

సామ్యూల్ మోరిస్ జీవితచరిత్ర
పూర్తిపేరు:- శామ్యూల్ కబూ మోరిస్
జన్మస్థలము:- సౌత్ ఆఫ్రికా దేశంలోని, లిబేనియా పట్టణములో
జననము:- 1873
మరణము:- 1893 మే 12
రక్షణానుభవం:- 15 సంవత్సరాల వయసులో
సేవాఫలితము:- బ్రతికింది కొంతకాలమే అయినా అతని పేరు ప్రపంచమంతటా మారుమోగిపోయింది. అతని జీవితచరిత్ర అనేక భాషలలోనికి అనువదించబడింది. అనేక శాఖలకు చెందిన మిషనరీలు ఆయన కలిగి యుండిన ప్రభావం మరి ఏ నాయకుడు కలిగి ఉండలేదు. అనేకమందిని క్రీస్తులోనికి నడిపించాడు.
వ్యక్తిగతసాక్ష్యం:- సామ్యూల్ మోరిస్ 1873 లోని సౌతాఫ్రికాలో లిబేనియాలో జన్మించాడు. పుట్టుకతోనే అదృష్టము అతనిని వరించలేదు. పశ్చిమ ఆఫ్రికా అడవుల్లో మరుగుపడిన అనేకమైన సామాన్య బాలుడులో సామ్యూల్ మోరిస్ ఒకడు. ఇతడు *క్రూ జాతికి చెందినవాడు. అతని అసలు పేరు కబూ. ఇతని తండ్రి తెగ నాయకుడు. ఆతను రాజకుమారుని హోదా కలిగినవాడు. కానీ తన స్థితి లోకములోని అతిహీనమైన జీవికంటే నీచమైన స్థితికి దిగజారిపోయింది. ఓడిపోయిన తెగ నాయకుడు గెలిచిన వారికి నిర్ణయింపబడిన రుసుము చెల్లించేవరకు తన జ్యేష్టకుమారుని తాకట్టుగా పెట్టాలి. రుసుము చెల్లించుట ఆలస్యమైతే ఆ జ్యేష్ఠ కుమారుడు చిత్రహింసలకు గురి అవుతాడు. అయితే కబూ బాల్యంలో ఉండగానే తన తండ్రి పొరుగుదేశాలతో పోరాడి రెండుసార్లు ఓడిపోయాడు. ఆ రెండు సార్లు కూడా కబూ తాకట్టు పెట్టబడినాడు. మొదటి సారి తన తండ్రి సరైన సమయానికి తగిన క్రయధనము చెల్లించి తన కుమారుని విడిపించుకున్నాడు. కానీ రెండవ సారి ఆ క్రయధనము చెల్లించటానికి కొన్ని సంవత్సరములు పట్టింది. తన కొడుకును ఎలా విడిపించుకోవాలో అర్థం కాలేదు. ఆతండ్రి ఎంతకీ రాకపోయేసరికి ఆ నాయకుడు కబూని చిత్రహింసలకు గురిచేశాడు. ప్రతి దినము కొరడాలతో కొట్టమని ఆజ్ఞాపించాడు. అలా కొన్ని నెలలు వారు పెట్టే చిత్రహింసలకు గురి అవుతూనే ఉన్నాడు. ఆఖరిసారిగా కొట్టడానికి శిలువ ఆకారంలో ఉండే మ్రానుమీద వ్రేలాడదియబడ్డాడు. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక మెరుపులా వెలుగు తనమీద ప్రకాశించి లేచి పారిపొమ్మని చెప్పిన ఒక స్వరమును విన్నాడు. అక్కడ ఉన్న వారంతా ఆ స్వరమును విని వెలుగును చూశారు కానీ వారికి ఏమీ కనిపించలేదు. తాను వినిన స్వరానికి విధేయుడై జింకవలే పరుగెత్తడం ప్రారంభించాడు.
అలా తాను చేరిన స్థలము విదేశీయులైనా తెల్లవారు ఉండే ప్రాంతం. అక్కడ తన జాతికి చెందిన ఒక వ్యక్తి తోటలో పనిచేస్తూ ఉండటం గమనించి ధైర్యము తెచ్చుకొని ఆ వ్యక్తిని సమీపించాడు. బానిసలను విడిపించే వారి దగ్గరకు చేరాను అని గ్రహించి ఎంతో సంతోషించాడు. తనతో పని చేస్తున్న నల్లజాతీయుడు మిషనరీలు చెప్పే వాక్యమును విని ప్రార్థించడం నేర్చుకున్నాడు. అయితే కబూ మెల్లిమెల్లిగా యేసయ్య గురించి తెలుసుకోవడం ప్రారంభించాడు. తనను మరణము నుండి రక్షించిన వెలుగే ఈ ఆత్మల రక్షకుడని ఎంతో సంతోషించాడు. వెంటనే యేసయ్యను తన హృదయంలోనికి ఆహ్వానించాడు. కానీ అతను తృప్తి చెందలేదు. తన హృదయంలో శాంతిని కలిగించిన ఆ సంతోషకరమైన యేసయ్య ప్రేమ గురించి అనేక మందికి తెలియజేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ప్రార్థనలో ఎంత పోరాడేవాడంటే తాను చేసే ఆర్తనాదాలు విని తన తోటి వారు విసిగి పోయేవారు. అతనికి బాప్తిస్మము ఇచ్చిన తర్వాత సామ్యూల్ మోరిస్ అనే పేరును పెట్టారు. ఆ విధంగా తన సొంత ప్రజల మధ్య శక్తివంతమైన సేవ చేయడానికి అతనికి విద్య అవసరమని, ఆ విద్యను అమెరికాలోని ‘స్టీఫెన్ మెరిట్’ గారి వద్ద అభ్యసించాలని తెలుసుకున్నాడు. అంతకంటే ముఖ్యంగా పరిశుద్ధాత్మ గురించి కూడా తెలుసుకోవటానికి ఎలాగైనా వెళ్లాలని నిర్ణయించుకుని వెళ్ళడానికి తన వద్ద వంద డాలర్లు లేవని తెలిసి కూడా దేవుని సహాయం మేరకు ప్రయాణానికి బయలుదేరాడు. పరిశుద్ధాత్మ యొక్క ధన నిధిని కనుగొనుటకు ప్రయాణం చేసిన వ్యక్తులలో సామ్యూల్ మోరిస్ అగ్రగణ్యుడు. అయితే ఓడ ద్వారా ప్రయాణం చేయవలసి వచ్చినది. ఓడలో పని చేసేవారు అనేక దేశాలకు చెందినవారు. వారిలో మోరీస్ ఒక్కడే నల్లజాతికి చెందినవాడు. అందువలన అందరూ అతనిని ద్వేషించారు, కొట్టేవారు, తిట్టేవారు. అయితే ఆ ఓడలోని వారందరి కోసం ప్రతిరోజు ప్రార్థించేవాడు. దేవుడు అతని ప్రార్థన విని అందరి హృదయాలను మార్చివేశాడు. తనను హింసించిన వారిమీద ఏనాడు అతను ప్రతీకారము తీర్చుకోలేదు. తన ప్రవర్తన, జీవితము ద్వారా యేసయ్యను మహిమపరిచాడు.
అతని మంచితనాన్ని చూసి వారందరూ కూడా యేసయ్య నమ్ముకోవడం ప్రారంభించారు. ఆరు నెలల ప్రయాణం ముగించుకొని అమెరికాలోని స్టీఫెన్ మెరిట్ గారి దగ్గరకు వెళ్ళాడు. అమెరికా చేరిన మొదటిరోజే అతనికి భాష సరిగా రాకపోయినప్పటికీ అనేకమందిని యేసయ్య చెంతకు నడిపించాడు. వాక్చాతుర్యము మోరీస్ దగ్గర లేదు. తనకు మాటలు మాట్లాడే విధానము చేతకాదు కాని పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రజలు ప్రభవింపబడేవారు. అతని ప్రార్థన ద్వారా ప్రతి పాపిని కదిలించివేశాడు. ఉన్నత సమాజానికి చెందినవారైనా, ధనవంతులైన తన మాటలను త్రోసిపుచ్చేవారు కాదు. అతనిలో ఉన్న దేవుని కృపను, శక్తిని అందరూ గుర్తించారు. కాబట్టి అతని జాతి గురించి, రంగు గురించి ఎవరూ పట్టించుకోలేదు. సామ్యూల్ మోరిస్ దేవుని సేవ కొరకు తన ఆరోగ్యాన్ని కూడా త్యాగం చేశాడు. ఆఫ్రికాలో సిలువ మీద నిస్సహాయుడనై చావుబ్రతుకుల మధ్య ఉన్నప్పుడు పరలోకమందున్న తండ్రి ఒక ఉద్దేశంతో తన వెలుగును పంపించి నన్ను రక్షించాడు. ఇప్పుడు ఆ ఉద్దేశము నెరవేర్చారు. భూలోకంలో నా పని పూర్తి అయింది అని చెప్పి 1893 మే 12వ తేదీన మధ్యాహ్నం దేవుని పిలుపు అందుకుని పరమునకు చేరుకున్నాడు. కానీ అతను 21 సంవత్సరములు కూడా జీవించలేదు అడవి నుండి బయటికి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు మాత్రమే బ్రతికినాడు. కానీ కొద్ది రోజుల్లోనే అతని పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది…