Malachi – మలాకీ

నెహెమ్యా కాలములలో జీవించియుండిన ప్రవక్తయైన మలాకీ ఇశ్రాయేలీయుల ఆత్మీయ పతనమునకు విరోధముగా దేవుని సందేశములను ప్రవచించుటకు ఏర్పరచుకొనబడినవాడు. మోసాలు చేయు యాజక సమూహములకును, క్రూర హింసలతో కూడిన జీవిత విధానముగల ప్రజలకును మలాకీ దేవుని వర్తమానములను ప్రకటించెను, ప్రజలు మేము దేవుని ప్రజల మనియు మాకు విశేష వాగ్దానములు గలవనియు మేము మిక్కిలి క్షేమముగా నున్నామనియు గర్వపడుచుండిరి. వారు మిక్కిలి హేయమైన ప్రవర్తన గల దుష్టతరము వారైయుండిరి. అట్టివారికి మలాకీ దేవుని సందేశములను అందించుచున్నాడు. మలాకీ ప్రశ్నలు వేయుట, జవాబులు చెప్పుట అను పద్ధతి అనుసరించెను. వారి వేషధారణను, మిశ్రమ వివాహ పద్ధతిని, విడాకుల ద్వారా వివాహములను రద్దుచేసికొను విధానమును, భక్తి లేని కేవలము ఆచారములతో కూడిన ఆరాధనను, అసూయతో నిండిన వినాశకరమైన జీవన విధానమును నిశితముగా పరిశీలించిన మలాకీ తీవ్రపద జాలముతో యూదులను గద్దించెను. అటు తరువాత దేవుడు 400 సంవత్సరము పర్యంతము మౌనముగా నుండెను. అనగా ఆ 400 సంవత్సరములలో ఒక్క ప్రవక్త కూడ ప్రవచించలేదు. తరువాత (మలాకీ 3:1)లో చెప్పబడిన ప్రకారము బాప్తీస్మమిచ్చు యోహాను ద్వారా దేవుడు తన ప్రవచన స్వరమును వినిపింపజేసెను. మలాకీ అనగా నా దూత అని అర్థము. బహుశ ఇది యెహోవా దూత అను అర్థమిచ్చు మలాకాయహా అను నామమునకు సంక్షిప్త రూపమై యుండవచ్చును. క్రొత్త నిబంధన దూతయైన బాప్తీస్మమిచ్చు యోహానును గూర్చి తెలియజేయుచున్న ఈ గ్రంథమునకు ఈ పేరు తగియున్నది. మలాకీ 2:7; మలాకీ 3:1 మున్నగు వచనములలో వివాదములు లేవు. గ్రంథమంతా ఒకరి చేతనే వ్రాయబడియున్నది అను విషయములో భిన్నాభిప్రాయములు లేవు. సంభాషణా ధోరణి గ్రంథమంతటా వ్యాప్తి చెంది యున్నది. ఈయనను గూర్చి తెలిసికొనుట ఇతర ఆధారములు ఏవియు లేవు. ఈయన తండ్రి పేరు అయినను మనకు లభించుట లేదు. అయినను ఈయన ఒక సమాజమందిర సభ్యుడు అని యుదా పారంపర్యము నమ్ముచున్నది.

మలాకీ కాలము : మలాకీ గ్రంథ కాలమును నిర్ణయించుటకు తగిన ఆధారములు లేనప్పటికిని, ఈ గ్రంథములోనే ఇవ్వబడిన కొంత సమాచారమును బట్టి ఈయన కాలమును గుర్తించుచున్నాము. మలాకీ 1:8 లో వ్రాయబడిన అధికారి అను పదము హగ్గయి 1:1; హగ్గయి 1:14; హగ్గయి 2:21 లలో కనిపించుటను బట్టి ఇశ్రాయేలీయులు పారశీకపాలకులకు లోబడియున్న కాలములో క్రీ.పూ 539 – 333 ఈ గ్రంథము వ్రాయబడి యుండునని తలంచవచ్చును. క్రీ.పూ 516లో పునర్నిర్మింపబడిన యెరూషలేము దేవాలయములో ఆ గ్రంథ రచనా కాలములో బలులు అర్పింపబడుచున్నవి (మలాకీ 1:7-15; మలాకీ 3:8) ఈ విధముగా బలులు అలవాటు మరల ప్రారంభింపబడిన తరువాత కొన్ని సంవత్సరములకు ఈ గ్రంథ రచన జరిగియుండును. బలియర్పణ పురాతన ఆచారము. చాలనియమములు పాటించవలసి యుండగా మలాకీ కాలములో నియమ పాలన జరుగలేదు. లోపము గల వాటిని బలి అర్పించుట హేయముగా నుండెను. మరియు నెహెమ్యా కనుగొనిన లోపమునే మలాకీ కూడ చూచెను. వారు కనుగొన్న సమస్యలు ఈ క్రింద విధముగా నున్నవి.

నీచులైన యాజకులు (మలాకీ 1:6; మలాకీ 2:9; నెహెమ్యా 13:1-9). 2. దశము భాగములను, కానుకలను నిర్లక్ష్యము చేయుట (మలాకీ 3:7-12; నెహెమ్యా 13:10-13). 3. అన్యజనులతో వివాహ బంధము మలాకీ 2:10-16; నెహెమ్యా 13:23-28.
నెహెమ్యా యెరూషలేము పట్టణ ప్రాకరములను కట్టుటకు క్రీ.పూ. 444లో యెరూషలేముకు వచ్చెను. ఎజ్రా దేవాలయ నిర్మాణమును ప్రారంభించి అప్పటికి 13 సంవత్సరములు గతించినవి. క్రీ.పూ 432లో నెహెమ్యా మరల పారశీక దేశమునకు వెళ్లెను. తరువాత క్రీ.పూ 425లో అతను మరల యెరూషలేమునకు వచ్చెను. అప్పడతడు ఇశ్రాయేలీయులలోనున్న వివిధ పాపపు అలవాటులను మార్చి వేసెను. కావున నెహెమ్యా యెరూషలేములో లేని కాలములో అనగా క్రీ. పూ. 432, 425ల మధ్య కాలములో మలాకీ ప్రవచించెనని అభిప్రాయపడుట మిక్కిలి తగినదైయున్నది. గ్రంథము హగ్గయి, జెకర్యా ప్రవక్తల కాలమునకు (క్రీ.పూ. 420) నూరు సంవత్సరముల తరువాత వ్రాయబడి యుండవచ్చు.

ముఖ్య పద సముదాయము : వెనుకంజ వేసిన వారికి ఆహ్వానము.

ముఖ్య వచనములు: మలాకీ 2:17; మలాకీ 3:1; మలాకీ 4:5-6

ముఖ్య అధ్యాయము : 3

పాతనిబంధనలోని ఈ చివరి గ్రంథము యేసు క్రీస్తును గూర్చియు, ఆయనకు ముందుగా పంపబడిన బాప్తీస్మమిచ్చు యోహానును గూర్చియు ప్రవచించుటతో ముగింపబడుచున్నది. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మలాకీ 3:1 నాలుగు వందల సంవత్సరముల దీర్ఘకాల ప్రవచన లేమిని తొలగించి ఇదిగో అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము. ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడి అను పలుకులతో యెహాను బయలుపరచబడెను. అప్పుడు యోర్దాను నదీ తీరమున ఉన్న యోహాను వద్దకు ఇశ్రాయేలు ప్రజలు కూడి వచ్చిరి. మలాకీ 3 , 4 అధ్యాయములు మెస్సీయా రాకడను, ఆయనకు ముందుగా రానున్న దూత రాకడను గూర్చియు ప్రవచించుట ద్వారా పాత నిబంధనకును, క్రొత్తని బంధనకును నడమ ఒక వంతెనగా నిలువబడుచున్నవి.

గ్రంథవిభజన : ప్రశ్నలు – జవాబులతో కూడియుండి సంభాషణా రూపమును మలాకీ దేవుని సందేశమును ప్రజల ముందు క్లుప్తముగా బోధించెను. ఈ సందేశముతో పాతనిబంధన ముగియుచున్నది. మలాకీ ఇశ్రాయేలీయులకు సంబంధించిన మూడు ముఖ్య విషయములను ప్రవచించుచున్నాడు.

1.యూదా ప్రజల ఆత్మీయ స్థితి మలాకీ 1:1-5 2.యూదుల అప విత్రత Mal,1,6-3,15 3.యూదుల కొరకు వాగ్దానములు. Mal,3,16-4,6

(a). జ్ఞాపకార్ధ గ్రంథములో వ్రాయబడియున్నవారి ఫలితములు మలాకీ 3:16-18 (b). క్రీస్తు రాకడవలన సంభవించు ఫలితములు మలాకీ 4:1-3 (c). ఏలీయా రాకడను గూర్చిన ప్రవచనములు మలాకీ 4:4-6

సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో ఇది 39వ పుస్తకము; చివరి పుస్తకము . అధ్యాయములు 4; వచనములు 55; ప్రశ్నలు 27; ఇశ్రాయేలీయులు పాపములు తెలుపు వాక్యములు 32; ఆజ్ఞలు 5; వాగ్దానములు 5; హెచ్చరికలు 30; ప్రవచన వాక్యములు 19; నెరవేరిన ప్రవచనములు 6; నెరవేరనున్న ప్రవచనములు 13; దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 28.

Zechariah – జెకర్యా

బబులోను చెర తరువాత కాలమునకు చెందిన ప్రవక్త జెకర్యా. ఈయన బబులోనులో పుట్టిన లేవీయుడు, (నెహెమ్యా 12:16) చెరసాల చరిత్రను తరచిచూచిన యెడల ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు క్రీ.పూ. 722లో అషూరు సైన్యమునకు లొంగిపోయి దీనావస్థలో పడెను. దక్షిణ దేశమైన యూదాకు ఇట్టి దుస్థితి క్రీ.పూ. 586లో బబులోను రాజైన నెబుకద్నెజరు దండయాత్ర ఫలితముగా తటస్థించెను. యూదులలో అనేకులు సుమారు 70 సంవత్సరములు బబులోను దాస్యములో నుండిరి. క్రీ.పూ. 539లో పారశీక మహా సామ్రాజ్యము బబులోను మహాసామ్రాజ్యమును జయించెను. పారశీక సామ్రాజ్యపు నూతన విదేశీ విధానము మూలమున యూదులు స్వదేశమునకు మరల వలెననియు, నెబుకద్నెజరు దండెత్తి కొల్లగొట్టి నాశనము గావించిన వారి దేవాలయమును పునర్నిర్మాణముగావించవలెననియు కోరేషు ఆజ్ఞ వెలువడెను. ఈ ఆజ్ఞననుసరించి జెరుబ్బాబెలు (ఇతడు తరువాత గవర్నరుగా నియమింపబడెను) యొక్కయు యాజకుడైన యెహోషువ యొక్క నాయకత్వమున సుమారు 50,000 మంది యూదాకు తిరిగివచ్చిరి. ఇట్లు వచ్చిన వారిలో ప్రవక్తయైన జెకర్యా ఒకడు. యెరూషలేమునకు రాగానే వారు పూర్వ ప్రకారంగా ఒక బలిపీఠమును కట్టి దేవునికి బలి అర్పించారు. (ఎజ్రా 3:1-6) వారు తమ స్వదేశమునకు వచ్చిన తరువాత రెండవ సంవత్సరములోనే దేవాలయమును కట్టుటకు పునాది వేసిరి. (ఎజ్రా 3:8-13; ఎజ్రా 5:16) కాని వెలుపటి ఆటంకముల మూలమునను, లోపటి సమస్యల మూలమునను దేవాలయ నిర్మాణము 16 సంవత్సరముల ఆటంకపరచబడినది. అటు తరువాత పారశీకరాజైన దర్యావేషు కాలమున (క్రీ.పూ. 522 – 486) మరల దేవాలయ నిర్మాణము ప్రారంభింపబడియున్నది. దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరమున (క్రీ.పూ. 520లో) యెహోవా హగ్గయిను దేవాళయ నిర్మాణపు పనికి ప్రోత్సాహమిచ్చుటకు లేపెను. హగ్గయి నాలుగు నెలల వ్యవధిలో నాలుగు వర్తమానములను అందించి తన పరిచర్యను పూర్తిచేసికొనెను. హగ్గయి తరువాత జెకర్యా అదే పరిచర్యను చేపట్టెను. (హగ్గయి 1:1; జెకర్యా 1:1) జెకర్యా ఖండించి బుద్ధి చెప్పు ఉపదేశ మార్గమును పాటించలేదు. తమ ఉజ్జ్వల భవిష్యత్తు కొరకును దేశాభివృద్ధి కొరకును దేవాలయ నిర్మాణము చేపట్టుట ఎంత ప్రాముఖ్యమో ప్రజలకు వివరించెను. ప్రజలు గొప్ప స్ఫూర్తితో దేవాలయ నిర్మాణములో ముమ్మరముగా పాల్గొనిరి. క్రీ.పూ. 516లో దేవాలయ నిర్మాణ పని పూర్తియైనది నిర్మాణమునకు సహాయపడిన దర్యావేషు తరువాత అహష్వేరోషు. (క్రీ.పూ 486 – 464) ఈ అహష్వేరోషే వస్తిని రాణి పదవి నుండి తొలగించి ఎస్తేరును పారశీక దేశపు రాణిగా చేసికొనెను. జెకర్యా అను నామమునకు “యెహోవా జ్ఞాపకము చేసికొనును” అని అర్థము. ఇదే భావము గల సందేశము ఈ గ్రంథములో అధికముగా వ్యాపించియున్నది. ఇశ్రాయేలీయుల మూల పితరులతో తాను చేసిన నిబంధనలను యెహోవా ఇప్పుడు జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. దీనిని బట్టి వారు ఆశీర్వదింపబడిన వారుగా నుందురు.

గ్రంథకర్త : జెకర్యా. పరిశుద్ధ గ్రంథములో జెకర్యా అను పేరుగలవారిని సుమారు ముప్పది మందిని చూడగలము. మగ సంతానము కలిగినందుకు దేవునికి కృతజ్ఞత తెలుపుకొనుటకు గుర్తుగా వారికి ఈ పేరు పెట్టబడియుండును. తన పితరులైన యిర్మీయా, యెహెజ్కేలు వంటి వారివలె ఈయనయు యాజక కుటుంబములో జన్మించిన ఒక యాజకుడు. ఈయన బెరక్యా కుమారుడు. ఇదోకు మనుమడు. (జెకర్యా 1:1-7; ఎజ్రా 5:1; ఎజ్రా 6:14; నెహెమ్యా 12:4-16) దేవుడు ఈయనను బాల్యములోనే పిలిచి ప్రవక్తగా ప్రత్యేకించుకొనెను. బెరక్యా కుమారుడైన ఈ జెకర్యా – యూదా పారంపర్య ప్రకారము లేఖనములను సమకూర్చు దేవాలయ సంఘ సభ్యులలో ఒకడుగా నుండెను. ఈయన దేవాలయమునకు బలిపీఠమునకు మధ్య మిక్కిలి దారుణముగా చంపబడెను. (మత్తయి 23:35) మరియొక జెకర్యాయును ఇదే విధముగా హత్య గావింపబడెను. (2 దినవృత్తాంతములు 24:20-21) జెకర్యా గ్రంథమును సంపూర్ణముగా వ్రాసినవాడు బెరక్యా కుమారుడైన జెకర్యాయేనని యూదా పారంపర్యము, క్రైస్తవ పారంపర్యము సాక్ష్యమిచ్చుచున్నది.

కాలము : క్రీ.పూ. 480 – 470 మధ్య కాలమని భావింపబడుచున్నది.

ముఖ్య పదసముదాయము : మెస్సీయ కొరకు సిద్ధపడుడి.

ముఖ్య వచనములు : జెకర్యా 8:3; జెకర్యా 9:9.

ముఖ్య అధ్యాయము : 14. జెకర్యా ప్రవచనము ఈ 14వ అధ్యాయము శ్రేష్ఠమైన ఒక అంశమును చెప్పుచున్నది. యెరూషలేము ముట్టడింపబడుట, ఇశ్రాయేలీయుల విరోధులు మొదటిగా విజయము పొందుటను వివరించిన తరువాత ఒలీవల కొండ రెండుగా విడిపోవుటయు, యెరూషలేము యెహోవా చేత రక్షింపబడుటయు జరుగును. యెహోవా దర్శనము జరుగును. అన్యజనులు దేవుని తీర్పుననుసరించి శిక్షింపబడుదురు. ఇశ్రాయేలు దేశము పూర్వ ఔన్నత్యమును పొందును. యూదా పునరుద్ధరింపడును. దేవుడేర్పరచిన పర్ణశాలల పండుగ ఆచరింపబడును. యెరూషలేము ప్రతిష్టిత పట్టణమగును. మున్నగు అంశములన్నియు ఈ అధ్యాయమునందు వర్ణింపబడెను.

గ్రంథవిభజన : ఈ గ్రంథములోని మొదటి 8 అధ్యాయములు దేవాలయమును నిర్మించుటకు యూదులకు ఇవ్వబడిన ప్రోత్సాహములు. తరువాత వచ్చు 6 అధ్యాయములు – దేవాలయ నిర్మాణము పూర్తియైన పిమ్మట మెస్సీయ రాకడ కొరకు ప్రజలు ఎదురు చూచుటకు తోడ్పడు హితోపదేశములు. అన్యజనుల పాలనలో నుండి మెస్సీయ పరిపాలనలోనికిని, శ్రమలలో నుండి సమాధానము లోనికిని, అపవిత్రతలో నుండి పవిత్రతలోనికిని యూదులను తెచ్చుగొప్ప మార్పులు ఈ చివరి భాగములో చెప్పబడినవి. గ్రంథములో వ్యక్తపరచబడిన మూడు భాగములు ఈ క్రింది విధముగానున్నవి.

ఎనిమిది దర్శనములు : 1 – 6 అధ్యాయములు 2. నాలుగు వర్తమానములు : 7, 8 అధ్యాయములు 3. రెండు హృదయ భారములు : 9 – 14 అధ్యాయములు
సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో ఇది 38వ పుస్తకము. అధ్యాయములు 14; వచనములు 211; ప్రశ్నలు 27; ఆజ్ఞలు 35; వాగ్దానములు 4; హెచ్చరికలు 226; ప్రవచన వాక్యములు మొత్తము 122; నెరవేరిన ప్రవచనములు 31; నెరవేరనున్న ప్రవచనములు 91; దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 59.

Haggai – హగ్గయి

గ్రంథకర్త : హగ్గయి

హగ్గయి కాలము : క్రీ.పూ 538లో పారశీక రాజైన కోరెషు – యూదులు తమ స్వదేశమునకు తిరిగి వెళ్ల వలెననియు, యెరూషలేములోని దేవాలయమును పునర్నిర్మాణము గావించవలెననియు ఆజ్ఞాపించెను. స్వదేశమునకు వచ్చిన మొదటి గుంపు ప్రజలకు జెరుబ్బాబెలు నాయకుడుగా నుండెను. క్రీ.పూ 536లో దేవాలయ నిర్మాణము ప్రారంభమాయెను. ఎజ్రా 4 నుండి 6 అధ్యాయములు – హగ్గయి ప్రవచన కాలమును వివరించుచున్నవి. అక్కడ జీవించుచుండిన సమరయులు దేవాలయ నిర్మాణమును నిలిపివేయవలెనని కోరుచు పారసీక రాజ్యమునకు లేఖ వ్రాసియుండిరి.

ఈ ఆటంకములను చూచి యూదులు అధికముగా నిరుత్సాహపడిరి. స్వదేశమునకు తిరిగి వచ్చుచు వారికి ఉన్న మంచి విశ్వాసము సడలెను. దేశములోనున్న శిథిలస్థితి, పంటలు లేకపోవుట, పునర్నిర్మాణమునకు జెందిన కఠినమైన పని, సమరయుల ఆటంకములు వారి మనస్సులను బహుగా నిరుత్సాహపరచెను. విదేశీయులతో పోరాడుట కంటే, దేవాలయ నిర్మాణమును నిలిపి వేయుటయే మంచిదని వారికి తోచెను. ఈ విధముగా రెండు సంవత్సరములు జరిగిన తరువాత క్రీ.పూ 534లో వారు దేవాలయ నిర్మాణమును నిలిపివేసిరి. జనులలోని మానసిక నిరుత్సాహము వారిని ఆత్మీయముగా వెనుకంజ వేయించుకొనుటలోను నిమగ్నులైరి. వారి అవసరములకు ఇండ్లు కట్టుటకు మొదటి స్థానమిచ్చిరి. దేవాలయ విషయములో అశ్రద్ధచూపుటకు వారు పలు సాకులు వెదకసాగిరి. రాజకీయముగా ఎదురైన ఆటంకము, యెరూషలేము ప్రాకారమును కట్టకముందు దేవాలయమును నిర్మించకూడదను ఆలోచన మున్నగునవి వారు చూపుచున్న కొన్ని సాకులు.

ఇట్టి సమయములో దేవాలయ నిర్మాణమును పూర్తి చేయవలెనని ప్రజలను ప్రోత్సహించుటకును, వారిలో నూతనోత్సాహమును పుట్టింపవలెననియు, దేవుడు ప్రవక్తలైన హగ్గయిని, జెకర్యాను లేపాడు. ఈ రెండు గ్రంథములు వ్రాయబడిన కాలములను ఆ గ్రంథముల పుటల నుండియే తెలిసికొనగలము. హగ్గయి గ్రంథము క్రీ.పూ 520లోను, జెకర్యా గ్రంథము క్రీ.పూ 519 – 518 లో వ్రాయబడి యుండును. ఈ ప్రవచనముల ఫలితముగా – 14 సంవత్సర కాలము నిర్లక్ష్యము చేయబడిన దేవాలయ నిర్మాణము క్రీ.పూ 520లో మరల ప్రారంభింపబడి క్రీ.పూ 516లో ముగింపబడినది.

హగ్గయి జెకర్యాలు ప్రవచించిన కాలములో క్రీ. పూ521 – 486 మొదటి దర్యావేషు రాజు పారశీక రాజ్యమును పాలించుచుండెను. ఈతని పై విరోధముగా లేచిన అనేక దేశములను జయించి యూదా దేశమును బలపరచి రాజ్యపాలన గావించెను.

ముఖ్య పదజాలము : దేవాలయమును నూతనముగా నిర్మించుట

ముఖ్యవచనములు: హగ్గయి 1:7-8; హగ్గయి 2:7-9.

ముఖ్య అధ్యాయము- 2

పరిశుద్ధ గ్రంథములోనున్న వాగ్దానములలోని మనలను బలముగా ఆకర్షించి, నిలువబెట్టి యోచింపజేయగల కొన్ని వాగ్దానములను హగ్గయి 2:6-9 లో చూడగలము.

గ్రంథ విభజన : ఉపదేశ పూర్వకమైన హగ్గయి ప్రవచన గ్రంథమును నాలుగు ముఖ్య భాగములుగా విభజింప వచ్చును.

దేవాలయ నిర్మాణమును పూర్తి చేయుట కొరకు ఉపదేశము : హగ్గయి 1:1-15.
2.దేవాలయము – దాని పూర్వ వైభవము హగ్గయి 2:1-9.

3.లోబడిన వెంటనే కలుగు ఆశీర్వాదములు హగ్గయి 2:10-19

4.భవిష్యత్తులో ఆశీర్వాదముల నిత్తునను వాగ్దానము హగ్గయి 2:20-23.

సంఖ్యా వివరములు: పరిశుద్ధ బైబిలులో ఇది 37వ పుస్తకము ; అధ్యాయములు 2; వచనములు 38; ప్రశ్నలు 8; ఆజ్ఞలు 9; వాగ్దానములు 3; ముందు జాగ్రత్తలుగా హెచ్చరికలు 14; ప్రవచన వాక్యములు 9; నెరవేరినవి 6; నెరవేరనున్నవి 3; దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 5.

Zephaniah – జెఫన్యా

ఇశ్రాయేలు దేశము రెండు ముక్కలుగా చీలగా, యెరూషలేము రాజధానిగానున్న దక్షిణ రాజ్యమే, యూదా దేశము. దీని ఆత్మీయ, రాజకీయ చరిత్రలలో పునరుద్ధీకరణలు, పరిశుద్ధ పరచబడుట పలుమారు జరిగియున్నవి. ఆమోను కుమారుడైన యోషీయా పరిపాలనా కాలములో ఇట్టి సంఘటన యొకటి సంభవించెను. అనగా దేవుని వైపు మళ్లుకొనుట జరిగెను. శుద్ధీకరణ పొందుటకై జెఫన్యా ప్రజలకిచ్చిన

ఆహ్వానము యోషీయా కాలములో జరిగిన ఉజ్జీవమునకు ప్రోత్సాహములను ఇచ్చియుండును. ఈ కాలములో యూదా ప్రజల జీవితములో బాహ్యముగా పలుమార్పులు కలిగినవి. అయినను ప్రజల అంతరంగములలో తగినంత మార్పు రాలేదు. శుద్ధీకరణ కొంతవరకే ప్రయోజన కరముగా నుండెను. కావున అప్పటి పరిస్థితులకు అనుగుణంగా జెఫన్యా – మహాభయంకరమైన యెహోవా దినము రాబోవుచున్నది. అప్పుడు ప్రతిపాపము ప్రతి దుష్టత్వము మిక్కిలి కఠినముగా దండింపబడును అని ఉచ్చై స్వరముతో ప్రవచించెను. దేవుని కోపాగ్నికి యూదాదేశముతో బాటు దాని చుట్టునున్న దేశములు కూడ కాలిపోవునని జెఫన్యా ప్రవచించెను. ప్రవచనము ప్రకారము వినాశము సంభవించిన తరువాత మిగిలిన ప్రజలు మెస్సీయ పరిపాలనా కాలముతో మహిమకరమైన ఆశీర్వాదములను స్వతంత్రించుకొందురు. అప్పుడు స్తోత్రమును సంతోషమును కలుగును అని జెఫన్యా ప్రవచించాడు. జెఫన్యా అనగా యెహోవాదాచును అని అర్థము. మిక్కిలి దుష్టుడైన రాజైన మనష్హే పరిపాలన ఉత్తరార్థములో జెఫన్యా జన్మించాడు. మనష్హె క్రూరత్వము నుండి యెహోవా అతనని మరుగుచేశాడు అను విషయమును ఈ నామము సూచిస్తుంది.

గ్రంథకర్త : గ్రంథములో వ్రాయబడిన ప్రథమ వచనము, దానిని వ్రాసిన జెఫన్యాను కొంచెము భిన్నమైన రీతిలో పరిచయము చేస్తున్నది. జెఫన్యా తన వంశమునకు చెందిన నలుగురు రాజుల నామములను ఈవచనములో వ్రాస్తున్నాడు. దీనిని బట్టి జెఫన్యా యూదా రాజుల వంశస్థుడనియు, అతడు ప్రవక్త ఆయెననియు తెలియుచున్నది. ఈ బంధుత్వము బట్టి రాజు సన్నిధిలో మంచి పదవిని, దేవుని వర్తమానమును ప్రకటించు స్వాతంత్ర్యమును కలిగియుండును. జెఫన్యా 1:6 లో యెరూషలేమును గూర్చి ఈ స్థలములో అని చెప్పుచున్నాడు. అంతమాత్రమే కాకుండా యెరూషలేమునకు గల ప్రత్యేకత అనేక వచనములలో చెప్పబడినది జెఫన్యా 1:9-10; జెఫన్యా 3:1-7. దీనిని బట్టియు జెఫన్యా యెరూషలేము నివాసీ అని తెలియుచున్నది.

కాలము : ఆమోను కుమారుడైన యోషీయా దినములలో అని గ్రంథము ప్రారంభమగుచున్నది. కావున యోషీయా కాలమును బట్టి జెఫన్యా కాలమును నిర్ణయింపగలుగుచున్నాము. యోషీయా క్రీ.పూ 640 నుండి 609 వరకు పాలించెను. జెఫన్యా 2:13 లో నీనెవె పతనము క్రీ.పూ . 612లో జరిగినది. కావున జెఫన్యా క్రీ.పూ 612 కంటె ముందే ప్రవచించెనని తెలియుచున్నది. కావున జెఫన్యా ప్రవచించిన కొలతలు క్రీ. పూ 640 – 621 మధ్య కాలమని భావింపవచ్చును. ఈ కాలమును నిర్ణయించుటకు గల ఆధారములను ఇంకను స్పష్టముగా పరిశీలింతుము. జెఫన్యా 1:3-13; జెఫన్యా 3:1-7 మున్నగు వాక్య భాగములలో వివరింపబడియున్న పాపముల పట్టికను పరిశీలించినచో ఈ వాక్యములు యోషీయా చేపట్టిన పునరుద్ధరణకు ముందుగా వ్రాయబడెననుట సుష్పష్టము. ఆయన ప్రవచించిన కాలములో మనషె కాలములో ఆమోను కాలములో బలపడిన పాపస్థితి కొనసాగుచునేయున్నది.

యోషీయా 8 సంవత్సరములవయస్సులో రాజాయెను. 16 సంవత్సరముల వయస్సులో ఆయన హృదయము దేవుని వైపు తిరుగసాగెను. అతడు తన పునరుద్ధీకరణ కార్యక్రమమును తన 12వ సంవత్సరమున ప్రారంభించెను. (క్రీ.పూ 628 లో 2 దినవృత్తాంతములు 24:3-7) బయలు దేవతాబలిపీఠమును పడగొట్టెను; ఉన్నత స్థలములను కూల్చివేసెను. విగ్రహములను ధ్వంసముచేసెను. అతడు యూదాదేశమును యెరూషలేమును శుద్ధీకరించెను. మరల 6 సంవత్సరములకు పిమ్మట క్రీ.పూ. 622 లో యాజకుడైన హిల్కియా, దేవాలయములో కనుగొనిన ధర్మశాస్త్ర గ్రంథమును చదివిన తరువాత మరియొక మారు, శుద్ధీకరణను చేపట్టుటకు పూనుకొనియుండెను. (2 దినవృత్తాంతములు 34:8; 2 దినవృత్తాంతములు 34:35-19) ఈ ఆధారముల ద్వారా జెఫన్యా కాలము క్రీ.పూ 640 – 621 అని స్థిరపరచబడినది. మనషే ఆమోనుల దుష్టపరిపాలన 57 సంవత్సరములు కొనసాగెను. అది యూదా ప్రజలపై బలమైన యొక దుష్టముద్రను వేసెను. యూదా అట్టి దుష్ట ప్రభావముల నుండి బయటపడుట ఎన్నటికిని సాధ్యపడలేదు. యోషీయా చేపట్టిన పునరుద్ధరణ కార్యములు చాలా ఆలస్యమగుట వలన పునరుద్దరణ తగినంత ప్రభావముతో వ్యాప్తిజెందలేదు. ఆయన మృతిజెందిన తరువాత ప్రజలు ఎప్పటివలే తమ పాత దుర్మార్గములకు, విగ్రహారాధనలకు మరలుకొన్నారు. యిర్మీయా, హబక్కూకు అనువారికి సమకాలికుడైన జెఫన్యా యూదా నాశనమునకు కొంచెము చివరి కాలములో జీవించెనని మనము ఒప్పుకొనవచ్చును.

ముఖ్య పదజాలము : ప్రభువుదినము.

ముఖ్య వచనములు : జెఫన్యా 1:14-15; జెఫన్యా 2:3

ముఖ్య అధ్యాయము : జెఫన్యా 3. జెఫన్యా యొక్క ఈ చివరి అధ్యాయములో ప్రభువు దినమును గూర్చి రెండు గుణ లక్షణములను గురించి న్యాయ తీర్పును, విమోచన గూర్చి వ్రాయబడినది మిక్కిలి గమనించవలసినది.

గ్రంథ విభజన : ఈ గ్రంథమును రెండు ముఖ్య కార్యములు మనము చూడగలము. తీర్పు, రక్షణ.

(1) ప్రభువుదినము న్యాయ తీర్పు, శిక్ష Zep,1,1 -3,8.

(a). లోకమంతటి మీదికి వచ్చు శిక్ష జెఫన్యా 1:1-3. (b). యూదా మీదికి వచ్చు శిక్ష Zep,1,4-2,3. (C). యూదా చుట్టునున్న దేశముల మీదికి వచ్చు న్యాయ తీర్పు జెఫన్యా 2:4-15. (d). యెరూషలేమునకు విరోధమైన న్యాయతీర్పు జెఫన్యా 3:1-7. (e). లోకమంతటి మీదికి వచ్చు న్యాయతీర్పు జెఫన్యా 3:8.

(2). ప్రభువు దినమున కలుగు రక్షణ జెఫన్యా 3:9-20.

(a). మారుమనస్సును గూర్చిన వాగ్దానము జెఫన్యా 3:9-13. (b). విమోచనను గూర్చిన వాగ్దానము జెఫన్యా 3:14-20.

సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో ఇది 36వ పుస్తకము. దీనిలోని అధ్యాయములు 3; వచనములు 53; ప్రశ్నలు లేవు; ఆజ్ఞలు 14; వాగ్దానములు 4; హెచ్చరికలు 86; ప్రవచనవాక్యములు 45; నెరవేరిన ప్రవచనములు 5; నెరవేరనున్న ప్రవచనములు 40; దేవుని నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 4. (జెఫన్యా 1:2; జెఫన్యా 2:1; జెఫన్యా 3:1-8).

Habakkuk – హబక్కూకు

యూదామరల మృత్యుముఖమును సమీపించుచున్న కాలములో హబక్కూకు ప్రవక్త ప్రవచించెను. మారుమనస్సు పొందుడని పలుమారు ఆహ్వానింపబడినను జనులు గర్విష్టులై వంగని మెడ గలవారై పాప మార్గములను విడువక వెంబడించుచుండిరి. తన దేశమున నెలకొనియున్న ఈ భయంకర దుస్థితిని చూచి ప్రవక్త యెహోవా ఇది ఎంత కాలము కొనసాగును అను ప్రశ్నను లేపుచున్నాడు. (హబక్కూకు 1:2; హబక్కూకు 1:13-14) తమ మీదికి రానున్న శిక్షను నెరవేర్చు ఆయుధములుగా బబులోనీయులు తన చేతిలో నుందురని దేవుడు జవాబివ్వగా – ప్రవక్త భయపడి వణకుచు తనకు తెలియకుండానే మోకాళ్లూని ప్రార్థన ప్రారంభించెను. అంతట ఏతరమునకు చెందిన వారైనను – నీతిమంతుడు చూపుద్వారా కాక విశ్వాసమూలముగా బ్రదుకును అను సత్యమును దేవుడాయనకు బయలుపరచెను. దేవుని మార్గములు తనకు సంపూర్ణముగా తెలియబడనప్పటికి హబక్కూకు సాటిలేని దేవుని జ్ఞానమును కీర్తించి స్తుతిగానము చేయుచున్నాడు. హబక్కూకు అను అసాధారణమైన హెబ్రీనామధేయము – కౌగలించుకొనుట అను అర్థమిచ్చు హబక్ అను హెబ్రీ క్రియా పదము నుండి ఉద్భవించినది. కౌగలించుకొనువాడు లేక గట్టిగా పట్టుకొనువాడు అని ఈ నామమునకు అర్ధము. దేవునిని గట్టిగా పట్టుకొనిన ఈ ప్రవక్త ఇదే భావమును హబక్కూకు 3:16-19 వాక్యముల ద్వారా వివరించుచున్నాడు.

గ్రంథకర్త : హబక్కూకు 1:1; హబక్కూకు 3:1 లను బట్టి దీని గ్రంథ కర్త హబక్కూకు అని స్పష్టమగుచున్నది. హబక్కూకు వృత్తి ప్రవచించుటయని ఈ వాక్యములు తెలియజేయుచున్నవి. 3వ అధ్యాయము ఒక ప్రార్థనా గీతము. దీని చివరి భాగములో ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది అని వ్రాయబడుటను బట్టి హబక్కూకు యెరూషలేములో జరుగు ఆరాధనలతో సంబంధము గలిగియున్న ఒక యాజకుడైయుండవచ్చునని మనము తలంచవచ్చును. ఆయన తనకుటుంబమును గూర్చియైనను తన దేశనమును గూర్చియైనను ఏమియు చెప్పలేదు. ఈయనకు దానియేలుతో సంబంధముగలదని కొందరు అభిప్రాయపడుచున్నారు.

హబక్కూకు కాలము : హబక్కూకు కాలము యొక్క గుర్తింపులను, జరుగనైయున్న బబులోను దండయాత్రను గూర్చి ఈ గ్రంథములో వ్రాయబడిన వర్తమానముల నుండి మాత్రమే గ్రహించగలము. (హబక్కూకు 1:6; హబక్కూకు 2:1; హబక్కూకు 3:16) హబక్కూకు గ్రంథము వ్రాయబడిన కాలము మనష్హే పాలనా కాలము ( క్రీపూ 697 – 642 ) అని కొందరు బైబిలు పండితులును, ఆమోను పాలనా కాలము (క్రీ. పూ. 642 – 640 ) అని మరికొందరు బైబిలు పండితులు అభిప్రాయపడుచున్నారు. అయితే ఈ ఇరువురు రాజుల కాలములో బబులోను అషూరు రాజులు పాలించిన భాగములలో ఒకటిగా ఉన్నందున ఈ ఊహలు పునాదులు లేనివిగా నున్నవి. క్రీ.పూ. 640 – 609 పాలించిన ఉత్తమ రాజైన యోషియా కాల పరిస్థితులు హబక్కూకు ప్రవచనములకు సరిపడలేదు. క్రీపూ 609 – 598 కాలములో యూదాను పరిపాలించిన భక్తి హీనుడైన రాజైన యెహోయాకీము కాలము మాత్రమే హబక్కూకు ప్రవచనమునకు సరిపోవుచున్నది. ఈ రాజే యూదాను నాశనపుటంచుల వరకు దుష్టత్వములో నడిపించాడు. (2 రాజులు 23:34; 2 రాజులు 24:5 యిర్మియా 22:17) నా బోసాలాసర్ (నెబూజరదాను)? అను రాజు కాలములో (క్రీ.పూ. 626 – 605) బబులోను బలపడనారంభించెను. అతడు క్రీ.పూ 612లో అషూరు రాజధానియైన నీనెవేను నాశనము గావించెను. నాబా సాలాసర్ తరువాత రాజైన నెబుకద్నెజరు క్రీ.పూ 605లో సింహాసన మెక్కెను. ఆయన తన పరిపాలన ప్రారంభమైన మొదటి సంవత్సరములోనే యూదాపై దండెత్తాడు. దానిని స్వాధీనము చేసుకొని రాజకుటుంబీకులలో 10,000 మంది అధిపతులను చెరపట్టి బబులోనుకు తీసికొని వెళ్లాడు. పేదలను వంఛించిన అధిపతులే మొదటిగా ఖైదీలుగా పట్టబడ్డారు. హబక్కూకు బబులోను దండయాత్రకు ముందే ప్రవచించెను. గనుక క్రీ.పూ 607 కు సమీపములో ఈ గ్రంథము వ్రాయబడియుండవలెను.

ముఖ్య వచనము : “నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రదుకును”

ముఖ్య వచనములు : హబక్కూకు 2:4; హబక్కూకు 3:17-19

ముఖ్య అధ్యాయము : 3 అధ్యాయము.

హబక్కూకు గ్రంథములోని చివరి మూడు వచనములు (హబక్కూకు 3:17-19) ఈ గ్రంథమును మిక్కిలి ఔన్నత్య స్థానమునకు హెచ్చించుచున్నది. ఫిర్యాదులతోను, సందేహములతో, ప్రశ్నలతోను ప్రారంభమైన హబక్కూకు ప్రవచన గ్రంథము ముగింపులో ధృఢ నిశ్చయతతోను, విశ్వాసముతోను అంతమగుచున్నది. విశ్వాస విజయ విఖ్యాతమైన ఈ మూడవ అధ్యాయము పరిశుద్ధ గ్రంథము అంతటిలో విశిష్ట స్థానము పొందుచున్నది.

గ్రంథ విభజన : ఈ గ్రంథములో రెండు భాగములు మిక్కిలి తేటగా కనబడుచున్నవి. హబుక్కూకు దేవుని యెదుట లేవనెత్తుచున్న సంశయాత్మక ప్రశ్నలును దానికి దేవుడు అనుగ్రహించిన జవాబులును మొదటి రెండు అధ్యాయములలోను, హబక్కూకు కృతజ్ఞతతో దేవునికి చేయు స్తోత్ర గీతము మూడవ అధ్యాయములోను వివరింపబడినవి.

(1) హబక్కూకు సంశయములు, ప్రశ్నలు, దేవుని జవాబులు: 1 , 2 అధ్యాయములు (a). హబక్కూకు మొదటి ప్రశ్న హబక్కూకు 1:1-4. (b). దేవుని జవాబులు హబక్కూకు 1:5-11 (c). హబక్కూకు రెండవ ప్రశ్న హబక్కూకు 1:12; హబక్కూకు 2:1 (d). దేవుని రెండవ జవాబు హబక్కూకు 2:2-20

(2) హబక్కూకు స్తోత్రగీతము : 3వ అధ్యాయము

(a). దేవుని కృప కొరకు ప్రవక్త ప్రార్ధన హబక్కూకు 3:1-2 (b). దేవుని కనికరము స్మరించుట హబక్కూకు 3:3-15 (c). దేవుని రక్షణపై విశ్వాసముతో ఆనుకొనుట హబక్కూకు 3:16-19

సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో ఇది 35వ పుస్తకము. అధ్యాయములు 3; వచనములు 56; ప్రశ్నలు 12; ఆజ్ఞలు 1; వాగ్దానములు లేవు; హెచ్చరికలు 20; ప్రవచన వాక్యములు 11; దేవుని నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 2 (Hab,1,5-2,2).

Nahum – నహూము

ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయ జూతురు; మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. లూకా 12:48. ఏకైక సత్యదేవుని తెలిసికొనే మంచి అవకాశము నీనెవెకు లభించినది. యోనా సందేశమును వినిన ఈ మహా పట్టణము మారు మనస్సు పొందినది. అందువలన దేవుడు తన అత్యంత కృపచేత దాని మీదికి రావలసిన శిక్షను నిలిపివేసెను. అయితే 100 సంవత్సరముల తరువాత ప్రవక్తయైన నహూము అదే పట్టణమునకు కలుగబోవు దుర్గతిని గూర్చి తన గ్రంథములో ప్రవచించుట చూడగలము. అష్హూరీయులు తమ ఆత్మీయ ఔన్నత్యము నుండి దిగజారిన తరువాత, వారు మరల తమ అక్రమములను, విగ్రహారాధనలను, దుష్టకర్మములను అనుసరించి. ఆ హేతువు చేతనే ఈ పట్టణమును బబులోను సర్వనాశనము చేయునని భూమిపై దీని పేరు చెరిపివేయబడునని నహూము ప్రవచించెను. ఈ ప్రవచనము మిక్కిలి భయంకరముగా అక్షరాలా నెరవేరెను. హెబ్రీ నామమైన నహూము నెహెమ్యా అను పేరుకు సంక్షిప్త రూపము. నహూము అనగా యెహోవా యొక్క ఆదరణ అని అర్ధము. అష్హూరు రాజధానియైన నీనెవె పతనమును గూర్చిన ప్రవచన వర్తమానము, నీనెవె చేతిలో శ్రమలు అనుభవించిన యూదాకును, ఇతర ప్రజలందరికిని మిక్కిలి ఆదరణ కరముగా నుండెను.

గ్రంథకర్త : నహూము, పాతనిబంధనలో నహూము 1:1 లో మాత్రమే ప్రవక్తయైన నహూమును గూర్చి లిఖింపబడియున్నది. అందు ఆయన ఎల్కోషు వాడు అని పిలువబడుచున్నాడు. ఎల్కోషు అను పేరుగల స్థలము ఎక్కడ ఉన్నది? దీనిని గూర్చి నాలుగు అభిప్రాయములు గలవు. (1). 16వ శతాబ్దములో నున్న ఒక సంప్రదాయమును బటి ఇరాక్ లోని అల్ కూస్ పటణమే ఈ ఎల్కొషు. ఈ పట్టణము ఇరాక్ లో, నేనెవేకు ఉతరమున టెగ్రీస్ నదీతీరమున గలదు. (2). గలలీయలోని రామా పట్టణమునకు సమీపమున నున్నట్టియు, ఎల్కెషి అని పిలువబడుచున్నట్టియు పట్టణమే ఎల్కోషు అని ఆది సంఘ పితరులలో ఒకరైన జరోము తలంచెను. (3). కప్నెహూము అనగా నహూము యొక్క నగరము అని అర్ధము. పూర్వము ఎల్కోషు అని పిలువబడిన పట్టణమే, నహూము జ్ఞాపకార్థముగా కపెర్నహూముగా మార్చబడినది అని కొందరు నమ్ముచున్నారు. (4). ఎల్కోషు అనునది దక్షిణ యూదాలో యెరూషలేమునకును, గాజాకును మధ్యలో ఉన్నదనియు, కాలక్రమములో ఎల్కేషేయి అని పిలువబడినదనియు బైబిలు పండితులలో అధిక సంఖ్యాకులు అభిప్రాయపడుచున్నారు. ఆఖరున చెప్పబడిన అభిప్రాయము ననుసరించి నహూము ప్రవక్త దక్షిణ దేశమైన యూదాకు జెందినవాడు. ఆయన యూదా విజయమును సంతోషముగా ప్రవచించుటను బట్టి ఆయన యూదా ప్రాంతమునకు జెందిన వాడని విశదమగుచున్నది (నహూము 1:15; నహూము 2:2)

నహూము కాలము : బబులోను దండయాత్ర ఫలితముగా నీనెవె క్రీ.పూ 612లో నాశనము చేయబడినది. నహూము 3:8-10 వచనములలో వ్రాయబడిన దానిని బట్టి నైలు నదీతీరమున నున్న తేబేసు (నో అమ్మోను) నాశనము నగరము యొక్క నాశనము సమీపకాల సంభవము తెలుపుచున్నది. తేబేసు నగరము

క్రీ.పూ. 663వ సంవత్సరములలో పతనమాయెను. కావున నహూము కాలము క్రీ.పూ. 663 కును, క్రీ.పూ. 612కును మధ్య కాలమనునది స్పష్టము. తేబేసు పట్టణము పతనమైన తరువాత పది సంవత్సరములకు, క్రీ.పూ. 693లో మరల నిర్మింపబడినదని చరిత్ర పుటలు వివరించుచున్నవి. నహూము తన గ్రంథమును

క్రీపూ 663కును, క్రీ.పూ. 654 కును మధ్య కాలములో వ్రాసియుండవచ్చునని తలంచవచ్చును. గ్రంథ ప్రారంభములో రాజులలో ఎవరి పేరైనను ప్రస్తావింపబడక పోవుటను బట్టి రాజైన మనష్హే (క్రీ.పూ. 697 – 642) దేవుని దృష్టికి చెడ్డవాడైయుండుటయే కారణమని తలంచవచ్చును.

యోనా ప్రవచన వర్తమానము విని నీనెవె ప్రజలు పశ్చాత్తాపబడిన సంఘటన క్రీ.పూ. 759లో జరిగినది. ఈ పశ్చాత్తాపము, మారుమనస్సు తాత్కాలికమైనదిగా నుండెను. అష్హూరీయులు అనతి కాలములోనే తిరిగి తమ క్రూరత్వమునకు మరలిరి. క్రీ.పూ 722 లో అష్హూరు రాజైన రెండవ షార్గోను ఉత్తర రాజ్య ( ఇశ్రాయేలు) రాజదానియైన షోమ్రోనును నాశనము చేసి, పది గోత్రముల వారిని చెదరగొట్టి వారిని బానిసలుగా అష్హూరునకు తీసికొని పోయెను. క్రీపూ 701లో అష్హూరు రాజైన సేన్హరీబు మహా గొప్ప సైన్యము యూదాను జయించుటకు విఫలయత్నము చేసెను. క్రీ.పూ 669 – 633 వరకు రాజ్యమేలిన అషూర్ పాని పాల్ కాలములో కీర్తి ఔన్నత్యము నొందియున్నది. నీనెవె పట్టణము దానికి రాజధాని.

భూమి మీద మిక్కిలి ప్రఖ్యాతిగాంచిన ఈ నీనెవె పట్టణము చుట్టూ 100 అడుగుల ఎత్తును, ఏక కాలములో మూడు రథములను ఒకదాని ప్రక్క మరొకదానిని ఉంచి నడుపుటకు తగినంత వెడల్పును గల కోటయున్నవి. కోటలోపల పలు ప్రాంతములలో కనబడు మేడమిద్దెలు ఇంకను 100 అడుగుల ఎక్కువ ఎత్తుగలవై యుండెను. వీటి అన్నింటి కంటె మిన్నగా కోట చుట్టూ 150 అడుగుల వెడల్పును 60 అడుగుల లోతును గల కందకము గలదు. ఇంత గొప్ప నీనెవె పట్టణము సర్వనాశనము చేయబడునని నహూము ప్రవచనము చెప్పుచుండెను. ఆ కాలములో ఈ ప్రవచనము నమ్మశక్యము కానిదిగా నుండెను.

క్రీ.పూ 663 తరువాత అషూరును పాలించిన రాజులకాలములో ఆమహా సామ్రాజ్యపు కీర్తి పతనమగుట ప్రారంభించెను. నహూము 1:8 లో నీనెవె పట్టణము ఒక మహా నది ప్రవాహము ద్వారా నాశనమగునని చెప్పబడియున్నది. అది అక్షరాలా నెరవేరెను. టైగ్రీస్ నది పొర్లి ప్రవహించి నీనెవె కోటగోడలో కొంత భాగమును పడగొట్టెను. కోట పడిపోయిన భాగము ద్వారా బబులోను సైన్యందండెత్తి క్రీ.పూ 612లో నగరమును స్వాధీనం చేసికొనిన పిదప దానిని అగ్నికి ఆహుతిచేసెను. నహూము 3:11 లో నీవును మత్తురాలవై దాగుకొందువు, శత్రువు వచ్చుట చూచి ఆశ్రయ దుర్గము వెదకుదువు అని వ్రాయబడిన ప్రకారముగానే క్రీ.పూ. 612లో నశించిపోయిన నీనెవె స్థానం మరువబడెను. 2500 సంవత్సరముల కాలము వరకు లోకములో అజ్ఞాతముగా నుండెను. అలెగ్జాండరు, నెపోలియనులు సమీపమున స్థావరమేరుపరచుకొని విశ్రమించెను. కాని వీరికి ఇక్కడ ఒక కాలమున ప్రసిద్ధి చెందిన పట్టణమున్నదను సూచన ఎలాంటిది లభించలేదు. అస్థలము మొత్తం గొర్రెల మేపు ప్రదేశమని పిలువబడెను. నీనెవె సర్వనాశనమాయెను. క్రీ.శ. 1542లో భూశాస్త్ర పరిశోధనలో ఇప్పుడున్న ఇరాక్ లో నున్న టైగ్రీసు నది తీరమున ఇది ఉన్నదని కనుగొనిరి.

ముఖ్య వర్తమానము : నీనెవె న్యాయతీర్పు.

ముఖ్యవచనములు : నహూము 1:7-8 నహూము 3:5-7

ముఖ్య అధ్యాయము : నహూము 1. ఈ అధ్యాయము ఒక ప్రక్క దేవుని ప్రతిదండనయు, కోపమును వర్ణించుటయు, మరో ప్రక్క తమ భక్తులకు శ్రమలకాములో యిచ్చు ఆశ్రయమైన దేవకారుణ్యమును హెచ్చించి చూపుచున్నది. “ఇదిగో సమాధానమును చాటించు సువార్తకుని పాదములు పర్వతముల మీద వచ్చుచున్నవి” అని ప్రారంభించు 15వ వచనము దేవుని బిడ్డలకు దేవుడిచ్చు బద్రతయు, సమాధానమును చెప్పుచున్నది.

గ్రంథ విభజన : మూడు అధ్యాయములు గల ఈ గ్రంథము నీనెవె మీదికి రాబోవు న్యాయ తీర్పును గూర్చి మూడు ముఖ్య కార్యములను రమ్యముగా తెలియ జేయుచున్నది.

నీనెవె నాశనమును చెప్పుచున్నవి : 1 అధ్యాయము (a). న్యాయ తీర్పు జరుగు విధము : నహూము 1:1-8 (b). నీనెవె నాశనము , యూదా విడుదల : నహూము 1:9-15. 2. నీనెవె నాశనము – వివరణ : 2 అధ్యాయములు. (a). యుద్ధమునకు ఆహ్వానము నహూము 2:1-2 (b). నీనెవె నాశనమగుచున్నది నహూము 2:3-13. 3. నీనెవె నాశనము కాబోవుచున్నది. 3 అధ్యాయము (a). నాశనమునకు కారణములు నహూము 3:1-11 (b). నీనెవె నాశనము – ఆగదు నహూము 3:16-19

సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో ఇది 34వ గ్రంథము. అధ్యాయములు 3; వచనములు 47; ప్రశ్నలు 8; ఆజ్ఞలు 5; వాగ్దానములు లేవు; హెచ్చరికలు 72; ప్రవచనములు 46; నెరవేరినవి 40; నెరవేరనివి 6; దేవుని నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 2; (నహూము 1:2; నహూము 2:1)

Micah – మీకా

మీకా ఒక గ్రామీణ కుటుంబము నుండి దేవుని చేత పిలువబడిన యొక ప్రవక్త. ఇతడు యెరూషలేము రాజకుటుంబమునకును, యూదా ప్రజలకును, షోమ్రోను రాజకుటుంబమునకును, ఇశ్రాయేలు ప్రజలకును దేవుని న్యాయ తీర్పులను గూర్చిన వర్తమానములను ప్రవచనములుగా ప్రకటించి యున్నాడు. ధనవంతులును, అధికారులును పేద ప్రజలను బాధించుచు, క్రూరముగా హింసించుటను సహించలేక మీకా గొప్ప హృదయ భారముతో తన ప్రవచన వాక్యములను ప్రకటించెను. సామాజిక, రాజకీయ అధికారములను స్వార్ధలాభము కొరకు ఉపయోగించుచున్న వారిని ఆయన గద్దించుచున్నాడు. మీకా గ్రంథములో ముఖ్యములగు మూడు అభిప్రాయములను చూడగలము.

మొదటిది : తన ప్రజల పాపము, క్రూరత్వము. రెండవది : వాటికి ప్రతిగా దేవుడు పంపబోవుచున్న కఠిన న్యాయ తీర్పు. మూడవది : శిక్ష విధింపబడిన యనంతరము మిగిలిన ప్రజలను తనకు మహిమ కరముగా పునరుద్ధ రించుట. ఈ మూడు ఉద్దేశముల ద్వారా దేవుడు తన ప్రజల నుండి ఆశించినది ఏమనగా —- న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు మాత్రమే.

మికాయా అను హెబ్రీ పదమునకు సంక్షిప్త రూపమే మికా. మీకాయా అను పదమునకు “యెహోవా వంటి వాడు ఎవడు” అని అర్థము. మీకా 7:18లో అడిగిన ప్రశ్న ద్వారా మీకా తన నామమును ప్రత్యేకముగా లిఖించుచున్నాడు.

గ్రంథకర్త : మీకా జన్మ స్థలమైన మోరె మోరేషేత్గతు (మీకా 1:14) యెరూషలేమునకు 40 కి. మీ దూరమున నైరుతి దిక్కుననున్నది. ఇది యూదయకును ఫీలిష్టియులకు సరిహద్దున, గాతునకు సమీపముననున్నది. ఆమోసువలె మీకా కూడా గ్రామీణుడే, ఆయన వృత్తిని గూర్చిన స్పష్ట సమాచారము లేదు. మోరెషెత్గతు గ్రామము వ్యవసాయ గ్రామము. అతడు వ్యవసాయదారుడై యుండవచ్చును. యెషయా దానియేలులవలె ఇతడు రాజకీయములను ఎరుగడు. అయినను ఆయన తన ప్రజల యొక్క శ్రమలను గూర్చి గాఢమైన హృదయ భారమును వ్యక్తపరచియున్నాడు. దేవుడు ఆయనను స్వయముగా పిలిచి ప్రవక్తగా ప్రత్యేకించెనను విషయము మీకా 3:8 ద్వారా స్పష్టమగుచున్నది. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడియున్నాను.

కాలము : ఈ గ్రంథములోని మొదటి వచనములో చెప్పబడిన ప్రకారము మికా ప్రవచించినది యోతాము (క్రీ.పూ 750 – 735), ఆహాజు (క్రీ.పూ 735 – 715 ), హిజ్కి యా (క్రీ పూ 715 – 686) అను యూదా రాజుల కాలము అని గ్రహించగలము. ( 2 రాజులు 16 అధ్యాయము) ఈయన ప్రవచించినది ముఖ్యముగా యూదాను గూర్చియే అయినను, ఈయన ఇశ్రాయేలీయులను గూర్చి కూడ ప్రవచించి షోమ్రోను పతనమును ప్రవచించెను. ఈయన ప్రవచించిన కాలములో అధిక భాగము క్రీ.పూ 722లో సంభవించిన అష్హూరు చెరకు ముందే జరిగి యుండెనని ఊహింపవచ్చును. దేవుని ప్రజలలో విస్తరించియున్న విగ్రహారాధనను, క్రమ శిక్షణా రాహిత్యమును ఈ ప్రవక్త మిక్కిలి కఠినముగా ఎదిరించి తీర్పును ప్రకటించుట వలననే హిజ్కియా కాలములో గొప్ప ఉజ్జీవము కలిగినదనియు – అందువలన ఈ ఉజ్జీవమునకు ముందే మీకా క్రీ.పూ 742 నుండి క్రీ.పూ 687 వరకు గల కాలములో జరిగినదని నిర్ణయించుకొనవచ్చును. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు రాజ్యములో జీవించిన హోషేయకును, యెరూషలేములోని రాజ భవనములో జీవించిన యెషయాకును ఈయన సమకాలికుడు. మహోజ్వలమైన ఉజ్జియా పరిపాలనానంతరము యోతాము యూదా రాజాయెను. అతడు తన తండ్రియైన ఉజ్జియా వలె దేవుని దృష్టికి నీతిగా ప్రవర్తించెను. అయినను అతడు ఉన్నత స్థలములను నాశనము చేయలేదు. యోతాము తరువాత అతని కుమారుడైన ఆహాజు యూదా రాజాయెను. ఆహాజు దుష్టుడై ఇశ్రాయేలు రాజులవలె ప్రవర్తించెను. అతని కాలములో అష్హూరు సైన్యము వలనను సిరియా సైన్యముల వలనను యూదా మీదికి భయోత్పాతములు వచ్చెను. అతని తరువాత అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజాయెను. హిజ్కియా కాలములో అష్హూరు సైన్యము యెరూషలేమును ముట్టడించెను. దేవుడు అద్భుత రీతిగా హిజ్కియాను, అతని రాజ్యమును రక్షించెను. ఆయన దేవుని దృష్టికి నీతిమంతుడుగా జీవించెను. అతడు ఉన్నత స్థలములను పడగొట్టి, విగ్రహములను ధ్వంసము చేసెను. ప్రజలను పరిశుద్ధ జీవితములోనికి నడిపెను. మీకా ప్రవచించిన కాలములో 3వ తిగ్లేత్పిలేసరు, ఐదవ సల్మనేసరు, రెండవ షార్గోను, సేన్హరీబు అను రాజులు అష్హూరును పాలించిరి. ఆ కాలములో అష్హూరు పతాక స్థాయినందుకొనెను. ఆది యూదాకు బీతిని పుట్టించుచుండెను. ఆ దినములలో బబులోను కూడా అషూషరుకు లోబడియుండెను. మీకా – యూదులు బబులోనుకు చెరగొని పోదురని మీకా 4:10 లో ప్రవచించెను. అందువలన బబులోను రాజ్యము బలపడక పూర్వమే ఈ ప్రవచించెను.

ముఖ్య వర్తమానము : యూదా, న్యాయ తీర్పు – విమోచనము

ముఖ్య వచనములు : మీకా 6:8; మీకా 7:18

ముఖ్య అధ్యాయములు : 6, 7 అధ్యాయములు.

గ్రంథ విభజన : ముందుగా ప్రస్తావింపబడినట్లుగానే ఈ గ్రంథమును మూడు ముఖ్య విభాగములుగా చేసి వాటిని మరికొన్ని భాగములుగా వివరింపవచ్చును.

(1). న్యాయ తీర్పును, గూర్చిన ప్రవచనము : 1 – 3 అధ్యా.

జనుల మీదికి వచ్చు న్యాయ తీర్పు మీకా 1:1; మీకా 2:13.
నాయకుల మీదికి వచ్చ న్యాయ తీర్పు మీకా 3:1-12
(2). విమోచనను గూర్చిన ప్రవచనము : 4, 5 అధ్యాయాలు

రాబోవు రాజ్యమును గూర్చిన ప్రవచనము : మీకా 4:1-5.
చెర నుండి తిరిగి వచ్చుటను గూర్చిన వాగ్దానము : Mic,4,6-5,1.
రాబోవు రాజును గూర్చి వాగ్దానము మీకా 5:2-15.
(3). మారు మనస్సు పొందుటకైన పిలుపు : 6, 7 అధ్యాయములు.

దేవుని మొదటి పిలుపు : మీకా 6:1-9.
దేవుని రెండవ పిలుపు : మీకా 6:10; మీకా 7:6.
సంపూర్ణ రక్షణను గూర్చిన ప్రవచనము : మీకా 7:7-20
సంఖ్యా వివరములు : ఇది పరిశుద్ధ గ్రంథములో 33వ పుస్తకము. అధ్యాయములు 7; వచనములు 105; ఆజ్ఞలు 20; ప్రశ్నలు 23; వాగ్దానములు 2; హెచ్చరికలు 123; ప్రవచనములు మొత్తము 123; నెరవేరిన ప్రవచనములు 91; నెరవేరవలసిన ప్రవచనములు 32; దేవుని నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 7.

Jonah – యోనా

యోనా అను హెబ్రీపదమునకు పావురము అని అర్ధము. లాటిన్, గ్రీక్ భాషలలో క్రమముగా జోన్స్ జోనా అను పదములు వినియోగింపబడినవి. తెలుగు అనువాదకులు వాటిని అంగీకరింపక యోనా అను హెబ్రీ పదమునే నేరుగా తెలుగు పరిశుద్ధ గ్రంథములో ఉపయోగించి యున్నారు.

ఉద్దేశము : దేవుని దయ మిక్కిలి శ్రేష్ఠమైనదని చూపుట. ఇందలి రక్షణ సందేశము అందరికి వర్తించును. అన్ని కాలముల వారికి వర్తించును.

గ్రంథకర్త : అమిత్తయి కుమారుడైన యోనా.

కాలము : క్రీపూ 793 – 753

ఎవరికి వ్రాయబడెను? ఇశ్రాయేలీయులకు లోకమంతటనున్న దేవుని ప్రజలకు.

గత చరిత్ర : నీనెవె పట్టణము అష్హూరు మహా సామ్రాజ్యమునకు రాజధాని. అష్హూరు ఇశ్రాయేలీయులకు గొప్ప శత్రువు. క్రీ.పూ. 722లో అష్హూరు ఇశ్రాయేలు దేశము మీద దండెత్తి జయము గాంచినది. యోనా ఆమోసు కంటే ముందు ప్రవచించినవాడు. ఇశ్రాయేలు రాజులలో మిక్కిలి బలవంతుడైన రెండవ యరొబాము పాలనా కాలములో యోనా ప్రవచించెను. (క్రీ.పూ 793 – 753; 2 రాజులు 14:23-25)

ముఖ్య వచనము : యోనా 4:11

ముఖ్య వ్యక్తులు : యోనా, ఓడ నావికుడు, ఓడలోని పనివారు, ప్రయాణికులు.

ముఖ్య స్థలములు : యెప్పే, నీనెవె

గ్రంథ విశిష్టత : నీనెవె ప్రజలకు యోనా చెప్పవలసిన ప్రవచనము ఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగును అనునదే (యోనా 3:4) ఈ పుస్తకములో మరియొక ప్రవచనము ఏదియు లేదు. యోనా జీవితమే ఇందలి ముఖ్య విషయము. యోనా జీవిత సంఘటనను తన మరణ పునరుత్థానములు సాదృశ్యమైన దానినిగా యేసు చూపుచున్నాడు. (మత్తయి 12:38-42)

సారాంశము : నీనెవె ప్రజలు మారు మనస్సు పొందుట

ముఖ్య వచనములు: యోనా 2:8-9; యోనా 4:27

ముఖ్య ఆధ్యాయము : 3 , ప్రపంచ చరిత్రలో ఇంత గొప్ప ఉజ్జీవము మరి ఎన్నడును, ఎక్కడను జరుగలేదు. నీనెవె ప్రజలందరు మారు మనస్సు పొందుట ఇందు వర్ణింపబడెను.

గ్రంథ విభజన : నాలుగు అధ్యాయములు గల ఈ గ్రంథమును రెండేసి అధ్యాయములు గల రెండు ముఖ్య విభాగములుగా విభజింపవచ్చును. ఒక్కొక్క విభాగమును మరల స్పష్టమైన భాగములుగా విభజింపవచ్చును.

(1). యోనాకు దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ 1, 2 అధ్యాయములు.

దేవుని ఆజ్ఞను యోనా పాటించలేదు యోనా 1:1-3
దేవుని దండన యోనా మీదికి వచ్చెను యోనా 1:4-17
మహా మత్స్యము కడుపులో నుండి యోనా ప్రార్ధించగా విడుదల అనుగ్రహింపబడుట యోనా 2:1-10 (2). యోనాకు దేవుడిచ్చిన రెండవ ఆజ్ఞ 3, 4 అధ్యాయములు.
దేవుని ఆజ్ఞ, యోనా విధేయుడగుట యోనా 3:1-4
నీనెవె మారు మనస్సు పొందుట. శిక్ష తప్పింపబడుట యోనా 3:5-10
యోనా ప్రార్థన యోనా 4:1-3
యోనాను దేవుడు సరిదిద్దుట యోనా 4:4-10
దేవుడు యోనాకు నేర్పిన మిక్కిలి గొప్ప పాఠము యోనా 4:11

సంఖ్యా వివరములు : యోనా గ్రంథము పరిశుద్ధ గ్రంథములో 32వ పుస్తకము.

దీనిలోని – అధ్యాయము 4; వచనములు 48; ఆజ్ఞలు 8; ప్రశ్నలు 12; వాగ్దానములు లేవు; మొత్తము ప్రవచనములు 1; నెరవేరిన ప్రవచనములు: ప్రజలు మారు మనస్సు పొందగా అప్పటికి శిక్ష తప్పించబడినది. తరువాత చాలా కాలమునకు ఈ ప్రవచనము నెరవేరినది. దేవుని నుండి వచ్చిన పత్యేక వర్తమానములు : 6. (యోనా 1:2; యోనా 2:10; యోనా 3:2; యోనా 4:4; యోనా 4:9; యోనా 4:10)

Obadiah – ఓబద్యా

యాకోబు ఏశావులు కవల సోదరులు. ఏశావును ఎదోము అనియు పిలిచెడివారు. ఏశావు అనగా ఎఱ్ఱనివాడు అని అర్థము. ఏశావుకు ఎరుపు రంగుతో పలు సంబంధములు గలవు. అతని శరీరఛాయ ఎరువు. అతని బలహీనత ఎఱ్ఱని చిక్కుడు కాయల వంటకము కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్ముకొనుట. అతడు ఎఱ్ఱని బండలు గల దేశమును తన నివాస స్థలముగా చేసికొనెను. (ఆదికాండము 25:25; ఆదికాండము 25:30; ఆదికాండము 36:1) యాకోబు హారానులో 20 సంవత్సరములు నివసించినపుడు ఏశావు శేయీరు మన్యము ఎతైన కొండ శిఖరముల పైనున్న పీఠభూమలో ఈ సెలానగరము, ఎఱ్ఱనిబండలతో నిండియున్నందునను, అతని పేరును బట్టి ఆదేశమును ఎదోము దేశమని పిలువబడెను. (ఆదికాండము 32:3) అది ఇంచుమించు 100 చదరపు మైళ్ల విస్తీర్ణము గల కొండ ప్రాంతము. ఎదోము దేశము (శేయీరు మన్యము) అరాబాకు తూర్పునను, మృతసముద్రమునకు దక్షిణమునను ఉన్నది.

ఎదోమీయుల మీదికి రాబోవుచున్న సంపూర్ణ నాశనమును గూర్చి ప్రవచించుటయే ఈ గ్రంథములోని విషయము. ఓబద్యా అనగా “యెహోవాను ఆరాధించువాడు”. లేక యెహోవాను సేవించువాడు అని అర్ధము.

గ్రంథకర్త : ఓబద్యా

కాలము : గ్రంథరచన జరిగిన కాలము వ్రాయబడలేదు.

గత చరిత్ర : ఎదోము దేశమునకు సెలా రాజదాని. సెలాను పెట్రా అనియు పిలుతురు. పెట్రా అనగా బండ అని అర్థము. చరిత్రలోని అద్భుతములలో పెట్రా నగరము ఒకటి. కొండల సందులలో ఈ అద్భుత నగరము నిర్మించిరి. దీనిని జయించుట శత్రువులకు సులభము కాదు. ఎత్తైన కొండ శిఖరముల పైనున్న పీఠభూమిలో ఈ సెలానగరము, యుండెను. కొండల మధ్య నుండు సందుల మార్గమున మాత్రమే ఈ సెలా నగరమున ప్రవేశించుట సాధ్యమగును. గొప్ప సైన్యముతో ఈ సందుల మార్గమున పయనించి ఈ నగరమును పట్టుకొనుట ఎవరికినీ సాధ్యము కాదు. చిన్న చిన్న గుంపులుగా ఎక్కి వచ్చి శత్రువులను ఓడించుట ఈ నగర వాసులకు సులభము. నగరము బద్రముగా ఉన్నప్పటికి, దేవునితీర్పు నుండి తప్పించుటకు ఆ కొండలవలన కాలేదు. యెరూషలేము పతనమునకు ఐదు సంవత్సరములకు తరువాత బబులోను సైన్యము ఈ నగరమును జయించినట్టు చరిత్ర తెలుపుచున్నది. అయినప్పటికి మక్కబీయుల కాలములో ఎదోమీయులు తిరిగి శక్తి పొందినట్లు చూడగలము. యేసుక్రీస్తు పుట్టుక సమయములో యూదాలో పరిపాలించుచుండిన హేరోదు ఒక ఎదోమీయుడు క్రీ.శ. 70వ సంవత్సరములో టైటస్ రాజు యొక్క నాయకత్వములో వచ్చిన రోమా సైన్యము ఎదోమును సమూలనాశనము చేసిరి. ఆయన వీరిని కాల్చి ఏశావు యొక్క వంశములో శేషము లేకుండ భక్షించిరి అని 18వ వచనములో చెప్పబడిన ప్రవచనము ప్రకారము నెరవేరినది.

ముఖ్య పదజాలము : ఎదోము యొక్క న్యాయ తీర్పు.

ముఖ్య వచనములు : ఓబద్యా 1:10-21

నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు, ఒక నెన్నటికిని లేకుండ మీరు నిర్మూలమగుదువు. (వచ 10) మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుట సీయోను కొండమీద రక్షకులు పుట్టుదురు అప్పుడు రాజ్యము యెహోవాదియగును (వచ 21)

గ్రంథ విభజన : 21 వచనములను కలిగియున్న ఈ గ్రంథము పాతనిబంధనలో మిక్కిలి చిన్న గ్రంథము. అయినను న్యాయ తీర్పుతో నిండియున్న శక్తివంతమైన వర్తమానమును దీనిలో చూడగలము. విమోచింపబడు అవకాశమే లేనివిధముగా , ఎదోము దేశ నాశనమును ముద్రింనబడియున్నది. దేవుడు ఎదోమీయుల అహంకామునకు ప్రతీకారము చేసి యాకోబు వంశీయులను విమోచించు ననునదియే ఓబద్యా ప్రవచించిన సందేశము. ఓబద్యా గ్రంథమును రెండు భాగములుగా విభజింపవచ్చును.

ఎదోము మీదికి రాబోవు న్యాయ తీర్పు (ఓబద్యా 1:1-16)
ఇశ్రాయేలీయుల విమోచన (ఓబద్యా 1:17-21)

సంఖ్యా వివరములు : ఓబద్యా గ్రంథము పరిశుద్ధ గ్రంథములోని 31వ పుస్తకము. అధ్యాయములు 1; వచనములు 21; ఆజ్ఞలు 1; ప్రశ్నలు 4; వాగ్దానములు లేవు; హెచ్చరికలు 30; ఆ ప్రవచనములు మొత్తము 12; నెరవేరిన ప్రవచనములు 5; నెరవేరనున్న ప్రవచనములు 7; దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 3 (ఓబద్యా 1:1; ఓబద్యా 1:7; ఓబద్యా 1:15)

Amos – ఆమోసు

ఇశ్రాయేలు రాజ్యము బలమైన రాజును కలిగియుండి, శాంతి భద్రతలతో వర్ధిల్లుచున్న కాలములో ఆమోసు తన ప్రవచన పరిచర్య జరిగించెను. అది వ్యాపారాభివృద్ధిని, ధన వృద్ధిని సాధించుకొనిన కాలము. అయితే ప్రజలు అల్ప సంతోషమునిచ్చు పాప భోగములందు ఆనందించుచుండిరి. అన్యాయము అవినీతి ప్రబలెను. (అధికమాయెను) సత్యమైన సరియైన ఆరాధనా స్థానమును కపటాచారములు ఆక్రమించుట ప్రారంభమాయెను. భద్రత విషయముతో గట్టి నమ్మకము, దేవుని శిక్షను అలక్ష్యము చేయు పరిస్థితి హెచ్చగుచుండెను. దేశములో కరువు కాటకములు పెరిగినను అపాయకరమైన వ్యాధులు వ్యాప్తిజెందినను, యుద్ధము నాశనము పైబడినను, ఇవి ఏవియు ప్రజలలో పశ్చాత్తాపమును పుట్టించలేదు. మారుమనస్సు పొందుటకు ప్రజలు సిద్ధముగా లేరు. ఆమోసు పశువుల కాపరియైన ఒక గ్రామీణ యువకుడు. ఈయన దేవుని పిలుపుకు లోబడి దేశము మీదికి దేవుని తీర్పు త్వరగా రాబోవుచున్నదని హెచ్చరించి, మారుమనస్సు పొందవలెనని దేశ ప్రజలుకు పిలుపు నిచ్చెను. వేషధారణతో కూడియున్న వారి భక్తియు, నిర్లక్ష్యముతో కూడిన వారి మతాచారములును వారిని గంపలో కుళ్లిపోవుచున్న పండ్లవలే మార్చెను. క్రమశిక్షణా రాహిత్యము వృద్ధియయ్యెను. వారిలో హింసా ప్రవృత్తి పెరిగినందున దేవుని నీతి న్యాయములు ప్రజలను వీడిపోయెను.

ఆమోసు అను హెబ్రీపదమునకు భారము భరించుట అని అర్థము. ఆమోసు తన పేరుకు తగినట్లుగా కలహకారులైన ఇశ్రాయేలీయుల పాప భారమును భరిస్తూ, వారికి దేవుని సందేశమును అందించెను. దేవుడు తనకు అప్పగించిన పనిని ఆమోసు నెరవేర్చి, తన సేవను సంపూర్తి గావించుకొనెను.

గ్రంథకర్త : ఆమోసు

ఆమోసు కాలము : యూదా రాజైన ఉజ్జియా దినములలోను, ఇశ్రాయేలు రాజైన యోవాసు కుమారుడైన యరొబాము దిసములలోను, భూకంపము కలుగుటకు రెండు సంవత్సరములకు ముందు, ఆమోసు ప్రవచనము చెప్పుట ప్రారంభమాయెను (ఆమోసు 1:1). ఉజ్జియా యూదాను యేలిన కాలము క్రీ.పూ 792 నుండి 749 వరకు. రెండవ యరొబాము ఇశ్రాయేలును పాలించిన కాలము క్రీ.పూ 793 నుండి 753 వరకు పరిపాలన చేసెను. ఉజ్జియా కాలములో సంభవించిన ఈ భూకంపమును గూర్చి సుమారు 200 సంవత్సరములకు ముందే జెకర్యా ప్రవక్త ప్రవచించియుండెను. జెకర్యా 14:5). ఆమోసు 7:11 లో ఇశ్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురని ప్రవచించెను. ఇది క్రీ.పూ 722లో నెరవేరెను. ఆ సంవత్సరములో అష్హూరు రాజు ఇశ్రాయేలీయులను అష్హూరు దేశములోనికి చెరకొని పోయెను. ఆమోసు ఈ ప్రవచనము చెప్పియున్నప్పుడు యరొబాము చనిపోలేదు అనునది స్పష్టము. ఆమోసు దక్షిణ రాజ్యమైన యూదాలో జన్మించినప్పటికి ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు రాజ్యములోని బేతేలులో తన ప్రవచన కార్యమును క్రీ.పూ 760 నుండి 750 వరకు జరిగెను.

ఓబద్యా, యోవేలు, యోనా మున్నగు ప్రవక్తల తరువాతను, హోషేయ, మీకా, యెషయా మున్నగు ప్రవక్తల కంటే కొంచెము ముందుగాను ఆమోసు ప్రవచించెను. ఆ కాలములో ఉజ్జీయా యూదా దేశమును చక్కగా పరిపాలించెను. ఆయన అమ్మోనీయులను, ఫిలిప్తీయులను, ఎదోమీయులను జయించెను. ఉత్తర దేశమును బలవంతుడైన రెండవ యరొబాము పాలించుచుండెను. దేశము ధనవృద్ధిని, సైనిక బలమును, అభివృద్ధిని కలిగియుండెను. లోకాశ, భక్తిహీనత, అవినీతి ప్రజల జీవితములో అధికమాయెను. (ఆమోసు 2:6-8; ఆమోసు 3:10; ఆమోసు 4:1; ఆమోసు 5:10-12; ఆమోసు 8:4-6) చెప్పబడలేదు. ఈ కాలములో అష్హూరియా, బబులోను, సిరియ, ఐగుప్తుయను రాజ్యములు ఇశ్రాయేలుతో పోల్చినపుడు బలహీనముగాయున్నవని చెప్పవచ్చును. ఈ స్థితిలో ఆమోసు పలికిన అపాయమేదనగా అష్హూరియా చెరవాసము జరుగ అవకాశము లేదని ప్రజలకు తోచినది. అయినప్పటికి 30 సంవత్సరములు జరిగిన తరువాత ప్రవచన నెరవేర్పుగా ఇశ్రాయేలీయుల పతనము జరిగినది.

గ్రంథ విభజన : ఆమోసు యూదయలో తాను జన్మించిన గ్రామమును విడిచి, ఇశ్రాయేలు దేశమునకు వెళ్లెను. తాను ఎన్నడును ఎదురుచూడని ఊహించని ఒక వర్తమానమును ఇశ్రాయేలీయులకు ప్రకటింవవలెనని దేవుడు ఆయనను పిలిచెను. సుఖ భోగములలో జీవిస్తున్న ఇశ్రాయేలీయులకు న్యాయ తీర్పును గూర్చిన ఆమోసు ప్రవచనములు తమ జీవిత కాలములోనే సంభవించుటకు ఆస్కారము లేదని తలంచిరి. ప్రవక్త అందించిన ఆ వర్తమానము అంగీకరించుటకు అయోగ్యముగానున్నట్లు వారు తలంచిరి.

ముఖ్య పదజాలము : ఇశ్రాయేలీయుల మీదనున్న న్యాయతీర్పు

ముఖ్యవచనములు : ఆమోసు 3:1-2; ఆమోసు 4:11-12

ముఖ్య ఆధ్యాయము : అధ్యాయము 9, ఆమోసు మిక్కిలి ఖచ్చితముగా భయంకర న్యాయ తీర్పును గూర్చి ఇచ్చు వర్తమానములకు మధ్యలో పరిశుద్ధ గ్రంథములోని ఇతర భాగముల కంటే, మిక్కిలి విశదముగా ఇశ్రాయేలీయుల రక్షణను గూర్చి ఈ అధ్యాయములో చెప్పుట చూడగలము. అబ్రహాముతోను దావీదుతో కూడ దేవుడు ఇశ్రాయేలీయులలో చేసిన నిబంధన “మెస్సియా” రాకడలో నెరవేరుటను గూర్చి, ఐదు వచనములలో మాత్రమే ప్రవక్త స్పష్టముగా వివరిస్తున్నాడు.

గ్రంథమును ఐదు భాగములుగా విభజింపవచ్చును.

ఆమోసు 1:1-2 వచనములలో ముందున్నవి మినహాయించి నాలుగు ముఖ్య భాగములు ఈ గ్రంథములో కనిపించుచున్నవి. గ్రంథములోని ముఖ్య భాగములు క్రింద ఇవ్వబడినవి.

ఉపోద్ఘాతము : ఆమోసు 1:1- 2. 2. ఎనిమిది న్యాయ తీర్పులు : (దయస్కు, గాజా తూరు, ఎదోము, అమ్మోనీయులు, మోయాబు యూదా, ఇశ్రాయేలులపై) న్యాయ తీర్పు ఆమోసు 1:3; ఆమోసు 2:16. 3. న్యాయ తీర్పును గూర్చిన మూడు ప్రసంగములు : Amos,3,1-6,14. 4. న్యాయ తీర్పును గూర్చిన ఐదు దర్శనములు : Amos,7,1-9,10 (మిడుతలు, అగ్ని, మట్టపుగుండు , వేసవి కాలపు పండ్ల గంప, పైకమ్ములు). 5. విమోచనను గూర్చిన ఐదు వచనములు ఆమోసు 9:11-15.

సంఖ్యా వివరములు : దేవుని పరిశుద్ధ గ్రంథములో ఇది 30వ పుస్తకము; అద్యాయములు 9 ; వచనములు 146; ఆజ్ఞలు 28; ప్రశ్నలు 31; వాగ్దానములు 2; హెచ్చరికలు 117, ప్రవచనములు 121; నెరవేరని ప్రవచనములు 8; నెరవేరిన ప్రవచనములు 113; దేవుని నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 35.

Joel – యోవేలు

దక్షిణ రాజ్యమైన యూదా రాజ్యమును యోవాషు రాజు క్రీ.పూ 835వ సంవత్సరము నుండి 796వ సంవత్సరము వరకు పరిపాలించెను. ఆ రాజు కాలములో గొప్ప మిడుతల దండు ఒకటి ఆదేశములో ప్రవేశించెను. ఆదండు ఆదేశములోని పొలము పంటలను, ఫలవృక్షములను సర్వనాశనము చేయగా దేశ ప్రజలు బహుగా క్షామపీడితులైరి. అట్టితరుణములో దేవుని ప్రవక్త లేక దీర్ఘదర్శిమైన యోవేలు ద్వారా దేవుడు తన సందేశమును ప్రజల యొద్దుకు పంపెను. ఆ సందేశమే యోవేలు గ్రంథము. మిడుతల దండు సృజించిన ఈ భీబత్సము – మానవుని పాప ఫలితముగా దేవుడు పంపిన కఠిన దండనను వర్ణించుచున్నది. అయితే అంత్యదినములలో అనగా ప్రభువు దినమున దేవుడు ప్రజల మీదికి తీసుకొని రాబోవుచున్న ప్రతి దండన మిక్కిలి భయంకరముగా నుండునని యోవేలు హెచ్చరించుచున్నాడు. ప్రభువు దినమున దేశము మీదికి రాబోవు అపాయము బహుకఠినముగా నుండుననియు, దాని ముందు గత కాలపు ప్రతి దండన మిక్కిలి అల్పమైనదిగా నుండుననియు ప్రవక్త వివరించెను. ఆదినమున దేవుడు తన శత్రువులనునిత్య తీర్పునకు లోబరచును. తనకు యధార్ధముగా లోబడువారికి ఆయన శ్రేష్ఠ ఫలముల నిచ్చును.

యోవేలు అను పదమునకు హెబ్రీభాషలో యెహోవాయే దేవుడు అని అర్థము. ఈ అర్థము గ్రంథసారాంశముతో ఏకీభవించుచున్నది. దేవుడు చరిత్రయంతటిపై సర్వాధికారిగా పరిపాలించుచున్నాడని ఈ నామము స్పష్టపరచుచున్నది. సర్వశక్తి సంపన్నుడైన మన దేవుడు, సమస్త ప్రకృతి మీదను, సకల రాజ్యముల మీదను సర్వాధికారము కలిగియున్నాడు.

గ్రంథకర్త : ఈ గ్రంథరచయిత యోవేలు. యోవేలు అను పేరు గల మరి పదుముగ్గురిని పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలము. అయితే ప్రవక్తయైన యోవేలును గూర్చిన సమాచారమును ఈ గ్రంథములో మాత్రమే కనుగొనగలము. ఈ గ్రంథరచయిత పెతూయేలు కుమారుడని విశదమగుచున్నది. పెతూయేలు అనగా దేవుని చేత ప్రేరేపణ పొందినవాడు అని అర్థము. సీయోనును గూర్చియు, దేవాలయమును గూర్చియు మాటి మాటికి ప్రస్తావించుటను బట్టి యోవేలు యెరూషలేమునకు సమీపముగా నివసించెనని మనము తలంచవచ్చును. యాజకత్వమును గూర్చి యోవేలు 1:13-14; యోవేలు 2:17 మున్నగు వచనములలో చెప్పినందున యోవేలు ఏకకాలమున ప్రవక్తగాను, యాజకుడుగాను ఉండియుండెనని కొందరు అభిప్రాయపడుచున్నారు. ఏది ఏమైనను, జనులు మారు మనస్సు పొందవలెనని యోవేలు ప్రవక్త అసందిగ్ధమైన భాషలో క్లుప్తముగా, స్పష్టముగా బోధించెను.

యోవేలు కాలము : యూదయలో పరిచర్య చేసిన ప్రారంభ ప్రవక్తలలో యోవేలు ఒకడు. యోవేలు 3:16ను ఆమోసు 1:2తోను, యోవేలు 3:18ను ఆమోసు 9:13 తోను పోల్చి చూచినప్పుడు ఆయా వాక్యముల సమభావములను బట్టి ఆమోసు ఈయనకు (యోవేలుకు) సమకాలికుడని మనము తలంచుటకు వీలు కలుగుచున్నది. క్రీ.పూ 835 నుండి 796 వరకు యూదా రాజ్యపాలన గావించిన రాజాయెను. ఆయనకు రాజ్యపాలన చేయు వయస్సు వచ్చువరకు – దేశము యాజకుడైన యెహో యాదా సంరక్షణలో నుండెను. అందువలన యోవేలు తన గ్రంథములో ఏ రాజు పేరునైనను ప్రస్తావించి యుండ లేదు అని కొందరు అభిప్రాయపడుచున్నారు. యోవేలు తొలి ప్రవక్తలలో ఒకడైయుండినందున ఈయన ఎలీషా ప్రవక్తకు సమకాలికుడు అయ్యే అవకాశము గలదు.

ముఖ్య సందేశము : మహాభయంకరమైన ప్రభుదినము రాబోవుచున్నది అనునది యోవేలు అందించిన ముఖ్య వర్తమానము.

ప్రాముఖ్య వచనములు : యోవేలు 2:11; యోవేలు 2:28-29

ప్రాముఖ్యమైన అధ్యాయము : 2, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి (యోవేలు 2:12-13) అనునదియే యోవేలు పిలుపు. యూదాజనం, ప్రవక్త చెప్పిన ప్రకారము దేవుని వైపు తిరిగిన యెడల, దేవుడు తాను చేయ నుద్దేశించిన కీడును చేయక మానుకొనును అను వాగ్దానమును యోవేలు వారికి ఇచ్చియున్నాడు. హృదయ పూర్వకముగా పశ్చాత్తాపపడు వారి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడునను దేవుని వాగ్దానమును కూడ యోవేలు వారికి తెలియజేసెను. పెంతెకోస్తు దినమున మేడ గదిలోనున్న విశ్వాసుల మీదికి పరిశుద్ధాత్మ దిగివచ్చుట ఈ వాగ్దానమును అనుసరించి జరిగినదే. పశ్చాత్తాప పడని వారి మీదికి యేసు క్రీస్తు రాకడ దినములలో దేవుని న్యాయ తీర్పు వచ్చును.

సారాంశము : యోవేలు గ్రంథము నందు మిడుతల దండువలన సంభవించిన వినాశము, హానికరమైన వ్యాధులు, క్షామములు, అగ్నివలన కలుగు ప్రమాదములు సైన్యములు దండెత్తుట, ఆకాశము నుండి వచ్చు అపాయములు అను అపాయముల పట్టికను చూడగలము. రాబోవు న్యాయ తీర్పు వర్ణింపబడినది. దేవుని కృపను, విశ్వాసమును పుట్టించు దేవుని వాగ్దానములను ఈ గ్రంథములో చూడగలము. ప్రభువు దినమును గూర్చి భూతకాలములో చెప్పబడినను అది భవిష్యత్తులో జరుగనున్నది.

గ్రంథ విభజన :

(1) ప్రభువు దినము. భూతకాల దృష్టి యోవేలు 1:1-20

(అ) గతించిన కాలములో జరిగిన మిడుతల దాడి యోవేలు 1:1-12

(ఆ) పైరులు, ఫలములు నశించుట, క్షామము యోవేలు 1:13-20

(2) ప్రభువు దినము : భవిష్యత్ కాల దృష్టి Joel,2,1,21

(అ) సమీపించుచున్న ప్రభువు దినము యోవేలు 2:1-27 అన్యులు దండెత్తుట.

(ఆ) బహుదూరమున నున్న ప్రభువుదినము. యూదులు దేవుని వైపు మరలుట, అంతిమన్యాయ తీర్పు Joel,2,28-3,21

సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో ఇది 29వ పుస్తకము; అధ్యాయములు 3; వచనములు 73; ప్రశ్నలు 7; ఆజ్ఞలు 50; వాగ్దానములు 10; ప్రవచన వాక్యములు 69; నెరవేరినవి 11; నెరవేరబోవునవి 59; దేవుని యొద్ద నుండి వచ్చిన సందేశము 1. (Joel,1,2-3,21)

Hosea – హోషేయ

సొలొమోను కాలమునకు తరువాత కనాను దేశము యూదా అనియు, ఇశ్రాయేలు అనియు రెండు భాగములుగా విభాగించబడి నిలిచిన రెండు రాజ్యములలో ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలులో ప్రవచనా సేవను నెరవేర్చిన వాడు హోషేయ. ఎప్రాయీము గోత్రీకుడైన యరొబాము విభజించబడిన ఉత్తర ఇశ్రాయేలుకు

మొట్టమొదటి రాజుగా ఉండెను. భూగోళ శాస్త్ర ప్రకారము పాలస్తీనా యొక్క మధ్య భాగములో ఎఫ్రాయీము గోత్రము యొక్క నివాసములుండెను. అనేక పరిస్థితులలో ఇశ్రాయేలీయుల పది గోత్రములలో ఎంతో ముఖ్యమైన గోత్రముగా ఎఫ్రాయీము గోత్రము పరిగణించబడి నందువలన ఉత్తరదేశమును ఎఫ్రాయీము అని హోషేయ పిలిచెను. హోషేయ అంటే రక్షణ అని అర్ధము. ఇశ్రాయేలు యొక్క పతనమైపోయిన ఆత్మీయ స్థితికి ఉదాహరణముగా గోమెరు అను స్త్రీని దేవుని ఆజ్ఞానుసారముగా హోషేయ పెండ్లాడెను. ఇశ్రాయేలీయుల విగ్రహారాధనకును, దేవునితో కలిగియున్న యదార్థత లేని స్థితికిని ప్రవక్త యొక్క కుటుంబము ఒక క్రియారూపకమైన పాఠముగా మార్చబడినది. హోషేయ ప్రవచనములో మూడు ముఖ్య భాగములు ఇమిడియున్నవి. 1. దేవుడు తన ప్రజల పాపములను ద్వేషించుచున్నాడు. 2. దేశము తీర్పు పొందడం నిశ్చయము. 3. తమ ప్రజలతో దేవునికున్న ప్రేమ ఏ మాత్రము మార్పు చెందనిది.

గ్రంథకర్త : బెయేరి కుమారుడైన హోషేయ ఈ గ్రంథము యొక్క గ్రంథకర్త. అని మొదటి వచనము హక్కుతో మెచ్చుకొనుట ఎవరు కాదనలేరు. ఆయన జన్మించిన ప్రదేశము ఏది అని ఎక్కడా వ్రాయబడలేదు. అయినను ఉత్తర దేశమైన ఇశ్రాయేలుతో నిరంతర సంబంధము కలిగిన వాడుగా నుండినందున ఆయన జన్మించిన స్థలము యూదా కాదుగాని ఇశ్రాయేలుగా ఉండి ఉండవచ్చును. హోషేయ 7:5 లో ఇశ్రాయేలు రాజును గూర్చి మన రాజు అని చెప్పుట ఈ తలంపును నిర్ధారణ చేయుచున్నది. భార్య గోమెరును ఇద్దరు కుమారులును, ఒక కుమార్తెయు కలిగిన కుటుంబముగా కనబడెను. (హోషేయ 1:1-9) పరిశుద్ధ గ్రంథములో ఇతర స్థలములన్నీటిలో ఆయనను గూర్చిన వర్తమానము ఏవియును తెలిసికొనుటకు తరుణము లేదు.

తమ దేశ ప్రజలైన ఇశ్రాయేలు యొక్క మోసము, నరహత్యలు, అబద్ధము, కృతజ్ఞతలేని స్థితి, విగ్రహారాధన, దురాశ అనువాటినన్నింటిని గూర్చి హెచ్చరించుచున్నాడు. అయినను ఆయన వార్త మిక్కిలి కరుణతో కూడినదై నమ్మకముతో నింపబడినదిగానున్నది. హోషేయ తమ స్వంత జీవితములో వ్యభిచార జీవితమును జీవించిన భార్య గోమెరు ద్వారా అనుభవించిన దుఃఖము ఆయన హృదయమును కనికరముతో నిండియుండియుండవచ్చును.

కాలము :- హోషేయ 1:1 లో చూచిన రీతిగా ఉజ్జీయా, యోతాము ఆహాజు హిజ్కియా మొదలైన యూదా రాజులకాలములోను, రెండవ యరొబాము అను ఇశ్రాయేలీయుల రాజు కాలములోనే హోషేయ తన సేవను నెరవేర్చెను. ఇశ్రాయేలీయులలో మరియొక ప్రవక్తగా యుండిన ఆమోసు, యూదా ప్రవక్తగా నుండిన యెషయా, మీకా, అనువారి యొక్క కాలములో నుండిన ప్రవక్తగా ఈయన ఉంటున్నాడు. హోషేయ యొక్క దీర్ఘకాల ప్రవచనము రెండవ యరొబాము కాలములోను తరువాత ఇశ్రాయేలీయుల రాజు యొక్క చివరి కాలములో పరిపాలించిన జెకర్యా నుండి హో షేయ వరకు గల ఆరుగురు రాజుల కాలములోను కొనసాగెను. ఆయన సేవాకాలము దాదాపుగా క్రీ.పూ 755 నుండి క్రీ.పూ 710 వరకు అని ఊహించవచ్చును. క్రీ.పూ 710 సంవత్సరముమునకు సమీపించిన హిజ్కియా పరిపాలనా కాలములో హో షేయ తన ప్రవచనా గ్రంథమును వ్రాసినట్లుగా తీసుకోవచ్చును. తన ప్రవచనా సేవ యొక్క నలుబది సంవత్సరముల కాల కార్య క్రమములతో నిండినది హోషేయ గ్రంథము.

హోషేయ సేవ ప్రారంభకాలములో ఇశ్రాయేలు రెండవ యరొబాము యొక్క పరిపాలన క్రింద సమృద్ధికలిగియుండెను. అయినను మూడవ తిగ్లత్పిలెసెరు యొక్క (క్రీ.పూ 745 – 727 ) పరిపాలనలో అష్హూరు ఎంతో ప్రఖ్యాతిగాంచిన వెంటనే ఇశ్రాయేలు పతనము వైపు సాగెను. చివరి ఆరుగురు రాజుల పరిపాలనా కాలములో ఎంతో క్లుప్తమైనవిగా నుండెను. వారిలో నలుగురు చంపబడిరి. 5వ రాజు బానిసగా అష్హూరుకు కొనిపోబడెను. ఉత్తర దేశపు రాజు యొక్క చివరి దినములు కలవరముతోను, వెనుకంజవేయు స్థితితో నిండినదిగా నుండినవి. అధర్మము విగ్రహారాధన ద్వారా ప్రజలు ఆత్మీయ గ్రుడ్డితనములో జీవించిరి.

ముఖ్యమాట : తిరుగుట, అధర్మము, విగ్రహారాధన విడిచి పెట్టి యెహోవా వైపు తిరుగుటకు ఆహ్వానము ఈ ప్రవచనా గ్రంథమంతటిలో మ్రోగడము మనము వినగలము.

ముఖ్య వచనములు : హోషేయ 4:1; హోషేయ 11:7-9

ముఖ్య అధ్యాయము : హోషేయ 4, ఇశ్రాయేలీయులు సత్యమును గూర్చిన జ్ఞానమును విడిచి అన్యులయొక్క విగ్రహారాధనను వెంబడించిరి. నా జనములు జ్ఞానము లేనివారైనశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండ నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేను నీ కుమారులను మరుతును అని హోషేయ 4:6 లో చూచుచున్న మాటలు హోషేయ ప్రవచనా వర్తమానము యొక్క ముఖ్యాంశమైయున్నది.

విభజన : యూదా దేశపు చివరి దినములలో యిర్మీయా చేసిన ప్రవచనా సేవతో ఇశ్రాయేలు యొక్క చివరి దినములలో దేవుని శుభవర్తమానమును ప్రకటించిన హోషేయ సేవను సరిపోల్చివచ్చును. శీలసంబంధముగా, యదార్థతలేని స్థితిని పడిపోవుచున్న ఇశ్రాయేలీయులు తిరిగి తన వైపు తిప్పుకొనుటకు దేవుడు చేసిన చివరి ప్రయాసమని దీనిని మనము ఊహించవచ్చును. భార్య భర్త బాంధవ్యములో ఒక్కరు మాత్రము యదార్థముగా ప్రేమలో నిలిచిన హోషేయ యొక్క స్వంత జీవితమువలె ఇశ్రాయేలుకు దేవుని గల సంబంధము కనబడినది. హోషేయ కుటుంబ జీవితములో కనబడిన దుర్మార్గాస్థితి ఇశ్రాయేలు దేశమునకు ఏర్పడిన దుర్మార్గస్థితికి చిత్రపటముగా పరిగణింపబడుచున్నది. గోమెరు అన్య ప్రజలను వెంబడించినట్లుగా ఇశ్రాయేలు అన్యదేవతలను వెంబడించెను. హోషేయ గ్రంథమును ఈ రెండు గొప్ప భాగములుగా విభజించవచ్చును.

దుర్మార్గముతో నిండిన భార్యయు యధార్థతగల భర్తయు అధ్యా 1 – 3.
విగ్రహారాధనతో నిండిన ఇశ్రాయేలును యదార్ధతగల దేవుడును 4 -14.
మానవులు పాపములో పడి యదార్థత లేనివారుగా మారినపుడు, యదార్థత, ప్రేమ అనువాటిలో మార్పు లేనివాడును. వారి ఉజ్జీవము కొరకు ప్రేమతో కని పెట్టుచున్న దేవుని యొక్క స్వభావము ఈ గ్రంథములో మనము చూచుచున్నాము.

కొన్ని ముఖ్య వివరములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 28వ గ్రంథము, అధ్యాయములు 14; వచనములు 197; ప్రశ్నలు 16; ఆజ్ఞలు 26; వాగ్దానము 10; హెచ్చరికలు 298; ప్రవచనా వచనములు 152; నెరవేరని ప్రవచనములు 17; నెరవేరిన ప్రవచనములు 134; దేవుని యొద్ద నుండి ప్రత్యేకమైన వర్తమానములు 10.

Daniel – దానియేలు

దానియేలు యొక్క జీవితము, సేవయు బబులోను చెరనివాసకాలమైన డెబ్బై సంవత్సరములు విస్తరించియున్నది. 16వ ఏటే చెరపట్టబడిన దానియేలు రాజకార్యము నిమిత్తము ఎన్నుకొనబడ్డాడు. దాని తరువాత దేవుని తాత్కాలిక నిత్య ఉద్దేశమును ఇశ్రాయేలీయులకు అన్యజనులకు బయలుపరచు దేవుని ప్రవక్తగా ఉన్నాడు. దానియేలు గ్రంథములోని 12 అధ్యాయములలో 9 అధ్యాయములు దేవుని దర్శనములు, కలలు, ఉదాహరణముతో నిండిన ప్రవచనములతో నిండి కనిపిస్తున్నవి. ప్రత్యేక జనులు మరియు దేశముల యొక్క జీవిత సంభవములలో దేవుని నడిపింపు, ప్రణాళిక ఏ విధముగా క్రియచేయుచున్నదని దానియేలు గ్రంథము మనకు తెలియజేయుచున్నది. దానియేలు అను పదమునకు దేవుడు నాకు న్యాయాధిపతి అని అర్థము.

గత చరిత్ర : దానియేలును అతని ముగ్గురు స్నేహితులు సమస్త జ్ఞానములోను శ్రేష్ఠులును రాజ కార్యమునకు యోగ్యులైనవారు (దానియేలు 1:4) వారికి బబులోను తర్పీదు శాలలో 3 సంవత్సరములు తర్పీదు లభించింది. (దానియేలు 1:5) వారి స్వదేశ పేరులను మార్చుటకు బెత్తెషాజరు అను క్రొత్త పేరు దానియేలుకు ఇవ్వబడినది. దానియేలు యొక్క జ్ఞానము మరియు కలల భావము చెప్పు సామర్థ్యము వలన ఆయనకు నెబుకద్నెజరు, దర్యావేషుల రాజ్యాంగములలో ప్రవేశము కలిగినది. ఎటువంటి అపవిత్రతకును లోనుకాని దానియేలును నీతితో నిండిన జీవితమునకు మాదిరిగా యెహెజ్కేలు చూపించుచున్నాడు. (యెహె 14 – 20, 28: 13) విశ్వాసము, ప్రార్థన జీవితము, ధైర్యము, నీతి భక్తి, క్రమము అనునవి నిండిన జీవితముగా ఆయన జీవితము ఉన్నది. నీవు బహుప్రియుడవు అని ప్రభువు ఆయనను పిలుచుచున్నాడు. బబులోను సామ్రాజ్యము పతనమయి మాదీయ పారశీక సామ్రాజ్యము వచ్చినప్పటికిని దానియేలు తన శేష్టమైన పదవిలో కొనసాగాడు. నెబుకద్నెజరు, బెల్లసరు, దర్యావేషు, కోరెసు, అను నలుగురు రాజుల కాలములోను ప్రధానమంత్రి అను శ్రేష్టమైన పదవిని వహించాడు.

గ్రంథకర్త : దానియేలు

దానియేలు కాలము : అష్హూరు సామ్రాజ్యమునకు విరోధముగా బబులోను కలవరము చేసి క్రీ.పూ. 612లో అష్హూరు రాజధాని అయిన నినెవేను పట్టుకున్నది. క్రీ.పూ. 605 ఐగుప్తు సైన్యమును జయించుట ద్వారా మధ్య తూర్పు దేశములపాలన ఆధిక్యము బబులోనుకు లభించింది. అదే సంవత్సరములో నెబుకద్నెజరు యెరూషలేమును జయించినపుడు చెరపట్టబడినవారిలో ఒకడుగా దానియేలు ఉన్నాడు. బబులోను చెరనివాసకాలమంతయు ఒక పాలకుడుగాను, ప్రవక్త గాను దానియేలు జీవించాడు. మాదీయులు పారశీకులు బబులోనును హస్తగతం చేసుకున్నాను. దానియేలు యొక్క పదవిలో మార్పు కలుగలేదు. పారశీక రాజైన కోరెషు యొద్ద పలుకుబడి పొందుటకు నూరు సంవత్సరములకు ముందే యెషయా కోరెషును గూర్చి ప్రవచించిన ప్రవచనమును ఆయన గ్రహింపునకు తెచ్చుటకు దానియేలు ప్రయత్నించియుండవచ్చును. దాని యొక్క ఫలితముగానే కోరెషు తన పాలన మొదటి సంవత్సరములోనే యెరూషలేము దేవాలయము మరల కట్టబడుటకు ఆజ్ఞను జారీ చేసియుండవచ్చును. దానియేలు

ప్రవచించిన విధముగా పారశీకరాజ్యము అలెగ్జాండరు దండెత్తువరకు నిలిచియుండినది. (దానియేలు 11:2-3), దాని తరువాత గ్రీకు సామ్రాజ్యము దాని పతనము తరువాత రోమా సామ్రాజ్యమును ఉద్భవించినవి.

ముఖ్య స్థలములు : నెబుకద్నెజరు యొక్క అంతఃపురము; అగ్నిగుండము, బెల్లసరు యొక్క విందుశాల, సింహముల గుహ.

గ్రంథ విశిష్టత : దానియేలు యొక్క దైవ దర్శనములు, మెస్సియాను గూర్చి సూటియైన ప్రవచనముల వంటివి నిండిన అనేక కాల మట్టములలో దేవుని ప్రణాళికలను గూర్చిన ఒక క్లుప్త వివరణ ఈ గ్రంథములో ఇవ్వబడియున్నది. ( 8 – 12 అధ్యాయములు)

ముఖ్య పదజాలము : మహోన్నతుడైన దేవుడు, మానవుల రాజ్యాంగములను, పదవులను నియంత్రించే ఉన్నతమైన దేవుని ఈ ప్రవచనము మనకు చూపించుచున్నది. దేవుని యొక్క మార్పులేని పాలన ఎల్లప్పుడును ఉండునను దానిని దానియేలు తెలియజేయుచున్నాడు.

ముఖ్య మైన వచనములు : దానియేలు 2:20-22; దానియేలు 2:44

ముఖ్యమైన ఆధ్యాయము : దానియేలు 9; డెబ్బై (70) వారములను గూర్చిన ప్రవచనము Dan,9,24,27 లో కనిపించుచున్నది. వీటిలో మొదటి 69 వారములు క్రీస్తు యొక్క రాకడతో నెరవేరినవననునది స్పష్టము. 69 – 70 వారముల మధ్యలో ఒక విరామము ఉన్నట్లుగా బైబులు పండితులు అభిప్రాయపడుచున్నారు. మనము ఈ వివిరామకాలములో జీవించుచున్నాము. 70వ వారము క్రీస్తు యొక్క రెండవ రాకడకు సంబంధించిన 7 సంవత్సరములను చూపించుచున్నది. ఎప్పుడు ఆ 70వ వారము వస్తుంది? దేవునికి మాత్రమే తెలుసు.

గ్రంథ విభజన : పాతనిబంధన ప్రకటన గ్రంథము అని పిలువతగిన దానియేలు ప్రవచన గ్రంథము దీర్ఘకాల ప్రపంచ చరిత్రను తెలిపే గ్రంథమగును మొదటి అధ్యాయము యొక్క ఉపోద్ఘాతము అర్ధమయిన తరువాత 2 నుంచి 7 వరకున్న అధ్యాయములలో లోకము యొక్క భవిష్యత్తు చెప్పబడియుంటున్నది. 8 నుండి 12 వరకైన అధ్యాయములలో అన్యజనుల పాలన క్రింద యూదా ప్రజల భ విష్యత్తు చెప్పబడియున్నది. ప్రపంచ చరిత్రపై దేవుని పరిపాలన (అధికారము) అను అభిప్రాయము ఈ ప్రవచనముల మూలముగా గ్రాహ్యమగుచున్నది. అది బబులోనీయుల వలన నాశనము చేయబడిన యూదా ప్రజలకును, క్రైస్తవ సంఘములకును ఓదార్పును, ఆధరణను ఇచ్చుచున్నది. బబులోను, పారశీకము, గ్రీకు, రోమా మహాసామ్రాజ్యములు ఉదయించి అస్తమించును. అయినను దేవుని విమోచన జనము ద్వారా ఆయన తన నిత్యరాజ్యమును స్థాపిస్తాడు. దానికి ఎప్పుడును అంతము లేదు. గ్రంథవిభజన క్రింద చూడండి.

దానియేలు యొక్క వ్యక్తిగత జీవితము అధ్యాయము 1.
అన్యజనుల దేశముల భవిష్యత్ కాల స్థితి అధ్యాయము 2 – 7.
(a) నెబుకద్నెజరు కలలు అధ్యా 2 – 4.

(b) బెల్లసరు దర్శనము అధ్యా 5.

(C) దర్యావేషు ఆజ్ఞ అధ్యా 6.

(d) నాలుగు (జంతువుల) దర్శనము అధ్యా 7 (మృగముల)

ఇశ్రాయేలీయుల భవిష్యత్ కాల స్థితి. అధ్యా 8 – 12.
( a) పొట్టేలు మరియు మేకపోతుల దర్శనము. అధ్యా 8.

(b) 70 వారముల గూర్చిన దర్శనము అధ్యా 9.

(C) ఇశ్రాయేలీయుల భవిష్యత్తును గూర్చిన దర్శనము. అద్యా 10 – 12.

కొన్ని క్లుప్త వివరములు : పరిశుద్ధ గ్రంథములో 27వ గ్రంథము, అధ్యాయములు 12, వచనములు 357; ప్రశ్నలు 16; చరిత్రకు సంబంధించిన వచనములు 218; నెరవేరిన ప్రవచనములు 79; నెరవేరని ప్రవచనములు 60; ఆజ్ఞలు 7; వాగ్దానములు 4; దేవుని యొద్ద నుండి ప్రత్యేక వర్తమానములు 16.

Ezekiel – యెహెఙ్కేలు

యెహెజ్కేలు ఒక యాజకుడుగాను, ప్రవక్త గాను ఉన్నాడు. ఈయన యూదా చరిత్రలో మిక్కిలి అంధకారకాలమైన 70 సంవత్సరముల బబులోను చెర నివాస కాలములో దేవుని కొరకు శత్రుదేశమైన బబులోనులో తనయొక్క ప్రవచన సేవను నెరవేర్చాడు. యెరూషలేము నాశనమగుటకు ముందు బబులోనుకు కొనిపోబడిన ఈ ప్రవక్త దర్శనములు, ఉపమానములు, రూపములు, ప్రవచనములు వంటి అనేక మార్గములలో చెరలో తనతో ఉన్న ప్రజలకు ప్రవచించాడు. చెదరిన ఎముకలవలె వారి అప్పటి స్థితి కనిపించుచున్నను దేవుడు వారిని మరల తనతో చేర్చుకుంటాడు. వారికి జీవమును పోసి మరల ఒక దేశముగా వారిని నిలుపుతాడు. భూత కాలములో సంభవించిన శిక్ష రాబోవు మహిమకు మార్గమును సిద్ధపరుస్తుంది. ఈ విధముగా నేను యెహోవానని మీరు తెలిసికొనెదరు అనునదే యెహెజ్కేలు యొక్క వర్తమానము.

హెబ్రీ భాషలో యెహెజ్కేలు అనియు గ్రీకు భాషలో యెజేక్కియేలు అనియు స్వల్ప భేదముతో కనపడు ఈ పేరు యొక్క అర్థము దేవుడు బలపరుస్తాడు అనునదే. దేవుడు పిలిచి ఏర్పరచిన ప్రవచనా సేవ నిమిత్తము యెహెజ్కేలును ఆయన బలపరుచుటను మనము చదువగలము (యెహెఙ్కేలు 3:8-9), యెహెజ్కేలు అను ఈ పేరు ఈ గ్రంథములో రెండు చోట్ల తప్ప పాత నిబంధనలో మరెక్కడను చూడలేము.

గ్రంథకర్త : బూజీ కుమారుడైన యెహెజ్కేలు వివాహమైన వాడు. నెబుకద్నెజరు చివరిసారిగా యెరూషలేమును ముట్టడించినపుడు యూదులకు ఒక సాదృశ్యముగా ఆయన భార్య మరణించినది. (యెహెఙ్కేలు 24:16 -24) యిర్మీయా వలె ఒక యాజకుడుగా ఉన్న ఈయనను తన ప్రవచన సేవ చేయుటకు దేవుడు పిలిచాడు. దేవాళయము, యాజకత్వము, బలులు, దేవుని మహిమ అనునవి ఆయన ప్రవచనములలో గట్టిగా చెప్పబడుటను చూడగలము. దేవుని శక్తి, దేవుని ప్రణాళిక అనువాటిని బయలుపరచే అనేక దర్శనములు యెహెజ్కేలుకు కలిగినవి. పొందిన దర్శనములను ఉపయోగకరమైన రీతిలో వివరించి వ్రాయుటకు ఆయన ఇష్టపడ్డాడు.

ఈ గ్రంథములో అక్కడక్కడ నేను అను సర్వనామమును ఉపయోగించి ప్రవక్త తన వర్తమానములను తెలియజేశాడు. ఈ విధముగా చెప్పేవాడు యెహెజ్కేలే అని యెహెఙ్కేలు 1:3; యెహెఙ్కేలు 24:24 అను వచనములు తేటపరచుచున్నవి. కనుక ఈ గ్రంథకర్త యెహెజ్కేలు అనుటలో సందేహము లేదు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నరపుత్రుడా నేను యెహోవానని తెలిసికొనెదరు అను పదజాలము పదేపదే వచ్చుచున్నది. ప్రారంభము నుండి చివరి వరకైన ఒకే వ్రాతశైలి ఈ గ్రంథమంతటిని యెహెజ్కేలే వ్రాశాడు అని సాక్ష్యమిచ్చుచున్నవి.

ఉద్దేశము : ఇశ్రాయేలులోను, అన్యదేశములలోను రాబోవు దేవుని శిక్షను గూర్చి చెప్పుట, దేవుని ప్రజల చివరి రక్షణను ముందుగానే తెలియజేయుట.

గ్రంథకర్త : యెహెజ్కేలు, లేవి గోత్రకుడును, యాజకుడునైన బూజీ కుమారుడు.

ఎవరికి వ్రాశాడు : బబులోను చెరలో ఉన్న యూదులకు, సమస్త దేశములలో ఉన్న దేవుని ప్రజలకు.

కాలము : సుమారు క్రీ.పూ. 571

గత చరిత్ర : యూదాను యెహోయాకీను రాజు పరిపాలించుచున్న క్రీ.పూ. 597 లో బబులోను రాజు యూదాను హస్తగతం చేసుకుని జనులను బబులోను చెరకు తీసుకుని వెళ్ళాడు. ఈ విధముగా చెరగొన్నబడినవారిలో ఒకడు ఈ యెహెజ్కేలు. బబులోను చెరనివాసుల మధ్య తన ప్రవచన సేవను చేసినవాడు యెహెజ్కేలు. యిర్మీయా కంటే వయస్సులో చిన్నవాడైన యెహెజ్కేలు బబులోనులోను, యిర్మీయా యూదాలోను ఒకే సమయములో ప్రవక్తలుగా జీవించారు.

ముఖ్యమైన వచనములు : Eze,36,24,26

ముఖ్యమైన వ్యక్తులు : యెహెజ్కేలు, ఇశ్రాయేలు నాయకులు, యెహెజ్కేలు భార్య, నెబుకద్నెజరు,

ముఖ్యమైన స్థలములు : యెరూషలేము, బబులోను, ఐగుప్తు

ముఖ్యమైన పదజాలము : భవిష్యత్ కాల మహిమ. బబులోను చెరలో జీవించుచున్న దేవుని ప్రజలకు వారికి సంభవించిన కీడునకు కారణము వారి పాపములే కారణమని యెహెజ్కేలు జ్ఞాపకము చేయుచున్నాడు.

దానితో రాబోవు కాలములో మహిమ కరమైన విడుదల వారికి ఉందని బోధించుచున్నాడు. దేవాలయమును విడిచి తొలగిన దేవుని మహిమ మరల దానిని నింపునట్లుగా చిత్రించిన భాగములను చూడుము. (యెహెఙ్కేలు 43:27; యెహెఙ్కేలు 44:4).

ముఖ్య మైన వచనములు : యెహెఙ్కేలు 36:24-26; యెహెఙ్కేలు 36:33-35.

ముఖ్యమైన అధ్యాయము : యెహెజ్కేలు 37. ఇశ్రాయేలీయుల భవిష్యత్ కాల నమ్మకమును రమ్యముగా బయలుపరచే ఒక భాగముగా చెదరిన ఎముకల ప్రవచనము ఉన్నది. ఇశ్రాయేలీయుల భవిష్యత్ కాలము ఎంత మహిమకరముగా ఉంటుందో అనునది ఈ భాగము తేటపరచుచున్నది.

గ్రంథ విభజన : నాలుగు భాగములుగా ఈ ప్రవచన గ్రంథమును విభజింపవచ్చును.

(1). యెహెజ్కేలుకు కలిగిన దేవుని దర్శనము, దేవుని నడిపింపు. అధ్యా 1 -3 వరకు, (2). యూదాపైకి రాబోవు న్యాయ తీర్పు (శిక్ష) అధ్యా 4 – 24 వరకు, (3). చుట్టు ఉన్న అన్యజనులకు న్యాయ తీర్పు (శిక్ష) అధ్యా 25 – 32 వరకు, (4). ఇశ్రాయేలీయుల విమోచన, దేవాలయము యొక్క పునర్వీకరణ ఆధ్యా 33 – 48 వరకు.

వాగ్దాన దేశమైన కనానులో నుండి పెరికి వేయబడిన పిమ్మట స్వంతముగా ఒక దేశమో, రాజు లేకుండా, స్వాతంత్ర్యమైన ఒక జీవితమునకు, కార్యమునకు, ఆరాధనకు అవకాశము లేకుండా పాడైన గుంటలో పడిపోయిన చెరనివాసులకు దేవుని వర్తమానములను తెలియజేయులాగున యెహెజ్కేలు ఏర్పరచబడ్డాడు. మొదటి అధ్యాయములో ఆయన చూచినట్లుగా ఉన్న దేవుని దర్శనము పాతనిబంధనలో మోషేకు, యెషయాకును, కొత్త నిబంధనలో యోహానుకును కలిగిన దర్శనములకు సమానమైనది. యెషయా, యిర్మీయా వలె ఒకే సారి దేవుని న్యాయ తీర్పు శిక్షను గూర్చి మరియు మహిమాయుక్తమైన భవిష్యత్ కాలమును గూర్చి ఆయన మాట్లాడుచున్నాడు. దేవుని మహిమ యెరూషలేము దేవాలయమును విడిచి వెళ్లుచున్నట్లుగా ఆయన పొందిన దర్శనము పదవ అధ్యాయములో వివరించబడియున్నది.

పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచుట ద్వారా క్రైస్తవ సమాజమునకును, వ్యక్తులకును నేడు సంభవించిన స్థితి ఇదే. కోల్పోయిన మహిమను తిరిగి పొందుటకు ఒకే మార్గము పాపములను విడిచి దేవుని వైపుకు తిరుగుట. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్దియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రదుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. (యెహెఙ్కేలు 18:31-32), ఇటువంటి సజీవమైన మానవహృదయములో నుండి సమాజములో నుండి దేవుని జీవజలనదులు బయలుదేరి చుట్టు సశ్యశ్యామలముగా చేయుటను గూర్చి 47వ అధ్యాయములో వివరించుచున్నాడు.

కొన్ని సంఖ్యా వివరములు : దేవుని గ్రంథములో 26వ గ్రంథము; అధ్యాయములు 48; వచనములు 1273; చరిత్రాత్మిక వచనములు 310; నెరవేరిన ప్రవచనములు 530; నెరవేరని ప్రవచనములు 433; హెచ్చరికలు 953; నెరవేరిన హెచ్చరికలు 659; నెరవేరని హెచ్చరికలు 294; ఆజ్ఞలు 345; వాగ్దానములు 25; ప్రశ్నలు 80; దేవుని యొద్ద నుండి ప్రత్యేక సందేశములు 179.

Lamentations – విలాపవాక్యములు

ఒక మహానగరము యొక్క గోషలాగ విలాపవాక్యములు కనబడుచున్నది. ఒక కాలములో యూదుల యొక్క అతిశయింపదగిన పట్టణముగా కనిపించిన యెరూషలేము బబులోనియులు స్వాధీనపరచుకొనినదానిని బట్టి ఆ పట్టణము ఒక ఇసుక దిబ్బలాగా మార్చబడిన సంగతులను కన్నీరు భాషగా విలాపించుచున్నారు.

గ్రంథకర్త ఐదు విలాప కావ్యముల కూర్పును యిర్మీయా ఈ గ్రంథము ద్వారా తన యొక్క వేదనతో కూడిన ఆలోచనలకు రెక్కలు ఇచ్చుచున్నాడు. యెరూషలేము పట్టణము కూలిపోయినది అది అందరికి అపహాస్యాస్పదముగా మార్చబడినది.

ఈ విలాప వాక్యములను అక్షర వరుసక్రమములో వ్రాసియున్నాడు. గ్రంథర్త 1 నుండి 4 వరకు ఒక్కొక అధ్యాయము ఆలెఫ్ అనబడిన హెబ్రీభాష మొదటి అక్షరముతో ప్రారంభించి తదుపరి వచ్చు ఒక్కొక్క వచనము వరుస క్రమములో మొదటి అక్షరముతో ప్రారంభించి చివరి అక్షరముతో ముగియబడుచున్నది. ఈ గొప్ప బాధకరమైన ప్రత్యక్షత మధ్యలో యెహోవా నీ యొక్క యదార్ధత గొప్పదైయున్నది. అనెడి ప్రకటన ద్వారా ఆధరణను నిరీక్షణను పొందుచున్నారు. ఈ విధముగా మిక్కిలి కీడైన బాధను విశ్వాసము యొక్క జయముగా మార్చుటకు యిర్మియా ప్రయాసపడుచున్నాడు.

గ్రంథకర్త : విలాపవాక్యముల యొక్క గ్రంథకర్త ఎవరని ఈ గ్రంథములో సూటిగా చెప్పబడలేదు. అయినప్పటికినీ అనేకమైన ఆంతర్యసాక్ష్యములు మరియు బాహ్య సాక్ష్యములును దీని యొక్క గ్రంథకర్త యిర్మీయా అని సాక్షమిచ్చుచున్నవి. సెప్టోజెంట్ భాషాంతర పరిచయ వాక్కులలో ఈ విధముగా వ్రాయబడియు యెరూషలేము నిర్మూలన చేయబడినది ఇశ్రాయేలీయులు దాసులుగా చెరపట్టబడిన తదుపరి యెరూషలేమును గూర్చి విలపించుచూ యిర్మీయా ఈ విలాప వాక్యములను విలపించెను. ప్రారంభకాల యూదా క్రైస్తవ పారంపర్యములు కూడా ఏక స్వరముతో ఈ గ్రంథకర్త యిర్మీయా అని అగీకరించుచున్నవి.

గ్రంథములో వివరించు సందర్భములో ముఖాముఖిగా చూచిన దృశ్యములుగా కనిపించుట గమనించదగినవి. (విలాపవాక్యములు 1:13-15; విలాపవాక్యములు 2:6-9; విలాపవాక్యములు 4:1-12 మొదలగు భాగములను చూడుము) యెరూషలేము పతనమైనది ముఖాముఖిగా చూచుట మాత్రమే కాదుగాని అందులోని జనులు దాసులుగా బబులోనుకు కొనిపోబడిన తరువాత కూడా కొంత కాలము అక్కడనే నివశించెను. యిర్మీయా ప్రవచనా భాషాశైలికి భిన్నమైనదిగా ఇది కనిపించుచున్నదని కొందరు విమర్శించుచున్నారు. పద్యభాగమునకు, గధ్య భాగమునకు మధ్యలో భాషాశైలిలో భేదముండుట సహజమే. అయినప్పటికినీ యూదా ప్రజల పతనమును గూర్చిన దుఃఖము అంజలియు ఈ రెండు గ్రంథములలో ఒకే విధముగా ధ్వనించుచున్నవి.

కాలము : యెరూషలేము పతనమైన తరువాత ప్రారంభ సంవత్సరములలో ఈ గ్రంథమును వ్రాసి ఉండవచ్చును క్రీ.పూ 588 నుండి 586 వరకు నెబుకద్నెజరు యొక్క సైన్యము యెరూషలేమును ముట్టడి వేసెను. క్రీ.పూ. 586 సంవత్సరము ఆగస్టు నెలలో పట్టణము పతనమైనది. యూదాలో సంభవమునకును మిగిలిన ప్రజలు యిర్మీయాను వారితో కూడా ఐగుప్తుకు తీసుకువెళ్ళుటకు మధ్యకాలములో ఈ గ్రంథము వ్రాయబడి ఉండవచ్చును.

ముఖ్య పదము : దుఖఃము

ముఖ్య మైన వచనములు : విలాపవాక్యములు 2:5-6; విలాపవాక్యములు 3:22-23

ముఖ్యమైన అధ్యాయము : అధ్యా 3. నాశనము, లేమి, నీరసత్వము అనునవి పొంగిపొర్లే ఈ గ్రంథములో తాను దేవుని వాగ్దానములను, మరియు దేవుని యదార్థతను ప్రాధమికాంశముగా కలిగిన ఒక విశ్వాసములో గ్రంథకర్త ఆశ్రయమును పొందుటను చూచుచున్నాము. మిగతా నాలుగు అధ్యాయములలో వేదనతో కూడిన ఆలోచనలకు మధ్యలో దేవుని యొక్క కనికరములో నిరీక్షణ కలిగిన మహిమతో నిండిన పూర్ణ విశ్వాసమును విలాపవాక్యములు 3:22-25 లో చూడగలము.

గ్రంథ విభజన : 40 సంవత్సరము లకు పైగా యెరూషలేముకు వచ్చు తీర్పును గూర్చి ప్రవచనము పలికి హెచ్చరికలను ఇచ్చిన ప్రవక్తగా యిర్మీయా కనిపించుచున్నాడు. క్రీ.పూ. 586 సంవత్సరములో నెబుకద్నెజరు యెరూషలేమును పతనము చేసిన తరువాత తనయొక్క హెచ్చరికలను అశ్రద్ధ చేసిన యూదులను నిర్లక్ష్యపరచి నేరము మోపుటకు యిర్మీయా ప్రయత్నించలేదు. అదే సమయములో యెరూషలేము యొక్క దుస్థితిని చూచి వేదనతో విలపించెను. ఈ విధముగా తన దేశ ప్రజలతో ఏకీభవించెను. పాపులును కఠిన హృదయము గలవారుగా కనిపించిన తన దేశ ప్రజలతో కఠినమైన దేవుని వాక్కులను ప్రకటించుటకు నియమింపబడిన ప్రవక్త యొక్క కనికరముగల మనసును ఈ గ్రంథము ప్రతిబింబిచుచున్నది. దీని అధ్యాయములకును దాని సారాంశముల మూలానుసారముగా ఇవ్వబడిన పేర్లు క్రింద ఇవ్వబడినవి.

అధ్యాయము 1 : యెరూషలేము నాశనము

అధ్యాయము 2 : దేవుని కోపము

అధ్యాయము 3 : కనికరము కొరకైన విన్నపము

అధ్యాయము 4 : యెరూషలేము ముట్టడి

అధ్యాయము 5 : విమోచనకొరకైన విన్నపము

కొన్ని క్లుప్త వివరములు : పరిశుద్ధ గ్రంథములో 25వ పుస్తకము ; అధ్యాయములు 5; వచనములు 154; ప్రవచన వచనములు 2; ప్రశ్నలు 13; ఆజ్ఞలు 3; వాగ్దానములు లేవు; హెచ్చరికలు 2; దేవుని యొద్ద నుండి ప్రత్యేక వర్తమానములు లేవు.

Jeremiah – యిర్మియా

యూదాకు మిక్కిలి అపాయకరమైన కాల స్థితిలో దేవుని ద్వారా లేపబడిన ఒక యౌవనుడు యిర్మీయా. సామర్థ్యములేని వారిని త్రోసివేయబడిన అనేకులను దేవుడు తన యొక్క ఉద్దేశము కొరకు లేక పని కొరకు ఏర్పరచుకొనుచున్నాడు. సున్నితమైన, లేక మృదువైన మనసు ధైర్యము లేని వాడైన యిర్మీయాను అసాధారణమైన వాక్కులను పలుకుటకు దేవుడు ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు, యూదా అని కనాను విభజించబడియున్నది.

ఇశ్రాయేలు అష్హూరీయుల చేత నిర్మూలమైన తరువాత 136 సంవత్సరం యూదా ప్రభుత్వము నిలిచియున్నది. అలాంటి స్థితిలో ఉన్న యూదులు విగ్రహారాధనకు వారి మార్గములను చెరిపివేసికొని సరియైన మార్గము విడిచిపోవుటకు దాసులగుట చూచిన యిర్మీయా వారి కాలములో వారిని చుట్టియున్న అపాయమును గూర్చి హెచ్చరించెను. యిర్మీయా దేవునివైపు తిరుగుటకు వారిని ఆహ్వానించెను.

వరుసక్రమమునుబట్టి గాని, కాలక్రమమునుబట్టిగాని యిర్మీయా గ్రంథము అమర్చబడలేదు. గ్రంథమంతయు చదివిన యెడల గ్రంథ కర్త యొక్క జీవితమంతయు తెలియబడును. అయితే అంశక్రమమును వరుసక్రమమును మనము కనుగొనవలెను. నాశనమునకు గురైనా యూదా తప్పించుకొనుటకు ఒకే మార్గము దేవునికిలో బడుటయే వారికి బుద్ధిచెప్పుటే ఈ గ్రంథము యొక్క సారాంశము.

ఉద్దేశము : దేవుని యొక్క జనులు తమ పాపములను విడిచి పెట్టి దేవుని యొద్దకు తిరిగి వచ్చుటకు ఆహ్వానము.

గ్రంథకర్త : యిర్మీయా

ఎవరికి : దక్షిణ రాజ్యమైన యూదాకు దానియొక్క రాజధాని అయిన యెరూషలేము ప్రజలకు

కాలము : క్రీ.పూ 627 – 586

గతచరిత్ర : యెషియా, యెహోయహాసు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా అను ఐదుగురు. యూదా చివరి రాజుల కాలములోను యిర్మీయా ప్రవచన సేవను నెరవేర్చెను. క్రీ.పూ 586లో బబులోను రాజు యూదాను నిర్మూలముచే సెను. ( 2 రాజులు 21 – 25 అధ్యాయము ) జెఫన్యా యిర్మీయాకు ముందుటివాడును, హబక్కూకుకు సమకాలీకుడగును.

ముఖ్యమైన వ్యక్తులు : పైన చెప్పబడిన ఐదుగురు యూదా రాజులు బారూకు, ఎబెద్మెలెకు, నెబుకద్నెజరును, రెగాబియురు మొదలగువారు.

గ్రంథము యొక్క ప్రత్యేకత : చరిత్ర కావ్యములు, జీవిత చరిత్ర మొదలగునవి ఇమిడియున్నవి తమ యొక్క మనస్సులోని బయలు పరుచుటకు అనేకమైన గుర్తులను ఉపయోగించుచున్నారు.

ముఖ్యపదము : తిరిగివచ్చుట, యూదాకు తన ధుర్మార్గ మార్గమును విడిచి తిరిగివచ్చుటకు ఆహ్వానము ఇచ్చుచున్నారు. యిర్మీయా అవకాశమును చివరి అవకాశమని వారికి తెలియపరచెను.

ముఖ్యమైన వచనములు : యిర్మియా 7:23-24; యిర్మియా 8:11-12

ముఖ్య అధ్యాయము : 31 అధ్యాయములో యిర్మీయా తన అన్ని హెచ్చరికలకు శిక్ష తీర్పులకును మధ్య దేవుని అద్భుత వాగ్దానములను గూర్చియు యూదా ప్రజలకు జ్ఞాపకము చేయుచుండెను. దేవుడు వారితో కొత్త నిబందన చేయును. నేను నా ధర్మ శాస్త్రమును వారి మనస్సులో ఉంచి దానిని వారి హృదయములో వ్రాసెదను నేను వారికి దేవుడనైయుందును వారు నా ప్రజలై యుందురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యేసుక్రీస్తు తన యొక్క మరణము పునరుద్దానమును వాటి ద్వారా ఈ కొత్త నిబంధనను స్థాపించి అమలులోనికి తెచ్చెను.

గ్రంథ విభజన : యూదా చరిత్రలో చీకటితో నింపబడిన కాల స్థితిలో అతిగొప్ప ప్రవక్త ఒకరు జరిగించిన సేవా ప్రతులే యిర్మీయా ప్రవచన గ్రంథము. చెరసాలలో నుండి 70 సంవత్సరముల తరువాత తిరిగి వచ్చుటను గూర్చియు క్రీస్తు ద్వారా స్థాపించబడు క్రొత్త నిబంధన ద్వారా దేవుని ప్రజలకు సొంతమగు మహిమ కలిగిన నమ్మకమును గూర్చియు యిర్మీయా పలికిన ప్రవచనములు ఎంతో గమనించతగినవి. ఈ గ్రంథములో 4 పాముఖ్యమైన భాగములు ఉన్నవి.

(1). యిర్మీయా పిలువబడుట (1 అధ్యా 1-19).

(2). యూదులకు ప్రవచనము ( 2 అధ్యా నుండి 45 అధ్యా వరకు)

(3). అన్య దేశములకు ప్రవచనము ( 46 అధ్యా నుండి 51 వరకు).

(4). ఇశ్రాయేలు (యూదా యొక్క) నిర్మూలము. బబులోను చెర అధ్యా 52.

కొన్ని క్లుప్త వివరణలు : పరిశుద్ధ గ్రంథములో 24వ పుస్తకము; అధ్యాయములు 52; వచనములు 1364; చరిత్రకు సంబంధించిన వచనములు 680; హెచ్చరికలు 1002; నెరవేరిన ప్రవచనములు 666; నెరవేరని ప్రవచనములు 180; నెరవేరిన హెచ్చరికలు 779; నెరవేరని ముందు హెచ్చరికలు 223; ప్రశ్నలు 194; ఆజ్ఞలు 303; వాగ్దానములు : 16; దేవుని యొద్ద నుండి ప్రత్యేకమైన వర్తమానములు 62.

Isaiah – యెషయా

పరిశుద్ధ గ్రంథము యొక్క 17 ప్రవచన గ్రంథములలో అనుక్రమానుసారముగా మాత్రమే కాకుండా శ్రేష్ఠత్వములోను ప్రధమ గ్రంథముగా కనుపించేదే యెషయా ప్రవచన గ్రంథము. యోబు నుండి పరమగీతము వరకున్న కావ్య గ్రంథాలు ఇశ్రాయేలు రాజ్య స్వర్ణయుగములలో వ్రాయబడగా యెషయా నుండి మలాకీ వరకైన గ్రంథాలు ఇశ్రాయేలు రాజ్య అంధకారయుగమునకు సంబంధించినవి. ఇశ్రాయేలు రాజ్యము ఉత్తర ఇశ్రాయేలు దక్షిణ యూదాగా రెండుగా విడిపోయి దైవభక్తి నుండి దిగజారి అక్రమమైన విగ్రాహారాధనలో పడిపోయినపుడు దేవుడు త ప్రవక్తలను పంపి వారితో మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాము. క్రీ.పూ. 9వ శతాబ్దము నుండి 4వ శతాబ్దము వరకు ఈ ప్రవక్తల కాలమగును క్రీ.పూ 4వ శతాబ్దములో ప్రవచించిన మలాకీ తరువాత బాప్తీష్మమిచ్చు యోహాను కాలము వరకు సుమారు మూడు వందల సంవత్సరములపైగా ఏ ప్రవక్త కూడా ఉద్భవించలేదు. 16 మంది ప్రవక్తలలో నలుగురిని పెద్ద ప్రవక్తలని 12 మందిని చిన్న ప్రవక్తలని వారి యొక్క గ్రంథముల ప్రాముఖ్యతను ఆధారము చేసుకుని, ప్రవచన గ్రంథము యొక్క కొలతను ఆధారము చేసుకుని గుర్తించబడినది. వీరిలో యెషయా, యిర్మీయా హోషేయా, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా అను పదకొండు మంది చెర నివాసమునకు ముందు జీవించారు. దానియేలు, యెహెజ్కేలు అనువారు చెరనివాసకాలములోను, హగ్గయి, జెకర్యా, మలాకీ అనువారు చెర విమోచనము తరువాత జీవించారు.

ప్రవక్తలు ద్వితీయోపదేశకాండము 18:18-19 వచనములలో కనబడునట్లుగా దేవుని కొరకు ప్రజలతో మాట్లాడుతూ వచ్చిరి. పరిశుద్ధ గ్రంథములో మూడింటిలో ఒక భాగము ప్రవచనా గ్రంథములు నింపబడుటలో ప్రవక్తల యొక్క సేవ ప్రాధాన్యతను బయలుపరచుచున్నది.

ఉద్దేశము : యూదాను దేవునివైపు త్రిప్పుట, మెస్సియా మార్గమైన దేవుని రక్షణను ప్రస్తావించుట.

గ్రంథకర్త : 1 – 39 వరకు గల అధ్యాయములు క్రీపూ 700 సంవత్సరములోను 40 -66 వరకు గల అధ్యాయములు క్రీపూ 681 సంవత్సరములోను వ్రాయబడినవని ఊహించవచ్చును.

సారాంశము : యెరూషలేము

ముఖ్యమనుష్యులు : యెషయా, ఆయన ఇద్దరు కుమారులు

గ్రంథము యొక్క విశేషం : ఈ గ్రంథములో పద్యములును పాటలును ఉన్నవి. మాదిరికరమైన కార్యములు అనేకమైన వున్నవి. జరుగుచున్న కాలములోను, భవిష్యత్తులోను జరుగవలసిన కార్య క్రమములు వచనా రీతిగా చెప్పబడియున్నది. అజర్యా అని పిలువబడు ఉజ్జీయా చనిపోయిన సంవత్సరములో యెషయాకు కలిగిన దర్శనమును గురించి 6వ అధ్యాయములో వ్రాయబడియున్నందున మొదటి 5 వ్రాయబడియున్నందున మొదటి 5వ అద్యాములు ఉజ్జీయా యొక్క పరిపాలన కాలములో వ్రాయబడినవని చెప్పవచ్చును. యోతాము కుమారుడైన ఆహాజు పరిపాలనా కాల కార్యములు 7వ అధ్యాయములో వ్రాయబడి యుండుటను బట్టి (యెషయా 7:1-5) యెషయా యొక్క ప్రవచనములలో అధిక భాగము ఆహాజు మరియు హిజ్కియాల పాలన కాలములో ప్రవచించబడినవని అనుకొనవచ్చును. ఆష్హూరు తిగ్లత్పిలేసెరు నాయకత్వములో ఒక గొప్ప శక్తివంతమైన రాజ్యముగా అభివృద్ధి చెందిన కాలమది. మధ్యదరా సముద్ర తీరపాంతములలో ఉన్న చిన్న దేశములను హస్తగతం చేసుకున్న అష్హూరు ఇశ్రాయేలుపై దండెత్తి దానిని స్వాధీనం చేసుకుని అక్కడ జీవించిన వారిలో ఎక్కువ మందిని చెర పట్టుకుపోయినది. ఈ విధముగా క్రీ.పూ 722లో ఇశ్రాయేలు సంపూర్ణముగా నాశనము చేయబడినది. ఇశ్రాయేలు పతనమునకు పిదప యూదాకు కూడా తీర్పు వచ్చును అనియు అది ఆష్హూరు నుండి కాదుగాని బబులోను నుండే కలుగునని ప్రవక్త పలుకుటను చూస్తున్నాము. ఇది బబులోను గొప్ప మహాసామ్రాజ్యముగా అవతరించుటకు ముందే చెప్పబడిన ప్రవచనము అని మనస్సులో గుర్తించుకోవాలి.

ముఖ్యమైన మాట : రక్షణ

ముఖ్య మైన వచనములు : యెషయా 9:6-7; యెషయా 5:3-6

ముఖ్యమైన అధ్యాయము : యెషయా 53. ఈ అధ్యాయములోని ఒక్కొక వచనమును దేవుని సత్యగని వలె ప్రాముఖ్యతను పొందినవి. ఇవి హృదయమున చెక్కబడవలసినవి.

గ్రంథ విభజన : వేదపండితుల ద్వారా ప్రవక్తలలో పెద్దవానిగా భావించబడువారు యెషయా మెస్సియాను గూర్చి మిక్కిలి స్పష్టముగాను ప్రాముఖ్యత కలిగిన ప్రవచనములు గల ఈ గ్రంథమును యెషయా సువార్త అని పిలుచుటలో ఆశ్చర్యపడనక్కర లేదు. ఈ గ్రంథము క్రింద ఇవ్వబడిన రీతిగా మూడు పెద్ద భాగములుగా విభజింపవచ్చును.

న్యాయ తీర్పును గూర్చిన ప్రవచనములు అధ్యాయము 1 నుండి 35 వరకు.
చరిత్ర సంబంధమైన ఒక అనుబంధము – అధ్యాయము 36 నుండి 39 వరకు.
అష్హూరు రాజు నుండి హిజ్కియాకు లభించిన విడుదల 36: 1 నుండి 37: 38 వరకు.
మరణకరమైన రోగము నుండి హిజ్కియాకు దొరికిన విడుదల యెషయా 38:1-22 వరకు
హిజ్కియా యొక్క బుద్దిహీనత యెషయా 39:1-8.
మహిమతో నిండిన విశ్వాసము యొక్క ప్రవచనములు – అధ్యాయము 40 నుండి 66 వరకు

కొన్ని సంఖ్యా వివరణలు : పరిశుద్ధ గ్రంథము యొక్క 23వ గ్రంథము; – అధ్యాయములు 66, వచనములు 1292; నెరవేరని ప్రవచనములు 634; నెరవేరిన ప్రవచనములు 395; హెచ్చరికలు 1313; నెరవేరిన హెచ్చరికలు 449; నెరవేరని హెచ్చరికలు 864; చరిత్రాత్మక వచనములు 273; ప్రశ్నలు 190; వాగ్దానములు 120; ఆజ్ఞలు 308; దేవుని యొద్ద నుండి ప్రత్యేక సందేశములు 71.

Song of Solomon – పరమగీతము

అనేక బృందములును తూర్పు దేశము యొక్క వాజ్మయశైలిలో అమర్చబడిన చిత్రపటములతో నిండిన ఒక ప్రేమ కవిత్వముగా పరమగీతము ఉంటున్నది. చరిత్ర రీతిగా చూచినట్లయితే సొలొమోను రాజునకును, ఒక కాపరి సంతతికి చెందిన కన్యకును మధ్య గల ప్రేమను, వివాహమును చిత్రించే ఒక గ్రంథముగాను, మరియొక రీతిగా చూస్తే ఇశ్రాయేలు దేవుని యొక్క పవిత్రమైన పెండ్లి కుమార్తెగాను, సంఘము యేసుక్రీస్తు

యొక్క పెండ్లి కుమార్తెగాను చిత్రించే ఒక గ్రంథముగా దీనిని పరిగణించవచ్చును. మానవుని ఆత్మీయ జీవితము యొక్క గొప్ప సమృద్ధి దేవునికిని మానవునికి అనగా క్రీస్తుకును మానవ ఆత్మకును మధ్యనున్న ప్రేమగల సంబంధమే.

అనేక సాక్షులతో నిండిన ఒక నాటకము యొక్క శైలిలో ఈ గ్రంథమున్నది. సొలొమోను రాజు (నాయకుడు) షూలమ్మితీ (నాయకురాలు) యెరూషలేము కుమార్తెలు (పాటల బృందము) వీరే దీని యొక్క ఈ కథా పాత్రలు. హెబ్రీ, గ్రీకు భాషలలో నున్న గ్రంథముల పేర్లు పాటల యొక్క పాటలు అనగా పరమగీతములు అనునదే. సొలొమోను రచించిన 1005 పాటలను గూర్చి 1 రాజులు 4:32 లో చెప్పబడియున్నది. వాటిలో ఎంతో శ్రేష్టమైన పాట అనుబావము ఇచ్చుటచే పరమగీతము అను పేరు అర్థముతో నిండినదిగానున్నది. ముప్పది సంవత్సరములకు లోబడిన వారు చదువుటకు ధర్మశాస్త్రో పదేశకులు, పెద్దలు దీనిని అనుమతించలేదు.

గ్రంథకర్త : సొలొమోను

కాలము : సొలొమోను పరిపాలన కాలము యొక్క ప్రారంభము అనగా దాదాపు 965లో వ్రాయబడినదని ఊహించవచ్చును.

ముఖ్యమైన మాట : ప్రేమ

ముఖ్యవచనములు : పరమగీతము 7:11; పరమగీతము 8:7 నేను నా ప్రియుని దానను. అతడు నా యందు ఆశాబద్దుడు (పరమగీతము 7:11). అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలవు ప్రేమకై యొకడు తన స్వాస్థ్యమంతా యిచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. (పరమగీతము 8:7).

ముఖ్యమైన అధ్యాయములు : గ్రంథమంతయు కవిత్వముతో నిండియున్నందున ఏదైన ఒక అధ్యాయమునకు శ్రేష్టతనిచ్చుటకు వీలుపడదు. 8 అధ్యాయములు కుటుంబ ప్రేమను ఎంతో చక్కగా బోధించుచున్నవి.

గ్రంథ విభాగములు : ఈ గ్రంథమునకు మూడు ముఖ్యమైన భాగములున్నవని చెప్పగలము.

(1). ప్రేమ ప్రారంభము Song,1,1-3,5 వరకు

పెండ్లి కమార్తె యొక్క ప్రేమాకాంక్ష పరమగీతము 1:1-8
ఒకరికొకరు తమ ప్రేమను బయలుపరచుట Song,1,9-2,7
రాజు పెండ్లి కుమార్తె యింటిలో పరమగీతము 2:8-17
పెండ్లి కుమార్తె యొక్క ఎడబాటు కల పరమగీతము 3:1-5

(2). ప్రేమ వివాహములో సఫలమయ్యెను Song,3,6-5,1

వివాహ ఊరేగింపు పరమగీతము 3:6-11
పెండ్లికుమార్తె యొక్క విశేషమైన అందము పరమగీతము 4:1-15
వివాహము యొక్క ఆనందం Song,4,16-5,1

(3). ప్రేమాభివృద్ధి Song,5,2-8,14

పెండ్లి కుమార్తె యొక్క రెండవ ఎడబాటు కల పరమగీతము 5:2-7
పెండ్లి కుమారుని విశేషమైన అందము Song,5,8-6,3
పెండ్లికుమార్తె యొక్క అందమును పొగడబడుట Song,6,4-7,10
తన యింటికి వెళ్ళుటకు పెండ్లి కుమార్తె వాంచ Song,7,11-8,4
ప్రయాణమైయింటిని చేరుకొనుట పరమగీతము 8:5-14

కొన్ని ముఖ్య వివరములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 22వ గ్రంథము ; అధ్యాయములు 8; వచనములు 117; ప్రశ్నలు 13; ఆజ్ఞలు 14; ప్రవచనములు లేవు; దేవుని యొద్ద నుండి విశేష వర్తమానములు లేవు.

Ecclesiastes – ప్రసంగి

మాయ (వ్యర్ధము) అనునదే ఈ గ్రంథము యొక్క ముఖ్య సారాంశము. 37 సార్లు మరల, మరలా ఈ మాట ఈ గ్రంథములో వచ్చుచున్నది. దేవుడు లేని జీవితములో తృప్తిని కనుగొనుటకు వ్యర్థముగా ప్రయాసపడుటయే ఈ పదము గుర్తించుచున్నది. ప్రసంగి అనగా సొలొమోను ఇశ్రాయేలీయుల చరిత్రలోనే ఎంతో గొప్ప జ్ఞానము గలవాడును, శ్రీమంతుడును, ప్రఖ్యాతి గాంచిన రాజుగా నుండెను. ఆయ సూర్యుని క్రిందనున్న సమస్తమును మానవ దృష్టితో చూచెను. అప్పుడన్నియు వ్యర్ధమైనవని చూచుచున్నాడు. మానవ హృదయములో దేవుడు ఉంచిన ఒక ఖాళీ స్థలమున్నది. దేవుడు తప్ప వేరే ఏదియు ఆ స్థలమును నింపవీలుపడదు. అధికారముగాని, పేరు ప్రతిష్టలుగాని, ఆస్థిగాని సుఖముగాని, ప్రఖ్యాతిగాని దానిని ఏమాత్రము నింపలేదు. దేవుని దృష్టితో దాని విలువను లెక్కించునపుడు జీవితానికి, లక్ష్యము, అర్థమ ఉన్నది. అప్పుడు తినుట, త్రాగుట, ఆనందించుట, మేలుచేయుట, దేవునికి భయపడుట మొదలైనవన్నియు ఎంతో విలువైనవిగా లెక్కించబడుచున్నవి. ప్రతి దినము మన జీవితమును దేవుడు అనుగ్రహించే ఒక ఈవి అని తలంచునపుడు సూర్యోదయములో మంచు మరుగైనరీతిగా నిరాశలన్నియు మరుగైపోవును. హెబ్రీభాషలో ఈ గ్రంథము యొక్క పేరు “గొహేలేత్ ” అనబడును. ఒక సంఘములో ప్రసంగించువాడు అని దీని అర్ధము. గ్రీకు పదమైన “క్లీసియాస్టెస్” అను మాటకు కూడ ఇదే అర్థము. ఈ విధముగా తెలుగులో ప్రసంగి అను పేరు పెట్టబడియున్నది.

గ్రంథకర్త : సొలొమోను

కాలము : సొలొమోను యొక్క అంత్య దినములలో దాదాపుగా క్రీపూ 935 లో

ముఖ్య మాట : వ్యర్ధము ( 37 సార్లు)

ముఖ్య వచనము : ప్రసంగి 2:24; Ecc,12,13,14

ముఖ్య అధ్యాయములు : ప్రసంగి 12 , గ్రంథము యొక్క చివరి భాగమునకు ప్రవేశించబోవుచున్నప్పుడు ప్రసంగి దైవ దృష్టి ద్వారా జీవితమును చూచుచున్నాడు. అయితే అంతకుముందు సూర్యుని క్రిందనున్న సమస్తమును బౌతిక కండ్లతో అతడు చూచెను. అప్పుడు ఆయనకు సమస్తము నిష్ప్రయోజనమైనవిగా అర్థశూన్యముగా నుండినవి. అయితే సూర్యునికి పైగా ఉన్న దేవుని దృష్టితో జీవితమును చూచినపుడు దేవుని ఈవిగా దానిని ఎంచుటకు, అన్నియు యథార్థమైనవిగా, మేలుకరమైనవిగా ఉన్నవని గ్రహించగలిగెను.

జీవితము యొక్క ముఖ్య సంకల్పము ఏమని ఆయన వెదకినపుడు కనుగొన్న జవాబే 12వ అధ్యాయము దేవుని యందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి (ప్రసంగి 12:13) అను గమ్యమునకే ప్రసంగి వచ్చి చేరెను.

గ్రంథవిభజన : మానవ జీవత ఉద్దేశము ఏమి అని కనుగొనుటకు గ్రంథకర్త జరిగించిన ధీర్ఘమైన అన్వేషణయే ఈ గ్రంథము యొక్క సారాంశము. ఈ గ్రంథమును మూడు ముఖ్య భాగములుగా విభజింపవచ్చును.

సమస్తము వ్యర్ధము అనునది Ecc,1,1-1,11 వరకు
వ్యర్ధము అను ఉద్దేశము యొక్క ఆదారములు Ecc,1,12-6,12 వరకు
వ్యర్ధమును జయించి జీవించుటకు బోధన Ecc,7,1-12,14 వరకు
దేవునియందలి భయభక్తులు కలిగి జీవించే మార్గమే శ్రేష్టమైన జీవితమును సంపాదించుకోగలదు అను తీర్మానమునకు ప్రసంగి చేరుకుంటున్నాడు. దేవునిని, దేవుని చిత్తమును, విలువైనదిగా ఎంచని వారి జీవితము అపాయములోను, భయంకరమైన అపజయములోను జారిపడుచున్నది. ప్రతి సమస్యకు పరిష్కారము కనుగొనేంత వరకు జీవితము ఎవరి కొరకును వేచియుండడములేదు. అయితే సూర్యునికి

క్రింద చూచుటకు బదులుగా సూర్యుని పైగా ఒకే కాపరిని తొంగి చూచుట ద్వారా జీవిత రహస్యమునకు జవాబులు దొరుకును. అప్పుడది అర్థవంతమైనదిగాను, సంతోషకరమైనదిగాను పరిగణంచబడుట నిశ్చయమే.

కొన్ని ముఖ్య వివరములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 21వ గ్రంథము ; అధ్యాయములు 12; వచనములు 222; ప్రశ్నలు 33; ఆజ్ఞలు 34; ప్రవచనములు లేవు; వాగ్దానములు 1; దేవుని యొద్ద నుండి విశేషమైన వర్తమానము లేదు.

Proverbs – సామెతలు

జ్ఞానము అనునదే సామెతల యొక్క ముఖ్య భావార్థము. జీవితము చక్కగాను, చమత్కారముగాను జీవించుటకు సామర్థ్యమునిచ్చునది జ్ఞానమే. అనుదిన జీవితము యొక్క క్రియారూపకమైన సమస్యలను జయకరముగా ఎదుర్కొనుటకు విశాలమైన కర్తవ్యములు ఈ గ్రంథములో ఇమిడియున్నవి. దేవుడు తల్లిదండ్రులు, పిల్లలు, స్నేహితులు, పొరుగువారు, అధికారులు మొదలైన వారితో ఏలాగు మెలగవలయును అని ఇది నేర్పించుచున్నది. జీవిత సమస్యలను ఎదుర్కొనుటకు అవసరమైన ఒక ఆత్మీయ దృష్టిని పాఠకులకు బహుకరించుటకు, కవిత్వము, విప్పుడు కథ, సామెతలు, ఉపమానములు, పొడుపు కథలు మొదలైవాటితో నిండిన ఒక అక్షరానుసారశైలిని దీని గ్రంథకర్తయైన సొలొమోను ఉపయోగించియున్నాడు.

ఉద్దేశము : సకల క్రియలలో, వివేకముగలవారుగాను, నిష్కలంకులుగా నుండుటకుగాను, జనులకు నేర్పించుటకుగాను, యువలకులకు వచ్చు సమస్యలు ఎలాగు అతిజీవించాలి అనుదానిని గూర్చిన నిర్దేశములు. జ్ఞానులకు యోగ్యమైన నాయకత్వ లక్షణములు నిచ్చుటకు సహాయపడుచుండెను. సంక్షిప్తముగా చెప్పినట్లైతే దైవ జ్ఞానం దయనందిన జీవితములోను ఉపయోగపరచుకొనుటకు సత్ మార్గ నిర్దేశములనిచ్చుటకుగాను యీ పుస్తకం రచించబడినది.

ముఖ్య గ్రంథకర్త ఇశ్రాయేలీయుల జ్ఞానులకు జ్ఞానియైన సొలొమోను కాబట్టి సొలొమోను సామెతలు అను నామము హెబ్రీ, గ్రీకు పరిశుద్ధ గ్రంథములు పెట్టుకొన్నవి. తరువాత లాటిన్ భాషలోను, ఇంగ్లీషులోను ఇతర భాషలలోను సామెతలు అని తగ్గించబడినది.

గ్రంథకర్త : సొలొమోను

కాలము : సొలొమోను పరిపాలన ప్రారంభములో వ్రాయబడింది. దాదాపుగా క్రీ.పూ 931 అని ఎంచబడుచున్నది. 25 – 29 అధ్యాయములు క్రీ.పూ 700 హిజ్కియా చేత సేకరించబడి చేర్చబడినవి.

ముఖ్యాంశము : పరిపూర్ణ జ్ఞానము గల ఆలోచనలతో దేవుని యందు భయభక్తులు గలిగి ఏలాగు జీవించాలి అని ప్రజలకు నేర్పించే చక్కటి వచనములతో నిండిన గ్రంథమిది.

గ్రంథ ప్రాముఖ్యత : కవిత్వము, చిన్న ఉపమానములు, ఉద్దేశముతో కూడిన ప్రశ్నలు.

ముఖ్య మాట : జ్ఞానము

ముఖ్య వచనములు : సామెతలు 1:5-7; సామెతలు 35:6.

ముఖ్య అధ్యాయము : సామెతలు 31 , ఈ అధ్యాయము పాత రచనలలో ప్రత్యేకమైన ఒక భాగము. దీనిలో స్త్రీలను గూర్చి ఉన్నతమైన, శ్రేష్టమైన ఒక దృష్టిని చూడవచ్చును. సామర్ధ్యము గల స్త్రీ, మాదిరికరమైన భార్య, శ్రేష్టమైన తల్లి, మంచి పొరుగు స్త్రీ అయిన స్థితులలో ఇక్కడ చిత్రించబడియున్న స్త్రీ 7వ అధ్యాయములోని జారస్త్రీ నుండి ఎంతగా ప్రత్యేకించబడుచున్నది.

గ్రంథ విభజన : క్రింది ఇవ్వబడియున్న రీతిగా ఆరు భాగములుగా ఈ గ్రంథమును విభజింపవచ్చు.

గ్రంథము యొక్క ఉద్దేశము Pro,1,1-1,7
యౌవనస్థులకు జ్ఞానోపదేశములు Pro,1,8-8,36
ప్రతి మానవునికి తగిన బోధనలు Pro,9,1-24,34
హిజ్కియా సేకరించిన సామెతలు అధ్యా 25 – 29
ఆగూరుపలికిన మాటలు 30వ అధ్యా
రాజైన లెమూయేలు పలికిన మాటలు 31వ అధ్యా

కొన్ని ముఖ్యాంశములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 20వ గ్రంథము; అధ్యాయములు 31; వచనములు 915; ప్రశ్నలు 49; నెరవేరని ప్రవచనాలు 27; పాపములు 67; మూడులను గూర్చినవి 66; సోమరితనములను గూర్చినవి 28; రాజులను గూర్చినవి 22; హేయమైనవి 25; ఆజ్ఞలు 215; వాగ్దానములు 120; ఆశీర్వాదములు 27; జీవిత రహస్యములు 24; మంచి క్రియలు 17; సామెతలు 560.

Psalms – కీర్తనల గ్రంథము

పరిశుద్ధ గ్రంథము యొక్క హృదయాంతరంగములో నుండి లేచు సంగీతమువలె కీర్తనల గ్రంథము దాని మధ్య అమర్చబడియున్నది. పరిశుద్ధ గ్రంథములోనే ఎంతో పెద్దదిగాను, ఎక్కువగా ఉపయోగించబడేదిగాను – ఈ గ్రంథమున్నది. మానవ అనుభవముల యొక్క ప్రత్యేకమైనదియు, అనుదిన జీవితముతో సంబంధము గలిగినదియునైన ప్రతి భాగములను ఇవిముట్టుచున్నవి. వీటిలో ఇమిడియున్న 150 పాటల యొక్క ముఖ్యాంశములో సృష్టి ఆరంభము నుండి ఇశ్రాయేలు చెరకొనిపోబడిన కాలమువరకు విస్తరించబడియున్నది. గోత్ర కర్తల కాలము న్యాయాధిపతులు రాజ్యమేలినకాలము, రాజపరిపాలన కాలము, చెరపట్టబడిన కాలము అను పలు రకములైన కాలములతో నిండియున్న కీర్తనలు ఈ గ్రంథములో నున్నవి. వీటిలో ఇమిడియున్న కర్తవ్యము ఆశ్చర్యము కలిగించేవిగానున్నవి. వాటిలో దైవీక ఆనందము, యుద్ధము, సమాధానము, ఆరాధన, న్యాయ తీర్పు, ప్రవచనము, స్తుతి, విలాపము అను పలు విధములైనవియున్నవి. సంగీత వాయిద్యముల సహాయముతో దేవాలయ ఆరాధనలో ఆలపింపబడేవిగా ఈ గానములు వ్రాయించబడినవి. యూదా ప్రజల పాటల వరుసగాను భక్తి మార్గదర్శిగాను పరిగణించబడుచూయున్నది.

ఉద్దేశము : కవిత్వముతో కూడిన స్తుతిని, ఆరాధనను, ఒప్పుదలను ప్రత్యక్షపరచుట.

ముఖ్యమైన మనుష్యులు : దావీదు

ముఖ్యమైన స్థలము : దేవాలయము

ముఖ్యమైన మాట : ఆరాధన

ముఖ్యమైన వచనములు : కీర్తనల గ్రంథము 19:14; కీర్తనల గ్రంథము 145:21

ముఖ్యమైన అధ్యాయము : కీర్తన 100

కొన్ని కీర్తనలలో పరిశుద్ధ గ్రంథము యొక్క చాలచక్కటి సారాంశములు పాడబడినవి కనుక ఏదైన ఒక కీర్తనను ఇది ముఖ్యమైనది అనుచెప్పుట చాలా కఠినము. 1, 22, 23, 24, 27, 72, 100, 101, 119, 121, 150 కీర్తనలు ముఖ్య మైనవే. 100వ కీర్తనలో స్తుతి, ఆరాధన అను రెండు భాగములు సమతల స్థితిలో ఏకమైయున్నవి. కనుక ఈ కీర్తనను ప్రాముఖ్యమైన అధ్యాయము అను స్థలములో ఉంచవచ్చును.

గ్రంథ విభజన : కీర్తనలను 5 స్కంధములుగా విభజించబడియున్నవి. ఒక్కొక్క స్కంధము ఒక స్తుతితో ముగించబడుచున్నది. 150వ కీర్తన 5వ పుస్తకమునకు పూర్తి పుస్తకమునకు ముగింపు స్తుతి. 5 స్కంధములకు వరుసగా క్రింద ఇవ్వబడియున్నవి.

ప్రథమ స్కంధము : 1వ కీర్తన నుండి 41 వరకు వీటి సాధారణ విషయసూచిక మానవుడు అని చెప్పవచ్చును. మానవుని నిజమైన స్థితి ఆశీర్వాదకరమైన స్థితి. పతనము, విమోచన అనునవి ఈ పాటలు చిత్రించుచున్నవి.

ద్వితీయ స్కంధము : 42వ కీర్తన నుండి 72వ కీర్తన వరకు ఇశ్రాయేలీయులు ముఖ్య పాత్రగా యున్నారు. 42 నుండి 49 వరకు గల పాటలు వారి పతనమును 50 నుండి 60 వరకు గల పాటలు వారి విమోచనకుడను, 61 నుండి 72 వరకు వారికి లభించు విమోచనమును గూర్చి చెప్పబడియున్నది.

తృతీయ స్కంధము : కీర్తన 73 నుండి 89 వరకు దేవాలయము అనగా పరిశుద్ధ ఆలయము దీని ముఖ్యాంశము సైన్యముల కధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు అను ప్రారంభించు 84వ కీర్తన చూడండి.

చతుర్ధ స్కంధము : కీర్తన 90 నుండి 106 వరకు. ఇది భూమిని గూర్చియు దానికి దొరకనైయున్న,

దొరకుచున్న దీవెనలను గూర్చియు పాడుచున్న సొగసైన పాటలు.

పంచమ స్కంధము : కీర్తన 107 నుండి 150 వరకు. దేవుని వాక్యమే ఈ పాటల యొక్క ముఖ్యమైన సారాంశమ. దేవుడు తన వాక్కును పంపి స్వస్థపరచుటను గూర్చి 107వ కీర్తనలో చెప్పబడియున్నది. 176 వచనములు కలిగిన 119వ కీర్తన యొక్క ప్రతి వచనము కూడ భక్తి గల మానవులకు దేవుని వాక్యము అనుగ్రహించు దీవెనలను పాడి ప్రస్తావించుచున్నది.

ఇక ఒక పాటను పరిశీలించినట్లయితే మొదట దేవునితో మాట్లాడునట్లుగాను, తరువాత తన స్థితి వివరముగాను దానికి తరువాత మరల దేవుని గూర్చి మాట్లాడునట్లు గాను, అమర్చబడియుండుట చూడగలము హెబ్రీ కవిత్వములతో ఈ లాంటివి సాధారణమైనవే.

కొన్ని ముఖ్యమైన వివరములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 19వ పుస్తకము ; అధ్యాయములు 150; వచనములు 2,461; చారిత్రాత్మిక వచనములు 2027; నెరవేరిన ప్రవచనములు 160; నెరవేరని ప్రవచనములు 274; ప్రశ్నలు 164; ఆజ్ఞలు 413; దేవుని క్రియలు 338; తీర్మానములు 124; దేవస్తుతులు 174; నిందలు చూపుట (విజ్ఞాపనలు) 118; యూదాను గూర్చినవి 72; దేవుని సత్యములు 865; దేవుని వచనములను గూర్చినవి 235; సాక్ష్యములు ప్రకటనలు 182; వాగ్దానములు 97; మెస్సీయాను గూర్చినవి 128; ఆశీర్వాదములు 281; పాటల గ్రంథకర్తలను గూర్చినవి 190; న్యాయక్రియలు 78; దుష్ట క్రియలు 101; పాపములు 233; విజ్ఞాపనలు 582; విజ్ఞాపనకు కారణములు 187.

Job – యోబు

ఎస్తేరు గ్రంథముతో పాతనిబంధన గ్రంథము యొక్క చారిత్రిక గ్రంథములు ముగియుచున్నవి. దీనికి ప్రక్కనున్న పద్య భాగములో మనము చూచుచున్న అయిదు కావ్య గ్రంథములలో మొట్టమొదటిది యోబు గ్రంథము. కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు మొదలైనవి ఇతర నాలుగు పద్య గ్రంథములు. అతి ప్రాచీనమో, ఆధునీకమైన సాహిత్య కృతుల సమూహములో అతి శ్రేష్టమైన కావ్య గ్రంథము యోబు గ్రంథమేనని టెన్నిసన్ అనునతడు చెప్పెను. పరిశుద్ధ గ్రంథములోనే ఎంతో పాత గ్రంథము యోబు గ్రంథమే.

ఉద్దేశము : నిజమైన విశ్వాసము యొక్క కర్తవ్యమును దేవుని ఉన్నతమైన అధికారమును ప్రత్యక్ష పరచుట.

గ్రంథకర్త : యోబు

కాలము : 2000 – 1880 క్రీ.పూ

పూర్వ చరిత్ర : ఊజు దేశము (పాలస్తీనాలోని ఉత్తర సరిహద్దులో దమస్కునకు యూప్రటీసు నదికిని మధ్య భాగములో నున్న అరణ్యములోనున్న స్థల మైయుండవచ్చును.)

ముఖ్య మనుష్యులు : యోబు, తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడగు బిల్టదు, నయమాతీయుడైన జోఫరు, రాము వంశస్థుడైన బూజీయుడుగు ఎలీహు.

విశేష కార్యములు : హెబ్రీ పరిశుద్ధ గ్రంథములో పద్య భాగములో మొట్టమొదటిగా యోబు గ్రంథము మొదటిస్థానము వహించినది. పరిశుద్ధ గ్రంథములో అతి ప్రాచీనమైనదిగా ఈ గ్రంథము పరిగణింపబడుచున్నది. సాతాను యొక్క క్రియలను గూర్చి లోతైన దృష్టి ఈ గ్రంథములో మనికివ్వబడుచున్నది. యెహెఙ్కేలు 14:14-20 యాకోబు 5:11 మొదలైన వచనములు యోబు ఒక చారిత్రక మానవునిగా చిత్రించుచున్నవి.

ముఖ్యమైన మాట : దేవుని యొక్క పరిపూర్ణమైన అధికారము: శ్రమలలో కూడా యోబు నేర్చుకొను పాఠము దేవుని పూర్ణమైన అధికారమును గూర్చినదైయున్నది. విశ్వాసుల యొక్క విషయములో అది అలాగే యున్నది.

ముఖ్యమైన వచనములు : యోబు 13:15; యోబు 37:23-24

ముఖ్యమైన అధ్యాయము : యోబు 42. గ్రంథము యొక్క ఈ చివరి అధ్యాయము యోబుకు తనతోను, భార్యతోను, స్నేహితులతోను, దేవునితోను జరిగిన పోరాటము యొక్క ఉన్నత స్థితిని చూపించుచున్నది. దేవుని పరిపూర్ణ మహాత్యమును సర్వ ఆధిపత్యమును అంగీకరించుటతో యోబుకు మానసిక పరివర్తనం సంభవించుచుండెను. ఆయనను కలత జెందించుచుండిన ఎందుకు అను ప్రశ్న తరువాత ఆయనకు సమస్యగా కనిపించలేదు.

విభాగము : గ్రంథమును మూడు భాగములుగా విభజింపవచ్చును. యోబు యొక్క దుఃఖములు, యోబుకు స్నేహితులకు జరిగిన వివాదము. ఆయనకు దొరికిన విడుదల మొదలైనవి ఈ మూడు భాగములు. ఒక్కొక్క దాని అంతర్భావములు ఈ క్రింద ఇవ్వబడియున్నవి.

(1): యోబు దుఃఖములు : Job,1,1-2,13. 1). యోబు యొక్క కుటుంబ చరిత్ర యోబు 1:1-5. 2). సాతాను మొదటి ముట్టడి యోబు 1:6-22. 3). సాతాను రెండవ ముట్టడి యోబు 2:1-10. 4). యోబు స్నేహితుల రాక యోబు 2:11-13

(2). యోబుకును స్నేహితులకు జరిగిన వాదోపవాద క్రమము : Job,3,1-37,24. 1). యోబు యొక్క మొదటి పలుకు Job,3,1-26. 2), ఎలీఫజు యొక్క పలుకులు, యోబు జవాబు Job,4,1-5,27. 3). బిల్దదు పలుకులు, యోబు జవాబును Job,8,1-10,22 4). జోఫరు పలుకులు, యోబు జవాబు Job,11,1-14,32. 5). ఎలీఫజు యొక్క రెండవ పలుకలుక జవాబును Job,15,1-16,17. 6). బిల్టదు పలుకులు యోబు జవాబును Job,18,1-19,29. 7). జోఫరు రెండవ పలుకులు యోబు జవాబు Job,20,1-21,34. 8). ఎలీఫజు మూడవ పలుకులు యోబు జవాబు Job,22,1-24,25. 9). బిల్దదు పలుకులును, జవాబులును Job,25,1-26,14. 10). యోబు చివరి వాదము Job,27,1-31,40. 11). ఎలీహు జవాబు Job,32,1-37,24.

(3). యోబుకు దొరుకు విడుదల : Job,38,1-42,17 1). యోబుకు దేవుడిచ్చే జవాబు Job,38,1-41,34 2). యోబు తన అమాయత్వమును సమ్మతించుట – స్వనీతి కొరకు పశ్చాత్తాపపడు యోబు Job,42,1-6. 3). యోబుకు దొరికిన విడుదల Job,42,7-17.

a). తన స్నేహితుల కొరకు యోబు విజ్ఞాపన చేయుచున్నాడు Job,42,7-10.

b). యోబు తాను పోగొట్టుకొన్న వాటికన్నిటికి రెండింతలు తిరిగి పొందుచున్నాడు Job,42,11-17.

యోబును కలత జెందించిన సమస్యలకు జవాబు {Job,42,5-6 వచనములలోనున్నది. ప్రతి దుఃఖమునకు ఉద్దేశము అదే. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్తనేను వింటిని అయితే యిప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను, బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.

కొన్ని ముఖ్య వివరములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 18వ గ్రంథము; అధ్యాయములు 42; వచనములు 1070; చరిత్రాత్మిక వచనములు 1066; నెరవేరిన ప్రవచనములు 1; నెరవేరని ప్రవచనములు 3; ప్రశ్నలు 329; ఆజ్ఞలు 13; వాగ్దానములు లేవు; హెచ్చరికలు 4; దేవుని యెద్ద నుండి ప్రత్యేకమైన వర్తమానములు 10.

Esther – ఎస్తేరు

ఎస్తేరు యొక్క హెబ్రీ పేరు హదస్సా అనబడును (ఎస్తేరు 2:7) పారసీక మాటయైన ఎస్తేరు అనగా నక్షత్రము అని అర్థమునిచ్చును స్టారా అను పారసీక మాటలో నుండి ఉద్భవించినది. గ్రీకు భాషలో గ్రంథము యొక్క పేరు ఎస్తేరు అని యుండగా లాటిన్ భాషలో హెష్టర్ అనియున్నది.

ఉద్దేశము : తన ప్రజలను గూర్చిన దేవుని అధికారము, ప్రేమ, బాధ్యత అనునవి బయలుపరచుట.

గ్రంథకర్త : మొర్దెకై గా (ఎస్తేరు 9:29) (రచనా శైలిని తీసికొని యీ పుస్తకమును ఎజ్రాయో, నెహెమ్యానో వ్రాసియుండవచ్చు అని అభిప్రాయపడువారున్నారు.)

కాలము : అహష్వేరోషు యొక్క పరిపాలనా కాలము క్రీపూ 486 నుండి క్రీపూ 464 వరకు. రాజు ఏర్పాటు చేసిన విందు ఆయన పాలన యొక్క మూడవ సంవత్సరము (ఎస్తేరు 1:3) గ్రంథము యొక్క 3 నుండి 10 వరకు గల అధ్యాయములలో వివరించు కార్యక్రమములు జరిగినవి క్రీపూ 483 నుండి 473 వరకు గల 10 సంవత్సరముల కాలపరిమితిలో జరిగినవి. (ఎస్తేరు 3:7-12) అహష్వరోషు చనిపోయిన సంవత్సరమైన క్రీ.పూ. 464 తరువాత దానికి సమీప కాలములో ఎస్తేరు గ్రంథము మొర్దకై ద్వారా వ్రాయబడియుండవచ్చును. తమ స్వదేశమునకు తిరగి వెళ్లక, పారసీక దేశములో జీవించుచున్న యూదుల ఉపయోగము కొరకై వ్రాయబడిన గ్రంథము ఇది. దైవభక్తులైన యూదులందరు పాలస్తీనమునకు తిరిగి వెళ్లలేదు. ఈ రీతిగా చెరనివాసము కొనసాగించ తీర్మానించి జీవించిన వారికొరకు దేవుడు వారియందు దృష్టించియున్నాడు. వారిని కూడా పరామర్శించువానిగా యున్నాడనునది. ఈ గ్రంథము తెలుపుచున్నది.

పూర్వ చరిత్ర : పరిశుద్ధ గ్రంథములో నెహెమ్యా తర్వాత ఎస్తేరు గ్రంధము వచ్చినప్పటికిని నెహెమ్యా కార్య క్రమములకు 30 సంవత్సరములకు ముందే ఎస్తేరు కార్య క్రమములు జరిగినవి. ఈ కార్యములు జరిగిన స్థలము పారసీక సామ్రాజ్యము యొక్క రాజధానియైన షూషనులోను, చక్రవర్తి అంతఃపురములోను జరిగినవి.

ముఖ్య మనుష్యులు : ఎస్తేరు, మొర్దకై, అహష్వరోషురాజు, హామాను.

ముఖ్య స్థలము : పారసీక షూషను అంతఃపురము

విశేషము: స్త్రీల పేర్లలో కనబడు రెండు గ్రంథములలో ఇది యొక్కటి. (రూతు మరియొక గ్రంథము) ఈ గ్రంథములో దేవుడు అనుమాట ఏమాత్రము ఉపయోగించబడలేదు. అయినను వీటి చర్యలన్నిటిలో దేవుని సన్నిధి ఎంతో తేటగా కనబడుచున్నది.

ముఖ్య మాటలు : దేవుని దృష్టి

ముఖ్యవచనములు : ఎస్తేరు 4:14; ఎస్తేరు 8:17

గ్రంథ విభజన : గ్రంథమును రెండు భాగములుగా విభజింపవచ్చును.

అధ్యాయము 1 నుండి 4 వరకు యూదులను భయపెట్టుట.
అధ్యాయము 5 నుండి 10 వరకు యూదులు పొందిన ఆశ్చర్యమైన విజయము.
మొర్దెకై దేశములో రెండవ మానవుడుగా హెచ్చింపబడుటను, ఆయన యూదులు యొక్క సంరక్షకునిగా మార్చబడుట చెప్పుచూనే ఈ గ్రంథము ముగియుచున్నది. తెలియని రీతిగా జరిగినవని భావించు అనేక సంఘటనలు ఒక దండవలె ఐక్యపరచబడిన రీతిగా ఇచ్చుటయే ఈ గ్రంథము యొక్క విశేషిత వష్తి రాణి యొక్క మొండితనము ద్వారా ఆమె పదవి తొలగించబడినది. రాజు యొద్దకు తీసుకొని రాబడిన అనేక కన్యకలలో ఎస్తేరు రాణిగా ఎన్నుకొనబడుట, ఒక రాత్రి రాజు నిద్రలేక బాధపడుట ఆ రాత్రి రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని ఆజ్ఞాపించుట, మొర్దెకై రాజును కాపాడిన సంఘటన చదువుట తటస్థించుట, అదే సమయములో హామాను అచ్చటికి రావడము జరుగుట అను కార్యములన్నియు మానవదృష్టిలో తెలియని రీతిగా జరిగిన సంఘటనలు. దేవుని ప్రజల యొక్క జీవమంతయు దేవుని ఆధీనములోనున్నది. వారి జీవితములో ఏదియు తెలియని రీతిగా జరిగినవి కావు. హామాను నుండి హిట్లర్ వరకు పగ తీర్చుకొను మనస్సు కలిగిన నాయకుల యొక్క ద్వేషమునకు గురియైన యూదుల వలె మరియొక ప్రజలు లోకములో వేరేలేరు. వేరే ఏ జనసమూహము ఆపధలను అతిజీవించుటకు ఇంత గొప్ప శక్తిని పొందలేదు.

కొన్ని ముఖ్య వివరములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 17వ గ్రంథము; అధ్యాయములు 10; వచనములు 167; ఆజ్ఞలు 11; ప్రశ్నలు 21; ప్రవచనములు లేవు; వాగ్దానములు లేవు, దేవుని యొద్ద నుండి విశేషమైన వర్తమానము లేదు.

Nehemiah – నెహెమ్యా

బబులోను చెర నివాసమునకు తరువాత యెరూషలేమునకు మూడవ సారిగా అనగా చివరి సారిగా తిరిగి వచ్చిన వారికి నాయకుడు నెహెమ్యా. నెహెమ్యా పారసీకదేశపు రాజైన అర్తహషస్తకు పానదాయకునిగా ఉండిన ఈయనకు యెరూషలేమును గురించి, అక్కడ కష్టపరిస్థితులలో జీవించిన ప్రజల గురించి కలిగిన భారము పరిశుద్ద సాహసాలు చేయునట్లుగా ప్రోత్సాహం ఇచ్చినది. అర్తహషస్త రాజు యొక్క అనుమతి పొంది తనతో బయలుదేరిన కొంత మందితో సైనిక నాయకులతో, గుఱ్ఱపు పరిచారకులతో కలిసి తన్ను వెంబడించువారితో యెరూషలేమునకు వచ్చెను. యెరూషలేము ప్రాకారమును కట్టునట్లుగా స్వజనులకు పిలుపునిచ్చెను.

ఆ కాలములో కోట ప్రాకారములేని పట్టణం ఏదైన దోపిడిదారుల ఆక్రమనమునకు “ఎర” గా మారు పరిస్థితియుండెను. అందువలన కాపుదల అవసరమని యూదులు యెరూషలేములో ఉండకండా చుట్టూ ఉన్న గ్రామములలో జీవించినారు. ఇందువలన అన్యజనులతో కలిసిపోవుటవలన భాషా, ఆచారపు అలవాట్లు, పరిశుద్ధ విశ్వాసము కూడా పోగొట్టుకునే పరిస్థితి వచ్చినది. ప్రాకారము మరమత్తు చేయబడి కట్టబడితే ఒక నిజమైన యూదా నగరమును కట్టినట్లైతే లోపలకి వచ్చువారిని, బయటకు వెళ్ళువారిని అదుపు చేయవచ్చును.

ఆ దేశ ప్రజల భయంకరమైన వ్యతిరేకతను ఎదుర్కొని 52 దినములలో ప్రాకారపు పని ముగించినప్పుడు ఈ అసాధ్యమైన కార్యమును చేయుటకు యెహోవాయే సహాయము చేసినాడని యూదుల యొక్క విరోధులు కూడా ఒప్పుకొనవలసి వచ్చినది. నెహెమ్యా యొక్క గొప్ప దైవ నమ్మిక, సంఘటిత సామర్థ్యం, శ్రేష్ఠమైన నాయకత్వ తలాంతు మరమత్తు చేయబడిన ప్రాకారముతో, అస్తవ్యస్తమైన యూదా ప్రజల జీవితమును సరిచేసి నూతన జీవమునిచ్చు అవకాశము ఏర్పడుటయే ఈ పుస్తకము యొక్క విషయ సూచికగా ఉన్నది.

ఉద్దేశము: పాతనిబంధన చరిత్ర పుస్తకములలో నెహెమ్యా చివరిది. చెరనుండి యెరూషలేముకు 3వ సారి వచ్చిన చరిత్రను చెప్పుచున్నది. దానితో బాటుగా యెరూషలేము యొక్క ప్రాకారము ఏలాగు మరలా కట్టిముగించారు అనేది, విశ్వాస సంస్కరణ ఎలాగు జరిగినది అనేది. ఈ పుస్తకము చెప్పుచున్నది.

గ్రంథకర్త : నెహెమ్యా. (పరిశోదకుడు అన్న స్థితిలో నెహెమ్యాతో పాటు ఎజ్రా కూడా ఈ రచనలో సహాయం చేసి ఉండవచ్చను.)

కాలం : క్రీపూ 445 – 432.

నేపథ్యము : క్రీ.పూ. 537లో జెరుబ్బాబేలు నాయకత్వములో యెరూషలేమునకు మొదటి సారి తిరిగి వచ్చుట జరిగినది. 458లో రెండవ సారి తిరిగి వచ్చుటకు ఎజ్రా నాయకత్వము వహించెను. 445 లో చివరిగా యెరూషలేములో ప్రాకారములను మరమ్మత్తు చేయుటకు చెర నుండి 3వ సారి వచ్చిన వారిలో నెహెమ్యా కూడా చేరినాడు.

ముఖ్యమైన వ్యక్తులు : నెహెమ్యా, ఎజ్రా, సన్బ్ల్లట్టు, టోబియా.

ముఖ్యమైన స్థలము : యెరూషలేము

గ్రంథ విశిష్టత : యెరూషలేము యొక్క ప్రాకారము తిరిగి కట్టబడును. అని జెకర్యా, మరియు దానియేలు యొక్క ప్రవచనములు నెరవేర్పులు ఈ పుస్తకము చూపించుచున్నది.

ముఖ్యమైన మాట : యెరూషలేము యొక్క ప్రాకారపు గోడలు

ముఖ్యవచనములు : నెహెమ్యా 6:15-16; నెహెమ్యా 8:8

ముఖ్య అధ్యాయములు : నెహెమ్యా 9. పాత నిబంధన బావము. దేవునితో ఉన్న నిబంధన యెరూషలేము ప్రాకారము కట్టబడిన తరువాత ప్రజలు పశ్చాత్తాపపడి పాపములను ఒప్పుకొని దేవునితో నిబంధనచేసిన దానిని వ్రాసి ముద్రించినట్లుగా ఈ అధ్యాయములో వ్రాయబడినది.

పుస్తకము యొక్క వివరణ : నెహెమ్యా మరియు ఆయన సమకాలికుడైన ఎజ్రా సేవలు ఇంచుమించుగా ఒకే కాలములో నిర్వహించబడెను. ఒక యాజకుడుగా ఎజ్రా ఒక ఆత్మీయ ఉజ్జీవమునకు నాయకత్వము వహించుచున్నాడు. నెహెమ్యా ఒక అధికారిగా లోకసంబంధమైన రాజకీయ సంబంధమైన సంస్కరణలను చేయుచున్నాడు. చెరనివాసమునకు తరువాత తిరిగి వచ్చిన దైవ ప్రజలలో మిగిలిన వారిని దైవ దర్శనములో స్థిరపరచి ఇద్దరూ ఏకీభవించి ఒక సంస్కరణలను చేసినారు. పాత నిబంధన ప్రవక్తలలో చివరివాడైన మలాకీ కూడా అదే కాలములో ప్రజలకు క్రమశిక్షణలో ఆత్మీయతతో మార్గమును చూపించెను.

నెహెమ్యా పుస్తకము పాత నిబంధన చరిత్ర చివరి కాలము అనగా క్రీ.పూ. 400 సంవత్సరముల ముందు కాలమునకు మనలను తీసుకొని వెళ్ళుచున్నది. పుస్తకము యొక్క రెండు పెద్ద భాగములు క్రింద ఇవ్వబడెను. (1). ప్రాకారపు మరమ్మత్తు1 – 7 అధ్యాయములు. (2). ప్రజలను సంస్కరించుట 8 – 13 అద్యాయములు.

కోట ప్రాకారపు పనితో యెరూషలేముకు సురక్షిత స్థితి ఏర్పడెను.

దాని తరువాత ప్రజల పునరుద్దారణ కోసం ఎజ్రా, నెహెమ్యా ఏకీభవించి చేసిన భాగమే పుస్తకము యొక్క శ్రేష్ఠమైన భాగమనవచ్చు.

క్రీ.పూ. 433లో పారసీకదేశమునకు తిరిగి వెళ్ళిన నెహెమ్యా క్రీ. పూ. 432 ప్రజలను తట్టి లేపి దేవుని దగ్గరకు వచ్చునట్లుగా మరియొక ప్రమాణమును చేసినాడు ఆయన దేవాలయమును పరిశుద్ధ పరచి విశ్రాంతి దినమును ఆచరించుటను స్థిరపరచి అన్య స్త్రీలైన భార్యలను పరిత్యాగ పత్రిక ఇచ్చి పంపివేయుమని ప్రజలకు ఖచ్చితముగా చెప్పెను.

కొన్నిక్లుప్త వివరణలు : పరిశుద్ధ గ్రంథములోని 16వ పుస్తకము ; అధ్యాయములు 13; వచనములు 406; నెరవేరిన ప్రవచనములు 3; హెచ్చరికలు 3; ఆజ్ఞలు 14; వాగ్దానములు లేవు; దేవుని దగ్గర నుండి ప్రత్యేక సందేశములేవు; ప్రశ్నలు 24.

Ezra – ఎజ్రా

దినవృత్తాంతములు రెండవ పుస్తకము తరువాత జరిగిన చరిత్ర మార్పును కొనసాగిస్తూ 70 సంవత్సరముల చెరనివాసమునకు తరువాత దేవుడు తన ప్రజలను వాగ్దాన దేశమునకు తిరిగి తీసుకొని వచ్చుటను గురించి చెప్పు పుస్తకము. ఇది బబులోను నుండి బయలుదేరి వచ్చు ఈ సంఘటనను రెండవ నిర్గమము అనవచ్చు. అయినప్పటికి ఈ రెండవ నిర్గమము మొదటి నిర్గమము వలె శ్రేష్ఠముగా ఉండలేదు. ఎందుకనగా బబులోనులో జీవించిన యూదులలో కొంత భాగము అంటే కొద్ది మంది మాత్రమే ఆ స్థలము వదలి తిరిగి వచ్చుటకు ముందుకు వచ్చిరి.

బబులోనును వదలి బయలుదేరి వచ్చిన రెండు గుంపులను గూర్చి ఎజ్రా వివరించుచున్నాడు మొదటి గుంపు జెరుబ్బాబేలు నాయకత్వములో దేవాలయమును కట్టుటకు, రెండవ గుంపు ఎజ్రా నాయకత్వములో ప్రజల భక్తి సంబంధమైన కార్యములలో తట్టిలేపుటకు స్వదేశమునకు తిరిగి వచ్చిరి. ఈ రెండు సంఘటనలకు మద్య సుమారు 60 సంవత్సరములు కాలవ్యవధియుండెను. ఈ మధ్య కాలంలో ఎస్తేరు పారసీక దేశ రాణిగా యుండెను. మూల భాషయమైన హెబ్రీ భాష పరిశుద్ధ గ్రంథములో ఎజ్రా, నెహెమ్యా ఒకే పుస్తకముగా ఉండినవి. ఎందుకనగా ఈ రెండు పుస్తకములలో వరుసగా ఒకే చరిత్ర వ్రాయబడియున్నది. లాటిన్ పరిశుద్ధ గ్రంథములో ఎజ్రా పుస్తకమునకు మొదటి ఎజ్రా అని, నెహెమ్యా పుస్తకమునకు రెండవ ఎజ్రా అని పేరు ఇవ్వబడినది.

ఉద్దేశము : తన ప్రజలను తిరిగి వారి దేశమునకు రప్పింపజేసెదను అనువాగ్దానమును నెరవేర్చుటలో దేవుడు ఎంత యదార్ధవంతుడుగా ఉండెనో చూపించుట.

గ్రంథకర్త : ఎజ్రా

కాలము : సుమారు క్రీ.పూ. 538 – 457. పారసీక రాజైన కోరెషు (సైరస్) క్రీపూ 539లో బబులోనును జయించెను. ప్రతి దేశస్తులకు వారి వారి మతాచారపు అలవాట్లకు అరాధన జరిగించుటకు స్వేచ్చ యివ్వబడవలెననునదే పారశీకుల పద్ధతి. ఇందువలననే క్రీ. పూ. 538లో కోరెషు యెరూషలేము దేవాలయమును కట్టుటకు అజ్ఞయిచ్చెను. దైవభక్తి, త్యాగము గల యూదులు జెరుబ్బాబేలు నాయకత్వంలో యెరూషలేము దేవాలయము కట్టుటకు బయలుదేరిరి. క్రీ.పూ. 536లో వారు దేవాలయమునకు పునాదులు వేసి పని ప్రారంభించిరి. క్రీపూ 586లో యెరూషలేము నాశనము చేయబడిన తరువాత కేవలం 50 సంవత్సరములు మాత్రమే చెరకొనసాగినది. కాని చెర నివాస కాలము 70 సంవత్సరములుగా లెక్కింపబడుచున్నది. ఎలాగనగా ఈ ప్రజలు బబులోనుకు మొట్టమొదట చెరపట్టబడిన క్రీ.పూ. 605 నుండి లెక్కింపబడినది. దేవాలయపుపని క్రీ.పూ. 534లో ఆటంకపర్చబడిన తరువాత క్రీ. పూ. 520లో పునఃప్రారంభమైనది. క్రీ.పూ. 516లో పని ముగించబడినది. యూదా నుండి ప్రజలను చెరపట్టుకొని పోయినది మొదటిగా క్రీ. పూ. 605 లోను, 2వ సారి క్రీ. పూ. 597 లోను, 3వ సారి క్రీపూ 586లో జరిగినది.

నేపథ్యము: దినవృత్తాంత పుస్తకములవలె ఎజ్రా పుస్తకము కూడా యూదా ప్రజల చరిత్రను చెప్పుచున్నది. చెరనివాసం వచ్చిన తరువాత యూదులు స్వదేశనమునకు తిరిగి వచ్చుట ఈ పుస్తకము యొక్క సారాంశం.

ముఖ్యమైన వ్యక్తులు : కోరెషు, జెరుబ్బాబేలు, హగ్గయి, జెకర్యా, దర్యావేషు, మొదటి అర్తహషస్త, ఎజ్రా.

ముఖ్య స్థలములు : బబులోను, యెరూషలేము.

గ్రంథ విశిష్టత : ఎజ్రా, నెహెమ్యా, హెబ్రీ పరిశుద్ధ గ్రంథములో ఒకే పుస్తకముగా ఉండినవి. ఈ రెండు పుస్తకములలో, ఎస్తేరు పుస్తకమును చేర్చినట్లైతే చెర నివాసము తరువాత కాలపు చరిత్ర పుస్తకములగును.

పుస్తకపు ముఖ్య భాగములు : ముఖ్యమైన వాక్యము, దేవాలయము సారాంశము: – దేవాలయమును తిరిగి కట్టుట, దైవ ప్రజల ఆత్మీయ, సమాజిక క్రమశిక్షణను సంస్కరించుట.

ముఖ్య వచనములు : ఎజ్రా 1:3; ఎజ్రా 7:10

ముఖ్యమైన అధ్యాయము : ఎజ్రా 6 దేవాలయము కట్టి ముగించిన తరువాత దాని ప్రతిష్ఠితను గూర్చి చెప్పు అధ్యాయము. ఇది పస్కా ఆచరించుటకు, అన్యజనుల అపవిత్రతను వదలి దేవునికి లోబడుటకు, లోబడి ఒక పరిశుద్ధ జీవితము జీవించుటకు ప్రజలు ప్రోత్సహింపబడిరి.

గ్రంథ విభజన : ఎజ్రా పుస్తకమును 2 పెద్ద భాగములుగా విభజించవచ్చును. 1 – 6 అధ్యాయముల వరకు ఉన్న మొదటి భాగము దేవాలయమును తిరిగి కట్టబడుటను గురించి, 7 – 10 అధ్యాయములలో ఉన్న రెండవ భాగం ప్రజల ఆత్మీయ సంస్కరణలను గురించి చెప్పుచున్నది.

కొన్ని క్లుప్త వివరణలు : పరిశుద్ధ గ్రంథములోని 15 వ పుస్తకము ; అధ్యాయములు 10; వచనములు 280; ప్రవచనములు లేవు; దేవుని నుండి ప్రత్యేక సందేశములు లేవు; వాగ్దానములు లేవు; ప్రశ్నలు 9; ఆజ్ఞలు 43.

Chronicles 2 – 2 దినవృత్తాంతములు

ఉద్దేశము : రాజులకు తీర్పునిచ్చే కొలబద్ద చూపించుచూ, నిజమైన ఆరాధనకు మనుష్యులను ఐక్యపరచుట, యూదాలోని నీతి మంతులైన రాజులను వారి యొక్క పరిపాలనలో జరిగిన ఆత్మీయ ఉజ్జీవమును చూపించుట. చెడు రాజుల పాపములను బహిరంగముగా చూపించుట.

గ్రంథకర్త : ఎజ్రా (యూదా పారంపర్య నమ్మకమును బట్టి).

కాలం : క్రీ.పూ. 430 ( సొలొమోను పరిపాలన ప్రారంభమైన క్రీ. పూ. 970 నుండి బబులోను చెర ప్రారంభమైన క్రీ.పూ. 586 వరకు జరిగిన సంఘటనలు వ్రాయబడినవి).

నేపథ్యము: ఒకటి, రెండు రాజుల రెండు పుస్తకముల ఉన్న చరిత్రను దినవృత్తాంతముల రెండవ పుస్తకములో వివరించుచున్నది. ఉత్తర భాగము ఇశ్రాయేలు అని దక్షిణ భాగము యూదా అని విభజింపబడిన దానిలో ఉత్తర ఇశ్రాయేలు దేశము మరియు అక్కడ ఏలిన రాజులను గురించిన చరిత్ర యించుమించు పూర్తిగా ఈ పుస్తకములో తీసివేయబడినది. ఈ పుస్తకము వ్రాయబడిన కాలంలో అధర్మం, విగ్రహారాధన వలన నాశనమైపోయిన ఆదేశములో యేదియును మిగలలేదు. దాని చరిత్రను వ్రాసి సమయమును వ్యర్థము చేయకూడదని గ్రంథకర్త తీర్మానము.

దీనికి బదులుగా దేవాలయమును కట్టుటకు అనుమతిని పొంది తిరిగి వచ్చిన దైవ ప్రజలైన యూదా ప్రజలకు ఆత్మీయ ప్రోత్సాహము ఇచ్చుటకు వారి గత కాలపు మహిమను గూర్చిన గర్వమును, భవిష్యత్తును గురించిన మంచి నమ్మికను వారిలో పెంచటానికి ఈ పుస్తకము ద్వారా గ్రంథకర్త ప్రయత్నిస్తున్నాడు. దైవభక్తి లో ఉన్నతముగా ఉండిన దావీదు రాజు కాలము తరువాత ఆయన వారసులుగా పరిపాలన సాగించిన ఎనిమిది మంది ఉత్తమమైన రాజుల చరిత్రను, వారి యొక్క సంస్కరణలను వివరించుటకు పుస్తకములోని అధిక భాగమును గ్రంథకర్త ఉపయోగించాడు. తమ దేశము స్థిరపరచబడుటకు దైవ ఆరాధన ప్రాధమిక పునాది అనుకొని గ్రంధకర్త యెరూషలేము దేవాలయ మహిమ అక్కడ జరిగిన ఆరాధనను నొక్కి చెప్పుచున్నాడు గ్రంథకర్త.

ముఖ్యవచనము : 2 దినవృత్తాంతములు 7:14

ముఖ్య వ్యక్తులు : సొలొమోను, షేబారాణి, రెహబాము, ఆసా, యెహోషాపాతు, యెరొబాము, యోవాషు, ఉజ్జియా, అహాజు, హిజ్కియా, మనషె, యోషియా.

ముఖ్యస్థలము : యెరూషలేము

గ్రంథ విశిష్టత : దేవాలయపు పనివివరములు వ్రాయబడినవి

గ్రంథ విభజన : (1). సొలొమోను పరిపాలనా కాలము : 1 నుండి 9 వరకు ఉన్న అధ్యాయములు, సొలొమోను పరిపాలనా కాలము సమాధానము, ధన సమృద్ధి, ఆరాధన అనువాటి యొక్క స్వర్ణయుగముగా ఉండినది. ఈ కాలములో యూదా ఐకమత్యములో, ధన సమృద్ధిలో ఉన్నత స్థానములో ఉండినది. సొలొమోను యొక్క ఐశ్వర్యము, జ్ఞానము, రాజభవనము, దేవాలయము అనునవి ఈ కాలములో ప్రఖ్యాతిగాంచినవి. ఈ భాగము యొక్క 9 అధ్యాయములలో మొదటి ఆరు అధ్యాయములు దేవాలయపు కట్టడపు పని, అర్పణ అనువాటిని కేంద్రముగా చేసుకున్నవి అనునది గమనించదగినది. (2). యూదా రాజుల యొక్క పరిపాలన : అధ్యాయము 10 – 36 వరకు దురదృష్టకరముగా ఇశ్రాయేలు మహిమ, ఐశ్వర్యము ఎక్కువ కాలము నిలువబడలేదు. సొలొమోను మరణము తరువాత అతని కుమారుడైన రెహబాము రాజు అయిన వెంటనే దేశము రెండుగా విడిపోయినది. విభజన ఫలితముగా ఏర్పడిన రెండు రాజ్యముల మధ్య పోరాటము వచ్చినది. కొంచెము కొంచెముగా తమ నాశనము దిగజారిపోయినవి. అప్పుడప్పుడు వచ్చిన కొందరు ఉత్తములైన యూదా రాజుల ఆత్మీయ సంస్కరణల వలన నాశనమగుటకు కొంచెము ఆలస్యయినది. యూదాను పరిపాలించిన 20 మంది రాజులలో 8 మంది ప్రజలను విగ్రహారాధన నుండి, క్రమశిక్షణా రాహిత్యము నుండి పైకి లేపుటకు ప్రయత్నించిరి. అయిననూ ఎవరి ప్రయత్నమైననూ ఒక తరము కంటె మించి నిలువబడినట్లుగా కనబడలేదు.

చివరిగా యోషియా తరువాత వచ్చిన నలుగురు రాజుల పాలన కాలములో దేశమునకు పూర్తిగా నాశనము వచ్చినది. మూడుసార్లు బబులోను రాజులు యూదా ప్రజలను, రాజులను చెరపట్టి తన దేశమునకు తీసుకువెళ్ళిరి. చివరిసారి అంటే క్రీ. పూ. 586లో యెరూషలేము నగరము, దేవాలయము పూర్తిగా నాశనమైనవి. అయినప్పటికిని 70 సంవత్సరముల బానిసత్వము తరువాత అప్పటి పారశీక రాజైన కోరెషు (ఈ విరామ కాలములో బబులోను రాజ్యము ముగింపై మాదీయ పారశీక సామ్రాజ్యము స్థాపించబడినది. యూదులు తమ దేశమునకు మరలుటకును, యెరూషలేము దేవాలయము కట్టుటకు, ఆజ్ఞాపించెను. “ఆయన ప్రజలందరిలో ఎవడు ఉన్నాడో వాడు వెళ్ళవచ్చును వాని యొక్క దేవుడైన యెహోవా వానికితోడై ఉండునుగాక” అనునది ఆజ్ఞ యొక్క సారాంశము.

క్లుప్త వివరణలు : పరిశుద్ధ గ్రంథములోని 14వ గ్రంథము ; అధ్యాయములు 36; వచనములు 822; చరిత్ర సంబంధమైన వచనములు 583; నెరవేరిన ప్రవచనములు 31; నెరవేరనివి 7; హెచ్చరికలు 42; ఆజ్ఞలు 45; వాగ్దానములు 8 ; దేవుని ప్రత్యేక సందేశములు 21; ప్రశ్నలు 47.

Chronicles 1 – 1 దినవృత్తాంతములు

సమూయేలు రెండవ గ్రంథము మొదలుకొని రాజులు రెండవ గ్రంథము వరకు చెప్పబడిన యూదా చరిత్ర యొక్క పలు కోణముల మరులిఖితమైయున్నది. అయినను ఇది మరొకసారిచెప్పుట కాదు. ఇశ్రాయేలు చరిత్రకు దేవుడు ఇచ్చిన ఒక వివరణ అని దీనిని చెప్పవచ్చు. రెండవ సమూయేలు, మొదటి, రెండవ రాజులు ఇశ్రాయేలీయుల సంపూర్ణ రాజకీయ చరిత్రగా కనబడుచుండగా, దావీదు నుండి ప్రారంభమైన యూదా రాజ కుటుంబమును మాత్రము ఒక మత చరిత్రగా దినవృత్తాంతముల పుస్తకములు వ్రాయబడినవి.

సమూయేలు, రాజులు అనే పుస్తకముల వలె ఈ పుస్తకములు కూడా హెబ్రీ భాషలో ఒకే పుస్తకముగా వ్రాయబడిననూ గ్రీకు “సెప్టోజెంట్ ” తర్జుమాలో రెండుగా విభజించబడినవి. దీని మొదటి పుస్తకములో దావీదు జీవిత చరిత్రను, రెండవ పుస్తకములో దావీదు నుండి ప్రారంభమైన యూదా రాజకుటుంబ చరిత్ర వరకు కనబడుచున్నది. దావీదు వంశావళి వివరణలో మొదటి పుస్తకము ప్రారంభమగుచున్నది. ఆయన యొక్క న్యాయపరిపాలన, ఆత్మీయ శ్రేష్ఠతను ప్రత్యక్షపరచి అది ముగియుచున్నది.

దినవృత్తాంతముల గ్రంథము హెబ్రీ గ్రంథములో చివరి పుస్తకములైనందున 1 నుండి 9 అధ్యాయములలో కనిపించే విశేష వంశావళి యొక్క వివరణ క్రొత్త నిబంధన యొక్క మొదటి పుస్తకములో కనిపిస్తున్నది. యేసుక్రీస్తు యొక్క వంశావళికి ప్రారంభమని చెప్పవచ్చును.

దినవృత్తాంతముల పుస్తకము హెబ్రీ భాష శీర్షికమైన “డిబారెహయామిమ్” అనుమాటకు అనుదిన కార్యక్రమములు అని అర్థము ఇది గ్రాహ్యమగునట్లుగా తెలుగులో తీసుకొనబడిన మాటే ఈ దినవృత్తాంతములు.

ఉద్దేశము : దేవుని ప్రజలను ఐక్యపరచడం, దావీదు వంశావళిని వ్రాయుట, సమాజములోను, వ్యక్తిగత జీవితములోను నిజమైన ఆరాధనకు ప్రథమ స్థానం ఇవ్వబడవలెనని చెప్పుట.

గ్రంథకర్త : ఎజ్రా, (యూదా పారంపర్య నమ్మికనుబట్టి)

వ్రాసిన కాలము : క్రీ.పూ. 430 (క్రీ.పూ. 1000 – 960 కాలములో జరిగిన సంఘటనలు వ్రాయబడినవి).

నేపథ్యము : రెండవ సమూయేలు వివరణగా ఈ పుస్తకమును చెప్పవచ్చును. యూదా మరియు ఇశ్రాయేలు మత చరిత్రకు దీనిలో ప్రాముఖ్యత ఇవ్వబడినది. చెర తరువాత ఒక మత గురువు (యాజకుని) నేతృత్వములో ఈ పుస్తకము వ్రాయబడినది.

ముఖ్యవచనము : 1 దినవృత్తాంతములు 14:2

ముఖ్యమైన వ్యక్తులు : దావీదు, సొలొమోను

ముఖ్య స్థలములు : హెబ్రోను, యెరూషలేము

గ్రంథ విభజన : బబులోను చెర నుండి తిరిగి వచ్చు వరకు ఇశ్రాయేలు గురించి మొత్తం చరిత్రకు ఇంకొక ప్రతి బింభముగా ఉన్నది. ఇశ్రాయేలులో తిరిగివచ్చిన శేష దైవ ప్రజలకు వారి యొక్క పాతకాలపు జీవితమును గురించిన ఒక ఆత్మీయ దృష్టిని ఇచ్చుటకు ఈ పుస్తకము వ్రాయబడినది. ఈ మొదటి పుస్తకము అంతయు సమూయేలు రెండవ పుస్తకము వలె దావీదు జీవిత చరిత్రను వివరించుటకు ఉపయోగపడుచున్నది. ఈ క్రింది విధముగా రెండు ముఖ్య భాగములను ఈ పుస్తకములో చూడవచ్చును.

(1). అధ్యాయము 1 నుండి 9 వరకు దావీదు వంశావళి పట్టిక. ఈ భాగములో దావీదు మరియు ఇశ్రాయేలీయుల పూర్వీకుల పారంపర్య ప్రారంభము నుండి ఇవ్వబడినది. పుస్తకము పూర్తిగా యూదా రాజ్య చరిత్రతో నిండిన యూదా, బెన్యామీను అను గోత్రములకే ముఖ్యత్వము ఇచ్చి ఈ పూర్వీకుల పట్టిక ఉద్భవించబడినది. ఈ పుస్తకములో యాజక ప్రాథమిక దృష్ట్యా లేవీ గోత్రమునకు ఉన్నతమైన స్థానము ఇవ్వబడినది.

(2). అధ్యాయము 10 – 29 వరకు. దావీదు జీవిత ముఖ్య సంఘటనలు వివరించు ఈ భాగములో సౌలుకు భయపడి ఆయన చేసిన అజ్ఞాత జీవితం, హెబ్రోనులో 7 సంవత్సరములు యూదా గోత్రమును మట్టుకు యేలినది. అనునవి విడువబడినవి. అదేవిధముగా బెత్సేబాతో దావీదు పడిపోయిన సంఘటనను ఈ గ్రంథకర్త వదిలివేసెను. దేవుని క్షమాపణ, ప్రేమ ఆశీర్వాదమహిమ అను వాటికి ముఖ్యత్వము ఇచ్చి చెర నుండి వచ్చిన దేవుని ప్రజలను విశ్వాసములోను, లోబడుటలోను, దేవుని భయంలోను దృఢపరచి స్థిరపరచవలెనన్న ఉద్దేశ్యముతో వదలవలసిన భాగములను వదిలి పెట్టి చేర్చవలసిన భాగములను చేర్చి పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి ఈ గ్రంథకర్త ఈ గ్రంథమును వ్రాశాడు. దేవుడు దావీదుకు దేవాలయము కట్ట అనుమతిని ఇవ్వకపోయినప్పటికి కట్టుడు పని నిమిత్తము సకల సిద్ధపాటులను ఆయన చేయగలిగెను. దావీదు యొక్క బహిరంగమైన స్తోత్రముతో, సొలొమోను సింహానాసీనుడయ్యే దృశ్యముతో ఈ పుస్తకము ముగింపగుచున్నది.

కొన్ని క్లుప్త వివరణలు : పరిశుద్ధ గ్రంథములో 13వ పుస్తకము ; అధ్యాయములు 29; వచనములు 942; చరిత్రకు సంభందించిన వచనములు 927; నెరవేరిన ప్రవచనములు 81; నెరవేరనివి 71; హెచ్చరికలు 30; ఆజ్ఞలు 53; ప్రశ్నలు 19; వాగ్దానములు 9; దేవుని సందేశములు 8.

Kings 2 – 2 రాజులు

వాగ్దానదేశములో నివాసమును స్థిరపరచిన దేవుని ప్రజల అంధకార దినములను గూర్చి రాజుల రెండవ పుస్తకము చిత్రించి చూపించుచున్నది. దేవునితో ఉన్న ఒడంబడికను దేవుని ఆజ్ఞలను మరచి విగ్రహారాధన చేసి చెడిపోయిన జీవితములో మునిగిపోయిన ప్రజల మీదికి వచ్చిన భయంకర న్యాయ తీర్పునే ఈ పుస్తకములో మనము చూచుచున్నాము. చివరి ఘట్టం వరకు ఇశ్రాయేలులోనూ, యూదాలోనూ పాలించిన రాజుల గురించిన దృశ్యములను మార్చి మార్చి చూపించుచున్నాడు గ్రంథకర్త.

ఇశ్రాయేలు, 19 మంది దుష్టపాలకుల పరిపాలన ముగిసిన తరువాత అపూరుకు బానిస అయినది. దీనితో పోల్చి చూసినపుడు యూదా చరిత్ర ఉన్నతముగా ఉన్నది అని చెప్పవచ్చును. అక్కడ అప్పుడప్పుడు దైవభక్తి కలిగిన కొందరు రాజులు లేచి తమ పితరులు నిలిపిన బలిపీఠములను, విగ్రహములను తీసివేసి ప్రజల జీవితమును చేతనైనంత వరకు పరిశుద్ధపరచ ప్రయత్నించిరి అయినప్పటికీ, చిట్టచివరికి నీతికి బదులు అధికముగా పాపము పెరిగి యూదారాజులు, దేశ ప్రజలు బబులోనుకు చెరగా వెళ్ళిరి.

కాలము : బబులోను చెరపట్టిన కాలమైన క్రీ. పూ. 586 కు ముందు రాజులును గూర్చి ఈ గ్రంథములో ఎక్కువ భాగము వ్రాయబడియుండవచ్చును. సొలొమోను మరణము, ఇశ్రాయేలు విభజన క్రీ.పూ. 930 సంవత్సరములో జరిగినది. ఐక్య ఇశ్రాయేలు రాజ్యము క్రీ.పూ. 1050 నుండి 930 వరకు 120 సంవత్సరములు నిలిచియుండినది. తదుపరి ఉత్తర ఇశ్రాయేలు రాజ్య ము క్రీ.పూ 930 నుండి 722 సంవత్సరముల వరకు 208 సంవత్సరములు కొనసాగినది. క్రీ.పూ 722 సంవత్సరములో అషూరు ఇశ్రాయేలును హస్తగతం చేసుకుని అనేకులైన ప్రజలను చెరగా తీసుకుని వెళ్ళినది. దక్షణ యూదా రాజ్యము దీని తదుపరి 136 సంవత్సరములు కొనసాగినది. క్రీ. పూ. 586 లో బబులోను చెర ద్వారా అది కూడా పతనమైనది. ఈ విధముగా క్రీ.పూ 1050 నుండి 586 వరకైన 464 సంవత్సరములు ఇశ్రాయేలు చరిత్రకాలములో ప్రపంచములో చాలా గొప్ప రాజకీయ మార్పులు చోటుచేసుకున్నవి. పాలస్తీనా భూభాగము పై అనేక సార్లు ఐగుపుకు, అషూరుకు మారిమారి అధికారము, పాలన ఉండినది. అప్పుడు విస్తరించిన అషూరు సామ్రాజ్యము కొంచెము కాలము తరువాత పతనమైనది. బబులోను దానిని తనలో విలీనం చేసుకున్నది.

ఉద్దేశ్యము : దేవుని న్యాయకత్వమును అంగీకరించుటకు సిద్ధమనస్సు లేని ప్రజల భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చూపించుట.

గ్రంథకర్త : యిర్మీయా

నేపథ్యము: ఒకే రాజ్యముగా ఉండిన ఇశ్రాయేలు దేశము విభజింపబడిన నూరు సంవత్సరముల తరువాత

ముఖ్య వచనములు : 2 రాజులు 17:22-23; 2 రాజులు 23:27

ముఖ్యమైన వ్యక్తులు : ఏలియా, ఎలీషా, షూనేమీయురాలు, నయమాను, యెజెబెలు, యెహూ, యోవాషు, హిజ్కియా, మనషేయోషియా, యెహోయాకీము,సేన్హేరీబు, యెషయా, సిద్కియా, నెబుకద్నేజరు.

పుస్తకము యొక్క ప్రత్యేకత : పాత నిబంధన చివరలో కనబడు 17 ప్రవచన పుస్తకములు రెండవ రాజుల పుస్తకముతో పోల్చి చూసి నేర్చుకొనదగినవి.

గ్రంథ విభజన : రాజులు రెండవ పుస్తకమును రెండు పెద్ద భాగములుగా విభజించవచ్చును. . 1. విడిపోయిన తరువాత ఏర్పడిన రెండు రాజ్యముల చరిత్ర. (1 – 17 అధ్యాయము) 2. అష్హురుతో యుద్ధము తరువాత నిలిచియున్న ఏక రాజ్య మైన యూదా చరిత్ర ( 18 – 25 అధ్యాయము).

ఇశ్రాయేలు పతనమునకు ఆరు సంవత్సరములకు ముందు హిజ్కియా యూదాకు రాజాయెను. ఆయన యొక్క మంచి దైవభక్తి చేసిన ఉజ్జీవ కార్యములు, వీటిని బట్టి దేవుడు యూదాను శత్రువుల నుండి విడిపించి వారికి ఐశ్వర్యమును, సుఖవంతమైన స్థితిని ఇచ్చెను. అయినప్పటికి హిజ్కియా కుమారుడైన మనషె కాలంలో దేశము చెడుతనములోకి తిరిగి కూరుకుపోయినది. మనషె యొక్క మనుమడైన యోషియా

మెచ్చుకొనదగిన, పరిశుద్ధపరచు కార్యముల వలన రావలసిన నాశనమును ఎన్నటెన్నటికి రాకుండా ఆపలేకపోయినది. యోషియా తరువాత వచ్చిన నలుగురు రాజుల కాలంలో బబులోను యొక్క తీవ్రమైన యుద్ధములు కొనసాగినవి. బబులోను రాజు మూడుసార్లు యూదులను చెరపట్టుకుని వెళ్ళెను. మూడవసారి యెరూషలేము నగరము, దేవాలయము నాశనమైనవి. చివరి ఘట్టములో యూదాలో మిగిలిపోయిన వారికి రాబోవు నిరీక్షణను చూపి, ఒప్పింపజేసి ఈ పుస్తకము ముగింపగుచున్నది. ఇశ్రాయేలులోనూ ఇంకా యూదాలోనూ రాజుల పరిపాలనా కాలయములో మనుష్యుల హృదయములను దేవుని వైపు త్రిప్పుటకు అనేక మంది ప్రవక్తలను దేవుడు తపెను, ఏలియా, ఎలీషా, ఆమోసు, హోషేయా అనువారు ఇశ్రాయేలులోను ఓబద్యా, యోవేలు, యెషయా, మీకా, నహూము, జెఫన్యా, యిర్మీయా, హబక్కూకు అనువారు

యూదాలో వారి సేవలను జరిగించిరి.

కొన్ని కుప్ల వివరములు : పరిశుద్ధ గ్రంథములోని 12వ పుస్తకము ; అధ్యాయములు 25; వచనములు 719; ప్రశ్నలు 118; చరిత్రకు సంబంధించిన వచనములు 560; నెరవేరిన ప్రవచనములు 58; నెరవేరనివి 1; హెచ్చరికలు 65; ఆజ్ఞలు 118; వాగ్దానములు 3; దేవుని సందేశములు

Kings 1 – 1 రాజులు

జ్ఞానులకు జ్ఞానియైన సొలొమోను రాజు పరిపాలన, ఆయన గొప్ప కార్యములను గురించి ఈ గ్రంథము యొక్క మొదటి భాగము చెప్పుచున్నది. సొలొమోను పరిపాలనా కాలము ఇశ్రాయేలు రాజ్యపు స్వర్ణ యుగముగా ఉండినది. శిల్పకళలో శ్రేష్టమైన గుర్తుగా యెరూషలేము దేవాలయము కట్టబడినది. అతని పాలనలో ఇశ్రాయేలు మహిమ చేరినది. దీనిని సొలొమోను యొక్క శ్రేష్టమైన కార్యముగా చెప్పవచ్చును. ప్రతి దినము రెండు లక్షల మంది పనివారు ఏడు సంవత్సరములు పనిచేసి ఈ దేవాలయమును కట్టిరి. గొప్ప జ్ఞానియూ, కవియూ అయిన సొలొమోను యొక్క జ్ఞానమును వినుటకును, ఆయన అంతఃపురము యొక్క మహాత్యమును చూచుటకు పలు దేశముల నుండి రాజులు, రాణులు యెరూషలేముకు వెళ్ళుట ఆనాటి అలవాటుగా ఉండినది.

అయినప్పటికి ఆయన వృద్ధాప్యము ఒక దుఃఖకరమైన స్థితికి సాక్ష్యమిచ్చినది. ప్రజల మధ్యలో అసంతృప్తి ఏర్పడినది. దేశములో విభజనలు, అంతర్గత కలహములు పెరిగినవి. మహిమ కలిగిన దేశము అతి త్వరగా చిన్నాభిన్నమైనది. ఈ నాశనమునకు కారణములు ఏమిటి అనేది చూద్దాం.

(1). ఆడంబర జీవితము, అనవసరమైన ఖర్చులు పెరిగి ప్రజలకు భారమాయోను. (2). రాజులందరు తమ నైపుణ్యము వలన జయించుటకు చేసిన ప్రయత్నముల మధ్య దేవుని కేంద్ర బిందువుగా చేయడం సొలొమోను మరచినాడు. (3). ఆయన వివాహ జీవితము సుఖభోగము యెక్క గుర్తుగా ఉండినది. ఆయన అంతఃపురంలో 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉండేవారు. ఆయన యొక్క అన్యులైన భార్యలు ఆయనను విగ్రహారాధనలోకి లాగిపడవేసిరి.

మహిమతో నిండిన యెరూషలేము దేవాలయమును కట్టిన రాజు విగ్రహారాధికునిగా మారుట ఎంత దుఃఖకరము. అయిననూ సొలొమోను జీవితములో ఇదే సంభవించినది.

ఉద్దేశ్యము : ఇశ్రాయేలు మరియు యూదా రాజుల చరిత్రను చెప్పుటతోబాటు, దేవుని ఆజ్ఞలు గైకొని నడుచువారిని, వాటిని మీరి నడచువారిని పోల్చి చూపించుట.

గ్రంథకర్త పేరు : యిర్మీయా

నేపథ్యము: ఇశ్రాయేలు దేశము విభజింపబడుచున్నది. లోక పరిస్థితిలో మాత్రము కాక, ఆత్మీయ స్థితిలోనూ వేరుపరచబడినది.

ముఖ్యవచనములు : 1 రాజులు 9:4-5

ముఖ్యమైన వ్యక్తులు : దావీదు, సొలొమోను, రెహబాము, యరొబాము, ఏలియా, ఆహాబు, యెజెబెలు.

ప్రత్యేకత : మొదటి, రెండవ రాజులు రెండూ కలిసి ప్రారంభములో ఒకే పుస్తకముగా ఉండినవి.

కాలము : క్రీ.పూ. 722 సంవత్సరంలో ఇశ్రాయేలు రాజ్యము ఆషూరు చెరకు, క్రీ. పూ. 586 సంవత్సరంలో యూదా రాజ్యము బబులోను చెరకు తీసికొనిపోబడుటకు కారణం లోబడకపోవడం, విగ్రహారాధన, చెడునడత అనునవే అని వివరించే అక్షరచిత్రముగా రాజుల పుస్తకములలో గోచరమగుచున్నవి. సొలొమోను రాజ్యమునకు వచ్చిన క్రీ. పూ. 970 నుండి అహజ్యా యొక్క పాలన ముగిసిన క్రీ. పూ. 853 వరకు ఉన్న 123 సంవత్సరాల చరిత్ర మొదటి రాజులు పుస్తకపు విషయ సూచికమగును. ఈ పుస్తకము క్రీ.పూ. 930 సంవత్సరమును గమనించేటట్లుగా చేయుచున్నది. సొలొమోను మరణించుటతోడనే దేశము రెండుగా విడిపోవుట ఈ సంవత్సరములోనే జరిగినది.

మహా గొప్ప జ్ఞానియూ, రాజకీయ చతురుడైన సొలొమోను వృద్ధాప్యములో ఒక బుద్దిహీనుడుగా ప్రవర్తించడం మనము చూస్తున్నాము. దీనిని బట్టి దేవుడు ఇశ్రాయేలు నుండి 10 గోత్రములను తీసి ఆయన సేవకుడైన ఇంకొకరికి ఇచ్చెను. పన్నును తగ్గించమని అడిగిన ప్రజలకు కఠినమైన జవాబు ఇచ్చిన రెహబాముకు రెండు గోత్రములు మాత్రమే ఇవ్వబడినవి. యూదా, బెన్యామీను గోత్రములే అవి. తక్కిన 10 గోత్రములు యరొబాముతో కలిసి ఉత్తర ఇశ్రాయేలు దేశముగా ఏర్పడినవి. అది ఆయనకు, అనుచరులకు సొంతమైనది.

గ్రంథ విభజన : ఈ పుస్తకమును తేటగా రెండు పెద్ద భాగములుగా విభజించవచ్చును.

ఒకటిగా కలిసిన ఇశ్రాయేలు దేశము (1 – 11 అధ్యా వరకు). 2. విడిపోయిన దేశము – ఉత్తర ఇశ్రాయేలు, దక్షిణ ప్రాంత యూదా (12 – 22 అధ్యా వరకు)
కొన్ని క్లుప్త వివరములు : పరిశుద్ధ గ్రంథములో 11వ పుస్తకము; అధ్యాయములు 22; వచనములు 816; ప్రశ్నలు 66; నెరవేరిన ప్రవచనములు 71; నెరవేరని ప్రవచనము 1; దేవుని సందేశములు 36; ఆజ్ఞలు 92; హెచ్చరికలు 73; వాగ్దానములు 6.

Samuel 2 – 2 సమూయేలు

సౌలుకు భయపడి మొదట యూదాలో, తరువాత ఫిలిప్తీయుల దేశములో దాగుకొని జీవించిన దావీదు, సౌలు మరణము తరువాత దేవుని ఆలోచన చొప్పున యూదాకు, తదుపరి ఇశ్రాయేలు దేశమంతటికి రాజై పరిపాలన చేసిన చరిత్రే సమూయేలు రెండవ పుస్తకము. దావీదు జీవిత చరిత్ర 1 రాజుల గ్రంథము మొదటి రెండు అధ్యాయముల వరకు కనబడినప్పటికీ, దావీదు యొక్క పరిపాలన గురించి ఎక్కువగా చెప్పిన గ్రంథము రెండవ సమూయేలు. దావీదు సింహాసనమును ఎక్కుట, చుట్టువున్న శత్రువుల మీద జయము పొందుట, చెదరిపోయే స్థితి నుండి ఇశ్రాయేలును స్థిరమైన దేశముగా రూపించుటకు ఆయన నాయకత్వము వహించుట మొదలగువాటిని గురించి ఈ గ్రంథము చెప్పుచున్నది. దావీదు యొక్క విజయాలను తెలుపుటతో పాటు, దిగజారిన స్థితిని కూడా నిజాయితీగా చిత్రించుటలో ఈ పుస్తకము ప్రత్యేకతను సంతరించుకొనినది. ఆయన జీవితమును పుట్టుకురుపు బాధించిన వ్యభిచారము, నరహత్య మొదలగు వాటి భయంకరమైన ప్రతిఫలములు ఆయన కుటుంబమును, దేశమును ఏలాగు కలవరపరచినవో ఈ గ్రంథములో చూడవచ్చును. గ్రంథము యొక్క పేరు, దానికి సంబంధించిన సమాచారము గురించి 1 సమూయేలు పరిచయములో చూడగలము. ఆ పుస్తకములో వ్రాయబడిన రాజ్య చరిత్ర కొనసాగింపే ఈ రెండవ పుస్తకములో చూచుచున్నాము.

ఉద్దేశము : 1. దావీదు పరిపాలనా కాలచరిత్రను చెప్పుటకు. 2. దేవుని పరిపాలన క్రింద ఎంత ఉన్నతముగా పాలన జరిగినదో చూపించుటకు. 3. ఒక వ్యక్తి ద్వారా మార్పులను తీసుకురాగలము అని చూపించుటకు. 4. దేవుని సంతోషపరచుటకు అవసరమైన గుణశీలములు ఏమిటి అని చూపించుటకు. 5. ఎన్నో కొరతలు ఉన్నా ఒక దేశములో మహా గొప్ప రాజుగా దావీదును చిత్రించి క్రొత్తది మరియు సంపూర్ణమైన ఒక దేశము

యొక్క మాదిరి గల నాయకుని రాబోయే క్రీస్తుని దావీదు మూలంగా ప్రతిబింబింపచేయుట (అధ్యాయము 7).

గ్రంథకర్త : యూదా పారంపర్యమునుబట్టి సమూయేలు, కానీ 1 దినవృత్తాంతములు 29:29 ప్రకారము నాతాను, గాదు అని కొందరు భావించుచున్నారు.

నేపథ్యము : దావీదు పరిపాలన క్రింద ఉన్న ఇశ్రాయేలు రాజ్యము.

ముఖ్యవచనములు : 2 సమూయేలు 5:12

గ్రంథ విశిష్టత : దావీదును అభిషేకించి దేవుని కొరకు జీవించ సలహానిచ్చిన సమూయేలు ప్రవక్త పేరు, ఈ పుస్తకమునకు ఇవ్వడినది.

సౌలు – దావీదు : సాధారణ గొర్రెలకాపరి స్థితి నుండి ఇశ్రాయేలీయుల శ్రేష్ఠుడైన రాజపదవికి దేవుడు తనను హెచ్చించెను అనునది దావీదు ఎప్పుడూ మరువలేదు. సౌలుకు, దావీదుకు మధ్య పోల్చి చూచి పరిశోధన జరిపితే ముఖ్యమైన వ్యత్యాసము బహిరంగపరచబడుట చూడగలము. ఇశ్రాయేలీయుల అతిచిన్న గోత్రము యొక్క సాధారణ కుటుంబములో నుండి దేవుడు తనను ఎన్నుకొన్నాడు అనే గహింపు ప్రారంభములో సౌలుకు ఉండినది. కానీ కాలము గడిచే కొలది తన పూర్వస్థితిని సౌలు మరచిపోయెను. దేవుని ఆజ్ఞలను విడచి అవిధేయత అనే పాపంలో దావీదు, సౌలు దాదాపుగా ఒకే విధముగా పడిపోయినప్పటికీ వారిద్దరూ తప్పు ఒప్పుకొనే స్థితిలో చాలా గొప్ప వ్యత్యాసమున్నది. సౌలు పాపములను ఒప్పుకొన్నప్పటికి ఒక నిజమైన పశ్చాత్తాపము ఆయనలో ఎన్నడూ ఏర్పడలేదు. దావీదైతే విరిగిన హృదయముతో దేవునికి మొఱ్ఱ పెట్టి, నిజమైన హృదయ మార్పుకు తనను తాను అప్పగించుకొనెను. అందువలన దావీదు దేవుని కృపను సంపాదించుకొనెను. వృద్ధాప్యంలో ఘనత, ఐశ్వరము కలిగి దావీదు మరణించగా, (1 దినవృత్తాంతములు 29:28) సౌలు సొంత ఖడ్గము మీదపడి భయంకరమైన మరణమును ఎదుర్కొనెను. (1 సమూయేలు 31:4)

గ్రంథ విభజన : ఈ గ్రంథమును మూడు పెద్ద భాగములుగా విభజింపవచ్చును. I. దావీదు పొందిన జయములు (1 – 10 అధ్యాయములు). 2. దావీదు యొక్క పాపం (11 అధ్యాయము). 3. పాప ఫలితము వలన దావీదు అనుభవించవలసిన శ్రమలు (12 – 24 అధ్యాయములు)

కొన్ని క్లుప్త వివరములు : పరిశుద్ధ గ్రంథములోని 10వ పుస్తకము : అధ్యాయములు 24; వచనములు 695; ప్రశ్నలు 125; చరిత్రకు సంబంధించిన వచనములు 679; నెరవేరిన ప్రవచనము 9; నెరవేరనివి 7; దేవుని సందేశములు 11; ఆజ్ఞలు 70; వాగ్దానములు 13; హెచ్చరికలు 25.

Samuel 1 – 1 సమూయేలు

ఇశ్రాయేలీయులులో దీర్ఘకాలము న్యాయాధిపతుల ద్వారా పరిపాలన చేసిన రాజ్యము తన స్థలమును ఖాళీ చేసి ఇచ్చే కాల మార్పునే ఈ మొదటి సమూయేలు పుస్తకము చెప్పుచున్నది. ఇశ్రాయేలీయుల రాజ్యమును గురించి చెప్పు ఆరు పుస్తకములు ఈ పుస్తకము నుండి ప్రారంభమగుచున్నవి. వీటి యొక్క విషయ సూచికలను చూద్దాము.

1 సమూయేలు – మనుష్యుని అర్హతలను బట్టి సరి అయిన రాజు – సౌలు.

2 సమూయేలు – ఆత్మీయ యోగ్యతలను బట్టి దేవుడు ఎన్నుకున్న రాజు – దావీదు.

1 రాజులు – సొలోమోను, ఇశ్రాయేలు.

2 రాజులు – ఇశ్రాయేలీయుల రాజవంశము.

1 దినవృత్తాంతములు – సొలొమోను, దేవాలయము.

2 దినవృత్తాంతములు – రాజంశములు, దేవాలయము.

ఇశ్రాయేలీయులలో 500 సంవత్సరాల రాజుల పాలన చరిత్ర ఈ పుస్తకము నుండి ప్రారంభమగుచున్నది. ఈ పుస్తకములో తలఎత్తి నిలువబడిన ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులను ఈ గ్రంథకర్త మన దృష్టికి తీసుకువస్తున్నాడు.

(1). చివరి న్యాయాధిపతియైన సమూయేలు. (2). మొదటి రాజైన సౌలు. (3). అభిషేకము పొందిన రాజు గా ఉండినప్పటికి 10 సంవత్సరాలు పారిపోయి దాగుకొనిన దావీదు.

జీవిత చరిత్రకు ఆకర్షణీయమైన వస్త్రములను ధరింపజేసి గ్రంథకర్త పొందుపరచాడు. అందరు ఇష్టపడు ఒక విషయము. సన్నివేశమును వివరించుట. క్రైస్తవ కుటుంబములలో పెరిగే చిన్న బిడ్డలు పిన్న వయసు నుండి వినే కథలుగా చిన్న సమూయేలు జీవితము (అధ్యా – 3), దావీదు – గొల్యాతును సంధించుట (అధ్యా 17), దావీదు యోనాతానుల స్నేహము (అధ్యా 18లో) కనబడుచున్నవి.

పుస్తకము యొక్క పేరు : హెబ్రీబైబిలులో సమూయేలు 1, 2 పుస్తకములు ఒకే సమూయేలు పుస్తకముగా కనబడుచున్నవి. సమూయేలు అను పేరునకు “దేవుని దగ్గర అడిగిపొందబడినవాడు” అని అర్థము. జీవితమంతటిని దేవుని కొరకు అప్పగించుకొనిన సమూయేలు, అన్నింటికంటే పైగా ఒక ప్రార్ధనా వీరుడుగా ఉన్నాడు. ప్రార్థనా శక్తికి మార్గము చూపించే ఒక పుస్తకముగా సమూయేలు గ్రంథము ఉన్నది. న్యాయాధిపతుల పరిపాలనలోని అంధకారయుగములో జీవించిన ఒక ప్రార్థనా పరురాలి చరిత్రతో ఈ పుస్తకము ప్రారంభమగుచున్నది. ఈ విధముగా దేవునిని అడిగి ఆమె పొందిన సమూయేలు ఏలీ ఎదుట యోహోవాను సేవించెను (1 సమూయేలు 3:1) దేవునికి ఉపయోగకరమైన పాత్రగా బాలుడైన సమూయేలు ఉన్నాడు. (1 సమూయేలు 3:1-19) దేవుని ప్రజలకు ప్రార్థన ద్వారా జయమును సంపాదించే ప్రవక్తగా సమూయేలు పెరిగెను. (1 సమూయేలు 7:5-10). తన ప్రజలు ఒక రాజు కొరకు అడిగినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసెను (1 సమూయేలు 8:6. ఈ విధముగా విజ్ఞాపన ప్రార్థన సమూయేలు యొక్క జీవితములో ముఖ్యమయిన భాగముగా ఉన్నది.

ఉద్దేశము : ఇశ్రాయేలీయుల చివరి న్యాయాధిపతి అయిన సమూయేలు జీవిత చరిత్ర, మొదటి రాజైన సౌలు పరిపాలనా మరియు పతనము, ఇశ్రాయేలీయుల మహోన్నతమైన రాజుగా దావీదును ఎన్నుకొనుట. తర్ఫీదు చేయుట యొక్క వివరములు.

గ్రంథకర్త : సమూయేలు (నాతాను, గాదు అనే ప్రవక్తల రచనలు కూడా ఉన్నవి. 1 దినవృత్తాంతములు 29:29.

గత చరిత్ర : న్యాయాధిపతుల కాలంలో ఈ పుస్తకము ప్రారంభమగుచున్నది. దేవుని పరిపాలన నుండి రాజుపాలనకు పరివర్తన చెందుటను గూర్చి వివరించుచున్నది.

ముఖ్యవచనములు : 1 సమూయేలు 8:7-9

ముఖ్యమైన వ్యక్తులు : ఏలీ, హన్నా, సమూయేలు, సౌలు, యోనాతాను, దావీదు.

గ్రంథ విభజన : సమూయేలు మొదటి పుస్తకమును మూడు భాగములుగా విభజింపవచ్చును.

సమూయేలు న్యాయము తీర్చిన కాలము ( అధ్యా 1-7); 2. సౌలు పరిపాలనా కాలము (అధ్యా 8 -15 ); 3. సింహాసనమును పొందిన దావీదు అజ్ఞాతవాస కాలము ( అధ్యా 16 -31) ఈ కాలములో సౌలు రాజుగా కొనసాగాడు గిల్బోవ పర్వత శిఖరమున సౌలు, అతని కుమారులు చనిపోయిన వెంటనే దావీదు తిరుగులాడిన కాలము ముగిసినది.
పుస్తకము యొక్క చివరి అధ్యాయములో (అధ్యా 31) నల్లని బట్టలు ధరించిన దుఃఖభరితమైన, కథ చాలా హీనమైన, పడిపోయిన దృశ్యమును చూచుచున్నాము. సొంతకత్తి మీదపడి చనిపోయిన సౌలు సొంత కత్తితో ఆత్మహత్య చేసికొని చనిపోయిన మనిషి యొక్క ప్రతిబింభమును అక్కడ చూచుచున్నాము. బంగారు యౌవనమో లేక సాధించిన గొప్ప విజయములో జీవితముగింపులో జయమునకు హద్దుగా ఉండవు. లోబడుటలో జీవిత ముగింపు వరకు నిలిచే వ్యక్తులే జీవ కిరీటమునకు యోగ్యులగుదురు. లోబడకపోవుట, గర్వం, అసూయ మొదలగు వాటికి, ఎరగా మారి నాశనమైన ఒక వ్యక్తి యొక్క విషాధమైన చిత్రముతో ఈ పుస్తకము యొక్క కథకు తెరదిగుచున్నది.

ఈ కొన్ని క్లుప్త వివరములు : 9వ పుస్తకము : అధ్యాయములు 31; వచనములు 810; ప్రశ్నలు 157; నెరవేరిన ప్రవచనములు 50; నెరవేరని ప్రవచనము 1; దేవుని యొద్ద నుండి ప్రత్యేక సందేశములు 29; వాగ్దానములు 4; ఆజ్ఞలు 117; హెచ్చరికలు 57.

Ruth – రూతు

న్యాయాధిపతుల యొక్క అంధకార యుగములో కల్తీలేని ప్రేమతో, నిష్కపట భక్తికి వర్ణకాంతులు విరజిమ్ముచున్న ఒక ఆదర్శ స్త్రీ చరిత్ర రూతు గ్రంథము. ఇశ్రాయేలు ప్రజలను, ఇశ్రాయేలు దేవుని ప్రేమించడానికి తన స్వజాతితో ఉన్న సంబంధములను, ఆచారములను త్రోసివేసి బెత్లెహేముకు వచ్చిన ఒక మోయాబు స్త్రీయే ఈ పుస్తకము యొక్క కథానాయకురాలు. బోయజు అనే ఉత్తమ భర్తను, ఓబేదు అనే మంచి కుమారుని ఆమె యొక్క భక్తి, ప్రేమ, దీనత్వము మొదలగు వాటికి బహుమతులుగా దేవుడు ఇచ్చెను. దావీదు రాజు తండ్రియైన యెష్షయి యొక్క తండ్రియే ఈ ఓబేదు. ఈ విధముగా ఆమె దావీదు పితరుల వంశావళి పట్టికలో స్థానం పొందినది. ఐక్యత అనే అర్ధమునిచ్చే “రియూత్ ” అనే హెబ్రీమాట యొక్క అర్థమే రూతు అను పేరు.

రూతు యొక్క కాలము: రూతు కథ నాలుగు రకములైన పరిస్థితులతో జరుగుచున్నది. రూతులో జరిగిన సంఘటనలు నాలుగు విభిన్న పరిస్థితులుగానుండెను. 1. మోయాబు దేశము (రూతు 1:1-18); 2. బెత్లెహేములో ఒక పంట పొలము (Ruth,1,19-2,23); 3. బెత్లెహేములోని ఒక ధాన్యపు కళ్లము (రూతు 3:1-18); 4. బెత్లెహేము నగరము (రూతు 4:1-21). ఇశ్రాయేలుకు పొరుగు రాజ్యమైన మోయాబు దేశము మృత సముద్రము యొక్క ఈశాన్యములో ఉన్నది. రూతు యొక్క మొదటి వచనము గత చరిత్రను స్పష్టీకరించుచున్నది. చూడండి, “న్యాయాధిపతులు యేలిన దినములయందు” (రూతు 1:1) విశ్వాసము, త్యాగము, యుద్ధము, క్రమశిక్షణా రాహిత్యము, అక్రమము, అరాచకము అనునవి రాజ్యమేలిన ఆ అంథకార యుగములో దేవుని ఆజ్ఞలను పట్టుదలతో వెంబడించిన ప్రజలు దేశములో ఉండినట్లుగా ఈ పుస్తకము దృఢపరచుచున్నది. ఆ ప్రత్యేక కాలమట్టము యొక్క చరిత్ర సందేశమును చెప్పుట మాత్రమే గాక, అందమైన ఒక సంభవమును చిత్రించుటకు ఈ పుస్తకము వ్రాయబడినది. కనుక దీని వర్తమానకాలమును గణించుట కఠినమైనది. కాని ముందుగా చెప్పిన నాలుగు పరిస్థితులను ప్రాథమికముగా పెట్టుకొని అది జరిగిన కాలమును మనము ఈ విధముగా గుర్తించవచ్చును. (1). రూతు 1:1-18 లోని దృశ్యము జరిగిన స్థలము మోయాబుదేశము, కాలము – సుమారు 10 సంవత్సరాలు. (2). Ruth,1,19-2,23 లోని దృశ్యము జరిగిన స్థలము – బేల్లెహేములోని ఒక పొలము, కాలము – సుమారు 1 నెల. (3). రూతు 3:1-18 లోని దృశ్యము జరిగిన స్థలము – బేబ్లె హేములోని ఒక కళ్లము, కాలము – ఒక రాత్రి. (4) రూతు 4:1-22 లోని దృశ్యము జరిగిన స్థలము – బెత్లెహేము నగరము. కాలము ఒక సంవత్సరము.

ఉద్దేశము: చుట్టు ఉన్నవారందరు తొట్రిపడిపోవుచున్నప్పుడును, శ్రేష్ట స్వభావములోను, దేవునితో ఉన్న యథార్ధ సంబంధములోను ఏవిధముగా స్థిరముగా నిలబడగలము అను చూపించుట కొరకు.

గ్రంథకర్త: పుస్తకములోని ఏ భాగములోను గ్రంథకర్తను గురించిన వివరములు లేవు. దీని గ్రంథకర్త రచించినది సమూయేలు అని కొందరు అభిప్రాయపడుచున్నారు. ఈ పుస్తకములో తేటగా చెప్పబడిన కొన్ని భాగములను బట్టి చూచినట్లయితే సమూయేలు మరణము తరువాత ఇది వ్రాయబడినది.

కాలము: న్యాయాధిపతుల కాలము. క్రీ.పూ. 1375 – 1050.

నేపథ్యము: తమ ఇష్టానుసారముగా జీవించిన ఇశ్రాయేలీయుల అంథకారయుగము. (న్యాయాధిపతులు 17:6) ముఖ్యవచనము: రూతు 1:16.

ముఖ్యమైన వ్యక్తులు: రూతు, నయోమి, బోయజు.

ముఖ్యమైన స్థలములు: మోయాబు, బెత్లెహేము.

గ్రంథ విభజన: 1. నయోమి మోయాబుకు వెళ్ళి నివశించుట, తిరిగి వచ్చుట. రూతు 1:1-22. 2. రూతు స్వీకరించబడినది Ruth,2,1-3,18. 3. బోయజు, రూతు రూతు 4:1-21.

కొన్ని క్లుప్త వివరములు: పరిశుద్ధ గ్రంథములో 8వ పుస్తకము ; అధ్యాయములు 4; వచనములు 84; ప్రశ్నలు 16; ప్రవచనములు లేవు. ఇశ్రాయేలీయులకు ఒక ప్రవక్త ద్వారా కూడా సందేశమును తీసుకురాని మొదటి పుస్తకము, ఆజ్ఞలు 30; వాగ్దానములు 2.

Judges – న్యాయాధిపతులు

యెహోషువ పుస్తకములో తేటగా చెప్పబడిన ఇశ్రాయేలీయుల పరిస్థితికి భిన్నమైన పరిస్థితిని చెప్పే పుస్తకమే ఈ “న్యాయాధిపతులు”. లోబడె గుణము కల్గిన ఒక సమూహము దేవుని శక్తిని ఆనుకొని కనానును జయించుట మనము యెహోషువలో చూస్తున్నాము. న్యాయాధిపతులలో లోబడని, విగ్రహారాధన చేయు ప్రజలు దేవునికి వ్యతిరేకముగా నిలుచుట వలన మరలా మరలా ఓటమి పొందిన దృశ్యమును చూస్తున్నాము. దేవుని ఆజ్ఞలను విడిచి పెట్టిన తరువాత తమ ఇష్టము చొప్పున నడచు ఈ ప్రజలు అనేక రకములైన జనాంగముల వలన హింసను, కౄరత్వమునకు బలైయ్యారు. సుమారు 350 సంవత్సరాల ఇశ్రాయేలీయుల చరిత్ర ఈ పుస్తకములో చెప్పబడుచున్నది. ఈ పరిస్థితుల మధ్య వారిని విడిపించుటకు పరాక్రమము గల నాయకులను దేవుడు లేవుచున్నాడు. ప్రతినాయకుని కాలంలో ప్రజలు పశ్చాత్తాపపడినప్పుడు, సమాజములో మంచి పరిపాలన సమాధానము స్థిరపరచబడుచున్నది. అయినప్పటికిని ఆ నాయకుల తరువాత మరలా వారు మహా గొప్ప దేవుని విడిచి పెట్టి పాపములోనూ, విగ్రహారాధనలోను పడిపోవుచుండిరి.

పుస్తకము యొక్క పేరు: హెబ్రీ పరిశుద్ధ గ్రంథములో ఈ పుస్తకమునకు ఇవ్వబడిన పేరుకు తెలుగు తర్జుమాయే “న్యాయాధిపతులు”. హెబ్రీ పరిశుద్ధ గ్రంథములో “షో పెట్రీమ్” అను పేరునకు న్యాయాధిపతి, ఏలువాడు, విమోచకుడు, రక్షకుడు అను అర్ధాలు ఉన్నవి. గ్రీకు బైబిలులో వాడబడిన “క్రిట్టాయి” అను పేరునకు కూడ న్యాయాధిపతులని అర్థము. “ ఓటమిపుస్తకము” అని కూడా ఈ పుస్తకమును పిలుస్తారు. న్యాయాధిపతుల పరిపాలనా కాలము: యెహోషువ మరణకాలంలో కూడా కనానులో ఆక్రమించుకొనవలసిన ప్రాంతములు ఇంకను అనేకం ఉండినవి. యెహోషువ క్రీ.పూ. 1390లో మరణించెను దానికి సుమారు 10 సంవత్సరములకు ముందు అంటే క్రీ.పూ. 1380 నుండి సుమారు. క్రీ.పూ. 1045 వరకు ఉన్న 335 సంవత్సరముల చరిత్రను ఈ న్యాయాధిపతుల గ్రంథము వివరించుచున్నది. ఒత్నీయేలు నుండి సంసోను వరకు 13 మంది, 1 సమూయేలులో మనము చూస్తున్న ఏలీ, సమూయేలు, యోవేలు, అబీయా అను నలుగురును చేర్చినయెడల మొత్తం 17 మంది. ఇశ్రాయేలులో న్యాయాధిపతులుగా పరిపాలన చేసిరి. సమూయేలు పుస్తకములో జరిగిన సంభవముల కాలమైన 30 సంవత్సరములను చేరిస్తే మొత్తము సుమారు 365 సంవత్సరములు ఇశ్రాయేలులో న్యాయాధిపతుల పరిపాలనా కాలమగును.

ఉద్దేశ్యము: దేవుడు పాపమును శిక్షించును అనేది ఖచ్చితము. అయినప్పటికి పశ్చాత్తాప పడువారిని క్షమించి, ఆయనతో ఉన్న సంబంధమును, నూతన పరచును అనే కార్యము దృఢపరచడమైనది.

గ్రంథకర్త: సమూయేలు

నేపథ్యము: తరువాత ఇశ్రాయేలుగా పిలువబడిన కనాను దేశము దేవునిని ద్వేషించువారు అనేక రాజ్యములుగా నున్న కనానును లోపరచుకొనుటకు దేవుడు ఇశ్రాయేలీయులకు సహాయము చేసెను. వారు దేవునికి లోబడనందున ఆదేశమును పోగొట్టుకునే పరిస్థితులలో వారున్నారు.

ముఖ్య వచనములు: న్యాయాధిపతులు 17:6

ముఖ్యమైన వ్యక్తులు: ఒత్నీయేలు, యెహూదు, దెబోరా, గిద్యోను, అబీమెలెకు, యెఫ్తా, సంసోను, దెలీలా.

పుస్తకము యొక్క ప్రత్యేక: ఇశ్రాయేలు దేశములో మొట్టమొదటి అంతర్గత యుద్ధమును తెలియజేయుచున్నది.

గ్రంథ విభజన: 1. న్యాయాధిపతుల దినములలో నున్న పరిస్థితులు Judg,1,1-3,6; 2. ఇశ్రాయేలీయులను శ్రమపరచిన రాజ్యములు, Judg,3,7-16,31; 3. విగ్రహారాధన, దేశీయ అంతర్గత యుద్ధము Judg,17,1-21,25

కొన్ని క్లుప్త వివరములు: పరిశుద్ధ గ్రంథములో 7వ పుస్తకము ; అధ్యాయములు 21; వచనములు 618; చరిత్రకు సంబంధించిన వచనములు 585; నెరవేరిన ప్రవచనములు 33; ప్రశ్నలు 92; దేవుని ప్రత్యేక సందేశములు 23; ఆజ్ఞలు 71; హెచ్చరికలు 26; వాగ్దానములు 5.

తుది కూర్పు: న్యాయాధిపతులు 17 నుండి 21 వరకు ఉన్న అధ్యాయములు ఈ పుస్తకము యొక్క తుది కూర్పుగా చెప్పవచ్చును. దేవుని విడిచి స్వంత మార్గములకు తిరిగి ఇశ్రాయేలీయుల అంతర్గత కలహమును, క్రమశిక్షణను మీరిన భయంకర స్థితిని మనము చూస్తున్నాము. న్యాయాధిపతులు 19లో చూచిన విధముగా క్రమశిక్షణలేని హీనమైన జీవితము బైబిలులోని వేరే భాగములలో ఎక్కడైనా చూడవచ్చునా అని సందేహముగా ఉన్నది. పాపము ఎక్కువైన స్థలములో దేవుని కృప కూడా ఎక్కువగుట అనే దేవుని సత్యమును జరిగిన సంగతుల మూలముగా మనము అర్ధము చేసుకొనవచ్చును.

Joshua – యెహోషువ

మోషే యొక్క పంచకాండములకు తరువాత యెహోషువ మొదలుకొని ఎస్తేరు గ్రంథము వరకు ఉన్న 12 చరిత్ర పుస్తకములు బైబిలులోని రెండవ భాగము అని చెప్పవచ్చును. వాటిలో మొదటి పుస్తకమైన యెహోషువ పంచకాండముల పుస్తకములను, ఇశ్రాయేలీయుల చరిత్రను కలుపుచున్నది.

మూడు ముఖ్యమైన యుద్ధముల ద్వారా కనానును జయించుట ఈ పుస్తకము యొక్క సారాంశము. యెహోషువ నాయకత్వంలో దాదాపుగా 30 శత్రు సేనలను ఇశ్రాయేలీయులు జయించిరి. జయము అనునది సైన్యము యొక్క బలము వలన కాదుగాని, దానికి బదులుగా దేవుని మీద ఉన్న విశ్వాసము, దేవుని వాక్యమునకు లోబడుట ద్వారా సాధ్యము అని ఈ పుస్తకము నిరూపించుచున్నది. దీనివలె ధైర్యమును ప్రోత్సాహము, దైవజ్ఞానమును ఇచ్చు పుస్తకము పాత నిబంధనలో ఇంకొకటి లేదు అని చెప్పవచ్చును. పుస్తకము యొక్క పేరు: పుస్తకము యొక్క ముఖ్యమైన వ్యక్తి అయిన యెహోషువ పేరే ఈ పుస్తకమునకు పెట్టుట గమనించదగినది. యెహోషువ యొక్క మొదటి పేరు హోషేయా (Num13 8). “రక్షణ” అనునది ఈ పేరుకు అర్ధము. మోషే ఆ పేరును యెహోషువ అని మార్చినాడు. సంఖ్యాకాండము 13:16, “యెహోవాయె రక్షణ” అనునది దీని అర్ధము. గ్రీకు భాషలో యేసు అనునదే హెబ్రీభాషలో యెహోషువ. కనానును జయించే పనిలో ఇశ్రాయేలీయుల నాయకునిగా యెహోషువ ఉన్నప్పటికి నిజమైన జయశీలుడు దేవుడే అని ఈ పుస్తకము చెప్పుచున్నది.

భౌగోళిక పరిస్థితి: యెహోషువ పుస్తకములో మనము మూడు భౌగోళిక పరిస్థితులను చూచుచున్నాము. అవి యొర్దానునది, కనాను దేశము, 12 గోత్రములు నివసించిన స్థలములు.

ఉద్దేశము: ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశమును స్వతంత్రించు కొనుటను వివరించుట

గ్రంథకర్త: యెహోషువ (చివరి భాగమును ఆయనతో ఉండిన ఫీనెహాసు వ్రాసియుండవచ్చును).

గతచరిత్ర: వాగ్దాన దేశమైన కనాను (ఇప్పటి ఇశ్రాయేలు దేశము).

ముఖ్యమైన వ్యక్తులు: యెహోషువ, రాహాబు, ఆకాను, ఫీనెహాసు, ఎలియాజరు.

ముఖ్యమైన స్థలములు: యెరికో, హాయి, ఏబాలు పర్వతము, గెరిజీము కొండ, గిబియోను, గిల్గాలు, షెకేము. ప్రత్యేకత: 20 లక్షల కంటె ఎక్కువ మంది ఐగుప్తు నుండి బయలుదేరినప్పటికి 20 సంIIలకు పైనున్న వారిలో యెహోషువ, కాలేబు మాత్రమే వాగ్దాన దేశములోనికి అడుగిడిరి.

పుస్తకము యొక్క ముఖ్య భాగములు: స్వతంత్రించు కొనుట అనునది ఈ గ్రంథము యొక్క ప్రాముఖ్యమైన మాట. ఇంకా ముఖ్యమైన భాగములు యెహోషువ 1:2-3; యెహోషువ 1:8; యెహోషువ 11:23; యెహోషువ 23:14

యెహోషువ గ్రంథములో 24వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది. యెహోషువ చివరి సందేశమును విన్న ఇశ్రాయేలీయులు దేవునితో నిబంధన చేయుట. యెహోషువ మరణము, పాతి పెట్టుట అనునవియే ఈ అధ్యాయము యొక్క ముఖ్యాంశములు.

గ్రంథ విభజన: యెహోషువ గ్రంథమును రెండు పెద్ద భాగములుగా విభజింపవచ్చును.

1 వాగ్దాన దేశమును జయించుట, Josh,1,1-13,7 వరకు 2 వాగ్దాన దేశమును పంచి గోత్రములను నివసింపచేయుట Josh,13,8-24,33 వరకు

ఈ భాగములలో కనబడే అంశముల విషయ సూచిక ఈ క్రింద ఇవ్వబడుచున్నది.

సైన్యమునకు కావలసిన ఆత్మీయత మరియు లోక సంబంధమైన సిద్ధపాటు 1 – 5 అధ్యాయములు, మోషే యెహోషువకు ఇచ్చిన ఆలోచనలు వేగుచూచుట, మొర్దాను, నూతన తరము వారి సున్నతి ఆచారములు ఈ భాగములో ఉన్నవి. మధ్య కనాను మీద యుద్ధమునకు పోవుట Josh,6,1-8,35 వరకు. దక్షిణ కనాను, ఉత్తర కనానుల మీద యుద్ధము చేయుట Josh,9,1-13,7 వరకు. పంచి పెట్టుట, నివాస స్థలము ఏర్పాటు చేయుట Josh,13,8-24,33 వరకు. ఈ భాగములో గోత్రము గోత్రముగా నివసించవలసిన స్థలములు వివరించుటలో కాలేబుకు హెబ్రోను కొండ ఇచ్చుట, ఆశ్రయ పురములను ఎన్నుకొనుట, లేవీయుల నగరములు, యెహోషువ చివరి సందేశము, మరణము, పాతి పెట్టబడుట మొదలగునవి చెప్పబడినవి.

కొన్ని క్లుప్త వివరములు: పరిశుద్ధ గ్రంథములోని 6వ పుస్తకము, అధ్యాయములు 24; వచనములు 658; చరిత్రకు సంబంధించిన వచనములు 624; నెరవేరిన ప్రవచనములు 42; ప్రశ్నలు 21; దేవుని సందేశములు 14; ఆజ్ఞలు 98; హెచ్చరికలు 44; వాగ్దానములు 15.

Deuteronomy – ద్వితీయోపదేశకాండము

120 సంవత్సరాల వృద్ధుడైన మోషే 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణమును ముగించాడు. వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనడానికి సిద్ధముగా ఉన్న రెండవ తరము వారైన ఇశ్రాయేలీయులను పంపడానికి అతడు ఇచ్చిన సందేశమే ద్వితీయోపదేశకాండము. లేవీయకాండమువలె ఈ పుస్తకములో పెద్ద ఆజ్ఞల పట్టికను చూడవచ్చును. కాని లేవీయకాండములో ముఖ్యముగా యాజక వంశముతో మాట్లాడినట్లుగా ఇక్కడ సాధారణ ప్రజలతో మాట్లాడుచున్నాడు. వారిముందు తరమువారి భయంకర నాశనమునుండి పాఠము నేర్చుకొనునట్లును, లోబడుటలో ఉన్న గొప్పతనమును అర్ధము చేసుకొనునట్లును మోషే పిలుపునిచ్చుచున్నాడు. ఈ పుస్తకములో ఆజ్ఞల యొక్క బంధకాలను చూడకుండ దేవుని వాక్యములోని మాధుర్యాన్ని దర్శించుచున్నాము అనునదే ఈ పుస్తకము యొక్క ప్రాముఖ్యతగా ఉన్నది. లోబడుట ద్వారా వచ్చు ఆశీర్వాదమును లోబడక పోవుట ద్వారా వచ్చు శాపమును వివరించుటకే ఈ పుస్తకము వ్రాయబడినది.

ద్వితీయోపదేశకాండము – క్రీస్తు: ప్రభువు (క్రీస్తు) తరచుగా ఈ పుస్తకములోని లేఖన భాగములను ఉపయోగించేవాడు. సాతానుతో పోరాడుటకు ప్రభువు ఉపయోగించిన మూడు వచనములు ద్వితీయోపదేశ కాండము నుండి తీసుకొనబడినవే. (మత్తయి 4:-10). పరిత్యాగ పత్రికను గురించి యూదులతో మాట్లాడేటప్పుడు, ధర్మశాస్త్రములోని ప్రధానమైన ఆగ్నేమిటి అని ప్రశ్న వేసినప్పుడు ప్రభువు ఎత్తిచూపినవి ఈ పుస్తకములోని వచనములే (మత్తయి 19:3-8; మత్తయి 22:30-40)

పుస్తకము యొక్క పేరు: హెబ్రీ భాషలో ఈ పుస్తకము హార్టేబరీమే అనే మాటతో ప్రారంభమగుచున్నది. “ఆ వాక్యములు” అని అర్ధమునిచ్చే, ఆ మాటే పుస్తకము యొక్క పేరుగా ఇయ్యబడినది. మోషే యొక్క ఆ మాటలే దేవుడిచ్చిన ధర్మశాస్త్ర వాక్యములే అని ఈ మాట చూపించుచున్నది. సీనాయి పర్వతమునందు ఇవ్వబడిన ధర్మశాస్త్రమును తిరిగి చెప్పే పుస్తకము అను సందర్భములో ద్వితీయోపదేశకాండము అనే పేరు తెలుగులో ఇవ్వబడుట బహుసరిగా నున్నది.

సమకాలీన పరిస్థితులు: యెరికోకు, యొర్దాను నదికి తూర్పున వున్న మోయాబు మైదానములో జరిగిన సంగతులు ఈ పుస్తకములో చూపించ బడుచున్నవి. ఈ సంగతులన్ని సుమారు రెండు నెలలలో జరిగినవని అనుకొనవచ్చును. దీనిలో రెండవ నెల మోషే గురించి ఇశ్రాయేలీయులు ప్రలాపించిన దినములుగా ఉన్నవి దానిని విడదీస్తే అరణ్య ప్రయాణము చివరి ఒక నెలలో (క్రీ.పూ 1405) దీనిలో చెప్పబడిన ముఖ్యమైన సంగతులు జరుగుచున్నవి. ద్వితీయోపదేశకాండము 1:3; ద్వితీయోపదేశకాండము 34:8; యెహోషువ 5: 6-12, ఈ వాక్యభాగములను పోల్చి చూస్తే ఇది తేటపడుతుంది. క్రొత్త తరము కనానులో ప్రవేశించుటకు సిద్ధమగుచున్న సమయములో, వారు దేవుని విశ్వసించి, లోబడి దైవీక ఆశీర్వాదములను స్వతంత్రించుకొనవలెననే లక్ష్యంతో వ్రాయబడిన పరిశుద్ద పుస్తకముగా దీనిని ఎంచవచ్చును.

ఉద్దేశము: దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు చేసినవి మరలా వారికి జ్ఞాపకము చేయుట, వారిని మరలా ఒక అర్పణకు ప్రోత్సాహించుట.

గ్రంథకర్త: మోషే (మోషేమరణము తరువాత మిగిలిన భాగమును యెహోషువ వ్రాసినట్లుగా చెప్పబడుచున్నది)

ఎవరికి వ్రాసిరి: వాగ్దానదేశములో ప్రవేశించడానికి సిద్ధముగా ఉన్న నూతన ఇశ్రాయేలు సంతతికి

కాలము: క్రీ.పూ 1405

గత చరిత్ర: యోర్దానునది తూర్పు ప్రాంతము

ముఖ్యవచనము: ద్వితీయోపదేశకాండము 7:9

ముఖ్యమైన వ్యక్తులు: మోషే, యెహోషువ

ముఖ్యమైన స్థలాలు: మోయాబు దేశములోని అరాబా మైదానము.

గ్రంధ విభజన: ముందు సీనాయిపర్వతము మీద దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రమును పోలిన మాదిరిగా మోషే ఇచ్చిన మూడు సందేశములే ఈ పుస్తకములోని ముఖ్యాంశములు

మొదటి సందేశములో Deut,1,1-4,43 వరకు దేవుడు తన ప్రజల కొరకు చేసిన కార్యములు. 2.రెండవదిగా Deut,4,44-26,19 వరకు దేవుడు వారి దగ్గర నుండి ఎదురుచూచిన కార్యములు. 3.మూడవదిగా ద్వితీయ 27వ అధ్యాయము నుండి 33వ అధ్యాయము వరకు భవిష్యత్తులో దేవుడు వారి కొరకు చేయ నిశ్చయించినవి మోషే చెప్పుచున్నాడు. ఈ విధముగా మోషే దేవుని ధర్మశాస్త్రమును ఎత్తి చూపి, వివరించి, స్థిరపరచుచున్నాడు.
కొన్ని క్లుప్తమైన వివరములు: పరిశుద్ధ గ్రంథములోని ఐదవ పుస్తకము, అధ్యాయములు 34; వచనములు 958; ప్రశ్నలు 33; చరిత్రకు సంబంధించిన వచనములు 690; నెరవేరిన ప్రవచనములు 230; నెరవేరనివి 37; దేవుని సందేశములు 33; ఆజ్ఞలు 519; వాగ్దానములు 47; హెచ్చరికలు 497.

Numbers – సంఖ్యాకాండము

ఇశ్రాయేలీయులు అవిశ్వాసము, అవిధేయత వలన దాదాపుగా 40 సంవత్సరాలు అరణ్యములో సంచరించిన చరిత్రనే సంఖ్యాకాండము చెప్పుచున్నది. హెబ్రీమూల భాషలో దీనికి చెప్పబడిన మొదటి మాట వాక్వేతెబర్ (చెప్పబడినది) అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ అని దాని అర్ధము. ఆజ్ఞ అరణ్య ప్రయాణం ప్రారంభంలోనే ఇశ్రాయేలీయులలో యుద్ధమునకు వెళ్ళుటకు అర్హులు ఎంత మంది అని లెక్కించి తీర్మానించాలి. దాదాపుగా 38 సంవత్సరముల తరువాత రెండవ సారి ఒక లెక్కింపు జరిగినది. అప్పుడు వారి అరణ్య ప్రయాణపు చివరి ఘట్టములో మోయాబు మైదానములోనికి వచ్చిరి. ఆ సమయములో మోషే ఎదుట ఉన్నవారిలో ఇద్దరు తప్ప తక్కిన వారంతా రెండవ తరమువారు. ఈ రెండు లెక్కింపులు ఈ పుస్తకము యొక్క పేరుకు బలమునిచ్చేవిగా నున్నవి. జన సంఖ్య లెక్కింపులో నేర్చుకొనవలసిన శ్రేష్ఠమైన పాఠం ఒకటున్నది. మొదటి లెక్కింపు జరిగినపుడు యుద్ధవీరులుగా లెక్కించబడినవారు ఆరు లక్షలుకు పైగానున్నారు. వారందరు అరణ్యములో రాలిపోయిరి. ఏదేమైనప్పటికి కనానులో కాలు మోపే సమయమునకు ఇంకొక ఆరు లక్షలకు పైగా యుద్ధవీరులు యుద్ధ భూమిలోనికి దుమికిరి. దేవుని యొక్క ఉద్దేశ్యములు ఎల్లప్పుడు సరిఅయిన సమయములో నెరవేరును. దానిని ఎవరు అడ్డుకొనలేరు.

అధిక సంచార పయనం : కాదేషు బర్నేయలో నుండి కనాకు వెళ్ళుటకు పదకొండు దినముల ప్రయాణము చాలును. దానికి బదులుగా 38 సంవత్సరాలు అరణ్యమార్గమున సంచరించి కష్టములు అనుభవించిరి. దేవుడు 95 కీర్తనలోని రెండు వచనములలో ఇశ్రాయేలీయుల క్లిష్ట పరిస్థితిని గూర్చి చెప్పెను నలువది యేండ్ల కాలము ఆ తరమువారి వలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలిసికొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి – వీరెన్నడును నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని. (కీర్తనల గ్రంథము 95:10-11)

అన్ని పాపములకు నివాసం అవిశ్వాసమే. దాని ఫలితం సర్వనాశనమని హెబ్రీ గ్రంథకర్త ఈ చరిత్రను జ్ఞాపకము చేసికొని 3, 4 అధ్యాయములలో విశదీకరించెను. ఈ విధంగా దేవుని ప్రజల మధ్యకు వచ్చిన అవిశ్వాసము అనే పాపము విపత్తులకు విత్తనములు విత్తినది. వారు అరణ్యములో చనిపోయిరి. ప్రధానయాజకుడైన అహరోను ఆయన సహోదరి మిర్యాము వాగ్దాన దేశమును చూడకుండా పోయిరి. మోషే ప్రజలను బట్టి విసుగుచెంది కోపగించుకుని దేవుని ఎదుట పాపము చేయడం జరిగినది. సీను అరణ్యములో నీరులేకజనులు సణిగినపుడు నీరు ఇమ్మని బండతో మాట్లాడమని దేవుడు ఆజ్ఞాపించెను. మోషే రెండు మారులు బండను కొట్టెను. కాబట్టి వాగ్దాన దేశమును చూడటం మాత్రమే గాని, దానిలో నీవు కాలు పెట్టవు అని దేవుడు చెప్పెను. మోషే పిస్గా కొండ శిఖరమున మరణించెను. సంఖ్యాకాండము 26 నుండి 33 వరకు ఉన్న అధ్యాయములలో మోయాబు మైదానములోనికి వచ్చిన క్రొత్త తరము వారు కనానును స్వతంత్రించుకొనుటకు దేవుడు వారిని స్థిరపరచడాన్ని చూస్తున్నాము. దేవుని దీర్ఘశాంతము, నమ్మకత్వము ఇక్కడ ప్రత్యక్షమగుచున్నది. యెహోషువ మోషేకు బదులుగా దేవుని ప్రజల నూతన నాయకునిగా అభిషేకం చేయబడడం ఇక్కడ చూడవచ్చును.

ఉద్దేశ్యము : వాగ్దాన దేశములోనికి ప్రవేశించుటకు ఇశ్రాయేలీయులు ఏలాగు తెగించిరి? వారి యొక్క పాపము ఏలాగు శిక్షించబడినది? వారు ఇంకను ప్రవేశింప ఏలాగు ప్రయత్నించిరి?

గ్రంథకర్త : మోషే

కాలము : క్రీ.పూ 1450 నుండి 1410

గతచరిత్ర : సీనాయి ప్రాంతపు పెద్ద యిసుక ఎడారి కనానుకు ఈశాన్యములో ఉన్న ప్రాంతము.

ముఖ్య వచనములు : సంఖ్యాకాండము 14:22-23; సంఖ్యాకాండము 20:12.

ముఖ్యమైన వ్యక్తులు : మో షే, అహరోను, మిర్యాము, యెహోషువ, కాలేబు, ఎలియాజరు, కోరహు, బిలాము.

ముఖ్యమైన స్థలములు : సీనాయి పర్వతము, వాగ్దాన దేశమైన కనాను, కాదేషు బర్నేయ, హోరేబు కొండ, మోయాబు మైదానము.

గ్రంథ విభజన : సంఖ్యా కాండమును మూడు ముఖ్యమైన భాగములుగా విభజించవచ్చును. 1. ప్రయాణమునకైన సిద్ధపాటు ప్రయాణ ప్రారంభము 1 – 13 అధ్యాయములు, 2. అవిశ్వాసము వలన తిరుగులాడిన స్థితి 14 – 25 అధ్యాయములు, 3. కనానును ఆక్రమించుకున్న క్రొత్త తరమును సిద్ధపరచుట 26 – 36 అధ్యాయములు

కొన్ని క్లుప్తమైన వివరములు : పరిశుద్ధ గ్రంథములో నాలుగవ గ్రంథము; అధ్యాయములు 36; వచనములు 1288 ; ప్రశ్నలు 59 ; నెరవేరిన ప్రవచనములు 42; నెరవేరని ప్రవచనములు 15; దేవుని సందేశములు 72; ఆజ్ఞలు 554 ; వాగ్దానములు 5; హెచ్చరికలు 79.

Leviticus – లేవీయకాండము

ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశమును విడిచి సాగిపొమ్మని దేవుడు వారికి ఆజ్ఞాపించిన తరువాత, విడుదల పొందిన ఆ జనులను దేవునిలో కేంక్రరింపబడే ఒక జనసమూహముగా చేయుట అవశ్యకమై యున్నది. వారిని ఎల్లప్పుడు సేవించు ప్రజలుగా ఆయన నియమించెను. ఈ విధముగా వారు దేవుని ఎలా సేవించాలి? ఎలా ఆరాధించాలి? ఆయనకు లోబడి ఎలా జీవించాలి? అని మోషే ద్వారా యెహోవా దేవుడు ఆజ్ఞలను వివరించి చెప్పెను. ఈ ఆజ్ఞల సంపుటియే లేవీయకాండము. ఈ ఆజ్ఞలను గైకొనుటయే దీని యొక్క ప్రాముఖ్యాంశము. ఇశ్రాయేలీలు ప్రజలకు అనగా తన జనులకు దేవుడు దయచేసిన ఒక చరిత్రాత్మిక పుస్తకమే ఈ లేవీయకాండము.

ఒక యూదబాలుడు తన జీవితములో మొట్టమొదటిగా నేర్చుకొనవలసిన పుస్తకమే ఈ లేవీయకాండము. ఇందులోనున్న ఒక్కొక్క దృశ్యభాగము రాబోవు కాలములో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు చేయదలచిన మానవాళి రక్షణ కొరకైన కార్యమును వ్రేలెత్తి చూపిస్తున్నది. ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండమను ఈ మూడు పుస్తకములు మానవుని క్రమశిక్షణ, దైవికమైన మూడు పద్ధతులను వివరించుచున్నవి. ఆదికాండములో – నశించిపోయెడి మానవుని గురించి, నిర్గమకాండములో – రక్షింపబడిన మానవుడు, లేవీయకాండములో – ఆరాధించునట్టియు, గైకొనునట్టియునైన మానవుని గురించి మనము చూడగలము.

ఉద్దేశ్యము : యాజకులకు ఆరాధన సంబంధమైన కర్తవ్యములు, హెబ్రీయులకు పరిశుద్ధ జీవితమును జీవించు మార్గములను నిర్దేసిస్తున్నది.

గ్రంథకర్త : మోషే

కాలము : క్రీ.పూ 1446 – 1445

గతచరిత్ర : సీనాయి పర్వతము. ఇశ్రాయేలు జనాంగము ఏవిధముగా ఒక పరిశుద్ధమైన ప్రజలుగా జీవితమును జీవించుటను గురించి దేవుడు వారికి నేర్పించిన విధము.

ప్రాముఖ్యమైన వచనములు : లేవీయకాండము 19:2; 17 11; 20 7-8.

ప్రాముఖ్యులు : మోషే, అహరోను, నాదాబు, ఎలియాజరు, ఈతామారు.

ముఖ్యస్థలములు : సీనాయి పర్వతము.

గ్రంథ విశిష్టత : పరిశుద్ధతను గురించి ఏ పుస్తకములో లేని విధముగా ఈ పుస్తకమందు అతిపరిశుద్ధతను గురించి 152 సార్లు చెప్పబడినది. పాత నిబంధన గ్రంథకాలములో వేరే దేశములతో ఉన్న నియమ నిబంధనలతో పోల్చి చూచినట్లయితే దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞల యొక్క సత్య విలువను గ్రహించగలము. ప్రత్యక్ష సాక్ష్యముగా నిర్గమకాండము 20వ అధ్యాయములో చూడగలము. “దొంగిలింపబడిన దాని విషయం” అనే ఆజ్ఞను గమనించినట్లయితే దొంగ దొంగిలింపబడిన వస్తువును బట్టి శిక్షింపవలెనన్న నియమము నియమించెను. ఒకవేళ వాడు పరిహారము చెల్లించలేకపోయినట్లయితే వానిని చంపవలెనన్న నియమములేదు. అయినప్పటికి 300 సంవత్సరములకు ముందు కాలములో జీవించిన బబులోను రాజైన హమ్మురాబ్బుని చట్ట ప్రకారము దొంగ దొంగిలింపబడిన వస్తువు యొక్క విలువను అచ్చుకొనవలయును, లేనియెడల వానిని చంపవలెనన్న నియమము కలదు. నేరస్థుని స్థానము ఏదైనప్పటికిని ఆ నేరస్థునికి ఒకే శిక్ష విధింపవలెను, “ అదే కంటికి కన్ను పంటికి పన్ను చెల్లింపవలెను” ఇదే ఈ ఆజ్ఞయొక్క పరమార్ధం. (లేవీయకాండము 24:20) విదేశీయులు (పరదేశి) చేసినట్లు పక్షపాతము లేక తీర్పు తీర్చవలెను, లేనట్లయితే దేవుడు వారికి కఠిన శిక్ష విధించును. దేవుని శాసనములో అనాధలకు, గ్రుడ్డివారికి, బీదలకు, చెవిటివారికి, సంరక్షణ కలదు. దేవుని దృష్టిలో ధనికుని సమృద్ధిలో నుండి పొందే అవకాశము వీరికి కలదు. స్వంతగా జీవించలేని బీదల (వారి కాళ్ళమీద వారు నిలబడలేని వారి) యెడల దేవుడు అక్కర కలిగియున్నాడు. లేవీయకాండము 19:9; లేవీయకాండము 19:13-14; లేవీయకాండము 15:32-37 పొరుగు వారితో నీవు నడవవలసిన విధులు వారి అక్కరలలో వారిని పరామర్శించు విధానమును గూర్చిన హెచ్చరికలు : నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను (లేవీయకాండము 19:18) అనే ఆజ్ఞనువారికి వివరించెను.

గ్రంథ విభజన : 1. అనేక ఆజ్ఞల వివరములు 1 – 17 అధ్యాయములు, 2. పరిశుద్ధతకై అనుసరించవలసిన ఆజ్ఞలు 18 – 27 అధ్యాయములు వీటి యందు మొదటి భాగములో దేవుని జనాంగము పాటించవలసిన ఐదు రకములైన బలులు వాటి యొక్క వివరములు, రెండవ భాగము నందు వారందులో చేయదగిన, పాటించదగిన విశ్రాంతి దినమును, సంవత్సరమంతయు ఆచరింపవలసిన ఏడుపండుగలను గురించిన వివరములు మనము చూడగలము.

కొన్ని సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో మూడవ గ్రంథము; అధ్యాయములు 27; వచనములు 859 ; ప్రశ్నలు 3 ; నెరవేరిన ప్రవచనములు 58 ; నెరవేరని ప్రవచనములు 6; చరిత్రాత్మిక వచనములు 799; ఆజ్ఞలు 795 ; వాగ్దానములు 26 ; హెచ్చరికలు 125; దేవుని యొద్ద నుండి ప్రాముఖ్యమైన అంశములు 35.

లేవీయకాండములో ప్రాముఖ్యమైన వచనములు : లేవీయకాండము 17:11; లేవీయకాండము 20:7-8

ముఖ్యాంశములను పొదిగించిన అధ్యాయము : 16 వ అధ్యాయము.

Exodus – నిర్గమకాండము

 

ఉద్దేశ్యము : ఐగుప్తులోని ఇశ్రాయేలీయులు బానిసత్వము నుండి విడిపింపబడుట మరియు వారు ఒక దేశముగా ప్రబలుటను గురించినది.

గ్రంథకర్త : మోషే

కాలము : సుమారు ఆదికాండ గ్రంథకాలములోనే క్రీ.పూ 1480 – 1410

రచించిన స్థలము : ఇశ్రాయేలీయులు అరణ్య ప్రాంతము గుండా పయనించు సమయములో సీనాయి సమతల భూభాగమునందు.

గత చరిత్ర : ఐగుప్తు దేశమునందు అనుకూల కాలవ్యవస్థ యందు జీవించిన ఇశ్రాయేలీయులు ఇప్పుడు దాస్యమునందున్నారు. దేవుడు వీరి బానిసత్వము నుండి విడుదల దయచేయుచున్నాడు. (ఐగుప్తు దాస్యములో నుండి విడుదల)

ప్రాముఖ్య వచనములు : నిర్గమకాండము 3:7-10

ప్రాముఖ్యులు : మోషే, మిర్యాము, ఫరో, ఫరో ప్రజలు, యిత్రో, అహరోను, యెహోషువ, బెసాలీయేలు,

కాలేబు.

ప్రముఖ స్థలములు : ఐగుప్తు, గోషేను, నైలునది, మిద్యాను, ఎఱ్ఱసముద్రము, సీనాయి సమతల భూమి, సీనాయి పర్వతము.

గ్రంథ విశిష్టత : పాతనిబంధన గ్రంథములోని అన్ని గ్రంథముల కన్నా అధికమైన అద్భుతములు లిఖించబడియున్న గ్రంథము ఇది. పది ఆజ్ఞలు ఈ గ్రంథము యొక్క ప్రాముఖ్యాంశము.

సమకాలీన చరిత్ర : క్రీ.పూ 1710 నుండి 1570 వరకు నున్న మధ్య కాలము 140 సంవత్సరములు ఐగుప్తు దేశమును పాలించిన రాజులు (ప్రభువులు) హి క్కోసు వంశపు వారుగా పరిగణింపబడు భూరాజులు అన్యదేశీయులుగా ఉండిరి. తూర్పు పాశ్చాత్య దేశమైన కనాను, సిరియా దేశస్టులైన వీరు బలవంతులు, యుద్ధ ప్రియులు. ఈ హిక్కోషీయులు అన్యులైనందున అన్యులతోనే సహవాసము కలిగియుండిరి. వీరిలో ప్రాముఖ్యుడైన అపోపి అనే రాజు (ఫరో) వీరి నాగరికతకు తగిన రీతిగానే అన్యుడుగా ఎంచబడిన యోసేపును అధిపతిగా చేసి ఐగుప్తు దేశములోని ఫలవంతమైన

గోషేనును ఇశ్రాయేలీయులకు నివాసస్థలముగా యిచ్చెను. ఈ హిక్కోషు ఫరోలు ఆ దేశస్థులైన ఐగుప్తీయుల యెడల నిర్దయతో అనాగరికముగా ప్రవర్తించారు. రక్త ప్రవాహము ద్వారా వీరు అధికారములోనికి ప్రవేశించారు, వారు స్వదేశీయులైన జనాంగమును శ్రమలపాలు చేసెడివారు. ఐగుప్తు దేశములోని స్త్రీలను,

పిల్లలను హింసించి పట్టణములను పాడుచేసి, దేవాళయములను పడగొట్టి, అగ్నిచేత వారిని దహించివేసేవారు. ఇటువంటి శ్రమలను అనేక దినములు సహించిన ఐగుప్తీయులు వారి దేశములో కలహములను రేపి అధికారమును ప్రజలే చేజిక్కించుకొనిరి ఈ విధముగా ప్రజలే ఫరోలను నిర్ణయించిరి. హిక్కో షు వారిపై ఐగుప్తీయులకు ఉన్న పగకు నిరఫరాధులైన ఇశ్రాయేలీయులు బలయ్యారు. ఇశ్రాయేలు జనాంగము శక్తినొంది అభివృద్ధి నొందుచున్నందున, ఐగుప్తీయులు వీరు తమకు విరోధముగా రావచ్చునేమో అని తలంచి తప్పుగా బావించి ఈ విధముగా వారిని బాధించెడివారు. వీరు దేశమునకు కరువు వచ్చునని బావించి అక్కడ నివసించే ప్రజలు 20 లక్షల కంటే ఎక్కువ మంది అన్యులని భావించి దేశాన్ని సంరక్షించుటకై కరువు నుండి తప్పించుకొనుటకై ఆహార వస్తువులను, ధాన్యములను నిలువచేయుటకై పెద్ద పెద్ద గదులు నిర్మాణించుటకు తీర్మానించిరి. ఈ పని పూర్తి చేయుటకు కావలసిన ఇటుకలు చేయుటకు లక్షలకొలది పనివారు కావలసి వచ్చెను. ఈ పని ప్రారంభించుటకు బానిసలుగా జనసంఖ్య బలాభివృది పొందుచున్న ఇశ్రాయేలీయులపై వీరు ధ్యాసనుంచిరి. ఐగుప్తు ఫరో దృష్టి ఇశ్రాయేలీయులపై పడినందున, అప్పటి నుండి ఇశ్రాయేలీయులకు శ్రమల కాలము ప్రారంభమైనది. యోసేపు పేరు ద్వారా సుకుమార జీవనమును గడుపుచున్న ఇశ్రాయేలీయులు బానిస బ్రతుకులకు దాస్యముగా లొంగిపోయిరి. కఠినమైన పనిలో వీరిని భాదించి పీతోము, రామె సెసను ఆహార దాన్యములు నిల్వచేయు ధాన్యాగారముల పట్టణములను కట్టిరి. అప్పటి నుండి కఠినమైన పనులలో ఇటుకల పని, కట్టడపని వీరికి బహుకఠినమాయెను, అవి వారికి భరించలేని భారమైపోయెను. హిక్కోషు ఫరోల ప్రీతికరమైన ప్రజలు కఠినమైన బానిసలుగా పనిచేయుట తట్టుకోలేకపోయిరి. అన్యదేశములో ప్రవచన రీతిగా తాము చేయుచున్న పెట్టి పనులను బట్టి వారు నిట్టూర్పులు విడిచిరి, వారి నిట్టూర్పులు దేవుని చెవిని చేరినవి. ఇశ్రాయేలీయుల బానిసత్వము దేవుని అనాది సంకల్పములో ఒక భాగమని ఐగుప్తు ఫరో గ్రహించలేక పోయెను. నిర్ణయకాలము వచ్చువరకు అనేక శ్రమానుభవముల తర్వాతనే ఐగుప్తు ఫరోలు వారికి విడుదల దయచేసిరి. మోషే నాయకత్వములో క్రీ.పూ 1446 లో విడిపింపబడిన పావురములవలె వాగ్దానభూమికి యాత్రుకులైరి. దీనినే నిర్గమమందురు.

భాగములు : 1. రక్షకుడైన మోషే Exo,1,1 – 4,31. 2. ఫరోతో జరిగిన యుద్ధకాండ Exo,5,1- 13,19. 3. ఐగుప్తు నుండి సీనాయి పర్వతము వరకు Exo,13,20-19,2. 4. నిబంధన నెరవేరు కాలము Exo,19,3-24,8. 5.దేవుని ఆరాధించుటకు ప్రత్యక్షపు గుడారములు Exo,24,9-40,38.

కొన్ని సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో రెండవ గ్రంథము; అధ్యాయములు 40; వచనములు 1,213; చరిత్రాత్మిక వచనములు 1089; నెరవేరిన ప్రవచనములు 129; నెరవేరనివి 2; ప్రశ్నలు 58; దేవుని సందేశములు 73; ఆజ్ఞలు 827; హెచ్చరికలు 240; వాగ్దానములు 28; మోషే ద్వారా చేయబడిన అద్భుతములు 35 తో కలిపి అద్భుతములు 42.

Genesisi – ఆదికాండము

పురాతన ప్రతులైన ఆదికాండము మొదలుకొని ద్వితీయోపదేశకాండము వరకు ఉన్న ఐదు పుస్తకములను నిబంధన పుస్తకములందురు. (2 దినవృత్తాంతములు 34:30). క్రీ.పూ 3వ శతాబ్దములోని రచయితలు హెబ్రీ భాష నుండి గ్రీకు భాషకు పాతనిబంధన గ్రంథమును తర్జుమా చేసిన సెప్టోలెజెంట్ భాషాంతర తర్జుమాదారులు వీటిని ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితియోపదేశకాండము అని ఐదు వివిధమైన పేర్లతో పిలిచిరి.

ఉద్దేశ్యము : ప్రపంచముల నిర్మాణమును గురించిన ముఖ్యాంశములను వ్రాయుటను దేవుని ఆరాధించుటకు ఒక ప్రత్యేక జనాంగమును ఎర్పరచుకొనుట దీని ముఖ్య ఉద్దేశ్యము.

రచయిత : ఈ ఐదు కాండముల (పుస్తకముల) ముఖ్య రచయితగా యూదావంశపువారును, యేసును అపోస్తలుల ద్వారా అంగీకరించబడిన వ్యక్తి మోషే, ప్రవక్తయైన మోషేకు దేవునికి మధ్య నలువది రాత్రింబవళ్ళు జరిగిన సంభాషణలో తన చర్యను గూర్చి తాను చేయబోయెడి విధానమును గూర్చిన వివరణ: నిర్గమకాండము 24:18, నిర్గమకాండము 34:28 వచనములలో చదువగలము. ఆ సంభాషణ ఫలితమే ఈ ఐదు కాండము (పుస్తకము) లని అనుకొనుట యుక్తమైయున్నది. మార్కు 12:26, యోహాను 1:17; యోహాను 5:46; యోహాను 7:19, యోహాను 7:23; అపో. కార్యములు 7:37- 38; అపో. కార్యములు 13:39; అపో. కార్యములు 15:1; అపో. కార్యములు 15:21; అపో. కార్యములు 28:23.

ఆదికాండము అని పేరు : ఆది అనగా ప్రారంభము అని అర్ధమిచ్చును. భాషాంతరమున పరేషిత్ అనే హెబ్రీ బాషాపదముతో పాతనిబంధన ప్రారంభమయినది. ఈ పుస్తకమునకు ఆదికాండము అను పేరు పెట్టుటకు గల కారణము ఈ పుస్తకములోని ప్రారంభపదమే దీనికి మూలకారణం. ఆది అనే సంస్కృత మాటకు సృష్టి , ప్రారంభము, పుట్టుట అను అనేక విధములైన పర్యాయపదములు కలవు.

రచించిన కాలము : క్రీ.పూ 1480 – 1410

గత చరిత్ర : మధ్య తూర్పుదేశము అనగా ప్రస్తుతమందు పిలువ బడుచున్న మిడిల్ ఈస్ట్.

ముఖ్య వచన భాగములు : ఆదికాండము 1:27; ఆదికాండము 12:2-3

గ్రంథ పరిశోధన : ఆదికాండములో సమస్త సృష్టి యొక్క చరిత్రయైన ఆకాశము, భూమి, వాటి నిర్మాణమును గురించిన వివరణ మరియు రాత్రింబవళ్ళు, సస్యమృగములు పక్షిజలచరములు, మానవుడు, భాషలు క్రమ శిక్షణ, సంబంధ బాంధవ్యములు వంటివి ఏ విధముగా ఏర్పరచబడినవి అను వాటిని గురించి పరిపూర్ణ అవగాహననిచ్చుచున్నది. పాపము యొక్క ప్రారంభ చరిత్ర దానికి దేవుడు చేసిన ప్రాయశ్చిత్తము ఈ పుస్తకము యొక్క ముఖ్య ఉద్దేశ్యమగును. భూగోళ శాస్త్రములోని మూడు ముఖ్యమైన విభన్న దేశ సంబంధములను ఈ ఆదికాండము తెరకెక్కించుచున్నది. యూప్రటీసు, టైగ్రీసు నదీతీరములు మొదటి భాగమునకు, కనాను దేశ ప్రాంతము రెండవ భాగమునకు, ఐగుప్తు మూడవ భాగమునకు విశిదీక రింపబడియున్నవి. మొదటి అధ్యాయము మొదలుకొని 11వ అధ్యాయము వరకునున్న మొదటి

భాగములో అన్నింటి ప్రారంభమును గురించి మొదటి మానవుని నిర్మాణమును గురించి, వారి వంశావళిని గూర్చిన చరిత్ర యిమిడియున్నది. మరియు 12వ అధ్యాయము మొదలుకొని 38వ అధ్యాయము వరకుగల రెండవ భాగములో ఆనాటి మానవుల వంశావళుల చరిత్రలో అబ్రాహాము అను ప్రత్యేకమైన మనిషిని దేవుడు పిలిచి ఏర్పరచి, ఆ అబ్రాహాము కుటుంబము ద్వారా యాకోబు సంతతివారిని మాత్రము తన సొంత జనాంగముగా ఎన్నుకొనుట దేవుని సంకల్పమైయున్నది. 39వ అధ్యాయము మొదలుకొని చివరి అధ్యాయము వరకునున్న మూడవభాగములో యాకోబు సంతతివారు యోసేపు ద్వారా ఐగుప్తుకు వలస వెళ్ళడం అక్కడ వారు బహుజనాంగముగా ఏర్పడి విస్తరించడము ఇందులో వ్రాయబడియున్నది. ఈ మూడు భాగములు కలిపి సంగ్రహించి కాలపరిమితి గలవై ఈ విధముగా సంగ్రహీకరింపబడియున్నది.

మొదటి భాగము : (1 – 11 వరకైన అధ్యాయములు) సృష్టి క్రీ. పూ 4000 లేదా దానికన్నా ముందుగా ఆది 1:1 ప్రారంభము నుండి తెరహు మరణము వరకు గల సంవత్సరములు 2090 ఆది 11:32 వరకు దాదాపు రెండువేల సంవత్సరాలకాల చరిత్ర

రెండవ భాగము : (12 – 38 వరకు గల అధ్యాయములు) అబ్రాహాము తన యింటి నుండి బయలుదేరు కాలము మొదలు కొని యోసేపు ఐగుప్తు దేశము వచ్చి చేరువరకు గల చరిత్ర కాలఘట్టము క్రీ.పూ 2090 నుండి 1897 వరకు దాదాపు 193 సంవత్సరములు.

మూడవ భాగము : (39- 50 వరకు గల అధ్యాయములు) యో సేపు ఐగుప్తు దేశములో ఉన్నప్పటి జీవితకాల చరిత్ర క్రీ.పూ 1897 నుండి 1805 వరకు దాదాపు 93 సంవత్సరములు.

ప్రాముఖ్యులు : ఆదాము, హవ్వ, హేబేలు, హనోకు, నోవహు , అబ్రాహము, శారా, ఇస్సాకు, బ్యా, యాకోబు, యోసేపు.

గ్రంథ విభజన : 1. ప్రపంచము, భూమి, మానవుడు, వాటి నిర్మాణము. Gen,1,1-2,25, 2.మానవుని పతనము దాని ప్రతిఫలము. Gen,3,1- 5,32. 3.న్యాయతీర్పు నుండి నోవహు కుటుంబము రక్షింపబడుట, Gen,6,1-9,29. 4.మానవుల వంశావళులు వృద్దీ చెందుట మరియు విభజింపబడుట Gen,10,1-11,32. 5.అబ్రాహాము జీవితము. Gen,12,1-25,18. 6.ఇస్సాకు యొక్క కుటుంబము. Gen,25,1-27,45. 7.యాకోబు గోత్రకర్తలు. Gen,28,1-38,30. 8.యోసేపు జీవిత చరిత్ర. Gen,39,1-50,26

కొన్ని సంఖ్యా వివరములు: పరిశుద్ధ గ్రంథములో మొదటి గ్రంధము ; ఆధ్యాయములు 50 ; వచనములు – 1,533 – చరిత్రాత్మిక వచనములు 1,385; ప్రశ్నలు 148 ; ప్రవచనములు 146; నెరవేరిన ప్రవచనములు 123; నెరవేరని ప్రవచనములు 23 ; ఆజ్ఞలు -106 ; వాగ్దానములు 71 : దేవుని యొద్ద నుండి పాముఖ్యమైన అంశములు 95 ; హెచ్చరికలు 326.

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account