job,42,7-10.

b). యోబు తాను పోగొట్టుకొన్న వాటికన్నిటికి రెండింతలు తిరిగి పొందుచున్నాడు Job,42,11-17.

యోబును కలత జెందించిన సమస్యలకు జవాబు {Job,42,5-6 వచనములలోనున్నది. ప్రతి దుఃఖమునకు ఉద్దేశము అదే. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్తనేను వింటిని అయితే యిప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను, బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.

కొన్ని ముఖ్య వివరములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 18వ గ్రంథము; అధ్యాయములు 42; వచనములు 1070; చరిత్రాత్మిక వచనములు 1066; నెరవేరిన ప్రవచనములు 1; నెరవేరని ప్రవచనములు 3; ప్రశ్నలు 329; ఆజ్ఞలు 13; వాగ్దానములు లేవు; హెచ్చరికలు 4; దేవుని యెద్ద నుండి ప్రత్యేకమైన వర్తమానములు 10.

Esther – ఎస్తేరు

ఎస్తేరు యొక్క హెబ్రీ పేరు హదస్సా అనబడును (ఎస్తేరు 2:7) పారసీక మాటయైన ఎస్తేరు అనగా నక్షత్రము అని అర్థమునిచ్చును స్టారా అను పారసీక మాటలో నుండి ఉద్భవించినది. గ్రీకు భాషలో గ్రంథము యొక్క పేరు ఎస్తేరు అని యుండగా లాటిన్ భాషలో హెష్టర్ అనియున్నది.

ఉద్దేశము : తన ప్రజలను గూర్చిన దేవుని అధికారము, ప్రేమ, బాధ్యత అనునవి బయలుపరచుట.

గ్రంథకర్త : మొర్దెకై గా (ఎస్తేరు 9:29) (రచనా శైలిని తీసికొని యీ పుస్తకమును ఎజ్రాయో, నెహెమ్యానో వ్రాసియుండవచ్చు అని అభిప్రాయపడువారున్నారు.)

కాలము : అహష్వేరోషు యొక్క పరిపాలనా కాలము క్రీపూ 486 నుండి క్రీపూ 464 వరకు. రాజు ఏర్పాటు చేసిన విందు ఆయన పాలన యొక్క మూడవ సంవత్సరము (ఎస్తేరు 1:3) గ్రంథము యొక్క 3 నుండి 10 వరకు గల అధ్యాయములలో వివరించు కార్యక్రమములు జరిగినవి క్రీపూ 483 నుండి 473 వరకు గల 10 సంవత్సరముల కాలపరిమితిలో జరిగినవి. (ఎస్తేరు 3:7-12) అహష్వరోషు చనిపోయిన సంవత్సరమైన క్రీ.పూ. 464 తరువాత దానికి సమీప కాలములో ఎస్తేరు గ్రంథము మొర్దకై ద్వారా వ్రాయబడియుండవచ్చును. తమ స్వదేశమునకు తిరగి వెళ్లక, పారసీక దేశములో జీవించుచున్న యూదుల ఉపయోగము కొరకై వ్రాయబడిన గ్రంథము ఇది. దైవభక్తులైన యూదులందరు పాలస్తీనమునకు తిరిగి వెళ్లలేదు. ఈ రీతిగా చెరనివాసము కొనసాగించ తీర్మానించి జీవించిన వారికొరకు దేవుడు వారియందు దృష్టించియున్నాడు. వారిని కూడా పరామర్శించువానిగా యున్నాడనునది. ఈ గ్రంథము తెలుపుచున్నది.

పూర్వ చరిత్ర : పరిశుద్ధ గ్రంథములో నెహెమ్యా తర్వాత ఎస్తేరు గ్రంధము వచ్చినప్పటికిని నెహెమ్యా కార్య క్రమములకు 30 సంవత్సరములకు ముందే ఎస్తేరు కార్య క్రమములు జరిగినవి. ఈ కార్యములు జరిగిన స్థలము పారసీక సామ్రాజ్యము యొక్క రాజధానియైన షూషనులోను, చక్రవర్తి అంతఃపురములోను జరిగినవి.

ముఖ్య మనుష్యులు : ఎస్తేరు, మొర్దకై, అహష్వరోషురాజు, హామాను.

ముఖ్య స్థలము : పారసీక షూషను అంతఃపురము

విశేషము: స్త్రీల పేర్లలో కనబడు రెండు గ్రంథములలో ఇది యొక్కటి. (రూతు మరియొక గ్రంథము) ఈ గ్రంథములో దేవుడు అనుమాట ఏమాత్రము ఉపయోగించబడలేదు. అయినను వీటి చర్యలన్నిటిలో దేవుని సన్నిధి ఎంతో తేటగా కనబడుచున్నది.

ముఖ్య మాటలు : దేవుని దృష్టి

ముఖ్యవచనములు : ఎస్తేరు 4:14; ఎస్తేరు 8:17

గ్రంథ విభజన : గ్రంథమును రెండు భాగములుగా విభజింపవచ్చును.

అధ్యాయము 1 నుండి 4 వరకు యూదులను భయపెట్టుట.
అధ్యాయము 5 నుండి 10 వరకు యూదులు పొందిన ఆశ్చర్యమైన విజయము.
మొర్దెకై దేశములో రెండవ మానవుడుగా హెచ్చింపబడుటను, ఆయన యూదులు యొక్క సంరక్షకునిగా మార్చబడుట చెప్పుచూనే ఈ గ్రంథము ముగియుచున్నది. తెలియని రీతిగా జరిగినవని భావించు అనేక సంఘటనలు ఒక దండవలె ఐక్యపరచబడిన రీతిగా ఇచ్చుటయే ఈ గ్రంథము యొక్క విశేషిత వష్తి రాణి యొక్క మొండితనము ద్వారా ఆమె పదవి తొలగించబడినది. రాజు యొద్దకు తీసుకొని రాబడిన అనేక కన్యకలలో ఎస్తేరు రాణిగా ఎన్నుకొనబడుట, ఒక రాత్రి రాజు నిద్రలేక బాధపడుట ఆ రాత్రి రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని ఆజ్ఞాపించుట, మొర్దెకై రాజును కాపాడిన సంఘటన చదువుట తటస్థించుట, అదే సమయములో హామాను అచ్చటికి రావడము జరుగుట అను కార్యములన్నియు మానవదృష్టిలో తెలియని రీతిగా జరిగిన సంఘటనలు. దేవుని ప్రజల యొక్క జీవమంతయు దేవుని ఆధీనములోనున్నది. వారి జీవితములో ఏదియు తెలియని రీతిగా జరిగినవి కావు. హామాను నుండి హిట్లర్ వరకు పగ తీర్చుకొను మనస్సు కలిగిన నాయకుల యొక్క ద్వేషమునకు గురియైన యూదుల వలె మరియొక ప్రజలు లోకములో వేరేలేరు. వేరే ఏ జనసమూహము ఆపధలను అతిజీవించుటకు ఇంత గొప్ప శక్తిని పొందలేదు.

కొన్ని ముఖ్య వివరములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 17వ గ్రంథము; అధ్యాయములు 10; వచనములు 167; ఆజ్ఞలు 11; ప్రశ్నలు 21; ప్రవచనములు లేవు; వాగ్దానములు లేవు, దేవుని యొద్ద నుండి విశేషమైన వర్తమానము లేదు.

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account