

వాచ్ మెన్ నీ జీవితచరిత్ర
పూర్తిపేరు:- వాచ్ మెన్ నీ
తల్లిదండ్రులు:- లిన్ హే పింగ్, నీ వెంగ్ స్యూ
జన్మస్థలము:- చైనా దేశం
జననము:- 1903 నవంబర్ 4
భార్యపేరు:- చారిటీ చాంగ్
రక్షణానుభవము:- 18 సంవత్సరాల వయసులో
మరణం:- 1972 మే 30
సేవాఫలితము:- పుట్టినప్పుడే దేవుని సేవకు సమర్పించబడి, తల్లితో కలిసి వీధుల్లో సువార్త ప్రకటించడమే కాకుండా చైనాలోని అనేకప్రాంతాలలో సువార్త ప్రకటించి, సువార్త ప్రకటనకొరకు అనేకులకు తర్ఫీదునిచ్చారు.
వ్యక్తిగతసాక్ష్యం:- వాచ్ మెన్ ని 1903 నవంబర్ 4వ తేదీన చైనాలో జన్మించాడు. ఈయన తల్లి పేరు లిన్ హే పింగ్ ఈమె ఒక పేద కుటుంబంలో జన్మించింది ఈమె తండ్రి వీరిని పోషించలేక దనికులైన ఒక కుటుంబానికి అమ్మివేశాడు. వారు తమ కుమార్తెగా ఆమెను దత్తత తీసుకున్నారు. వారు క్రైస్తవులే కాబట్టి లిన్ హే పింగ్ చిన్ననాటి నుండి క్రైస్తవ వాతావరణంలో పెరిగింది. తరువాత ఈమె 18 సంవత్సరాల వయసులో నీ వెంగ్ స్యూ అను వ్యక్తితో వివాహము జరిగింది. వీరికి ఇద్దరు ఆడబిడ్డలు కావడం వలన అత్తగారి హేళనకు గురి అయింది. అయితే హన్నా వలె కుమారుని కోసం కన్నీటితో ప్రార్ధన చేసి కుమారుని ఇస్తే సేవకు సమర్పిస్తానని తీర్మానించుకున్నప్పుడు ప్రభువు ఆమెకు కుమారుని అనుగ్రహించాడు. దేవుని స్తుతించి బిడ్డ సేవకు సమర్పించబడ్డాడు అని గుర్తు ఉండుట కొరకు నో-టో-షెంగ్ అని పేరు పెట్టింది. దాని భావము ఇంగ్లీషులో ప్రభువుకు ‘మెళకువ కలిగిన ఒక కాపరి’ అని అర్థము (వాచ్ మెన్ నీ). తరువాత నలుగురు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్ళు పుట్టారు. అయితే బిడ్డలకు దేవుని వాక్యము, కీర్తనలు నేర్పించేది. వాచ్ మెన్ నీ పియానో వాయించడం కూడా నేర్చుకున్నాడు. అయితే తల్లి అస్తమానూ దండించడంవలన మనసులో ద్వేషం పుట్టింది. అలాగే దేవునికి అవిధేయుడయ్యాడు. పైగా తన తల్లి కూడా అతనిని పట్టించుకోవడం మానేసింది. ఆమె కూడా దేవునికి దూరం అయ్యింది. వాచ్ మెన్ నీ కూడా తల్లి మీద కోపంతో దేవుణ్ణి విడిచిపెట్టాడు.
అయితే ఒక దినము జరిగిన ప్రార్థన కారణంగా తల్లి తన తప్పును గ్రహించి కొడుకును ప్రేమించటం మొదలుపెట్టింది. దాని వలన వాచ్ మెన్ నీ కూడా దేవునికి దగ్గరై తల్లి యొక్క ప్రవర్తన ద్వారా 18 వ ఏట క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి తన జీవితాన్ని సేవకు సమర్పించుకుని తల్లితో కలిసి అనేక ప్రాంతాల్లో బలమైన సువార్త పరిచర్య చేశారు. మంచి బోధకుడిగా, రచయితగా పేరు సంపాదించి లోతైన ఆత్మీయసత్యాలతో కూడిన రచనల వలన ప్రపంచంలోనే అగ్రగన్యులలో ఒకడిగా నిలిచాడు. తనతోటి కళాశాల విద్యార్థులను ప్రభువులోనికి నడిపించాడు. వీధుల్లో తిరిగి యేసును గూర్చి ప్రకటించేవాడు. ఒకసారి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఐదు కుటుంబాలు తప్పించబడ్డాయి అందులో వాచ్ మెన్ నీ గారి కుటుంబం కూడా ఉండటం వల్ల దేవునిపై విశ్వాసం మరింత పెరిగింది. ఇక ఎల్లప్పుడూ ఇతరులను రక్షణలోనికి నడిపించటానికి 24 గంటలు ప్రార్థనలో గడిపేవాడు. భక్తుల జీవితచరిత్రలు చదివి అవసరాలకొరకు దేవునిపై ఆధారపడటం నేర్చుకున్నాడు.
ఒకసారి షాంగై నగరంలో సువార్త ప్రకటన చేస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురై క్షయవ్యాధి చేత విపరీతమైన దగ్గుతో మాట్లాడటానికి కూడా కష్టపడేవాడు. వైద్యులు ఎన్నో రోజులు బ్రతకడని తేల్చేశారు. ఆరోగ్యము ఇంకా సన్నగిల్లింది, బరువు తగ్గిపోయాడు, వాక్యం కూడా చదువలేని స్థితికి వచ్చేశాడు. దేవునిసేవ అర్ధాంతరంగా ఆగిపోవాలా? అని ఆలోచించినప్పుడు తను చదివిన కంఠస్థవాక్యములు అతనిని ఆదరించేవి. అయితే ప్రార్థన మరియు దేవుని దయను బట్టి మంచి ఆహారంవల్ల ఆరోగ్యము కుదుటపడింది. అయితే ఇతని సేవలో అందరూ కూడా జీతం లేకుండా పనిచేసే వారే కాబట్టి సేవ మెరుగుపడింది. దేవునికి నమ్మకంగా ఉండి ఆయన రక్షణ గురించి సాక్ష్యం ఇవ్వటమే ప్రధానలక్షణం అని, నాగటి మీద చెయ్యి వేసి వెనుతిరుగకూడదు అని చెబుతూ అనేక ప్రాంతాలలో సేవ చేసాడు. మనము చైనాలో ఉండి సేవ చేస్తూ మిగిలిన ప్రాంతాలకు కూడా సేవకులను పంపించాలని నమ్మకస్తులైనవారికి తర్ఫీదునిచ్చాడు. దేవుని కొరకు సమస్తాన్ని సమర్పించుకుని, సేవ కొరకైన అవకాశాలను, తలాంతులను ఉపయోగిస్తూ పరిచర్యలో ముందుకుసాగాడు. అనేక శోధనలు, హింసలు ఎదురైనప్పటికీ క్రీస్తును నిరాకరించక విశ్వాసంతో ముందుకు సాగిపోయాడు. అయితే తనమీద వచ్చిన నేరాల వలన 20 సంవత్సరాలు జైలులో ఉంచబడ్డాడు. జైలులో ఎన్నో చిత్రహింసలు, ఎన్నో రకాల శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ ఆదర్శమైన జీవితం జీవించి తీవ్ర అనారోగ్యానికి గురై 1972 మే 30వ తేదీ అనగా తన 69వ ఏట ప్రభువు సన్నిధికి చేరుకున్నాడు.
గొప్పపలుకు:- దేవుడు అనుగ్రహించే అవకాశాలను ఉపయోగించుకోవడమే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, తలాంతులు దాచిపెడితే తీరని నష్టం ఏర్పడుతుంది అని బోధించేవాడు.